Wednesday, February 11, 2026

Shuka Maharshi Came To Parikshith Place - శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

అనుక్షణం అంతర్ముఖంగా పరబ్రహ్మ స్వరూపాన్ని చూచి పరవశించిన హృదయంతో బాహ్యప్రపంచాన్ని మరచినవాడు, తామరపైన గండుతుమ్మెదలవలె ముద్దులు మూటగట్టే మొగంపై ముంగురులు ముసురుకొన్నవాడు, గీతగీసి మాయను సమ్మతింపని విధంగా వస్త్రాలు ధరింపక దిగంబరుడై తిరిగేవాడు, ఇతడు సర్వసంగపరిత్యాగియైన యోగి అని చాటుతున్నట్లు పరిహాసాలు పలికే బాలురు వెంట వచ్చేవాడును, సహజసుందరములైన కాళ్లు, పిక్కలు, తొడలు, నడుము, చేతులు, భుజములు, ఉరము, కంఠము, ముఖము, నొసలు, వీనులు, కన్నులు, ముక్కు చెక్కిళ్లు, తల కలిగిన ఒక అవధూత అనుకోకుండా అచ్చటికి విచ్చేశాడు.

ఇవ్వలేదని లోకులపై కోపించి ఎగ్గులు పలుకడు. కావలెనని ఏ కోరికలను కోరడు. జనసమూహంలో చేరడు. వ్యర్థమైన సంభాషణలను చేయడు. అంతేకాదు వ్యర్థమైన ప్రపంచ విషయాలలో ప్రవేశింపడు. దైవవశమున తనకు కలిగిన దానితో సంతృప్తి చెంది, ఏమీ తెలియని అమాయకునివలె సామాన్యంగా కనిపిస్తాడు. 

ఆ మహాత్ముని పదునారేండ్ల నవయౌవనం, ఆ సుందరమందగమనం, ఆ గుణవిశేషాలు, ఆ విలాసం, ఆ నేర్పులు చూచి ముక్తియే ముచ్చటపడి మోహింపగా, ఇక ఇతర కాంతల విషయం చెప్పవలసిన దేమున్నది?

వెఱ్ఱితనం లేక పూర్తిగా విజ్ఞానమూర్తియై బ్రహ్మజ్ఞానస్ఫూర్తితో తిరిగే శుకమహర్షిని వెఱ్ఱివాడని భావించి, అతనివెంట వెఱ్ఱియెత్తినట్లు స్త్రీలు, బాలకులు వెంటనంటి వస్తున్నారు.

ఈ విధంగా వ్యాసుని పుత్రుడైన శుకమహర్షి అక్కడికి రాగా ఆ మహానుభావుని మహత్త్యం తెలిసిన మునివర్యులందరూ తమ తమ ఆసనాలనుండి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చినారు. పాండవపొత్త్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగీశ్వరునికి అతిథి సత్కారాలుచేసి, సాగిలబడి మ్రొక్కి పూజలు గావించినాడు. గ్రహ నక్షత్ర తారకల నడుమ మిక్కిలి వెలుగు లీను పున్నమనాటి చంద్రునివలె అక్కడ ఉన్న బ్రహ్మర్షి దేవర్షి రాజర్షుల మధ్య శుకయోగీంద్రుడు విరాజిల్లినాడు.

కురుకుల శ్రేష్ఠుడైన పరీక్షిత్తు భయభక్తులతో మరల నెన్నుదురునేల తాకేట్లు నమస్కారంచేసి చేతులు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు. "మహానుభావా! వివేకమే ఆభరణమైనవాడా! దివ్యములైన భాషణములు కలవాడా! నా అదృష్టమెటువంటిదో కాని నీవు పావనమూర్తివి, పుణ్యకీర్తివి సరియైన సమయానికి నీ విప్పుడు విజయం చేసినావు.

అవధూతలలో శ్రేష్ఠుడా! నీ ఆగమనంవల్ల ధన్యుణ్ణి అయినాను. నీ సందర్శనంవల్ల నా జన్మ తరించింది. నీవంటి బ్రహ్మజ్ఞాని పావననామం ఉచ్చరించిన మాత్రాన చేసిన పాపాలన్నీ భస్మీపటలమౌతాయి. ఇక నిన్ను దర్శించి, నీ మాటలు విని, నిన్ను అర్చించి, నీ కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లుకొని, నిన్ను స్పృశించి, నీ సేవ చేసుకునే మహాభాగ్యం లభించిన నావంటి వానికి మోక్షం సంప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంటుంది?

భగవంతుడైన వాసుదేవునివలన లోకకంటకులైన నిశాచరులు నశించినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వలన మా మహాపాపాలు మొత్తం రూపు మాసిపోతాయి.

ఏ మహానుభావుడు ప్రియమైన మఱదియై, మంత్రియై మా పితామహులైన పాండవులను నాల్గు సముద్రముల తీర రేఖలు గల విశాలమైన ఈ ధరణీచక్రానికి చక్రవర్తులను గావించెనో, ఆ మహామహుడు, లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికి రక్షకుడై ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని ఆదరాభిమానాలతో కాపాడే రక్షకుడు ఆయన తప్ప అన్యులు ఎవ్వరున్నారు? ఆ సర్వసద్గుణ సంపన్నుని, కారుణ్యపయోనిధిని భక్తితో వేడుకొంటున్నాను. 

అయ్యా! నీవు అవధూతలలో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గతి కలవాడవు. నీ దర్శనం వ్యర్థం కాదు. నా అభిమతం తప్పక ముమ్మాటికి ఫలించి తీరుతుంది. ఈనాడో రేపో ఈ దేహాన్ని త్యజించటానికి సంసిద్ధంగా ఉన్న జీవికి సంసారబంధాలు సమసి మోక్షం ప్రాప్తించటానికి, చింతింపవలసింది, జపింపవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవలందింపవలసింది ఏమేమి కలవో దయదలచి విశదీకరించండి అని వేడుకొంటున్నాను. నీవు జగద్గురుడవు, యోగీశ్వరుడవు, నీకు తెలియందేముంది? గోవును పాలు పిదికేంత సేపు తప్ప అంతకంటె ఎక్కువసేపు ఎక్కడగాని ఉండవు. దయగల తండ్రీ! మోక్షమార్గాన్ని నాకు తెలియజెప్పు.

ఈ విధంగా పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ప్రశ్నించినాడు.

తామర రేకులవంటి కన్నులు కలవాడా! రాజాధిరాజుల కిరీటాలలో చెక్కిన రత్నాల కాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడా! భువిలోని జనులకు కల్పవృక్షము అయినవాడా! నిరంతర విశ్వకల్యాణ భావనకలవాడా, నిత్యధర్మచింతన కలవాడా!

సాటిలేని కల్యాణ గుణాలే పుష్పమాల అయినవాడా! చంపబడుతున్న వైరి వీరులు కలవాడా! లోక జన వినుత విహారా! సీతామానసచోరా, రాక్షసమేఘాలకు సమీరమైనవాడా, దానవ వైభవాన్ని చీల్చి చెండాడినవాడా, కఠిన పాపాత్ములకు కఠోరమైనవాడా! సముద్రుని గర్వాన్ని అపహరించినవాడా!

ఇది శ్రీ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ప్రాప్తించిన అద్భుతమైన కవిత్వం కలవాడూ, కేసనమంత్రి కుమారుడూ, సహజమైన పాండిత్యం కలవాడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం. అందులో నైమిశారణ్య వర్ణన, శౌనకాదిమునుల సంప్రశ్నము, సూతుని నారాయణ కథాసూచన, వ్యాసుల వారి విచారం. నారదాగమనం, ఆయన పూర్వజన్మ వృత్తాంతం, ద్రౌపదీ పుత్రశోకం, అర్జునుడు అశ్వత్థామను బంధించి తేవడం, అశ్వత్థామ గర్వపరిహారం. భీష్మ నిర్యాణం, ధర్మరాజు పట్టాభిషేకం, శ్రీకృష్ణుని ద్వారకాగమనం, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుని అశ్వత్ధామయొక్క అస్ర జ్వాలలనుండి శ్రీకృష్ణుడు కాపాడటం, పరీక్షిత్తు జననం, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిష్మమణం, నారదుడు ధర్మరాజుకు చేసిన కాలసూచన, శ్రీ కృష్ణనిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, పరీక్షిత్తు దిగ్విజయం, కలి గర్వభంజనం, ధరణీధర్శదేవుల సముద్ధరణం, పరీక్షిత్తుకు శృంగి శాపం, గంగాతీరంలో పరీక్షిత్తు ప్రాయోపవేశం, శ్రీ శుకసందర్శనం, మోక్షమార్గాన్ని పరీక్షిత్తు అభ్యర్థించడం అనే కథలతో కూడిన ప్రథమస్మంధం సమాప్తం.

శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట