రామాయణం సుందరకాండ 58వ సర్గ - అన్వేషణ గాథ
మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు.
అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ:
నాయనా! సీతాదేవిని ఎలా చూడగలిగావు! క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా వున్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథం వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం, అన్నాడు.
ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది.
సీతాదేవికి మనసా నమస్కరించి, కథ ఆరంభించాడు.
మీ రందరూ చూస్తూండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగన వీధికి లేచాను కదా! సముద్రం మీద వెడుతూండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా దాని శిఖరం వేయి ముక్కలయింది.
అప్పుడా గిరి: నాయనా! నీ తండ్రి వాయుదేవుడూ నా స్నేహితుడు. నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూత కోటిని నాశనం చేస్తూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలో చేర్చాడు.
ధర్మపరుడయిన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది, అన్నాడు.
నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. తీవ్రవేగుడనై వెడుతూంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి:
ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది, అనగా నేను చేతులు జోడించి:
అమ్మా: నేను దాశరథియైన రాముని పనిమీద వెడుతున్నాను. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆవిడను దర్శించి, ఆ వృతాంతం రామునికి నివేదించి వచ్చి నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను.
ఆ కామరూపిణి సురస: ఓరీ! నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికీ తరం కాదు, అంది.
నేను పది ఆమడలు పెరిగాను.
సురస అంతకంటె పెద్ద నోరు తెరిచింది.
ఉత్తర క్షణంలో నేను అంగుష్ఠ దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఈవలకు రాగా, నన్ను చూసి నాగమాత:
వానరా! నాకు సంతోషంగా వుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీ సంకల్పం ఫలిస్తుంది. సీతా రాములకు సమాగమం కలిగించు, అంది.
గరుత్మంతునివలే గగనవీధికిఎగిరాను.
దక్షిణముఖంగా సాగుతున్నాను,
అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లనిపించింది ఎదో శక్తి,
క్రిందికి చూశాను. ఏమీ కనబడలేదు. అటూ యిటూ చూశాను. ఏ ప్రాణీలేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి చూశాను.
ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది.
ఓ మహాకాయుడా! ఎక్కడికి పోతున్నావు. చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను, అంది.
ఆ రాక్షసి నోరుకంటె విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకిపోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. చూసిన చారణులు:
భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది, అనుకుంటూంటే వింటూ సాగి సాగి లంకా నగరపు సరిహద్దులో ప్రవేశించాను.
సూర్యుడు అస్తమిస్తున్నాడు.
లంకలో దిగాను.
దిగుతూన్న సమయంలో-
ప్రళయకాలమేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖలవలె వున్నాయి. అది నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పాడిచాను.
నేల కూలుతూ: ఓ మహావీరుడా! నేను లంకా నగర అధిష్ఠానాన్ని. నన్ను జయించిన నీకు లంకలో ఎదురులేదు, అని కన్ను మూసింది.
చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా వున్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని పేరు అశోకవనం. దానిలో శింశుపావృక్షం మీద కూర్చుని చూడడం మొదలు పెట్టాను.
ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృశించి, ఏకవేణితో దీనవదనంతో భర్తృ చింతాపరాయణయై వున్న సీతను చూశాను.
ఆమెచుట్టూ వికృతాకారాలతో క్రూరస్వభావంతో రాక్షసీజనం.
రక్త మాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా వుంది.
ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలి పెట్టె దశలో వుండగా చూశాను.
అంతలో రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోక వనముఖంగా వస్తున్నట్లు వినిపించింది.
నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరి చూస్తున్నాను.
రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు.
సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టుకు కూర్చుంది.
గజ గజలాడే ఆమెను చూస్తూ రావణుడు.
ఓ సుందరీ! ఇంక నీకు రెండు మాసాలు గడువుంది. ఈ లోపున నీ మనసు నాపై మరలదో నీ రక్తం త్రాగక తప్పదు, అని గర్జించాడు.
సీత: రాక్షసాధమా! అమిత తేజశ్శాలి రాముడు నా భర్త. ప్రఖ్యాత మయిన ఇక్ష్వాకుల ఇంటి కోడలిని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే!
నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు కనక ఇంకా బ్రతికి వున్నావు. ఆయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన అజేయుడు. అని క్రోధంతో మాట్లాడుతూంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హా హా రవాలు చేశారు.
వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి:
నీకు ఈ సీత దేనికి! దేవ గంధర్వ యక్ష కాంత లెందరు లేరు నీ అంతఃపురంలో.
వారితో హాయిగా భోగా లనుభవించు, అని తీసుకువెళ్ళింది. వాడు వెళ్ళాడు.
ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్రనుంచి లేచి త్రిజట వారందరినీ చేర బిలిచి:
ఓసీ! మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనక రాజపుత్రి, దశరథుని కోడలు, మహాపతివ్రత.
ఇప్పుడే నాకు కల వచ్చింది.
ఈమె భర్త లంకకువచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమయి తీరుతుంది. కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి, అనగానే అందరూ ఆమె పాదాలమీద పడ్డారు.
మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, అంది సీత.
అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే అది వుచితం అనిపించలేదు.
అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను.
నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ:
ఓ వానరోత్తమా! నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో నీకెలా స్నేహమయింది? అని అడిగింది.
అప్పుడు నేను:
అమ్మా! బలశాలియైన వానరేశ్వరుడు సుగ్రీవుడు. నేనాయన భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో ఈ ఉంగరం ఆనవాలుగా యిచ్చాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, నీ అభిమతమయితే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను.
జానకి: నాయనా! ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను; అమ్మా! అయనకు ఆనవాలుగా ఏమయినా యిస్తావా, అని అడిగాను.
ఆవిడ ఈ మణి యిచ్చింది.
అది అందుకుని, ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను.
అప్పుడావిడ : నాయనా! నా అవస్థ అంతా వివరంగా చెప్పి, రెండు మాసాలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు, అని విచారించింది. నేను ఓదార్చాను.
ఓదార్చి నా శరీరం పర్వతమంత పెంచాను.
ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులయిన కింకర గణాన్ని పంపాడు. శూల ముద్గరాయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీది దూలం అందుకుని వారిని యమపురికి పంపాను, హతశేషులు వార్తాహరులయ్యారు.
నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా ఉన్నవారిని ఒక స్తంభంతో కడతేర్చాను,
రావణుడు జంబుమాలిని పంపించాడు.
వీడు, వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే వాడి కొడుకు.
వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను.
అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు.
వారిని కూడా అంతకు ముందు వచ్చిన వారికి తోడు పంపాను. సేనాపతులు వచ్చారు. వారు అయిదుగురు, మహాయోధులు, వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దులకొడుకయిన అక్షుని పంపాడు. వాడు చతురంగబలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు.
వచ్చిన అక్షుని రెండు కాళ్ళూ పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రిజిత్తును వదిలాడు. వీడు చాలా ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు, ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్ళతో బంధించి రావణుని కొలువుకూటానికి కొనిపోయారు.
ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకీ దర్శనార్థం వచ్చాననీ, అందుకే యింత చేశాననీ చెప్పి, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, వాయుదేవుని ఔరసపుత్రుడను.
మా రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకు రమ్మని, ఇంకా ఏమన్నాడంటే;
రావణా! రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన రాక్షసుని సంహరించడానికి నేనంగీకరించాను. వాలిని సంహరించడానికి అయన అంగీకరించాడు. అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు.
రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చాడు, సుగ్రీవుడు వానరేశ్వరుడయ్యాడు. మమ్ము దశ దిశలకూ పంపాడు, నేను నీ దగ్గరకు దూతగా వచ్చాను.
వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరు. వారు దేవసమ పరాక్రములు. వారందరూ వచ్చి నీసేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రామునికి అప్పగించు, అని మా ప్రభువు సందేశం.
ఇలా నేను చెపుతూంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు,
ఆయన తమ్ముడున్నాడు ధీమంతుడు విభీషణుడు. ఆయన రాజనీతి చెపుతూ దూతవధ చాలా అన్యాయమనీ, దూతకు అంగవికలత్వం పెద్ద శిక్ష అనీ అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు.
రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు, నన్ను కర్రలతో, పిడికిళ్ళతో హింసించారు. అలా రాజవీధులుత్రిప్పుతూంటే నగరం అంతా చూసాను. చూడడం అయింది.
శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడలించి, అంతలో పర్వతాకారుడనై మండుతున్న తోకతో లంకానగర సౌధ, భవన, ప్రాసాదాలన్నీ తగులబెట్టాను, అంతా అయాక సీత ఏమయిందో అని చింతలో పడ్డాను.
అప్పుడు ఆకాశచారులమాటలను బట్టి సీతాదేవి సురక్షితంగా వుందని గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి. హానిచేస్తాడా, అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్టపర్వతం ఎక్కి గగనమార్గాన ఇలా వచ్చాను, ఇది యింతవరకూ జరిగిన కథ.
ఇక జరగవలసింది ఆలోచించండి, అన్నాడు.
ఆలోచనలు