శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
అష్టాదశపురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధః ప్రకీర్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహస్రాణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు.
మత్స్యపురాణంలోని 53వ అధ్యాయంలో అష్టాదశ పురాణాల లక్షణాలు, ఆపురాణాలలో చెప్పబడ్డ అంశాలు, శ్లోకాల సంఖ్య తదితర విషయాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి. పురాణాలలో ఇది ప్రాచీనమైనదిగా పండితులు భావిస్తారు.
మత్స్యపురాణంలో చెప్పబడ్డ ప్రధాన అంశాలు :
మత్స్యావతారవర్ణన, బ్రహ్మాండసృష్టి, గర్భిణీధర్మాలు, సూర్యచంద్ర వంశాల వర్ణన, గయాక్షేత్ర విశేషాలు, పురూరవుడి చరిత్ర, కచదేవయానుల వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, శ్యమంతకోపాఖ్యానం, కలిధర్మాలు, ద్వాపరధర్మాలు, కృష్ణాష్టమీవ్రతం, అక్షయతృతీయ వ్రతం, మహాదానవర్ణన, పుష్యవాహనుడికథ, ప్రయాగక్షేత్రమాహాత్మ్యం, యమునానదీ స్నాన ప్రాశస్త్యం,
సప్తద్వీపాల వర్ణన, ఋషిలక్షణాలు, పార్వతీకళ్యాణం, వినాయకజననం, కుమారసంభవం, తారకాసురవధ, నృసింహావతారవర్ణన, సావిత్రీ సత్యవంతుల చరిత్ర, రాజధర్మాలు, వామనావతారం, వరాహావతారం, క్షీరసాగరమధనం, వాస్తు శాస్త్రవిశేషాలు, క్రియాయోగ వర్ణన, వివిధరకాల ప్రతిమా నిర్మాణ విశేషాలు, కల్పనామ సంకీర్తన వంటి ప్రధానాంశాలతో పాటు మరెన్నో
విషయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.
మత్స్యపురాణ ప్రాశస్త్యం
పాతాళాదుత్పతిష్టోర్మకర వసతయోయస్య పుచ్చాభిఘాతా ।
దూర్ధ్వం బ్రహ్మాండఖండ వ్యతికర విహితవ్యత్యయే నాపతంతి ॥
విష్ణోర్మత్స్యావతారే సకల వసుమతీ మండల వ్యశ్రువానా ।
స్తస్యాస్యోదరితానాం ధ్వని రపహరతాదశ్రితుం వః శ్రుతీనాం ॥
(మత్స్యపురాణం -శ్లో 1 -2)
మత్స్యావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు, పాతాళలోకంనుంచి పైకి ఎగిసిపడే తన మత్స్యంతోకతో కొట్టబడుతూ, సముద్రంపై భాగం నుంచి పడుతూ ఈ బ్రహ్మాండఖండాల సంపర్కంతో పుట్టిన కల్లోలం వల్ల సమస్త భూమండలంలో వ్యాపిస్తూ, పైకెగిరి తిరిగి క్రిందపడుతున్నాడు. ఆ మత్స్యపరమాత్మ నోటినుంచి వెలువడే వేదాలనాదం మనందరి పాపాలనూ పోగొట్టుగాక.
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సృష్టి ప్రారంభంలో హయగ్రీవుడనే రాక్షసుడు వేదాల్ని దొంగిలించి పాతాళంలో దాచగా, మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి, హయగ్రీవుడి చెరలోవున్న వేదాల్ని ఉద్దరించాడు. ఈ విధంగా వేదాల్ని ఉద్ధరించి సమస్త భూమండలాన్ని రక్షించిన మత్స్యావతార విశేషాల్ని చెప్పినందువల్ల ఇది మత్స్యపురాణం అనబడుతోంది. మహాప్రళయ కాలంలో శ్రీమహావిష్ణువు సప్తర్షులకూ,
వైవస్వతమనువుకూ ఉపదేశించిన ఎన్నో మహిమాన్వితమైన కథలు, గాథలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.
ఈ మత్స్యపురాణాన్ని శైవులు, స్మార్తులు, శాక్తేయులు, వైష్ణవులూ ప్రామాణికంగా గ్రహిస్తారు. పురాణానికి చెప్పబడ్డ ఐదులక్షణాలూ ఈ పురాణంలో సమగ్రంగా వున్నాయి. ఇందులో కథలు, గాథలే కాక అనేకమైన శ్రౌత, స్మార్త, నిత్యనైమిత్తిక కామ్య కర్మలకూ సంబంధించిన వివిధ రకాల అంశాల వివరణ కూడా కనిపిస్తుంది. ప్రాచీనతదృష్ట్యా కూడా మత్స్య పురాణానికి ఒక ప్రత్యేకత
వుంది. అందుకే వామన పురాణం 'పురాణేషు దైవం మాత్స్యమ్' - పురాణాలలో దైవంలాంటిది మత్స్యపురాణం అని చెబుతుంది.
ఈ పురాణంలో ఎన్నోరకాల వైదిక అనుష్టాన ప్రక్రియలు వివరించబడ్డాయి. ముఖ్యంగా తొంభైరెండు, రెండువందల అరవై నాలుగు అధ్యాయాల్లో గ్రహశాంతుల గురించి సవివరంగా చెప్పారు. ఇవేకాక రుద్ర, ఉమా, విష్ణు, స్వయంభూ, ఇంద్ర, యమ, అగ్ని జల, సర్ప, వినాయక వంటి దేవీ దేవతలకు నైవేద్యం అనగా బలిని ఎలా సమర్పించాలి? అనే విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి.
మత్స్యపురాణంలో వైదికమంత్రాలే కాకుండా పౌరాణిక మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. ఇవి శ్లోకాల రూపంలో అందరికీ సులభగ్రాహ్యంగా వుంటాయి . ఇందులో పాంచరాత్ర మత సిద్ధాంతానికి సంబంధించిన విశేషాలు చాలావరకూ కనిపిస్తాయి. 264వ అధ్యాయంలో వివిధ దేవతల్ని ప్రతిష్టించే విధివిధానాలు పామ్రాణికంగా చెప్పబడటంతో ఇది విశిష్ట పురాణంగా ప్రసిద్ధిచెందింది. అందుకే వామనపురాణం మత్స్యపురాణం గొప్పతనాన్ని గురించి ఇలా వర్ణిస్తుంది.
ముఖ్యం పురాణేషు యథైవ మత్స్యం స్వాయంభువోక్తి స్వధసంహితాసు ।
మనుస్మృతీనాం ప్రవరోయథైవ తిథైషు ధర్మో విబుధేషు వాస వః ॥
(వామన అధ్యా -12-శ్లో॥48)
పురాణాలలో మత్స్యపురాణం, సంహితలలో స్వాయంభుడు చెప్పిన స్వథసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులన్నిటిలో అమావాస్య గొప్పవి. దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడు.
త్రిపురాసురోపాఖ్యానం
No comments:
Post a Comment