Friday, February 27, 2026

Shiva was implored by deities to restore Daksha - ఈశ్వరుండు బ్రహ్మాదులచే. బ్రార్థితుండై దక్షాదుల ననుగ్రహించుట

ఈశ్వరుండు బ్రహ్మాదులచే. బ్రార్థితుండై దక్షాదుల ననుగ్రహించుట

అని ఇలా చతుర్ముఖుడు అననయిస్తూ శివుణ్ణి వేడుకున్నాడు. ఆ వెంటనే శివుడు ఎంతో ఆనందపడి చిరునవ్వు చిందిస్తూ ప్రసన్నంగా ఇలా మాట్లాడాడు. హరిమాయలో పడిన అమాయకులు మళ్లీ మళ్లీ చేసే తప్పుల మీది తప్పులను నేను ఎప్పుడూ మనస్సున పెట్టుకోను.

(ఇందుమౌళి: చంద్రుడు సిగయందు కలవాడు - శివుడు.)

అలా తలంచనప్పటికిన్ని బలవంతులను శిక్షించడం, బలహీనులను రక్షించడం న్యాయమార్గం. కాబట్టి దుష్టుల తప్పులను బట్టియే నేను పట్టుబట్టి దండన విధిస్తూ ఉంటాను.

తల కాలిపోయి మొండెం మాత్రంగా ఉన్న దక్షుడు గొర్రెముఖం పొందుతాడు. భగుడు దర్భసంబంధి యాగాంశాన్ని అంది మిత్రుడని పిలిచే కంటితో మిగతా యాగాన్ని చూస్తాడు. పూషుడు పిండి ఉండలను యాగకర్తదంతాలతో తింటాడు. యాగశేషభాగాన్ని దేవతలు నాకు ఒప్పగించడం వల్ల దేవతలందరూ యథావిథిగా సంపూర్ణ దేహులవుతారు. విరిగిన అవయవాలుగల ఋత్విక్కులూ, ఇతరులూ అశ్వినీదేవతల భుజాలతోనూ, పూషుని చేతులతోనూ తిరిగి తమ తమ బాహువులనూ చేతులనూ పొంది జీవవంతులవుతారు. భృగుముని మేక మీసాలూ గడ్డాలూ పొందుతాడు. అని చెప్పిన శివుడి మాటలు విని జీవులందరూ అమితంగా ఆనందించారు. తండ్రీ! మేలు అయింది. బాగుంది బాగుంది అనే అరుపులతో ప్రశంసించారు. ఆ పై శివుడి పిలుపు మేరకు ఇంద్రుడు మొదలైన దేవతలు, మునులను కలుపుకుని వచ్చారు. శివుడు ముందరవరుసలో నడుస్తుండగా వేలుపుల పెద్ద 'బ్రహ్మా' వాళ్లందరితో దక్షవాటికకు నడిచాడు

పెద్దలకే పెద్ద అయిన ఓ విదురుడా! ఆ సమయంలో శివుడి యోగసాధన తీరులో అన్ని అవయవాలతో కూడినవారై మునులూ, ఋత్విక్కులూ, దేవతా ముఖ్యులూ మునుపటివలెనే అదే శరీర సంపదతో శోభిల్లారు.

(గీర్వాణులు వాక్కులే బాణంగా గలవారు = వేలుపులు.)

విదురా! బాగా విను, అంతలోన దక్షుని మేక ముఖం కలవాణ్ణిగా చేశాడు. శివుడు లోలోపల కుతూహలపడుతూ ఆ ఘటనను వీక్షిస్తూ ఉండగా, దక్షుడు అప్పుడే నిద్ర మేల్కాంచిన వాడివలె లేచాడు.

ఇలా నిద్ర నుంచి తుళ్లిపడ్డట్టు లేచి నించున్న దక్షుడు ఎదురుగా ఉన్న శివుణ్ణి దర్శించినంత మాత్రాననే శరత్కాలంలో బురదలేని తేటనీటికొలను వలె ఇతఃపూర్వం శివుడి మీద పగవల్ల కల్గిన వాని పాపాలు ప్రక్షాళితమయ్యాయి. మనస్సు తేరుకుంది. శివుణ్ణి స్తుతించాలనుకునేంతలో చచ్చిపోయిన ముద్దుబిడ్డ సతి తలపులోకి వచ్చింది. ఆ అమితమైన ప్రేమకూ, ఆ వగపుకూ కంటి నిండా నీళ్లు కమ్ముకున్నాయి. గొంతు పూడుకొని పోయింది. నోటి మాట పెగలడంలేదు. అతి కష్టం మీద, పొర్లుకువచ్చే ఆ బాధనంతా బీగబట్టుకున్నాడు. పట్టలేని ప్రేమతో ఎంతో విలవిల లాడుతూ శివుడితో ఇలా అన్నాడు.

ప్రభూ! అభవ! పురహర! శివ! ఆలకించు. నేను చేసిన తీరని అపరాధానికి నన్ను శిక్షించడం ధర్మమే. నీ అభిప్రాయంలో అది నన్ను మన్నించడానికే అని నా మనస్సు చెప్తుంది.

ఓ! మహాత్మా! నువ్వూ, విష్ణుమూర్తీ, ఎటుగా, ఎంతగా, గాలించి చూచినా బ్రహ్మబంధులను పట్టీపట్టనట్లు ఉంచరట కదా. మంచి నియమం నిష్ఠగల బ్రాహ్మలపట్ల తటస్థ భావం మీకు ఎందుకు ఉంటుంది? తరతరాల నుంచి అలవాటు పడ్డ వేదధర్మాన్ని అలవరించడానికి అటు అమర్త్యుల పర/ఆత్మ విద్యలోనూ, ఇటు మర్త్యుల అపర/ధర్మ విద్యలోనూ వ్రతదీక్షగల బ్రాహ్మణులను వంశంగా జన్మలనెత్తించావు. ఆ కారణాన ఓ శివా! నువ్వూ చేతకర్ర పట్టీ పసుల కాపరి కదుపును కావలి కాచినట్లు ఆ బ్రాహ్మణ వ్రతులను ఎపుడూ ఓ కంట కనిపెడ్తూనే ఉంటావు కదా.

నీచుల తుదముట్టించేవాడా! ఆర్ద్ర హృదయుడా! భయంకరుడా! నీ బ్రహ్మమయత్వం అవగతంకాని పరమదుర్వివేకిని అని యోచించగా యోచించగా నాకు తెలియవచ్చింది. నువ్వు ఆనాటి సదస్సు మధ్యలో నా పెళుసు మాటలనే బాణాలచే దెబ్బతిన్నావు. అయినా కూడ నేను చేసిన పొరపాటును ఒక మాటు అయినా మనస్సులో కూడ తలవ లేదు. ఓ ముక్కంటీ! ఆ నిందారోపణం వలని అపరాధం కారణంగా అట్టడుగుకు కూరుకొని పోతున్న నా వంటి పాపిని దయతో కాచావు. అంతటి నీకు నేను ప్రత్యామ్నాయంగా తెలిసి తెలిసి ఉపకారం చేయపూనుకో గలంతవాడినా, ఆదర్శప్రాయమైన వర్తనుడవు నువ్వు. ఎదటివారిపై దయతలచి తలపడి చేయ పూనే పనులచేతనే నీ మనస్సు సంతుష్టి చెందుగాక! "నిస్స్వార్ధమైన ద్వేషరహితమైన మంచికార్యం పరమసంతృప్తికి మార్గం" అని హిత భావన.

ఇలాంటి పశ్చాత్తాపంతో దక్షుడు రుద్రుణ్ణి క్షమాపణను కోరాడు. బ్రహ్మ ఆదేశాన్ని అంది పుచ్చుకున్నాడు. వేద పండితుల, పురోహితుల చెంతకు వచ్చి యాగకార్యానికి సిద్ధం అయ్యాడు. అపుడు బ్రాహ్మణులందరూ క్రతువు ఏ అడ్డూ లేకుండ సక్రమంగా జరిగిపోవడానికీ, శివదండువల్ల వాటిల్లిన యాగ విధ్వంసదోషాన్నీ ఉపశమింపచేయడానికీ పురోడాశ హోమకర్మను కావించాడు. ఈ కర్మ విష్ణుదేవతాసంబంధసంస్కారం కలది. దీన్ని బ్రాహ్మణులు "మూడు కపాలాల్లో వండిన అన్నం, అపూపం వంటి పదార్థాలతో తయారు చేసిన పురోడాశం" అనే హవిస్సుతో నిర్వర్తించారు. ఆ పిమ్మట యాగ అధ్వర్యుడు భృగుముని తోడుగా యజమాని దక్షుడు నిర్మలమైన మనస్సుతో హవిస్సును సమర్పించాడు. అందుచే విష్ణుమూర్తి అనుగ్రహించినవాడై

నీలదేహచ్చాయలు ఆదరణ యోగ్యంగా నాలుగు దిక్కులా వ్యాపించాయి. బంగారు మొలతాడు  మెరుపులు, కట్టిన పట్టుపంచె వన్నెలతో జతగూడాయి. లక్ష్మితో కూడిన మనోజ్ఞమైన ఎదమీద వైెజయంతిమాల సొగసు తీరి ఉంది. నెత్తిన రత్నాలు తాపిన బంగారు కిరీటపుకాంతి పుంజాలు ఉదయసూర్యుని రోచిస్సులతో వేళాకోళాలాడ్తున్నాయి. ముందటి కురులు చక్కనైన నీలిమబ్బుల వన్నెలతో శోభిల్లుతున్నాయి. జగదేక గురువు విష్ణుమూర్తి

తీరైన శంఖం, చక్రం, పద్మం, గద, బాణం, విల్లు, కత్తుల అచ్చపు కాంతులతోనూ, కనక కాంతుల మణులు పొదిగిన చేతి కడియాల వేలి ఉంగరాల మెరుగులు చిమ్ముతూ, విశృంఖలంగా విరగబూచిన కొండగోగు పూలచెట్టును పోలుచూ భుజాలు మెరుస్తూ ఉన్నవి.

సరసమై, గంభీరమైన చిరునవ్వు ఒలికే చూపులతో సమస్త జగత్తును రమింపచేస్తున్నాడు. అదిపెద్ద పండువుగా ప్రకాశించగా లోకబాంధవుడు అవుతూ

దేవకాంతలు విసన కర్రలవలె ఊపుతున్న వింజామరలు తెల్లటి రాజహంస కాంతుల్లో తిరుగాడుతున్నాయి. శ్వేతచ్చత్రం తెల్లని చల్లని చంద్రుడివలె వెలుగులు విరజిమ్ముతుంది. బృహత్తు, రథంతరం అనే సోమస్తోత్రాలు రెండూ రెండు రెక్కలుగాగల గరుత్మండుడిపై పయనిస్తూ కరివరదుడు విష్ణువు విచ్చేశాడు.

మహాతేజస్సు ఉట్టిపడ్తూ అలా వేంచేసిన విష్ణుమూర్తిని, భావ వికారాలకు దూరమైన వానిని, బ్రహ్మ ఇంద్రుడు, శివుడూ, మిగతా దేవతాముఖ్యులు దర్శించారు. ఆ వెంటనే భక్తితో ఆదరాబాదరాగా లేచి నిలబడ్డారు. ఉత్సాహం ఉరుకులెత్తుతుండగా, దయాసముద్రుడవైన ఓ సామీ! నీకు మా దండాలు నీకు మా దండాలు అని నోట పలుకుతూ ఆపుకోలేని భక్తితో ఒక్కసారిగా మోకరిల్లారు.

అలా నమస్కరించిన వెనువెంటనే తామర పూవులవలె విప్పారిన కందోయి కల విష్ణుని అపారమైన సామర్థ్యంచే కళ్లు గుచ్చి చూచినా కనలేని మిరుమిట్లచేత వారివారి కాంతుల్ని కోల్పోయారు. స్తోత్రం చేసే స్తోమత లేని వారయ్యారు. “జడుపు” అనే జబ్బు పట్టుకున్నవారయ్యారు. ఆ బాధ వల్ల కన్నీళ్లు పొంగి పొర్లాయి. గొంతు గద్గదమయింది. శరీరం చలనం తప్పింది. చాలసేపటికి ఆ దైవం ఆదరం లభించి.

No comments:

Post a Comment

After receiving blessings for his devotion and an exalted position, a mature Dhruva returns to his kingdom to be welcomed by his father, King Uttanapada - ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట అంటూ ఆ ధ్రువుడు దుఖపడ్డాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే సంస్కర...