Thursday, February 5, 2026

Pothana Bhagavathamu Prathama Skandhamu - పోతన భాగవతము ప్రథమస్కంధము

పోతన భాగవతము ప్రథమస్కంధము

ఎవని కారణంగా అన్నిలోకాల పుట్టుక, ఉనికి, వినాశం జరుగుతూ ఉందో, అనుసరించుటచేత, వెనుదిరుగుటచేత అన్ని పనుల్లో అంతా తెలిసినవాడై, అన్నింటికి తానే ప్రభువై, ఎవడు సంకల్పమాత్రంచేత నాలుగు వేదాలు బ్రహ్మదేవునికి తెలియచెప్పాడో, ఎవనిపట్ల పండితులంతా పరమప్రీతితో ఉంటారో, ఎవనియందు సత్వరజస్తమోగుణాలవల్ల ఏర్పడినసృష్టి నీళ్ళు, ఎండమావులు, గాజు మొదలగు వాటిలో తాను కలిసి మెలిసి ఉన్నట్లు తోచేవిధంగా ప్రకాశించి, ఇదిసత్యమేమో అన్నట్లు అగుపిస్తూ ఉందో, తన శక్తితో మాయను తొలగించుకొన్నవాడెవడో - ఆలాంటి పాపరహితుని, సత్యస్వరూపుని, పరబ్రహ్మాన్ని ప్రతిదినం నేను కోరి స్మరిన్తాను.

“సత్యం పరం ధీమహి” అనే గాయత్రీమంత్రంతో ప్రారంభమైనందువల్ల గాయత్రీ పరదేవతాస్వరూపమైనదై, గాయత్రిని మించి విరివిగ ధర్మాలు, వృత్రాసురవధ ఏ గ్రంథంలో వివరింపబడునో అది భాగవతమని మత్స్యపురాణం చెప్పినందువల్ల ఈ పురాణం భాగవతమనే పేరుతో ప్రసిద్ధి పొందింది.

యత్రాధికృత్య గాయత్త్రీం, వర్ణ్యతే ధర్మవిస్తరః,
వృత్రాసురవధోపేతం తద్భాగవతమిప్యతే

అని మత్స్యపురాణం.

గాయని, గాయత్రిని మించి ధర్మాలను విరివిగ వివరించి, వృత్రాసురవధతో కూడి ఉంటే దానిని భాగవతం అంటారు. “జన్మాద్యస్య... సత్యం పరం ధీమహి” అని వ్యాసమహర్షి చెప్పిన ప్రథమశ్లోకంలోని గాయత్రీమంత్ర పదాలద్వారా ఆ పరతత్త్వ స్మరణ జరిగింది. ప్రధానంగా మోక్షధర్మం, ఇతర ధర్మాలు గ్రంథం నిండా మెండుగా ఉన్నాయి. షష్టస్కంధంలో వృత్రాసురవధ ఉంది. అందువల్ల మత్స్యపురాణం చెప్పినట్లు ఈ పురాణగ్రంథం భాగవతంగా పేరొందింది.

ఈ భాగవతం ముముక్షువులకు ఆనందం కలిగించేది. వేదవ్యాస మహర్షి రచించినది. దీనిని భక్తితో వినగోరేవారి నిర్మలహృదయాలలో భగవంతుడు నివసిస్తాడు. అంతేకాని కుతర్కవాద శాస్త్రాలవల్ల మాత్రం ఆయన లోబడడు. మంచివారు, అసూయ లేనివారు, కర్మఫలితాలపై అపేక్ష లేనివారు, సంసారంలో ప్రవర్తింపజేసే కోరిక లేనివారు, ఒక్క తత్త్వదర్శనమందు మాత్రమే ఇచ్చ కలవారు దీనియందు ఎప్పుడూ మనస్సును నిలిపి ఉంచాలి. అందువల్ల తాపత్రయం నశిస్తుంది. ఈ 
గ్రంథంలో పరమపురుషార్థమైన మోక్షం తెలియజేయబడుతుంది. అదే మిక్కిలి ఆనందదాయకం. సత్తు అసత్తుగాక, వ్యక్తం అవ్యక్తం కాక అంతటా ప్రకాశించే పరమాత్మను ఇందులో తెలుసుకోతగును.

ఈ భాగవతం ఒక మహాఫలం. అది వేదమనే కల్పతరువునుంచి బాగా పండి తనంతట తాను రాలి క్రిందపడింది. దానినీ చిలుక ముట్టుకోగా అమృతరసంతో కూడుకొని ఉంది. ఆ ఫలరసాన్ని రసజ్ఞులు, తత్త్వ
జ్ఞులు తనివితీరా గ్రోలెదరుగాక!

ఈ విశ్వంలో చాలా అడవులు ఉన్నాయి. కాని నైమిశారణ్యం మిక్కిలి స్తుతించదగింది. శుభప్రదమయింది. అది మునిగణంచే వాసికక్కింది. పుష్పఫలసమృద్ధితో వృద్ధి పొందించబడిన ద్రవ్యరాశి కలది.

ఆ నైమిశారణ్యం లక్ష్మీదేవితోను, మన్మథునితోను వాసికెక్కిన మధుసూదనుని వైకుంఠ భవనంలా, శారదాదేవితో కూడుకొన్న బ్రహ్మదేవుని సత్యలోకంలా, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశరుద్రులు, పార్వతి, కుబేరుడు, నంది, గాలవుడు, శాండిల్యుడు, పాశుపతులు, జటాధారులు మున్నగువారితో కూడుకొన్న మహేశ్వరుని కైలాస సభామండపంలాగా, ఐరావతం, అమృతం, రంభాద్యప్సరసలు మొదలగువారితోనున్న బలసూదనుని సుధర్మాపీఠంలా, రక్కసుల గుంపులతోకూడియున్న మురుడనే రాక్షసుని నివాసంలా, శంఖపద్మకుందముకుందాది నవనిధులతో భాసిల్లే కుబేరుని నిలయంలా, నిరంతరం బాణాగ్ని జ్వాలలతో దీపించే శ్రీరామచంద్రుని సంగరరంగంలా, కార్తవీర్యార్జునుని సంహరించిన భార్గవరాముని సంగ్రామభూమిలా, అరిష్టజంభనికుంభాదిశక్తులతో కూడియుండే రాక్షసుల యుద్ధరంగంలా, ద్రోణార్జునుల బంగారు రథాలతో రాజిల్లే కురుక్షేతయుద్ధంలా, శల్యుని సహాయంతోకూడిన కర్ణుని కయ్యంలా, నలనీలపనసాది వానరులచే కొనిరాబడ్డ శిలలచే శోభిల్లే రామసేతువులా, అక్షరమైన అక్షయఫలంతో కూడిన ముక్కంటి సేవలాగా, పున్నాగపుష్పాలు, తుమ్మెదలు కలసి ప్రకాశించే మన్మథుని చెఱకువిల్లులా, గొప్పజూలు, వాడిగోళ్లు కలిగిన నరసింహుని అవతారంలా, నటనటీ వాద్యయుక్తమైన రంగస్థలంలా, చందన కర్పూర తిలకంచే అలంకరించబడే పార్వతీదేవి ఫాలభాగంలా, ఇంద్రధనుస్సుతోకూడి మేఘాలతో, వడగండ్లతో కలసిన వానయొక్కరాకలా, గాయత్రీమంత్రంచే పరమపవిత్రమైన వేదంలా, తేలికయైన లలితమైన పదప్రయోగంతో రచించబడిన మహాకవి ఉత్తమకావ్యంలా, గరుత్మంతునిచే ప్రకాశించే తల్లియైన వినతాదేవి మందిరంలా, దేవతలతో విలసిల్లే దేవేంద్రుని రాజధానియైన అమరావతీనగరంలా, మధువనే రాక్షసుని సహకారంతో కూడుకొన్న కైటభుని అధికారంలా, మోక్షఫలాన్ని ప్రసాదించే శ్రీమహావిష్ణువు కైంకర్యంలాగా, ఆకాశాన్నంతా శరాలతో కప్పివేసే అర్జునుని యుద్ధవిహారంలా, నందకపుండరీక సహితమైన వికుంఠనగరంలా, కృష్ణుని బాల్యక్రీడలచే శోభిల్లే నందుని వ్రేపల్లెలా, శ్రీరాముని ధర్మపత్నియైన సీతను అపహరించిన రావణుని లంకాపురిలా, గజగవయ శరభాది వానరులతో కూడియుండే సుగ్రీవుని సైన్యంలాగా, శివుడు, ఇంద్రుడు, భరద్వాజుడు, తిత్తిరి - ఇత్యాదులచే భాసిల్లే నారాయణుని ఆస్థానంలా, భీమధర్మరాజ దుర్యోధనాది శకుని నకుల సంయుక్తంబైన మహాభారతంలా, ఎడతెగక సాగిపోయే సూర్యరథ సంచారంలా, యావత్ప్రజానీకానికి మంచి మనస్సును ప్రసాదిస్తూ సంధ్యాసమయంలా ప్రకాశిస్తుంది. దానికే విష్ణుక్షేత్రమని పేరు.

అందు శౌనకాది మహర్షులు శ్రీమహావిష్ణువును పొందగోరి వేయిఏండ్ల కాలపరిమితిగల సత్రయాగాన్ని ఆచరిస్తున్నారు. ఒకనాడు వేకువజాముననే లేచి వారు నిత్యనైమిత్తికాదులు పూర్తి చేసుకొన్నారు. ఆ సమయంలో ఆ పుణ్యనైమిశారణ్యానికి సూతమహర్షి విచ్చేశారు.  మునీశ్వరులందరు ఆయనకు సుఖాసనం కూర్చి యథావిధిగా అర్చనలు గావించారు. అనంతరం ఆయనను ఇలా ప్రశ్నించసాగారు.

సూతుడు గురువైన వ్యాసునివల్ల విశేషమైన జ్ఞానం నేర్చుకొన్నాడు. ఆ జ్ఞానంద్వారా అన్ని పురాణాల సారాంశాన్ని విశేషంగా తెలుసుకొన్నాడు. శ్రీహరి సద్గుణాలను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాడు. అపారకృపాగుణం కలవాడు. అట్టి సూతమహర్షిని తాపసులు ఇలా ప్రశ్నించారు.

పండితులలో శ్రేష్టడవైనవాడా! విశేషవిజ్ఞానంతో పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు మొదటినుంచి ప్రవచించినవాడవు. వ్యాసాది ప్రముఖులు, మహర్షులు, ధీమంతులు ఏ రహస్యాలను దర్శించారో, అవన్నీ నీ మనస్సులో స్ఫురిస్తాయి. వారి అనుగ్రహంవల్ల నీ బుద్ధికి తోచనిదంటూ ఏమీలేదు.

సద్గురువులు ప్రియ శిష్యులకు మిక్కిలి గోప్యాలైన విషయాలను కూడ తేటతెల్లం చేస్తారు. కాబట్టి ఈ లోకంలో సకల మానవులకు శాశ్వతానందాన్ని చేకూర్చిది ఏది ఉందో, దాన్ని బాగా పరిశీలించి మాకు ఉపదేశించు.


మహర్షీ! నీవు చాలాకాలం జీవించావు. పురాణాలలోని పరమార్థం గ్రహించావు. వినదగినవన్నీ విన్నావు. గురువులను సేవించి సత్ప్రసంగాలలో పాలు పంచుకొన్నావు.

ఋషిసత్తమా! ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు. దేనిలోనూ బుద్ధిపూర్వకంగా చొరవ చూపించలేరు. అల్పమైన ఆయుస్సు కలవారు. అనేకవిధాలైన రోగాలతో బాధలుపడేవారు. భగవద్‌ జ్ఞానసంపదలో అల్పులు. సత్కార్యాలు ఏవీ చేయలేనివారు. కాబట్టి అన్నివిధాలా ఆనందం దేనివల్ల చేకూరుతుందో ఆత్మకు ప్రశాంతి దేనివల్ల లభిస్తుందో దానిని మాకు అనుగ్రహించండి.

పవిత్ర చరిత్రగల ఓ సూతమహర్షీ! ఏ మహానుభావుని అవతారం సమస్తప్రాణులకు ఆనందం, అభివృద్ధి కలిగిస్తుందో, ఏ పవిత్రనామాన్ని పదేపదే పలకడంద్వారా చావుపుట్టుకలు దూరమవుతాయో, ఏ చరిత్రను హృదయంలో భావించినంత మాత్రాన మృత్యుదేవత భయపడి పరుగులు తీస్తుందో, ఏ దివ్యమూర్తి పాదాలనుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంతనే సమస్తకల్మషాలు దూరమవుతాయో, ఎవరి చరణాలను శరణువేడి భక్తులు తాపశాంతిని పొందుతారో, దేవకీ వసుదేవులకు ఎవడు ముద్దువిడ్డగా జన్మించాడో, అట్టి వాసుదేవుని కథలు వినాలనే సంకల్పంతో ఉన్నాము. అవన్నీ మాకు వినిపించు.

శ్రీ మహావిష్ణువు కల్యాణగుణాలను గూర్చి అధికంగా చేసే సంభాషణలు సరస్వతీదేవికి ఆభరణాలు. కల్మషవినాశకాలు. మృత్యుదేవతకు అధికభయంకరాలు. భక్తజనుల హృదయాలకు సంతోషకరాలు. అత్యంత శుభంకరాలు.

ఓ మహాత్మా! కలికాల పాపాలను పారద్రోలేది, గొప్ప కీర్తిమంతులు ప్రశంసించేది అయిన విష్ణుకథను చెపుతుంటే పవిత్ర స్థితిని కోరుకొనే ఏ పురుషుడు ఆసక్తితో వినడు!

బ్రహ్మానందానుభూతి పొందినవారై వినునటువంటి వారికే మాటమాటకు మధురాతిమధురమైన శ్రీకృష్ణుని చరిత్ర, మాకు కూడ వినాలని ఎంతో కోరికగా ఉంది. వింటేగాని తృప్తి కలుగదు.

ఓ బుధసత్తమా! ఈ విశ్వంలో మిక్కిలి శ్రేష్టమైనది నారాయణుని చరిత్ర. అదే అమృతం. దానిలోని సారమే జడివాన. దాని జల్లులు వరుసగా పడితేతప్ప సంసారకల్మషమనే కార్చిచ్చు చల్లారదు. ఇతర మార్గాలవల్ల ఆ చిచ్చు ఆరే అవకాశం లేదు. కారణం ఆ చిచ్చు మిక్కిలి విశాలమైనది. అణగదొక్కడానికి వీలయ్యేది కాదు. అంతంలేనిది. ఓర్చుకోవడానికి శక్యం అయ్యేది కాదు. అనేక జన్మలనుంచి రాశీభూతమై అతిశయిస్తూ వెన్నాడుతూ ఉంటుంది. తరింప శక్యం కానిది. అది ప్రవేశిస్తూ ఉంటే మిక్కిలి భయాన్ని కలిగిస్తుంది. అతికఠినమైనది. అది ఎల్లప్పుడూ వెంటాడే పాపాలతో మండుతూ ఉంటుంది. ఆ సంసార కల్మషమనే కార్చిచ్చు గోవిందుని కథలనే వర్షధారలతో తప్ప చల్లారదు.

బుద్ధిమంతుడవైన సూతా! భయంకర పాపాలనే అడవులు భస్మం కావాలంటే విష్ణునామ సంకీర్తన అనే కార్చిచ్చు ఒక్కసారి వ్యాపించాలి. సంసార బాధలనే మేఘసమూహాలు చెల్లాచెదరు కావాలంటే గోవింద సందర్శనమనే వాయువు ఒక్కమారు చెలరేగాలి. తాపత్రయాలనే మదేభాలు కూలిపోవాలంటే హరిధ్యానమనే సింహం ఒక్కమారు విజృంభించాలి. కామక్రోధాదులనే అంధకారం తొలగిపోవాలంటే నారాయణ స్మరణమనే సూర్యకాంతి ఒక్కసారిగా వ్యాపించాలి. సంసార సముద్రాన్ని దాటాలంటే కేశవభక్తి అనే నావమాత్రమే దాటించగలదు. పలుమాటలు ఎందులకుగాని శ్రీహరి మాహాత్యాన్ని మాకు వినిపించు.

అంతేకాదు కృష్ణుడు మాయామానుషరూపంతో రహస్యంగా ప్రవర్తిస్తూ, రోహిణీపుత్రుడైన బలరామునితో కలసి మానవులు చేయడానికి వీలుకాని సాహసవీరకృత్యాలు ఎన్నో చేశాడని విన్నాము. వాటినన్నీ మాకు వివరించండి. ఘోరకలి రాబోతున్నదని తెలిసి ఈ నైమిశమనే విష్ణుక్షేత్రంలో దీర్ఘసత్రమనే పేరుగల యజ్ఞం చేస్తున్నాము. హరికథలు వినాలనే సంకల్పంతో ఉన్నాము. అదృష్టం మాకు కలిసి వచ్చింది.

జలనిధిని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులు చుక్కాని ధరించియున్న నావికుని చూచి ఎంత సంతోషిస్తారో,కలిఘోర కృత్యాలను దూరం చేసుకోవాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకునీ దర్శనం లభించింది.

మునీంద్రా! ఉత్కృష్ట ధర్మాలకు పట్టుకొమ్మగా నిలిచిన భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమపదానికి చేరుకోగా, ధర్మం బలం కోల్పోయి, దిక్కులేక ఎవరిని ఆశ్రయించిందో!

సూతుండు నారాయణ కథాప్రశంస



No comments:

Post a Comment

kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూ...