Friday, February 27, 2026

Pleased by Dhruva devotion, Vishnu appeared and Dhruva Praised Lord Vishnu - సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట

సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట

ఆ సర్వవ్యాపకమైన ఆ దైవస్వరూపాన్ని కళ్లారా జుర్రుకుంటున్నట్లుగా, ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్టుగా భావించుకుంటూ మొక్కాడు. చేతులతో కౌగలించుకుంటున్నట్టుగా అనుభూతి పొందుతూ సాగిలపడ్డాడు.

ఇలా అనుభవిస్తూ సాగిలబడి నమస్కరించాడు. రెండు చేతులు జోడించి కీర్తించడానికి సంకల్పించాడు. వర్ణించడానికి ధ్రువుడి చేత కాలేదు. సర్వాంతర్యామి విష్ణువు ధ్రువుడి ఇంగితాన్ని గమనించాడు. వేదాత్మకమైన తన శంఖంతో ధ్రువుడి బుగ్గలను నిమిరాడు. ఆ స్పర్శతో ధ్రువుడికి జీవాత్మ పరమాత్మల వేరుపాటును చక్కగా పసికట్టగల జ్ఞానం కల్గింది. ధ్రువుడు భక్తియందు శ్రద్ధాళువు అయ్యాడు. సమస్తభువన ప్రఖ్యాతుడగు నారాయణుని మహత్తరమహిమచే చెప్పబడ్డవై ధ్రువుడి వేదమయ వాక్కులుగా వెలువడుతున్నాయి. ఆ విష్ణువును ఆ తన మాటల్లో ఇలా స్తుతించాడు. ఓ దైవమా! అనంతశక్తి సమన్వితుడవు, సర్వాంతర్యామివి ఐన నువ్వు, నాలో సంలీనమై ఉన్ననా మాటలకూ, నా శ్వాసకూ, చేతులు, కాళ్లు, చెవులు, చర్మం మొదలైన ఇంద్రియాలకూ, నీ చైతన్యసామర్థ్యంచే దయ చూపిన దైవమవు, పరమాత్మవు అయిన నీకు నమస్కరిస్తున్నాను. అనన్యుడవయిన నువ్వు మహత్తు మొదలైనవి ప్రధానంగా కల ఈ సకల చరాచర ప్రపంచాన్ని మాయ పేరిట నీ స్వతంత్రమైన ఇచ్చతో సృజించావు. ఆ మాయామయ ప్రపంచంలో త్వగాది ఇంద్రియ రూపాల్లో చొచ్చి ఉన్నావు. ఆ యా దేవతల స్వరూపాల్లో అన్నిరకాల కట్టెల్లో దాగి ఉండే నిప్పువలె బహు ప్రకారంగా కనిపిస్తుంటావు.

(ప్రాణేంద్రియములు

1. ప్రాణములు. ఇవి ఐదు. 1.ప్రాణము, 2.అపానము, 3.వ్యానము, 4.ఉదానము, 5.సమానము

2. ఇంద్రియములు - ఇవి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు - రెండు రకాలు.

కర్మేంద్రియములు ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ.

జ్ఞానేంద్రియములు : త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము.)

దీనబాంధవా! నిద్రనుంచి లేచినవాడు మళ్లీ ప్రపంచాన్ని చూసినట్లు బ్రహ్మదేవుడు నిన్ను శరణుపొంది నీవు ప్రసాదించిన జ్ఞానం చేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. మోక్షం కోరేవాడికి శరణాలయిన నీ పాదాలను ఉపకారం మరువని సజ్జనుడు ఎలా మరచిపోతాడు? (మరచిపోడు)

మహాత్మా! నువ్వు చావుపుట్టుకల విముక్తికి నిమిత్తుడవు. అనన్యమైన కల్పవృక్షం వంటివాడవు. భక్తులు ఎవ్వరైనా తాము కోరినదాని కోసం ప్రయత్నించే వాళ్లు నీ మాయకు లోనవుతారు. చతుర్విధ పురుషార్థాల భోగాలకోసం తమను తాము అప్పగించుకుంటారు. అది త్రిగుణమయమైన శారీరక సుఖాలకోసంగా మనస్సున సంకల్పించుకుంటారు. సంసార తాపాన్ని పాపే గుణకథన మాధుర్యం గలవాడా! ఈశా! మాధవుడా! ముకుందా! అలాంటివాళ్లకు ఇంద్రియార్థాల వల్ల కల్గే సౌఖ్యం నరకంలోనూ వర్తిల్లుతుంది.

పద్మనాభా! సాధుజనావన! నీ చరణాలను స్మరించడంవల్లా, మిక్కిలి ప్రేమతో అలరింపచేసే నీ గాథలను వినడంవల్లా, సమకూడిన ఆనందాన్ని తననే ఆహ్లాదింపచేసే బ్రహ్మానందంలోనూ లేవట. యముడి కాలదండంచే భగ్నమై విరిగిపడే విమానాలనుంచి ఎడం లేకుండా నేలకూలే ఆ దివ్యుల గూర్చి ఇక చెప్పుకునేది ఏమి ఉంటుంది.

(దానధర్మాది పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి వెళ్లిన వారు తిరిగి భూలోకానికి వస్తారు. కాని మోక్షం కోసం ప్రయత్నించి వెళ్లినవారు భూలోకానికి తిరిగిరారు. స్వర్గానికి మోక్షానికి ఇది భేదం.)

ఓ వెన్నుడ! నీ ఆరాధన విధానంలో నియమంతో మనస్సు పెట్టే వాళ్లయొక్క నీదు మూర్తిపైనే దృష్టిపెట్టిన భక్తవరుల యొక్క సహవాసాన్ని నాకు సమకూర్చు. ఆ సజ్జన సాంగత్యంచేత రుచికరమైన నీ కథామృతపానంచేత ఉన్మత్తుడనవుతాను. ఆ పారవశ్యంతో దాటశక్యంకాని కష్టాల కడలిని సులభతమంగా దాటేస్తాను.

ఓ సర్వాంతర్యామీ! లక్ష్మీవల్లభా! ముక్తిదాయకా! హరీ! ఎప్పుడూ నీ పాదపద్మాల సేవా పరిమళంలో మునిగి తేలే మనస్సు కలవాళ్లు ఎంతో ప్రియమైన తమ శరీరం నశ్వరత్వాన్ని గ్రహిస్తారు. అలాంటి వాళ్లు తమ భార్యల్ని, బిడ్డల్ని మిత్రుల్ని ఇంటిని, బంధువుల బలగాన్ని మరచిపోతారు.

శుద్ధ స్వరూపుడా! పరమాత్మా! భవభయాన్ని దూరంగా తోసేవాడా! పరమముని కీర్తనీయా! అంతంలేని భాగ్యంకలవాడా! పద్మదళనయనా! లక్ష్మీనాథా! నీ స్థూలమైన విశ్వరూపం మానవులు, దేవతలు, పశువులు, జంతువులు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పెక్కు ప్రాణి కోటితో నిండి ఉంటుంది. ప్రకృతి, పురుషుడు వంటి సత్‌, అసత్‌ భేదాలు కలది. మహత్తత్త్వాదులకి హేతువైనట్టిది అని నాకు తెలుసును. కాని నిత్యం క్షేమదాయకం అయినదీ, ఎపుడూ ఐశ్వర్యరూపంతో ఉండేదీ, అనేక శబ్దాదుల వ్యవహారం లేనిదీ అయిన మిగిలిన బ్రహ్మరూపం గూర్చి నాకు ఏమీ తెలియదు.

యుగాంతవేళ ఈ బ్రహ్మాండాన్ని నీలో కలుపుకొని శేషుణ్ణి తోడుగా చేసుకొని ఆ శేషతల్పం పైననే పరుంటావు. యోగనిద్రాసక్తిలో ఉంటావు. బొడ్డు అనే నదిలో పుట్టిన బంగరు పద్మం దుద్దునుంచి బ్రహ్మను ఒద్దికగా పుట్టిస్తావు. ఆ పద్మం తేజస్సును బయలుపరచే బ్రహ్మ స్వరూపంలో నువ్వే ఉంటావు. ఓ శుభప్రవర్తనుడా! పద్మదళనయనుడా! నిత్య భద్రకరరూపా! అక్షీణ ఆనందరూపా! గోవిందా! నారాయణా! ముక్తిదాయకా! అట్టి నీకు నియమవంతుడనై మొక్కుతాను.

అలా యోగనిద్రలో మునిగి ఉన్నప్పటికిన్నీ జీవులకంటే వేరైన వాడవే. ఆ విలక్షణం అయిన మతిస్థితి విశేషంవల్ల మొక్కవోని స్వశక్తికలవాడవు. ఆ సామర్థ్యంచే విశ్వపాలనంకోసం యజ్ఞాధిష్ఠాతవు అయ్యావు. నువ్వు నిత్య విమోచనుడివి, నిత్యపావనుడవు, సర్వం తెలిసినవాడవు, సర్వానికి ఆత్మరూపుడవు, స్తిమితపరుడువు, మూలపురుషుడవు, ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, ధనం, తెలివి, వైరాగ్యాది లక్షణాలుగల భగవానుడవు. త్రిగుణాధిపతివై వర్తిస్తుంటావు. నిర్భాగ్యుడైన జీవుడిలో ఈ గుణాలకు తావుండదు. పరస్పర విరుద్దాలైన పలుసామర్థ్యాల యొక్క కలయిక గల సర్వేశ్వరుడవు. దాంట్లో అవిద్యాదుల వరుసలు లయమవుతూ ఉంటాయి. అలాంటి సర్వవ్యాపక కారకమూ, అద్వితీయమూ, అనంతమూ, మూలభూతమూ, ఆనందమయమూ, నిర్వికారమూ అయిన పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. నీకు నమస్మారం. ఓ దేవా! నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలయిన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్రపాదసేవనమే, ఇది నిశ్చయం. కాని గోవు లేగదూడను నిత్యం చనుబాలుకుడిపి, తోడేళ్లవంటి వన్యమృగాల బారినుంచి గోవును కాపాడినట్లు నీవు కాముకులైన దుఃఖితుల కోరికలు తీరుస్తుంటావు. భవభీతినుంచి వాళ్లను దూరం చేస్తుంటావు. ఇలా యథార్థసంకల్పుడు, సద్వివేకి అయిన ధ్రువుడు ఆ దేవదేవుని ప్రస్తుతించాడు. భక్తుల పై వాత్సల్యం కురిపించే ఆ భగవంతుడు ఆ స్తుతుల తనివితో ఇలా మాటిచ్చాడు.

నిశ్చితమైన నియమం పట్టినవాడా! ఓ క్షత్రియ పుత్రకా! నీ మనస్సులో అట్టిట్టాడే సంకల్పం ఏమిటో నేను పసికట్టాను. నిజానికి అది నెరవేర్చరానిదే అయినా తప్పక నెరవేరుస్తాను.

ఆ దుర్లభం ఎట్టాంటిదో విను. కేంద్రస్థానమైనగుంజ చుట్టూ తిరుగుతుండే ఎద్దు వలె గ్రహాలూ నక్షత్రాలూ తారలగుంపులూ అనే కాంతిమండలం, చుక్కలరూపు పొందిన ధర్ముడు, అగ్ని కశ్యపుడు, శక్రుడు, సప్తర్షులు ఏడుగురూ తారకలను కలుపుకుని ఒక ధ్రువకేంద్రం చుట్టువార తిరుగుతూనే ఉంటారు. ఆ భాగం మరొకరు చేరరానిది. పొందరానిది ముల్లోకాల ముంపులోనూ చెక్కు చెదరనిది, మహాకాంతిమంతమైంది 'ధ్రువక్షితి' అనే స్థానం. ఇక రాబోయే 6000 ల ఏళ్లు గడిచాక ఈ చోటును నువ్వు పొందుతావు. ఆ పదం ప్రాప్తించే లోపు నీ తండ్రి వానప్రస్థానికి వెళ్తాడు. ఆ రాజ్యాన్ని నువ్వు న్యాయవంతంగా ఆదరణీయంగా ఇంద్రియాలకు లోను గానివాడవై పరిపాలిస్తావు. నీ తమ్ముడు వేట వ్యసనంవల్ల అరణ్యంలోకి పోయి మరణిస్తాడు. అతణ్జి వెతుకులాడుతూ అతని మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్న ఆతని తల్లి ఆ అడవుల్లోకి పోయి కార్చిచ్చుల్లో చిక్కుకొని నాశమవుతుంది. అదియునుగాక,

(మూలగ్రంథాల్లో 26 వేలనియూ 36 వేల సంవత్సరాలు ధ్రువుడు రాజ్యపాలనం చేశాడని ఉంది.)

పుణ్యశీలీ! ఆ తర్వాత నువ్వు యజ్ఞశరీరధారినైన నన్ను విరివిగా దక్షిణలిచ్చే ఎన్నోయాగాలచేత యజిస్తావు. నిజమైన ప్రాపంచిక సౌఖ్యాలన్నిటిని అనుభవిస్తావు. చివరిక్షణాల్లో నన్నే మనస్సున స్మరించుకుంటావు. సమస్తజనులు చేతులెత్తి మోకరిల్లేది, ఇహలోకంలోకి మళ్లి తిరిగి రాలేనిది, ఋషిమండలంకంటే పైన ఎత్తున ఉన్న ఆ పరంధామాన్ని తగిన సమయంలో చేరుకోగలవు అని ఆ విష్ణుమూర్తి ధ్రువుడు కోరిన కోరికలను తీర్చాడు. అలా ఆ ధ్రువుడి కళ్ల ముందే గరుడ వాహనం ఎక్కి సంతోషంగా తన వైకుంఠపురికి తరలి వెళ్తాడు.

ఓ విదుర! విశిష్టచరిత! ఆ ధ్రువుడుకూడా ఆ విష్ణుపాదకమలాల మీది భక్తివల్ల ఉత్తమవరాలు అందుకున్నప్పటికీ మానసిక సంతృప్తిలేకనే తిరిగి వెల్లిపోయాడు.

ఇలా మైత్రేయముని ధ్రువుడు భక్తి యోగమార్గాన విష్ణువుచే ధన్యుడైన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు మొదటి నుంచి చివరిదాకా విదురుడికి వినిపించాడు. అది విన్న విదురుడు అతి వినమ్రంగా మైత్రేయుణ్ణి గూర్చి ఇలా పలికాడు.

మునిశ్రేష్టా! విను. కాముకులు పొందలేనిది, విష్ణుపాదసేవకులైన మునులు మాత్రమే చేరకల్గింది అని చెప్పుకునే ఆ నారాయణుని ధామాన్ని ఎన్నో పుట్టుక లెత్తితేగాని పొందరాని ఆ విష్ణుపదాన్ని ధ్రువుడు ఒకే ఒక జన్మలోనే పొందాడు. ఆ ధ్రువుడు పురుషార్థం తెలిసినవాడు. అయినా కోరిక తీరలేదని ఎందుకు అనుకున్నాడు? అనగానే మైత్రేయుడిలా సమాధానం పలికాడు.

పుణ్యుడా! పినతల్లి తనను ఉద్దేశించి పలికిన పారుష్యపు మాటలు అనే అమ్ములు గుచ్చుకున్న మనస్సు కలవాడై వాటినే స్మరించు కోవడంచేత, 'మోక్షాన్ని కోరుకోలేక పోయాననే చింత'ను మనస్సున పెట్టుకున్నాడు.

అంత ఆ ధ్రువుడు ఇలా చింతించాడు. 'ఇంద్రియ నిగ్రహులు, మహామహిములు అయిన సనందాది మునులు అడ్డులేని భక్తితో ఏ చోటనైనా ఏ కాలంలో అయినా ఏ జన్మలోనైనా కొంతకొంతగా సంతరించి పెట్టుకున్న సమాధి యోగంవల్ల ఎవ్వరి పాదపద్మాల గురించి తెలుసు కోగల్గుతారో అలాంటి పరమేశుని, సర్వేశుని, నిర్వికారుని, అపరిమితుని, అజేయుని, ఆదిదేవుని,

నేను ఆరు మాసాలు మాత్రమే సేవించి మహాయోగసాధనతో ఆ హరి పాదపద్మాల నీడను ఆశ్రయించగలిగాను. అయినా అన్యదృష్టితోనే ఉన్నాను. అయ్యో! ఇలాంటి దురదృష్టవంతుణ్ణి నేను. భవబంధాలను తెగ్గొట్టే ఆ నారాయణుని కన్నారా చూచి అశాశ్వతమైన వరా లడిగాను. ఇలాంటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? తమ తమ ఉనికి పట్టుకంటే ఉచ్చదశకు చేరుకుంటా ననే అక్కసుతో దేవతలు నా బుద్దిని వ్యాకులపరిచారేమో! ఆనాటి నారదముని వాక్కులన్నీ యథార్థ మయ్యాయి. ఆ ముని మాటలు పెడచెవిన పెట్టిన నేను నీచుణ్జి. స్వాప్నికావస్థానుభూతిలో ఉన్నవాడు, దైవికమైన మాయచేత అన్యదృష్టిని పోయేవిధంగా నేనూ అపరభావం లేదని తెలిసీ అన్నదమ్ముడనే విరోధిత్వంతో వ్యథపొందాను, లోకస్వరూపుడూ, సుప్రసాదుడూ, సంసారతాపం తొలగించేవాడూ, అయిన ఈశ్వరుని కొలిచి ఆ దేవుడిదయను కూడ పొందగలిగాను. ఆయుర్ధాయం మూడిన రోగి చికిత్సను వలె ఎందుకూ పనికిమాలిన, అస్థిరమైన వరాలడిగాను అని మైత్రేయుడు చెప్పి మళ్లీ

(భేద దర్శనుడనయి : ధ్రువుడు - సవతి తల్లిమీది కోపంతో తపస్సుచేశాడు. తాను వేరు తల్లి వేరు - అనే భేదజ్ఞానం తొలగిపోలేదు. తనయందు సకలభూతములందు - ఒక భంగి అనే సమహితత్వం - ధ్రువునిలో రాలేదు. అందుకు తగ్గట్లే వరం లభించింది. అదీ ధ్రువుని బెంగ.)

మహారాజును ఆశ్రయించిన నిరుపేద మితిమీరిన అహంతో ధాన్యం గింజల్ని దానం చెయ్యమని కోరినట్లుంది నా స్థితి. మోక్షఫలాన్ని ప్రతిఫలంగా ఇవ్వగల ఆ విష్ణువే తనివితీరా ప్రత్యక్షమయ్యాడు. కాగా ఆ దేవుణ్ణి ప్రాపించికమైన కోరికలు ప్రసాదించమని వేడాను. నా వంటి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ ఎవరైనా ఈ మట్టిమీద పుట్టి ఉంటారా? ఉండరని భావం.

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

No comments:

Post a Comment

After receiving blessings for his devotion and an exalted position, a mature Dhruva returns to his kingdom to be welcomed by his father, King Uttanapada - ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కర...