తమ్ముడూ! భీమసేనా! చూచితివి కదా! కాలగమనంలో ఎంత వింతమార్చులు వచ్చినవో! పంటలు ఓషధుల మొక్కలు సరియైన కాలంలో పండకున్నవి. క్రోధం, లోభం, క్రూరత్వం, అసత్యంతో ప్రజలు వర్తించుచున్నారు. ఏ వ్యవహారంలోనైనా వ్యాపారాలలోనైనా మోసం పెచ్చు పెరిగిపోతుంది. స్నేహంలో ద్రోహమే కన్పిస్తుంది. భార్యలు భర్తలను స్పర్ధతో ద్వేషంతో చూస్తున్నారు. కొడుకులు కన్నతండ్రులపై కచ్చెతో ప్రాణాలు తీయుటకే పూనుకొంటున్నారు. ఇక శిష్యులు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులనే దూషిస్తున్నారు. శాస్త్రాలు చెప్పిన విధులేవి కూడా సాగుటలేదు. విజ్ఞులు సైతం న్యాయమార్గంలో నడవటం లేదు. కాలమిప్పుడు వింతగా పూర్తిగా తారుమారైంది.
భీమసేనా! మాధవుని వెంట అర్జునుడు ద్వారకకుపోయి ఇప్పటికి ఏడుమాసాలు గడచిపోయాయి. నేటిదాక అతడు తిరిగిరాలేదు. కనీసం వార్తాహరులు కూడా ఎవ్వరు రాలేదు. యాదవులు పొగరు పట్టిన స్వభావం కలవారు. వారిలో చాంచల్యం ఎక్కువ. వాళ్లు ప్రశాంతచిత్తులై ఉండగలరా? వాసుదేవుడు సుఖంగా క్షేమంగా ఉన్నాడా? మనస్సు ఎందుకో ఒక విధంగా ఉంది. ఇంతకు దైవసంకల్పం ఏ విధంగా ఉన్నదో! ఏమో!
తమ్ముడూ! భీమసేనా! నా మనస్సు కలత చెందుతుంది. అనేక దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. వాసుదేవుడు తన లీలామానుష దేహాన్ని చాలింపవలెనని తలంచున్నాడేమో!
శ్రీకృష్ణుడు మనం విన్నవింపకమునుపే మన కష్టనష్టాలు గుర్తించి, స్వయంగా అన్నీ తానై మన ధర్మపత్నిని, మన మానప్రాణాలను, రాజ్యాన్ని, సిరిసంపదలను కాపాడుతానని తలచి, అట్లే దయతో మనలను పోషించి బ్రతికించినాడు.
వాయునందనా! భీమా! నారదుడు చెప్పినట్లుగానే చాలా చెడ్డకాలం వచ్చింది. ఈ భూమిపై భయంకరాలై మునుపెన్నడూ చూడని ఉపద్రవాలు కన్పిస్తున్నాయి. చూచావు కదా!
No comments:
Post a Comment