Sunday, February 1, 2026

Magha Puranam 15 - మాఘ పురాణం 15

మాఘ పురాణం - 15 వ అధ్యాయం

శిష్యుడు పశ్చాత్తాపము పొందుట

సుబుద్ధియు అతని కుమార్తె ఆమెభర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగినఫలితముచే సమస్తదోషమును పోగొట్టుకొని సుఖంచిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగాతిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను.

“నాధా! సుబుద్ధికుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి మరి 
సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు వినకుతుహలముగానున్నది” అని
సాంబ
శివుని కోరినది, అందుల కా పార్వతీపతి యిట్లు వివరించెను.

సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తానువేసిన పాపమునకు ఫలిత మనుభవించుచుంటినిగదా యని పశ్చాత్తాపమనస్కుడై గురువు గారి వ్రద్దకు పోయి గురువుపాదములపై బడి "గురువరా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అదినాదోషము కాదు. నేను పూజ్యా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని, దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుటచూచి నెమ్మదిగా నావెంటవచ్చినది నేను అటు అడవిమధ్యకు పోయి ఒక కోనేటివద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలలో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు, నన్ను బలవంతము పెట్టినది, నన్నుక్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభంలేదని “నాతో నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణ త్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయముకలిగి నిజంగా అమె ప్రాణ త్యాగమే చేసుకున్న చో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీలేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేనుకూడ పాపరహితుడ నెటులకాగలనో సెలవిండని బ్రతిమాలెను.

శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన 
కుమార్తెవలె తన శిష్యునిగూడ పాపరహితుని జేయ నెంచి సుమిత్రా! నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పావరహితుడవు
కాగలవు, అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సుచేసుకొనుము, ఆ తపస్సుచే కలుగు ఫలితమువలన పా
ము మబ్బు విడిపోయినటుల నశించుపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.

“ధన్యోస్మిధ
న్యోస్మి" మీయజ్ఞప్రకారము నేనిప్పుడే ప్రయాణసన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకుదండ ప్రమాణములాచరించి గంగానదితీరమునకు బయలుదేరెను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమన గుట్టలు, కొండలు, సెలయేళ్లుదాటి ఒక  అరణ్యమధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాదమొనరించు దృశ్యములు కనుపించినవి. కౄరమృగములు సాధు జంతువులు కలసి మెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి, పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము
కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సున కానంద మొన్నరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఓక వటవృక్షము క్రింద విశ్రమించి, నలుదిశల పరికించిచూడగా ఒక ఆశ్రమము కనిపించినది.

వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకువచ్చితొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప  నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి "హరిహరీ" యని బిగ్గరగా కేకలువేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. అదృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజపూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న  సుబుద్ధికి కూడ  ప్రసాదమివ్వగా “స్వామి! మీరాచరించిన వ్రత మెట్టిది? దీనివలన ఫలిత మేమి కలుగును! మనుజుడు పాపరహితుడగునా? ఈ నాసందియములను దీర్పవేడుచున్నాను” అని వినయముగా ఆమునిసత్తముల నడిగెను.

పాపములచే పీడింవబడు చున్న సుమిత్రుని ప్రార్థనవిని అచటనున్న మనుజులందరూ మాఘమాస మందాచరించవలసిన ధర్మమును అతనికి వివరించుటకుగాను వారిలో నొకరిని నియమించిరి అంత నా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు
వివరించెను.

“విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాసవ్రతము ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటి నన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంతమాత్రమున అవి యన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపములన్నియు నశించిపోవును. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానముచేయునో అట్టిమనుజుడు శ్రీహరికి ప్రియుడగును, ఎట్టిదోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘవురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన మొనర్చువారు వైకుంఠవాసులగుదురు. ఆలాగున చేయనివాడు, అసత్యములాడు వాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పర స్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్యము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్షములు చెప్పుట, జనసమర్థముండుచోట మలమూత్రములను విడచుట, గుఱ్ఱములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి, చేయువారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమనము. మరియు ధైవ సంబంధమగు ధనమును అపహారించువాడు, ఏ పుణ్య దినములలోనై న శుచిగా స్నానముచేసి దేవుని ప్రార్థించనివాడు, దాన మిచ్చెదనని వాగ్దానముచేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి రత్నములు సాల గ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టుడై జార చోరత్యములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహా పాతకములు చేసినవారితో సమానులగుదురు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహీంసలు చేయువాడును బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయవాడును మహాపాతకులు. అట్టివారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహసంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనము అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసినవానిని జూచి ఎగతాళిచేయువాడును బ్రహ్మహత్య చేసినవానితో సమానుడగును.

గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం, ఈ వ్రతం చేయుటనలన మాకు ఏమాాత్రమూ పైన  చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును, ఇది ముమ్మాటికీ నిజం.
అందుచేతనే మేమందరను మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము.

మాఘమాసం ప్రారంభముకాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానంచేసి సూర్యునికి నమస్కరించి? నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకుపోయి శ్రీహరికి పూజచేసి, తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆ విధముగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును, మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత గాన యా మాసమందు ఆచరించిన స్నానమువలన కల్గు ఫలము నిచ్చువాడు అతడేగనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. ఒక వేళ నదీతీరమందుగాని, చెఱువు దగ్గరగాని విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమునుగాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు దూపదీప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణశ్రవణము గావించవలయును.

ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మాణునకు వస్త్రములు,  బంగారము ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టాలి, ధనమున్న నారు బ్రాహ్మణా సమారాధన చేసిన యెడల ముకోటిదేవతలు సంతసించుటేగాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలుగదు. ఈ నావచనములు అనత్యములు కావు. ఇప్పటి వరకూ మాఘస్నాన ఫలిత మంతయు విన్నావుగదా! ఇక మాఘమాసం మూడుదినాలు మాత్రమే వున్నది, గాన ఈమూడు దినములలోను ఈనదిలో స్నానముచేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవుకమ్ము" అని మునీశ్వరులు తెలియజేసెను.

అంత సుమిత్రుడు తనగురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు బోయి తపస్సు చేసుకో మనిచెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.

"నీగురువు చెప్పిన విషయం యదార్ధము. నీగురుపుత్రికతో గూడి రతిసల్పినావు. అందు నీదోష మేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించింది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడ నరక బాధలు తప్పవు. గాన ఈ మాఘమాసమందలి మూడుదినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము, తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురుపు చేప్పినవిధముగా భక్తితో తపస్సు చేసిన యెడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు స్వార్ధము, చంచలభావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము" అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడుదినములుండి మాఘస్నానములు చేసి, నదీతీర మందు విష్ణువును పూజించి, పురాణపఠనము గావించెను. తదనంతరము ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీతీరమునకు తపస్సు జేయుటకై వెళ్లిపోయెను.

No comments:

Post a Comment

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...