Friday, January 2, 2026

Maredu Dalam Nomu Katha - మారెడు దళము కథ

మారెడు దళము కథ

ఒక రాజునకు ఒక కుమారుడు గలడు. ఆ కుమారుడు హఠాత్తుగా చనిపోగా నాతని తోడునకు పిల్ల నెవ్వరైన నిచ్చెదరా! యిన పట్టణమంతయు నడుగుచు దిరిగిరి. ఎవ్వరును పిల్ల నియ్యరైరి. ఆ పట్టణమున నొక బ్రాహ్మణున కొక కూతురుగలదు. ఆ చిన్నదానికి తల్లిపోవుటచే సపతి తల్లి తటస్థించెను. ఆమె ధనాశచేత ఆ పిల్లనిచ్చి పిల్లయెత్తు ధనంపుచ్చుకొనెను. రాజభటులా చిన్నదాన్ని తీసికొనిపోయి చచ్చిపోయిన రాజ కుమారుడు శవముతో తీసికొనిపోవుచుండగా నంతట వానవచ్చెను. ఆ వర్షములో కాటికి తీసికొని వెళ్ళలేక సమీపముననున్న యొక పాడుబడిన కాళీ దేవాలయములో దింపి తమ దారిని వారు పోయిరి. అంత సూర్యుడస్తమించి యెల్లెడల చీకటి గ్రమ్మెను. అంతట నా చిన్నది కట్టువిప్పికొని దేవాలయమునకు ప్రదక్షిణ చేయుచు, శివశివ! చిటికిన వ్రేలైన పట్టనీయవైతివి హరహర! అక్షింతలు గింజలైనా వేయ నీయవైతివి. మహాదేవ! మంగళసూత్రమైనా కటనీయవైతివి అనియనుచు మూడు సార్లు ప్రదక్షిణము చేసెను. పార్వతీదేవి ప్రత్యక్షమై నీవెవ్వరవని యడిగెను. "నేను బ్రాహ్మణకూతురను, నన్నీ చనిపోయినవానితో కట్టిపడవేయగా నా యదృష్టముచేత నీ యాలయమునకు వచ్చినాను, ఇప్పుడు నాయవస్థనుగురించి చెప్పుకొనుచు ప్రదక్షణము చేయుచున్నా"నని యా బ్రాహ్మణయువతిచెప్పె. అప్పుడు పార్వతీదేవి "నీవు క్రిందటి జన్మంబున మారేడుదళము నోముపట్టి యుల్లంఘనము చేయుటచేత నీకీ గతివచ్చినద" ని చెప్పి అక్షింతలు నీళ్ళు యిచ్చి "మూడు ప్రదక్షిణములు చేసి యవి యాపిల్లవానిమీద జల్లుమని" ని చెప్పెను. ఆ చిన్నది ఆ ప్రకారము జేయగా రాజకుమారుడు నిద్రపోయి లేచినవానివలె లేచి కూర్చుండెను. తరువాత అన్ని సంగతులు బ్రాహ్మణకుమార్తె వలన విని కాలక్షేపమునకై యామెను పుస్తకము చదవమని తానర్ధము చెప్పసాగెను. అంతలో తెల్లవారుటచే వారిని దహనము చెయుటకు రాజబంధువులువచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూచి ఆశ్చర్యముతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. "ఇదేమి చిత్రమ" ని ఆశ్చర్యముతో నడుగగా- "పార్వతీదేవి యొక్క వరప్రభావమ" ని యాచిన్నది వారితో చెప్పెను. అప్పుడారాజు ఆ చిన్న దానిని తన కుమారునికి ఇచ్చి మహా వైభవముగా వివాహము చేసెను. అప్పుడా బ్రాహ్మణచిన్నది మారేడుదళము నోముపట్టి వెండిదళము, బంగారు దళము చేయించి, చెట్టుదళమొకటి తెచ్చి ఆ మూడు దళములు మూడుదోసిళ్ల బియ్యము శివునకు పూజచేసి, చిరకాలము సౌభాగ్య సంపదలతో సుఖమనుభవించుచుండెను. 

ఉద్యాపన: వెండి దళము, బంగారుదళము, మారేడుదళము కలిపి మూడుదోసిళ్ళ బియ్యముతో శివునకు పూజచేసి బీదలకు సంతర్పణ చేయవలెను.

No comments:

Post a Comment

Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara (the Four Kumaras) cursed Vishnu’s gatekeepers, Jaya and Vijaya - శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట ధర్మరాజా చాలమంది కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరి...