విదురా! విను. అన్ని లోకాల రక్షణార్ధం విష్ణు అంశ కలిసిన బ్రహ్మ దేవుడికి పుట్టినవాడు స్వాయంభువమనువు. ఇతడు యశోవంతుడు.
ఆ స్వాయంభువ మనువుకి శతరూప కడుపున ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లిద్దరూ లోకుల పొగడిక కన్నవారు. ఈ పిల్ల లిద్దరిలో ఉత్తానపాదుడు మంచిమనుగడ కలవాడు. ఇతడికి,
విదురా! విను. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు ఇల్లాళ్లు. సునీతి, సురుచి. వీళ్లల్లో ద్రువుడి కన్నతల్లి సునీతి మీద ఉత్తానపాదుడికి అపేక్ష తక్కువ. సురుచి మీద ప్రీతి ఎక్కువ. ఇలాగున ఉంటున్న సమయంలో,
(సునీతి చక్కటి నీతి మంతురాలు. సురుచి చక్కటి సొగసరి.)
ఒక దినాన ఉత్తానపాదుడు, ప్రేయసి సురుచి కన్నకొడుకును ఉల్లాసంగా తొడల మీద కూర్చోపెట్టుకుని లాలిస్తూ ఉన్నాడు. అదే వేళలో తానూ తండ్రితొడ ఎక్కాలని ఆసగొన్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు చూసినా, దగ్గరకు తీయలేదు. ముద్దాడ లేదు. ఉపేక్షించి కిమ్మనక ఉన్నాడు. దానితో పొగరెక్కిన సురుచి, సపత్ని కొడుకు ధ్రువుడితో ఇలా పలికింది. ఓ సవతి కొడుకా! తండ్రి తొడ ఎక్కాలని కుతూహలపడినట్లయితే విను. నువ్వు ఆనాడే నా కడుపున పడక మరొక స్త్రీ గర్భాన పడ్డావు. తండ్రి తొడ ఎక్కి కూర్చుని ఆనందించే అదృష్టం కోరుకున్నంతమాత్రాన చిక్కుతుందా?
పుణ్యాత్మా! అందుకని నువ్వు ఆ వెన్నుని పాదారవిందాల ప్రాపును విడువక పొందు. ఆ దైవం నిన్ను నా కడుపున పుట్టిస్తాడు. ఆ విధంగా వీలుపడితే ఎడతెగని సంతోషం అనుభవిస్తావు.
ఈ రకంగా పలికిన పిన తల్లిమాటలు చెవికి ఏవగింపు పుట్టించాయి. తన తండ్రి వినేటట్టుగా తననుగురించి మాట్లాడిన కానిమాటలు ఎదను కెలికి కష్ట పెట్టగా,
కన్నకొడుకునైన తనను పట్టించుకోనట్లున్న తండ్రినుండి పక్కకు తొలగాడు. కష్టాలకడలిలో మునిగివుంటూ కర్రదెబ్బ పడ్డ పెద్దపామువలె కోపంతో
పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ దుఃఖానికి రెండుకళ్లనుంచి కన్నీరు బొటబొట జాలువారుతూ ఉంది. తల్లి దరికి చేరాడు. కన్నబిడ్డను చూసి తల్లి సునీతి ఎంతో ఆప్యాయంగా ఒళ్లోకి తీసుకొని ప్రేమగా మొగం అంతా అరచేతులతో అటూ ఇటూ సవరించింది. జరిగిన సంగతంతా స్త్రీలు, రాణివాసంలో ఉండే పరిచారికలూ చెప్పగా విన్నది. పెద్ద పెద్ద నిట్టూర్పులు వెంట వెంటగా నిగిడించింది. కంట నీరు పెట్టుకుని క్షోభపడిందై
సవతి సురుచి పల్కిన నిక్కుమాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. అలా పేర్చబడ్డ శోకాగ్నుల దొంతరలతో లోలోపల మగ్గిపోతూ కారుచిచ్చుల కాకల్లో తగుల్కొని ఆ వెలుతురులకు కమిలిపోయే మాధవీలతలాగా ఆమె కుమిలిపోయింది.
కాసేపటికే స్తిమితపడి ఆ సునీతి, తన పిల్లవాణ్ణి స్పృశిస్తూ తండ్రీ! ఏడవకు మంటూ ఊరడించి ఇలా తెలియపలికింది.
బాబూ! ఏదో నెపంగా ముందటి జన్మంలో చేసిన పాపభూయిష్ఠమైన వేదన వెనుకొని వెంటాడుతుంది. ఎట్లయినా మన ఈ వెతకు సంబంధించి బయటివారికి జంకవలసిన అగత్యం కల్గదు కదా.
కట్టుకున్న భర్త నోటను భార్య అని కాదు కదా కనీసం 'ఊడిగపుది' అనే పిలుపు కయినా నోచని దానను. భార్యగా గౌరవం పొందని నిర్భాగ్యురాల నన్పించుకోగల నా కడుపున పుట్టిన దౌర్భాగ్యానికి
ఆ సురుచి నిన్ను అన్నమాటల్లో నిజం ఉంది. నీ తండ్రి తొడలపై కూర్చోవాలనేదే నీ ఆకాంక్ష అయితే నీవు సర్వరక్షకుడగు ఆ పరాత్పరుని పాదాలు ఆశ్రయించు.
కనుక మాతృసమానురాలైన ఆ సురుచి మాటప్రకారంగానే ఆ విష్ణుని ప్రాపు చేరు అని హితవు చెప్పింది. మళ్లీ ఇలా సమర్థించి చెప్పింది.
నిజానికి ఆలోచించి చూస్తే ఈలోకాల రక్షణకోసం ఇష్టపడి సత్త్వాదిగుణరూపాల్లో గోచరమయ్యే విష్ణుని పాద పద్మాలను కొలిచి ఆ బ్రహ్మ అంతఉన్నత పదవిని అందుకోగల్గాడు. మీ తాత స్వాయంభువమనువు ఔన్నత్యం కలవాడు ప్రఖ్యాతుడు. సర్వాంతర్యామి తత్త్వప్రధానమైన ఎరుకతో ఆ విష్ణువుని సవనరూపంలో అనేక దక్షిణలతో సేవించాడు. తానుగా భూలోకస్వర్గలోక సౌఖ్యాలతోపాటు ముక్తిసౌఖ్యాన్నీ అనుభవించాడు. అటువంటి అచ్యుతుని, పరుని, యోగివర్యుల సమితిచే గాలించబడే పాదపద్మాలజంట కలవాణ్ణి, అవిరామమైన కాంతిమయుణ్ణి, భక్తులయందు వాత్సల్యంకలవాణ్ణి లోకసంధాతను ఆ విష్ణుమూర్తిని (ఆశ్రయించు)
మళ్లీ, చేత లీలాపద్మం పట్టుకొని బ్రహ్మాది దేవతలు చూస్తుండగా లక్ష్మిచేత అన్వేషింపదగిన ఆ మహావిష్ణువును
No comments:
Post a Comment