ఒక రాజుభార్యయు, మంత్రి భార్యయు పదుహారు ఫలముల నోముపట్టి మంత్రి భార్య మంచి ఫలముల నన్నిటిని యెంచి యధాశక్తి దక్షిణతో నొక ముత్తెయిదువ కిచ్చినది. రాజుభార్య నేను కదా గొప్పదానిని గర్వించి పదుహారు రకముల ఫలములను తెప్పించి ఒక గది లో వేయించి మంచి చెడ్డలు చూడకుండ దానము చేసినది. తరువాత మంత్రి భార్యకు మంచి సంతానము కలిగెను. రాజుభార్యకు గ్రుడ్డివాండ్రు, కుంటివాండ్రు పిల్లలు గలిగిరి, అపుడు రాజుభార్య మంత్రి భార్యను "యేమమ్మా! మనమిద్దరము కూడా నోముపట్టినాము. ఉద్యాపనము చేసినాము. నీకు మంచిపిల్లలు
పుట్టడమేమి? నాకిట్టి సంతానము కలగడమేమి?" యని యడిగెను. అంతట మంత్రి భార్య "నీవు గర్వించి అన్ని ఫలములను ఒక్కసారి దానము చేసినావు. నేను ఏ ఫలము కాఫలమే చేసినాను. అందుచేత నీకు యిట్టి సంతానము కలిగినది, నాకట్టి సంతానము కలిగినది" అని చెప్పినది. అపుడు రాజుభార్య "యేమి చేయమనెదవమ్మా యిప్పుడు" అని మంత్రి భార్య నడిగెను. "తిరిగి పదుహారు ఫలములనోముపట్టి మంచి మంచి ఫలముల నెంచి తగిన దక్షణతో నుద్యాపన జేసికొంటి మంచి సంతానమగును" అని మంత్రి భార్య చెప్పెను. ఆ ప్రకారము రాజుభార్య నోముపట్టి పదహారు ఫలాలు యుద్యాపనము చేసికొనెను.
ఉద్యాపనము: పదహారు రకముల పండ్లను ఎంచుకొని పిమ్మట ఒక్కొక్క జాతిఫలమును ఏరి ముత్తయిదువులకు పంచిపెట్టవలయును. పూర్తియైనంత సంతర్పణ చేయవలయును.
No comments:
Post a Comment