Monday, January 5, 2026

Polala Amavasya Katha - పోలాలమావాస్య కథ

పోలాలమావాస్య కథ

ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు.

 ఒక బ్రాహ్మణునకు యేడుగురు కొడుకులు, ఏడుగురు కోడండ్రు కలరు. ఏడుగురు కోడండ్రు పోలాలమావాస్య నోము నోచుకుందామని యత్నము చేసికొనిరి. అంతట కడసారపు కోడలికి అమావాస్య రోజున ఒకపిల్ల చచ్చిపోయెను. ఆకారణము చేత ఆయేటికి ఆ నోము అంతామానివేసిరి. అదిమొదలు ప్రతిసంవత్సరము వీళ్లంతా నోము నోచుకుందామని యత్నము చేయుచుండుటయు, అమావాస్య వచ్చేసరికి కడసారపు కోడలికి పుట్టినపిల్ల చచ్చిపోవుచుండెను. ఇట్లు ఏడేళ్లు అయిన తరువాత “యేటేట మాకడసారపుదానికి పుట్ట, చావ” అని తిట్టుకుటూ కోడండ్రంతా మళ్లీ యత్నము చేసికొనిరి. అమావాస్య వచ్చేసరికి సరిగా కడసారపు కోడలికి ఒక పిల్లపుట్టి మళ్లీచచ్చిపోయెను. అంతా తిట్టి పోతారని చెప్పి చచ్చిపోయిన పిల్లను ఇంటిలో పెట్టి తాలము వేసికొని కడసారపుకోడలు అందరి తోడకోండ్రయింటికి వెళ్లెను. అందరికి తలాయొక పని సాయముచేసెను. తరువాత ఒకరియింటిలో తలంటి నీళ్లుపోసి, మరియొక యింటిలో పిండి పప్పు మొదలయినవి తెచ్చుకొని యింటికివచ్చి చచ్చినపిల్లను యింటిలో పెట్టుకొని తాను కూడా నోము నోచుకొనెను. ఆ ఆరాత్రిదాకా వుండి చీకటిలో చచ్చినపిల్లను భుజముమీదను వేసికొని పోలేరమ్మ గుడివద్దకు వెళ్ళి ఆ పిల్లను అక్కడ పెట్టి యేడ్చుచు కూర్చుండెను. ఇంతలో అమ్మవారు గ్రామ 

సంచారము వెళ్లి గుడివద్దకువచ్చి ఎడ్చుచున్న యా చిన్నదానినిచూచి “ఎమమ్మా ఇలా ఏడ్చుచున్నా”వని అడిగెను. అందుకా చిన్నది “యేడేండ్ల నుండి యేడుగురు పిల్లలను ఈ అమ్మవారికి అప్పగించుచున్నాను. ఈయేడు కూడా ఈ పిల్ల చచ్చి పోయింది. తోటికోడండ్రు తిట్టిపోతారని ప్రొద్దుటి నుంచి దాచి ఇపుడు తీసికొనివచ్చి ఇక్కడ పడకవేసి ఏడ్చుచున్నానని చెప్పెను. అప్పుడు అమ్మవారు కరుణించి- 'పిల్లలకు మరేమి భయంలేదు. నేను తీసికొనివచ్చి యిస్తానని చెప్పి అక్షతలు ఆచిన్నదాని చేతులోబోసి 'నీవు నీపిల్లలను పాతిపెట్టిన చోటికివెళ్లి పిలువమని చెప్పెను. ఆమె ఆ ప్రకారము అవి పుచ్చుకొని ఆ అక్షతలు చల్లి “అందెలాడరారా! మువ్వలాడరారా! అని వరుసగా ఏడుగురిని పిలువగా అందరు వరుసగా లేచి చక్కా వచ్చిరి. ఆమె
సంతోషముతో ఆ పిల్లలను తీసుకొని యింటకి వెళ్లెను. తెల్లవారిన తరువాత అందరూ చూచిన "అయ్యో! ఇదేటమ్మా! ఈ పిల్ల లెక్కడనుండి వచ్చినార" ని యడిగిరి. ఆ చిన్నది వారందరితోను తాను రాత్రిచేసిన పనులుచెప్పి- "పోలేరమ్మ దయవలన వీరు బ్రతికి వచ్చినారని చెప్పెను". అంతట నుంచి ప్రతిసంవత్సరము ఈ యమావాస్యను తప్పక నోము నోచుకొని అందరు ఈకథ చెప్పి అక్షతలు వేసుకొనుచుండిరి. అందుకా అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానము, సంతానము కలవారికి కడుపుచలవ యిచ్చి రక్షించెను.

No comments:

Post a Comment

The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట

రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...