Thursday, February 5, 2026

Sree Maha Vishnu Ekavisanthi Avatharamulu - శ్రీ మహా విష్ణు యేకవింశత్యవతారములు

శ్రీ మహా విష్ణు యేకవింశత్యవతారములు

ఆ విరాట్స్వరూపమే అన్ని అవతారాలకు మొట్టమొదటిది. అదే అన్నింటికి మూలం. అది శ్రీమన్నారాయణుని దేదీప్యమానమైన సగుణరూపం. పరమయోగులైన వారికి మాత్రమే ఆ దివ్యస్వరూపం గోచరిస్తుంది. ఆ నారాయణుని నాభి పద్మంనుంచి సృష్టికారకులైన వారిలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆ విష్ణుభగవానుని అవయవ ప్రదేశాలనుండి సకలలోకాలు కల్పించబడ్డాయి. మొట్టమొదట ఆ విష్ణుదేవుడు "కౌమారం" అనే పేరుగల సృష్టిని ఆశ్రయించాడు. కేవలం ఆత్మదర్శనం మాత్రమే చేసేవాడై, దుష్కరమైన బ్రహ్మచర్యాన్ని మాత్రమే ఆచరించే దీక్ష వహించాడు.

రెండోసారి లోకాలను సృష్టించడానికి అనువుగా రసాతలభాగంలో ఉండిపోయిన భూమిని పైకెత్తడానికి యజ్ఞవరాహావతారం ధరించాడు. 

మూడోపర్యాయం నారదుడనే పేరుతో బ్రహ్మర్షియై కర్మబంధాలను తొలగించే వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. 

నాలుగోసారి ధర్ముని భార్యయైన మూర్తియందు నరనారాయణ రూపంలో అవతరించి దుష్కరమైన తపస్సు ఆచరించాడు.

ఐదో అవతారంలో కపిలుడనే పేరుతో ఉద్భవించి సమస్త సిద్ధులు తెలిసినవాడై “ఆసురి అనే బ్రహ్మర్షికి ఇరవై నాలుగు తత్వాలతో కూడిన సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. 

ఆరో అవతారంలో అత్రికి అనసూయకు పుత్రుడై (దత్తాత్రేయుడై) అలర్కునకు, ప్రహ్లాదుడు మున్నగువారికి బ్రహ్మవిద్యను తెలియజేశాడు.

ఏడో పర్యాయం ఆకూతికి, రుచి ప్రజాపతికి యజ్ఞుడై జన్మించి, యముడు మున్నగు దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని కాపాడాడు.

ఎనిమిదో అవతారంలో మేరుదేవికి నాభికి ఉరుక్రముడనే పేరుతో పుట్టి మిక్కిలి ప్రసిద్దుడై ఆత్మవేత్తలకు పరమహంస పరివ్రాజకుల జీవన విధాన మెటువంటిదో తెలియజేశాడు.

తొమ్మిదోసారి ఋషులచే కోరబడి పృథు చక్రవర్తిగా ఆవిర్భవించి భూదేవిని ఆవుగాచేసి ఓషధులనన్నింటిని పితికాడు. 

పదో పర్యాయం చాక్షుషమన్వంతరంలో మీనావతారం ధరించి భూమిరూపంలోనున్న ఓడలో ఎక్కించి వైవస్వతమనువును కాపాడాడు.

పదకొండోసారి సముద్రాన్ని చిలికే సమయంలో కూర్మావతారం ధరించి మందరపర్వతాన్ని తనవీపుపై నిలిపాడు.

పండ్రెండో అవతారంలో సురాసురులచే చిలుకపడ్డ పాలకడలిలో "ధన్వంతరి" అనే పేరుతో అమృత కలశాన్ని చేతదాల్చి సాక్షాత్కరించాడు.

పదమూడోసారి జగన్నోహినియై, అసురులను వంచించి సురలకు అమృతం ఆహారంగా పంచిపెట్టాడు.

పదునాల్గొదైన నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. 

పదియేనవదైన వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగులను యాచించి ముజ్జగాలు ఆక్రమించాడు. 

పదునారోసారి పరశురామావతారంలో ఆవేశం పొంది బ్రహ్మవేత్తలకు హాని కల్గించిన ప్రభువులను ఇరవై యొక్క పర్యాయాలు వధించి భూమిని క్షత్రియ శూన్యం కావించాడు.

పదియేడోసారి వ్యాసరూపంలో అవతరించి అల్పబుద్ధులైన మానవులపై దయచూపించి వేదవృక్షానికి శాఖోపశాఖలు కల్పించాడు.

పద్దెనిమిదో పర్యాయం దేవకార్యార్థమై శ్రీరాముడనే పేరుతో క్షత్రియుడుగా అవతరించి 'సాగరబంధనం' మున్నగు సాహసకృత్యాలు ఆచరించాడు. 

పందొమ్మదివ పర్యాయం బలరాముడుగను.

ఇరవైయవ అవతారం లో శ్రీకృష్ణుడు అనే రూపంలో యాదవవంశంలో జన్మించి భూభారాన్ని అరికట్టాడు.

ఇరవై ఒకటోసారి కలియుగ ప్రారంభ సమయంలో బుద్ధుడనే పేరుతో పుట్టి దానవులను వంచించడానికై “మధ్యగయ” అనే పుణ్యప్రదేశంలో జినసుతుడుగా విరాజిల్లుతాడు. 

ఇరవై రెండో పర్యాయం కలియుగసంధిసమయంలో భూమిని పాలించే పరిపాలకులే తస్కరప్రాయులై సంచరిస్తూ ఉండగా విష్ణయశుడనే బ్రాహ్మణోత్తమునకు 'కల్కి' అనే పేరుతో ఆవిర్భవించి అధర్మాన్ని నశింపజేసి కృతయుగ లక్షణాలను యథాతథంగా జరిగేటట్లుగా ఏర్పాటు చేస్తాడు. 

ఈ విధంగా భగవదవతార విశేషాలను వివరించి సూతుడు ఇంకా శౌనకాది మహామునులకు ఇలా వివరిస్తున్నాడు.

చెరువులోనున్న నీరు పెక్కు కాలువలరూపంగా ప్రవహించినట్లుగా, నారాయణుని ద్వారా ప్రపంచశ్రేయస్సును కలిగించేలా వ్యక్తమయ్యే అవతారాలు అనంతాలు. భూమిని పాలించే చక్రవర్తులు, దేవతలు, బ్రహ్మ
ర్షులు, మహర్షులు అందరూ విష్ణువు అంశలవల్ల, కళాంశల వల్ల జన్మించినవారే. బలరాముని తమ్ముడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే. కృష్ణునకు, విష్ణునకు కించిద్భేదంకూడ లేదు.

ఏ సమయంలో లోకాలు రాక్షసబాధలచే చీకాకుపొందుతూ ఉంటాయో, ఆ సమయంలో భగవానుడైన శ్రీమన్నారాయణుడు ప్రతియుగంలోను లీలావతారంగా ఆవిర్భవించి కాపాడుతూ ఉంటాడు.

శ్రీమన్నారాయణుని అవతారగాథ ఎన్నో అంతరార్థాలతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని ఏ మానవుడైనా ఉదయం, సాయంకాలం మిక్కిలి శ్రద్ధతో భక్తితో పఠిస్తే చాలు, అతడు భవబంధాలకు లోనుగాక దూరంగా ఉంటాడు.

మహర్షులారా! సావధానంగా వినండి. వాస్తవానికి జీవుడు రూపంలేక జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అయినప్పటికి పరమాత్మయొక్క మాయవల్ల జనించే మహత్తత్త్వం మున్నగు వాటివల్ల ఆత్మ కేంద్రబిందువుగా ఉండే స్థూలశరీరం జీవునికి కల్పించబడుతోంది. ఆకాశంలో గాలి ఆధారంగా ఉండే మబ్బులు, వాయువువల్ల భూమికి సంబంధించి పైకిలేచే దుమ్ముయొక్క బూడిదరంగుతో కన్పించినట్లుగా, సర్వదర్శియెన ఆత్మలో నానాదృశ్యాలు ఆత్మదర్శనం చేయని వారిచే కల్పించబడుతున్నాయి. జీవునికి ఈ కనబడుతున్న స్థూలశరీరంకన్న సూక్ష్మశరీరం వేరొకటి ఉంది. అది కనబడని గుణాలు కలదై ఉంటుంది. అది వినబడేది కాదు. అది నిత్యం వాస్తవస్థితిలో ఉంటుంది. అది కంటికి కనబడక అవ్యక్తమై సూక్ష్మరూపంతో కాలు, చేయి మున్నగు అవయవాలు లేక మరో శరీరంతో ఉంటుంది. ఆ సూక్ష్మశరీరం వల్లనే మరణానంతరం జీవునికి రాకపోకలతో పునర్జన్మ కనబడుతోంది.

ఎప్పుడయితే స్వరూపజ్ఞానం, సమ్యగ్‌జ్ఞానం జీవునకు కలుగుతాయో అప్పుడు స్థూలదేహం, సూక్ష్మదేహం కూడా తొలగిపోతాయి. ఆ సమయంలో మాయవల్ల ఆత్మలో ఈ సంసారమంతా కల్పించబడుతోందని తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే జీవుడు బ్రహ్మ సందర్శనానికి యోగ్యుడవుతాదు. ఆత్మదర్శనం అంటే సమ్యగ్ధర్శనమే. 

సర్వజ్ఞుడైన ఈశ్వరుని అధీనంలో మాయ ఎప్పుడూ క్రీడిస్తూ ఉంటుంది. ఆ అవిద్య (మాయ) ఉపశమించి తానే విద్యారూపంగా మారిపోయే సమయంలో జీవోపాధి ధరించడానికి హేతువులైన స్థూల సూక్ష్మరూపాలు రెండూ దగ్దమైపోతాయి. అపుడు జీవుడు కాష్ఠం లేకుండా ప్రకాశించే అగ్నివలె అవుతాడు. తాను దేహంలేకుండా పరమాత్మ స్వరూపాన్నిపొంది అద్వైతానందంతో విరాజిల్లుతాడు. ఈ విధంగా తత్త్వవేత్తలు వచిస్తారని చెబుతూ సూతమహర్షి ఇలా అంటున్నాడు.

భగవంతునికి పుట్టుక అనేదే లేదు. జన్మ అనేదే లేదంటే కర్మప్రసక్తి మాత్రం ఎలా ఉంటుంది? అయినా సత్కవులు బ్రహ్మను తెలిపే పదజాలంతోనే పరాత్పరునికి జన్మకర్మలు కల్పించి స్తోత్రం చేస్తూ ఉంటారు. వేదాల్లో ఎక్కడచూచినా, జీవునికివలె కర్మ జన్మలు ఉన్నట్లుగా పరమాత్మకు చెప్పబడలేదు.

భగవంతుడు సమస్త లోకాలను సార్ధక లీలావిలాసంగా సృష్టిస్తాడు. రక్షిస్తాడు. లయం చేస్తాడు. కాని తాను మాత్రం వాటియందు నిమగ్నుడు కాడు. అనేక ప్రాణికోటులలో అంతర్యామి రూపంలో విహారం చేస్తూ ఉంటాడు. ఇంద్రియ సమూహానికి ప్రీతి కలిగిస్తాడు. స్వర్గం దూరంగా ఉన్నాా దగ్గరగా ఉన్నట్లే భావించి ఆనందించేవిధంగా, ఇంద్రియాలకు దూరంగా ఉంటూ ప్రయోజనాన్ని సంతరిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలను స్వీయవిషయాలపై ప్రవర్తింపజేస్తూ, ఆ వెనువెంటనే నియంత్రిస్తూ, ఇష్టం వచ్చినట్లు వాటిని తిప్పుతూ ఉంటాడు.

లోకేశ్వరుడైన శ్రీహరి క్రీడావిలాసాలు, నామరూపాలు అనంతాలు. వాటిని మనస్సు గ్రహించలేదు. వాక్కు స్తుతి చేయలేదు. ఎంత ఊహానైపుణ్యంతో, కుతర్కం చేసేవాడైనా ఆ పరమాత్మ క్రియాకలాపాలకు అవధిని ఏర్పాటు చేయలేడు. కళాభిజ్ఞుడు కానివాడు నాట్యంలోని అందచందాలను గ్రహించి అభినందించలేనట్లే, అజ్ఞుడైనవాడు సర్వజ్ఞుని లీలావిలాసాలను గ్రహించలేడు.

ఏ భక్తుడు ఇంచుకైనా వంచనలేకుండా, మనస్సులో నిరంతరం ప్రీతి కలిగి నారాయణుని పాదపద్మాల సుగంధాన్ని సేవిస్తాడో, అతడు మాత్రమే బ్రహ్మాదులకు కూడా గ్రహింప శక్యంకాని అత్యద్భుతాలైన హరి కర్మలీలలను తెలుసుకోగలుగుతాడు.

భూసురోత్తములారా! శ్రీహరి పాదద్వంద్వంపై మీకు కలిగిన భక్తి అచంచలమైనది. మిక్కిలి నిష్ఠతో కూడుకొన్నట్టిది. మీ మనఃప్రవృత్తి ఆయనయందే ఎడబాటు లేకుండా విరాజిల్లుతూ ఉంటుంది. మీరు ధన్యాత్ములు. సర్వం తెలిసినవారు. నారాయణస్మరణప్రభావంవల్ల చావుపుట్టుకల బాధలు ఎప్పుడూ మిమ్ములను సమీపించలేవు.

పరీక్షిత్ మహారాజు

No comments:

Post a Comment

kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూ...