Wednesday, April 1, 2026

Krishna Satakam - కృష్ణ శతకం

కృష్ణ శతకం- నరసింహ కవి

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా 
॥ 01 

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
 ॥ 02 

నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవ వైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా
 ॥ 03 

హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా
 ॥ 04 

క్రూరాత్ముడజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా
 ॥ 05 

చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితివ
వలరగ మిము దలఁచు జనులకరుదా కృష్ణా
 ॥ 06 

అకౄరవరద! మాధవ!
చక్రాయుధ! ఖడ్గపాణి! శౌరి! ముకుందా!
శక్రాది దివిజ సన్నుత!
శుక్రార్చిత! నన్ను కరుణ జూడుము కృష్ణా!
 ॥ 07 

నందుని ముద్దుల పట్టిని
మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నిను దలంతు భక్తవత్సల! కృష్ణా!
 ॥ 08 

ఓ కారుణ్య పయోనిధీ!
నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్
నాకేల ఇతర చింతలు
నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా!
 ॥ 09 

వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తివనఘ! మురారీ;
నా దిక్కు చూచి కావుము
నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!
 ॥ 10 

పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా!
 ॥ 11 

అష్టమి రోహిణి ప్రొద్దున
అష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!
 ॥ 12 

అల్ల జగన్నాథుకు రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయుఁ
తల్లియునై చన్నుగుడిపెఁ దనరగ కృష్ణా!
 ॥ 13 

అందెలు గజ్జెలు మ్రోయఁగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందునిసతి యా గోపిక
ముందఱ ఆడుదువు మిగుల ముఱియుచు కృష్ణా!
 ॥ 14 

హరిచందనంబు మేనునఁ
గర మొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగ
పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా
 ॥ 15 

పాణి తలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగఁ పింఛం
బాణీముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణా!
 ॥ 16 

మడుగుకు జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్
కడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలతు నచ్యుత! కృష్ణా!
 ॥ 17 

బృందావనమున బ్రహ్మా
నందార్భకమూర్తి వేణు నాదము నీవా
మందార మూలమున గో
విందా! పూరింతు వౌర! వేడుక కృష్ణా!
 ॥ 18 

వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీవా
చీరలు మ్రుచిలి యిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!
 ॥ 19 

దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!
 ॥ 20 

అండజవాహన! విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడి నీ వా
కొండల నెత్తితివందురు
కొండిక పనిగాక దొడ్డకొండా! కృష్ణా!
 ॥ 21 

అంసాలంబితకుండల!
కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్
సంసారిరీతి నుంటివి.
హంసేంద్ర! విశాలనేత్ర! అచ్యుత కృష్ణ!
 ॥ 22 

పదియాఱు వేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర ! వసుధను కృష్ణా!
 ॥ 23 

అంగన పసుపున దోవతి
కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా
సంగతి విని దయ నొసఁగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!
 ॥ 24 

హా వసుదేవకుమారక!
కావుము నా మానమనుచుఁ గామిని వేఁడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీవర! యక్షయ మటంచుఁ జీరలు కృష్ణా!
 ॥ 25 

శుభ్ర మగు పాంచజన్యము
నభ్రంకషపగిది మ్రోవ నాహవ భూమిన్
విభ్రము లగు దనుజసుతా
గర్భంబులు పగులఁజేయు ఘనుఁడవు కృష్ణా!
 ॥ 26 

జయమును విజయున కియ్యవె
హయముల ములుకొలమోపి యదలించి మహా
రయమున ఱొప్పవె తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱగ! కృష్ణా!
 ॥ 27 

దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగఁదలచి నీవు నిఖిలాధారా!
దుర్జనులను వధియింపను
అర్జునునకు నీవు సాదివైతివి కృష్ణా!
 ॥ 28 

శక్రసుతుఁ గాచు కొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ! సర్వలోక నాయక కృష్ణా!
 ॥ 29 

దివిజేంద్రసుతునిఁ జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముడవై
దివిజేంద్ర సుతుని గాచియు
రవిసుతుఁ బరిమార్చితౌర! రణమున కృష్ణా!
 ॥ 30 

దుర్భరబాణము రాగా
గర్భములోనుండి అభయ కావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!
 ॥ 31 

గిరులందు మేరు వౌదువు
సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్
బరమాత్మ! చంద్రుఁడౌదువు,
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!
 ॥ 32 

చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజ మగు లెక్కబెట్ట నజునకు కృష్ణా!
 ॥ 33 

కుక్షిని సకలజగంబుల
నిక్షేపముఁజేసి ప్రళయనీరధి నడుమన్
రక్షక! వటపత్రముపై
దక్షతఁ బవళించినట్టి ధన్యుఁడ కృష్ణా!
 ॥ 34 

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁ దలచి విష్ణుడవనఁగా
విశ్వముఁ జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!
 ॥ 35 

అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాది నారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!
 ॥ 36 

మగ మీనమవై జలనిధి
జగతుని సోమకుని జంపి పద్మభవునకున్
నిగమములు దెచ్చి యిచ్చితి
సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణ!
 ॥ 37 

అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధిఁ దరుప పొలుపున నీ వా
నందముగా కూర్మమవై
మందరగిరి యెత్తితౌర! మాధవ కృష్ణా!
 ॥ 38 

ఆది వరాహుడవయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు హతుఁ జేసి తగన్
మోదమున సురలు వొగడఁగ
మేదిని వడిగొడుగునెత్తి మెరసితి కృష్ణా!
 ॥ 39 

కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్
ఉరము జీరి వధించితి
నరహరి రూపావతార! నగధర కృష్ణా!
 ॥ 40 

వడుగడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర అఖిలజగంబుల్
తొడిగితివి నీదు మేనున
కడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
 ॥ 41 

ఇరువదొకమాఱు నృపతుల
శిరములు ఖండించితౌర! చేగొడ్డంటన్
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా!
 ॥ 42 

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్యన్
విశదముగఁగీర్తినేలిన
దశరథరామావతార! ధన్యుఁడ కృష్ణా!
 ॥ 43 

ఘనులగు ధేనుకముష్టిక
దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిఁ
అనఘాత్మ! రేవతీపతి
యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా!
 ॥ 44 

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్
కపటపు రాజవు బళిరే
కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!
 ॥ 45 

వలపుల తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలువ హీనులఁ ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోక కర్తవు కృష్ణా!
 ॥ 46 

వనజాక్ష! భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
మను నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రు లెన్నజాలరు కృష్ణా!
 ॥ 47 

అపరాథ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముఁడనై చేసితిఁ
జపలుని ననుఁగావు శేషశాయివి కృష్ణా!
 ॥ 48 

నరపశువు మూడచిత్తుడ
దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱుతెఱుఁగ నెంతవాఁడను
హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!
 ॥ 49 

పరనారీ ముఖపద్మము
గురుతుఁగ గుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా!
 ॥ 50 

పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్ధినిఁ జరింతుకొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా!
 ॥ 51 

దుష్టుఁడ దురాచారుఁడ
దుష్ట చరిత్రుఁడను జాల దుర్బుద్ధిని నే
నిష్ట నినుఁ గొల్వనేరను
కష్టుఁడను ననుఁ గావు కావు కరుణను కృష్ణా!
 ॥ 52 

కుంభీంద్ర వరద! కేశవ!
జంభాసుర వైరి దివిజ సన్నుత చరితా!
అంభోజనేత్ర! జలనిధి
గంభీరా నన్నుగావు కరుణను కృష్ణా!
 ॥ 53 

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!
 ॥ 54 

హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచే మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడఁగఁ
గరిఁగాచినరీతి నన్నుఁ గావుము కృష్ణా!
 ॥ 55 

పురుషోత్తమ! లక్ష్మీపతి!
సరసిజగర్భాదిమౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!
వరదుఁడ వగు నాకు భక్తవత్సల! కృష్ణా!
 ॥ 56 

క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ
పతీ! మిముఁ దలచినవారికి
నతులిత పుణ్యములు గలుగుటరుదా? కృష్ణా!
 ॥ 57 

స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్
అంభోజ నేత్ర! జలనిధి
గంభీరుఁడ! నన్నుఁగావు కరుణను కృష్ణా!
 ॥ 58 

శతకోటిభాను తేజుఁడ!
యతులిత సద్గుణగణాఢ్య యంభుజనాభా!
రతినాథ జనక! లక్ష్మీ
సతిహిత! ననుగావు భక్తవత్సల కృష్ణా!
 ॥ 59 

మందుఁడ నేదురితాత్ముఁడ
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
 ॥ 60 


గజరాజ వరద! కేశవ!
త్రిజగత్కల్యాణమూర్తి! దేవమురారీ!
భుజగేంద్ర శయన! మాధవ
విజయాప్తుఁడ! నన్నుఁగావు వేడుక కృష్ణా!
 ॥ 61 

గోపాల దొంగ మురహర
పాపాలను బాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి! దయతో
నా పాలిటఁ గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా!
 ॥ 62 

దుర్వార చక్రధర కర!
శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా!
నిర్వాణనాథ! మాధవ!
సర్వాత్మక! నన్ను గావు సరుగున కృష్ణా!
 ॥ 63 

సుత్రామనుత! జనార్దన!
సత్రాజిత్తనయనాథ! సౌందర్యకళా
చిత్రావతార! దేవకి
పుత్రా! ననుఁగావు నీకుఁ బుణ్యము కృష్ణా!
 ॥ 64 

బల మెవ్వఁడు కరిబ్రోవను
బల మెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు రవిసుతునకు
బలమెవ్వఁడు నాకు నీవు బలమౌఁ కృష్ణా!
 ॥ 65 

పరుసము సోఁకిన యినుమును
వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి నీ నామము సోకిన
సురవందిత! నేను నటుల సులభుఁడ కృష్ణా!
 ॥ 66 

ఒకసారి నీదు నామము
ప్రకటముగాఁ దలఁచువారి పాపప్ము లెల్లన్
వికలములై తొలఁగుటకును
సకలాత్మ యజామిళుండు సాక్షియె కృష్ణా!
 ॥ 67 

హరి సర్వంబునన్ఁ గలఁడని
గరిమను దైత్యుండు పలుక గంబములోనన్
ఇరవొంద వెడలి చీల్పవె
శరణనఁ బ్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా!
 ॥ 68 

భద్రార్చిత పదపద్మ! సు
భద్రాగ్రజ! సర్వలోకపాలన! హరి! శ్రీ
భద్రాధిప! కేశవ! బల
భద్రానుజ! నన్నుఁబ్రోవు భయహర కృష్ణా!
 ॥ 69 

ఎటువలెఁ గరిమొఱ వింటివి
యెటువలెఁ బ్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట! నిను నమ్మినాఁడ గావుము కృష్ణా!
 ॥ 70 

తటపట లేటికిఁ జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్నున్
ఎటువలె నిపుణునిఁ జేసితి
నటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!
 ॥ 71 

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేఱె పదవి పుట్టుట యేమో
హరి! మిముఁ దలచిన వారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!
 ॥ 72 

ఓ భవనంధ విమోచన!
యో భరతా గ్రజ! మురారి! యోరఘు రామా!
యో భక్త కామధేనువ!
యో భవహర! నన్నుఁగావుమో హరి కృష్ణా!
 ॥ 73 

ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుఁడై యతని సుతుని గరుణను గాచెన్
బ్రీతి సురకోటి పొగడఁగ
నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా!
 ॥ 74 

ఓ పుండరీకలోచన!
యో పురుషోత్తమ! ముకుంద! యో గోవిందా!
యో పురసంహార మిత్రుడ!
యో పుణ్యుఁడ! నన్నుఁ బ్రోవు మో హరికృష్ణా!
 ॥ 75 

ఏ విభుఁడు ఘోర రణమున
రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు,
నా విభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా!
 ॥ 76 

గ్రహభయదోషముఁ బొందదు
బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను,
తహతహలెక్కడివి నిన్నుఁ దలచిన కృష్ణా!
 ॥ 77 

గంగ మొదలైన నదులను
మంగళముగఁ జేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిముఁ దలచుఁ సాటి రావుర కృష్ణా!
 ॥ 78 

ఆ దండ కావనంబునఁ
గోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ!
నాదండ కావరమ్మీ
వేదండముఁ గాచినట్టి వేల్పవు కృష్ణా!
 ॥ 79 

చూపుము నీ రూపంబును
బాపవు దుష్కృతములెల్లఁ బంకజనాభా!
పాపుము నాకును దయతో
శ్రీపతి! నిను నమ్మునాఁడ సిద్ధము కృష్ణా!
 ॥ 80 

నీ నామము భవహరణము
నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్
నీనామ మమృత పూర్ణము
నీ నామము నేఁ దలంతు నిత్యము కృష్ణా!
 ॥ 81 

పరులను నడిగిన జనులకుఁ
గురుచ సుమీ ఇది యటంచు గు!రుతుగ నీవున్
గురుచ్ఁడవై వేడితి మును
ధ్రఁ బాదత్రయము బలిని దద్దయు కృష్ణా!
 ॥ 82 

పాలను వెన్నయు మ్రుచ్చిలఁ
ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుఁడవా బ్రహ్మఁగన్న ప్రభుఁడవు కృష్ణా!
 ॥ 83 

రఘునాయక నీనామము
లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా!
అఘములఁ బాపుము దయతో
రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా!
 ॥ 84 

అప్పా! యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
అప్పా! ననుఁ గను్గొనవే
యప్పా! ననుఁ బ్రోవు వేంకటప్పా! కృష్ణా!
 ॥ 85 

కొంచెపువాఁడని మదిలో
నుంచకుమీ వాసుదేవ! గోవింద! హరీ!
యంచితముగ నీ కరుణకుఁ
గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా!
 ॥ 86 

వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు సేయు గర్వాంధులనున్
దేవ! వధించుట వింటివి
నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా!
 ॥ 87 

అయ్యా! పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్
జయ్యన్ గలుచుఁచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా!
 ॥ 88 

కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్
జంటయు నీవుండుట నే
కంటక మగు పాపములను గడచితి కృష్ణా!
 ॥ 89 

యమునకు నిఁక నే వెఱువను
కమలాక్ష! జగన్నివాస! కామితఫలదా!
విమల మగు నీదు నామము
నమరఁగఁ దలఁచెను వేగ ననిశము కృష్ణా!
 ॥ 90 

దండమయా! విశ్వంభర!
దండమయా! పుండరీక దళనేత్ర హరీ!
దండమయా! కరుణానిధి!
దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా!
 ॥ 91 

నారాయణ! లక్ష్మీపతి!
నారాయణ! వాసుదేవ! నందకుమారా!
నారాయణ! నిను నమ్మితి!
నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా!
 ॥ 92 

తిరుమణి దురితవిదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుజుఁడు
పరమ పవిత్రుండు భాగ్యవంతుంఁడు కృష్ణా!
 ॥ 93 

శ్రీలక్ష్మీనారాయణ!
వాలాయము నిన్నుఁ దలఁతు వంద్యచరిత్రా!
ఏలుము నను నీ బంటుగఁ
జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!
 ॥ 94 

శ్రీధర! మాధవ! యచ్యుత!
భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ
పాద యుగళంబు నెపుడు
మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా!
 ॥ 95 

శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుఁ బతకము
సిరినాయక! యమరవినుత శ్రీహరి కృష్ణా!
 ॥ 96 

అందెలఁ బాదము లందును
సుందరముగ నిల్పినావు సొంపమరంగా
సుందర! మునిజనసన్నుత!
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
 ॥ 97 

కందర్పకోటి సుందర!
మందరధర! భానుతేజ! మంజుల దేహా!
సుందర విగ్రహ! మునిగణ
వందిత, మిముఁ దలతు భక్తవత్సల కృష్ణా!
 ॥ 98 

దుర్మతిని మిగుల దుష్టపుఁ
గల్మషములు జేసినట్టి కష్టుండ ననున్
నిర్మలునిఁ జేయవలె ని
ష్కర్ముఁడ నిను నమ్మినాను సతతము కృష్ణా!
 ॥ 99 

అనుదినము కృష్ణశతకము
వినినఁ బఠించినను ముక్తి వేడుకఁ గలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయ కృష్ణా!
 ॥ 100 

భారద్వాజసగోత్రుఁడ
గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేరు నృసింహ్వాయుఁడను
శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా!
 ॥ 101 

శతకం

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Pariksin,asked Shukayogindra "Why was Lord Vishnu born in the virtuous Yadu dynasty?" - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడుప్రశ్న

పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడుప్రశ్న

అన్ని పురాణాల అర్థ వివరణలో అత్యంత సమర్థమైన వాగ్దోరణి గల సూతమహర్షి గొప్ప గుణాలచేత మహోన్నతులైన ఆ ముని శ్రేష్ఠులకు, శుకయోగీంద్రుణ్ణి చూచి పరీక్షిన్మహారాజు ఈ విధంగా అడిగాడని అన్నాడు.

చంద్రసూర్యవంశాలు విస్తరిల్లిన తీరును, ఆ వంశాల రాజుల చరిత్రలను విన్నాము. ఉన్నవి ఉన్నట్లు మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లు మాకు తెలియ చెప్పావు.

మహాత్ముడు, లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు సత్ప్రవర్తనగల యదువంశంలో ఎందుకు జన్మించాడు? ఏవిధంగా నడచుకొన్నాడు. ఎప్పుడెప్పుడు ఏ యే పనులు చేశాడు? చక్కగా వివరించండి.

శ్రీహరి స్తోత్రం జన్మరాహిత్యానికి మందు. మనస్సుకు, చెవులకు ఆనందం. మోక్షాపేక్షకలవారికి స్థానం. అలాంటి శ్రీహరిస్తోత్రాన్ని విని - కసాయివాడు తప్ప, 'ఇక చాలు. నా చెవులకు తృప్తి కలిగింది' అనే మూర్ఖుడు ఇంకెవడైనా ఉంటాడా? (ఉండడని భావం)

ఇదివరలో దేవతలకు కూడా దాటశక్యం కాని భీష్మాదికురువంశశ్రేష్ఠులతో కూడిన సేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఏ తెప్పసాయంతో ఒక పసిబాలుడి పాదముద్రను దాటినట్లు దాటగలిగారు?

పాండవ వంశాన్ని నిలబెట్టటానికి మహానుభావుడైన శ్రీకృష్ణుడు చక్రాయుధం చేపట్టి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంవల్ల చైతన్యం లేనివాడినై మా తల్లిగర్భంలో ఉన్న నన్ను రక్షించాడు.

పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు త్రికాలస్వరూపాలతోకూడి, లోకంలోని జనుల వెలుపల లోపల ఉండి, జనన మరణాలను, సంసార మోక్షాలను ఇస్తున్నాడు. ఆయన చరిత్రనంతా చెప్పండి.

('అంతర్బహి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః' - 'ఈ సృష్టి సమస్తంలో లోపల వెలుపల వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు అని శ్రుతి.)

శుకయోగీంద్రా! బలరాముడు రోహిణీదేవి కుమారుడని ఇంతకుముందే చెప్పావు. కానీ, ఇంకొక శరీరం లేకుండా దేవకీదేవి గర్భంలో ఆయన ఎలా ఉండినాడు? కృష్ణుడు మధురలో తనతండ్రి ఉన్న మందిరాన్ని వదలి ఏ విధంగా వ్రేపల్లెకు వెళ్ళాడు? ఎవరి ఇంట్లో ఉండినాడు. ఏమి చేస్తూ ఉండినాడు? తన మేనమామ అయిన కంసుణ్ణి ఎందుకు సంహరించాడు? ఎన్ని సంవత్సరాలు ఈ నేలమీద మానవుడుగా జీవించాడు? ఆయనకు భార్యలు ఎంతమంది? వారితో ఏ విధంగా ప్రవర్తించాడు? ఇంకా ఏమి చేశాడు? ఆ మాధవునిచరిత్ర అంతా నాకు వివరంగా చెప్పండి.

(దేవకీదేవి గర్భంలో ఫలదీకరణ జరిగిన వెంటనే యోగమాయాప్రభావంతో ఆ పిండాన్ని రోహిణీదేవి గర్భంలోకి మార్చటం జరిగింది. తరువాత ఆ పిండం రోహిణిగర్భంలోనే పెరిగి బలరాముడు జన్మించాడు. ఇది ఒక అద్భుతం, అభూత కల్పన అని ఇదివరకు చాలమంది పెదవి విరిచేవారు. కాని, ఆధునిక వైద్యవిజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా!
ఇవే కాదు - మన వేదశాస్త్రపురాణాల్లో అసహజాలు, అసంభవాలు, అభూతకల్పనలు అని అపహసించిన అనేక అంశాలు ఆధునికయుగంలో విజ్ఞానశాస్త్రపరిశోధనల ద్వారా నిరూపితాలౌతున్నాయి.)

అని, పరీక్షిన్మహారాజు శుకయోగితో ఇంకా ఇట్లా అన్నాడు.

నీ ముఖపద్మంనుండి వెలువడిన విష్ణుకథ అనే అమృతాన్ని త్రావి త్రావి నా శరీరం ఉప్పాంగింది. దుఃఖం వదలిపోయింది. దప్పిక, ఆకలి దూరమయ్యాయి. మనస్సు వికాసం పొందింది.

పై విధంగా అంటూ ఉన్న పరీక్షిన్మహారాజు మాటలు విని వ్యాసపుత్రుడైన శుకయోగి ఇలా అన్నాడు.

విష్ణుకథలందే మనస్సు లీనమైనవారిని, విష్ణుకథలు చెప్పేవారిని, విష్ణుకథలు వినేవారిని-ఆ విష్ణుకథాప్రసంగం విష్ణుపాదంనుండి పుట్టిన గంగాజలంవలె పవిత్రుల్ని చేస్తుంది.

(వామనావతారంలో విష్ణుమూర్తి ఒకపాదం పైకెత్తి ఆకాశాన్ని ఆక్రమించాడు. బ్రహ్మదేవుడు ఆ విష్ణుపాదాన్ని తన కమండలంలోని నీటితో కడిగాడు. ఆ నీరే గంగానది అయిందని పురాణగాథ. అందుకే గంగ విష్ణుపాదోద్భవ.)

పరీక్షిన్మహారాజా! చెబుతాను విను. పూర్వం వేలకొలది రాక్షసులు రాజ్యాధికారాలు చేపట్టి తన్నాక్రమించగా, భూదేవి ఆ రాక్షసభారాన్ని మోయలేక గోరూపం ధరించి బ్రహ్మదేవుని దగ్గరకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. బ్రహ్మదేవుడు దయతో భూదేవి నోదార్చి, ఆ భూదేవినీ, దేవతలనూ వెంటబెట్టుకొని విష్ణుమూర్తిని దర్శించాడు. పురుషసూక్తంతో ఆయన్ను స్తుతించాడు. సమాధిస్థితుడయ్యాడు. ఆ విధంగా సమాధి స్థితుడైన బ్రహ్మాదేవునికి ఒకమాట వినిపించింది. తరువాత ఆయన ఓ దేవతలారా! ఓ భూదేవీ! నేను విన్నమాట మీకు వివరిస్తాను అని ప్రియంగా ఇలా అన్నాడు.

దేవతల్లారా! మీరందరూ మీ మీ అంశలతో భూమిమీద యాదవకులంలో పుట్టండి. లక్ష్మీపతి అయిన శ్రీమహావిష్ణువు ప్రేమతో వసుదేవునిపుత్రుడుగా జన్మించి, భూభారాన్నంతా తొలగిస్తాడు.

దేవతాస్త్రీల్లారా! మీరు అందమైన శరీరాలు గలవారై శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుణ్జి పూజించటానికి భూలోకంలో పుట్టండి. ఆదిశేషుడు ఆ విష్ణుమూర్తికళతోనే శ్రీకృష్ణునికి అన్నగా పుట్టి, ఆయనకు ప్రియమైన పనులు చేస్తుంటాడు.

ఈ ప్రపంచం అంతా ఏ మాయచేత మోహబుద్ధిని చెందుతూ ఉంటుందో. ఆ విష్ణుమాయ, విష్ణువుఆజ్ఞచేతనే ఆయన అంశతోనే ఒకానొక పనికొరకు భూమిపైన జన్మిస్తుంది.

(అనిత్యమగు ఈ జగత్తంతా నిత్యమని భ్రమింప చేసేదే మాయ. ఈ మాయనే విష్ణుమాయ, యోగమాయ అని తత్త్వవేత్త లంటారు.)

బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పి దేవతలను సమ్మతింపచేసి, భూదేవిని ఒప్పించి, తన తొలి నివాసస్థానానికి వెళ్ళాడు. తరువాత, యాదవులకు ప్రభువైన శూరసేనమహారాజు మథురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధుర, శూరసేన దేశాలను పరిపాలించాడు.

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీమన్నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఏ మథురానగరంలో ఎల్లప్పుడు ప్రీతితో విహరించాడో ఆ మథురానగరమే యాదవరాజులందరికి రాజధాని అయింది.

శూరసేనుని కుమారుడైన వసుదేవుడు ఒకరోజు మథురా నగరంలో దేవకుని కూతురైన దేవకిని వివాహమాడాడు. నూత్నదంపతులు ఎంతో సంతోషంతో రథమెక్కి బయలుదేరుతున్న సమయంలో - ఉగ్రసేనునికుమారుడైన కంసుడు ఉత్సాహంతో, చెల్లెలు దేవకీదేవి, మరది వసుదేవుడు సంతోషించగా, గుర్రాలపగ్గాలు చేపట్టి, రథానికి ముందు భాగంలో పెద్దనగారాలు, మద్దెలలు, శంఖాలు, తప్పెట్లు ఎడతెరిపిలేకుండ మ్రోగుతుండగా, గుర్రాల్ని అదిలించి, రథాన్ని నడపటానికి పూనుకొన్నాడు. దేవకీదేవితండ్రి తనకూతురికి పుట్టింటివారు ఇచ్చే కానుకలు ఇవ్వాలని ఆలోచించి, ప్రేమాభిమానాలతో

(ఉగ్రసేనుడు, దేవకుడు ఆహుకుని కొడుకులు; అన్నదమ్ములు. ఉగ్రసేనుడికి తొమ్మిదిమంది కుమారులు; నలుగురు కుమార్తెలు. కొడుకులలో కంసుడు పెద్దవాడు. దేవకునిపుత్రిక దేవకిదేవి. కంసునికి చిన్నాయన కూతురు. శూరసేనునికి దేవమీఢు డని మరొకపేరు. ఇతని పుత్రుడే వసుదేవుడు.)

సంపదలతో నింపబడిన పదునెనిమిదివందల రథాలను, బంగారు కట్టుగొలుసులు గల నాలుగువందల ఎత్తెన ఏనుగులను, పదివేల గుర్రాలను, ఒయ్యారులైన రెండువందల మంది పనిగత్తెలనూ అరణంగా ఇచ్చి పంపగా, వధూవరులజంట మార్గంవెంట బయలుదేరి వెళ్ళుతున్న సమయంలో

(అరణము - క్రొత్త పెళ్ళికూతురికి పుట్టింటివారు ఇచ్చి పంపే కానుకలు.)

గుర్రాల పగ్గాలు సడలించి, వేగంగా రథాన్ని నడుపుతున్న కంసునిగుండెలు అదిరేట్టు, ఆకాశవాణి హఠాత్తుగా ఇలా పలికింది.

"సంతృప్తితో ఉన్న నీ తోబుట్టువు దేవకి మెచ్చుకొనేటట్లుగ, నీవు ఎంతో ప్రీతిగా రథాన్ని తోలుతున్నావు. మున్ముందు ఏమి జరుగుతుందో నీ వెరుగవు. ఈమె అష్టమసంతానం నీ పాలిటి మృత్యువౌతుంది సుమా!"

అని ఈ విధంగా ఆకాశవాణి పలుకగా, భోజవంశాన్ని చెరిచేవాడైన కంసుడు అదిరిపడి మూపులు కదలుతుండగా ఒరనుండి కత్తిని భయంకరంగా లాగి, జళిపించి, చెల్లెలైన దేవకీదేవి కొప్పును చెదరలాగి, ఒడిసిపట్టుకొని, చెల్లెలనికూడ చూడకుండ తెగించి ఆమెను తెగనరుకుటకు ప్రయత్నించాడు. ఆ సమయంలో వసుదేవుడు సమీపించి

మదించినవాడు, అగ్నిజ్వాలవలె కోపంతో మండుతున్నవాడు, పాపాత్ముడు అయిన కంసుణ్ణి - వసుదేవుడు పూనికతో తన మంచిమాటలనెడి అమృతధారలతో కొంతకు కొంత శాంతపరిచాడు.

బావా! అన్నవైన నీవు నీ చెల్లెలికి బంగారునాణాలివ్వాలి. చీరలివ్వాలి. మర్యాద చెయ్యాలి. తీయని మృదువైన మాటలతో ఆదరించాలి. అంతేగాని, ఆకాశవాణి పలుకులే నిజమని, నీకు మేలు చేసేవని నమ్మి, చెల్లెల్ని చంపవద్దయ్యా! నీ ప్రయత్నాన్ని విరమించు. ఓర్పు వహించు. నిన్ను వేడుకొంటున్నాను. దేవకిని వధించవద్దు.

అంతమాత్రమే కాకుండా

భోజవంశప్రభువువైన ఓ కంసా! నీవు మంచి వంశంలో జన్మించావు. పుణ్యాత్ముడవు. చెల్లెలు కూతురితో సమానురాలు. అమాయకురాలు, అశక్తురాలు, నీ క్షేమాన్ని కోరుకొనేది ఎలాంటి కల్మషంలేని స్నేహితురాలు ఈ దేవకిని, ఏదో ఆకాశంలోని పలుకులు విని తెగనరకటం న్యాయమా? ఇది చాలాపాపం కనుక కోపంమాని ఆలోచించుకో.

(కోపాన్ని తగ్గించటానికి, పాపపు పనులు ఆపటానికి అప్పుడప్పుడు ప్రశంస అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు వసుదేవుడు చేసిన కంస ప్రశంస దేవకీదేవి ప్రాణాన్ని కాపాడింది.)

మానవులకు దేహంతోపాటే మరణం కూడా పుట్టుతుంది. ఈ రోజైనా, రేపైనా, నూరేండ్లకయినా మరణం తప్పదు. జీవుడు మరణాన్ని పొంది కర్మానుసారియై, పచ్చిగడ్డిమీద ప్రాకే జలగ తనముందు భాగాన్ని పైకెత్తి వేరొక గడ్డిపరకమీద మోపి, తరువాత వెనుకభాగాన్ని ఎత్తి ముందుకు సాగినట్లు -క్రొత్తదేహాన్ని పొంది పాతదేహాన్ని వదలుతాడు. మానవుడు మేల్కొని ఉన్నప్పుడు చూచినవి, విన్నవి, ఆలోచించినవి అతనికలలో క్రమంగా కన్పించినట్లు, మంచి చెడ్డ కర్మల ఫలాలు అతణ్జి వెంబడిస్తాయి.

("జాతస్య హి ధ్రువో మృత్యుః! ధ్రువం జన్మ మృతస్య చ" పుట్టినవానికి మరణం తప్పదు. మరణించినవానికి పుట్టుక తప్పదు - అని గీతాచార్యునివచనం; సృష్టిధర్మం.
మంచిపనికి ఫలం శుభం. చెడుపనికి ఫలం పాపం - అని రామాయణం.)

తాను పూర్వం చేసిన కర్మల ననుసరించే మనిషి మనస్సు అనేక వికారాలకు లోనవుతుంది. ఇంద్రియాలు ఎటువెళ్ళితే ఆ మనస్సు అటే వెళ్ళుతూ ఉంటుంది. మనిషి ఎన్ని జన్మలెత్తినా అతనికర్మఫలాలు నశించవు. అవి అతణ్ణి వదలవు.

నీటికుండ, నీటికుంట, చెరువు, కొలను మొదలగు వాటియందు సూర్యచంద్రాదులు ప్రతిఫలిస్తూ, గాలికి కదలుతూ ఉన్నట్లే, ప్రాణి తన కర్మఫలాలతో నిర్మితమైన దేహాల్లో కోరికలు కలవాడై కదలుతూ ఉంటాడు.

మంచిని, చెడును కలుగచెసేవి కర్మలే! జీవుడికైనా, బ్రహ్మదేవుడికైనా అంతే! ఆలాంటప్పుడు తాను కర్మలు చేస్తూ తనకు జరిగే మంచి చెడులకు ఇతరులు కారకు లనటం ఎందుకు?

అందువల్ల ఇతరుల్ని హింసించ కూడదు. తనకు శుభం కలుగుతుందని ఇతరుల్ని హింసించినట్లయితే దానిఫలితం ఊరకే పోదు. తరువాతనైనా దాన్ని అనుభవించక తప్పదు.

(కర్మఫలం ఈ జన్మలో కాకున్న మరోజన్మలోనైన అనుభవించక తప్పదు. కర్మఫలం-మంచికి మంచి; చెడుకు చెడు.)

ఓ దయామయుడవైన కంసమహారాజా! ఈ దేవకి నీకు వరుసకు చెల్లెలే గాని, నీ కన్నబిడ్డవంటిది; చాలమంచిది. గౌరవించదగినప్రవర్తన గలది. భయపడేస్వభావంగలది; పిన్నది; క్రొత్తగా పెళ్లి అయినట్టిది. చక్కని శోభకలది; భయంతో వణుకుతూంది; నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను. ఆమెను కాపాడు.

అని వసుదేవుడు సౌమ్యంగా, కటువుగా మాట్లాడగా, కంసుడు తన వేడిచూపులనుండి నిప్పులు కుప్పలువడ రాల్చి, దయలేనివాడై తెగించి దేవకిని చంపబోయాడు. అది తెలుసుకొని వసుదేవుడు అతని ప్రయత్నాన్ని ఏ విధంగా వంచించాలా అని ఇలా ఆలోచించాడు.

చావు తప్పదు కదా అని మనిషి తెలివి తక్కువగ పిరికితనంతో ఊరుకోకూడదు. ధైర్యం వహించి, బుద్ది ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు అతడు స్వశక్తితో ప్రవర్తించాలి.

అని వసుదేవుడు నిర్ణయించుకొని

ఆపదలో ఉన్నదేవకిని రక్షించటానికై, పుట్టబోయే కుమారుల్ని వీడికి ఇచ్చివేస్తాననటం ప్రస్తుతానికి మంచిది. ముందు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ఊపిరితో ఉంటే రేపు మరోమార్గం దొరకదా? కొడుకులు పుట్టి, వాళ్ళకు మరణం తప్పనిసరి అయితే - వీడుకూడా బ్రహ్మదేవునిచేత ఏ ఆపదా పొందకుండ ఉంటాడా? అడవిలో పుట్టిన అగ్ని-దావాగ్ని-ప్రక్కనున్న చెట్లను విడిచి, విజృంభించి ఎక్కడో దూరంలో ఉండే చెట్లను; దహించినట్లు-కర్మఫలాన్ని అనుసరించి జననమరణ కారణం దూరదూరంగా పోతుంటుంది. అందువల్ల ఇక నేను తడబడటం ఎందుకు?

పుట్టబోయే కొడుకులను ఇస్తానని, కంసునిబారినుండి దేవకిని రక్షించటం ప్రస్తుతానికి తెలివైన పని. వీడు ఇప్పుడు ఆమెను చంపకుండా వదలితే-కొడుకులు పుట్టేనాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆ నాటికి ఏ దైవమైనా అడ్డుపడక పోతుందా?

'దేవకిఎనిమిదవగర్భంనుండి పుట్టేకొడుకు కంసుణ్జి చంపుతాడని గట్టిగా ఆకాశవీథినుండి వినిపించింది. ఆ మాటలు ఎందుకు తప్పిపోతాయి? తప్పక జరిగితీర్తాయి. అందువల్ల దేవకిని వెంటనే కంసుని బారినుండి విడిపించటం మంచిది' అని వసుదేవుడు అనుకొంటూ

వసుదేవుడు మృదువుగా మాట్లాడుతూ - వెంటనే ఆ క్రూరుడైన కంసుణ్ణి తగు రీతిగా పూజించి మాటలపూలతో గౌరవించాడు. మనస్సు మండుతూ ఉన్నా. ప్రశాంతముఖంతో అతనితో ఇలా అన్నాడు.

(యాదవప్రభువైన శూరునికొడుకు కనుక వసుదేవుడు శౌరి.)

దేవకీదేవికి పుట్టిన పుత్రునివల్ల నీవు చస్తావని ఆకాశవాణి పలికిందని గదా నీవు కోపపడుతున్నావు? ఈమెకు పుట్టే కొడుకుల్ని చంపడానికి వరుసగా నీ కిస్తాను.

అని ఈ విధంగా వసుదేవుడు పలుకగా, కంసుడు విని, అంగీకారసూచకంగా తలయూచి, గుణాన్ని గ్రహించే వానివలె ప్రవర్తించి, దుఃఖిస్తున్న చెల్లెలి కొప్పు వదలి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడు కూడా ఏలాగో బ్రతికి బయటపడ్డానని అనుకొని, భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. కొంతకాలం గడిచిన తరువాత

ఎడతెగకుండా కంసునివల్ల కష్టాలు అనుభవిస్తూ, దేవకీదేవి అందరి దేవతల భావాన్ని తాను పొంది, ఏడాదికొక్కడు చొప్పున ఎనిమిదిమంది కొడుకుల్నీ ఒక కూతురునీ ప్రసవించింది.

(దేవకికి ఎనిమిదిమంది కొడుకులు కల్గారు. వాళ్లు 1) కీర్తిమంతుడు 2) సుషేణుడు 3) భద్రసేనుడు 4)ఉదారధీ 5) మృదుడు 6) సమ్మర్దనుడు 7 బలభద్రుడు 8) కృష్ణుడు పిదప కల్గిన కూతురు - యోగమాయ.

ఆ కన్నబిడ్డలను, వసుదేవుడు ధైర్యం వహించి, సత్యాన్ని పాటిస్తూ, ఇచ్చిన మాటమీద నిలబడి, పుత్రమమకారాన్ని వదలుకొని, దేవకీదేవి మొదటిసారి కన్నకొడుకును కీర్తిమంతుడనేవాణ్ణి వెంటనే తెచ్చి కంసరాజు కిచ్చాడు.

ఆడినమాట తప్పకుండ, సంకోచం లేకుండ, మోసం చేయకుండ, కలత చెందకుండ తన కొడుకులను, చంపేందుకై శత్రువుకు అప్పగించిన ధీరుడు - వసుదేవుడు తప్ప లోకంలో మరొకడున్నాడా?

ఓ పరీక్షిన్మహారాజా! సత్యవ్రతుడికి మాటతప్పడం తప్ప, దుష్కరమైంది ఏముంది? ఆలాగే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మపదార్ధం తప్ప ఇష్టమైంది మరొకటి ఏముంది? భగవద్భక్తిలో నిమగ్నుడైనవాడు త్యాగం చేయలేనిది ఏముంటుంది? ఆలాగే మేలు ఏదో, కీడు ఏదో తెలియనివానికి కీడు అనేది ఏముంటుంది?

(సత్యపాలనే వ్రతంగా కలవాడు, ఇచ్చినమాటకోసం హరిశ్చంద్రునివలె జీవితంలో దేన్నైనా వదలుకోగలడు; అప్పగించిన ఏ పని అయినా చేయగలడు. అలాంటప్పుడు అతనికి కష్టమైంది అంటూ ఏముంటుంది?)

ఈ విధంగా సత్యాన్ని తప్పకుండా కొడుకును తెచ్చి అప్పగించిన వసుదేవునిమాటనిలుకడకు మెచ్చికొంటూ కంసుడు ఈ విధంగా అన్నాడు.

నీ కొడుకును మరల నీవే తీసుకొని వెళ్ళు. వీనివల్ల నాకు భయం లేదు. అందువల్ల వీడిమీద కోపం లేదు. నీ ఎనిమిదవకొడుకే నా పాలిటి మృత్యువట! అందువల్ల అప్పుడే వాణ్ణి వధిస్తాను.

కంసుడు ఆ విధంగా అనగా, వసుదేవుడు తన కొడుకును తీసుకొని వెళ్ళాడు. అయినా అతనికి ఆనందం లేదు. దుష్టుడైన ఆ బావగారిమాటలు విన్నా ఆ తరువాత ఎప్పుడు ఏమౌతుందో అని భయపడుతూనే ఉండినాడు. ఆ తరువాత

('ఆనకదుందుభి' - వసుదేవునికి గల మరొక పేరు. అతడు పుట్టినపుడు ఆకాశంలో విష్ణువు ఈతని పుత్రుడై జన్మిస్తాడని ఆనకములు - అనగా మద్దెలలు, భేరులు మ్రోగాయట. అందువల్ల వసుదేవుడు 'ఆనకదుందుభి' అయ్యాడు (భాగ. 9-715).)

ఒకరోజు నారదమహర్షి తిన్నగా కంసునిమందిరానికి వచ్చాడు. రహస్యంగా అతనితో వ్రేపల్లెలో ఉన్న నందుడు మొదలైనవారు, వారిభార్యలు, కొడుకులు, బంధువులు,(మథురాపురంలో ఉన్న) దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవాది యాదవులందరూ నిజానికి దేవతలేగాని మానవులు కారు. కంసా! నీవు రాక్షసుడవు. దైవస్వరూపుడైన శ్రీమహావిష్ణువు దేవకీదేవికిపుత్రుడై పుట్టి, భూలోకాన్ని చెరిచే దుష్టరాక్షసులనందర్నీ సంహరిస్తాడు అని చెప్పి, స్వర్గలోకానికి వెళ్ళాడు.

నారదుని మాటలు విని మిక్కిలిగా కుమిలి, యాదవులంతా దేవతలనీ, గతంలో శ్రీహరి ఖడ్గంతో హతుడైన కాలనేమి అనే రాక్షసుడు తానే అనీ కంసుడు మనస్సులో

(విష్ణుమూర్తి ఖడ్గం నందకం. కంసుడు గతజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. అతడు దేవాసురయుద్ధంలో విష్ణువుచేత హతుడయ్యాడు. ఈ జన్మలో కంసుడుగా జన్మించాడు.)

(నారదుడు చెప్పినమాటలకు) మనస్సులో మిక్కిలి కలవరపాటునొందిన కంసుడు పెల్లుబికిన కోపంతో చెల్లెలు, మరది అనికూడా చూడకుండా దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు. విష్ణుమూర్తిని గుర్తు చేసుకొంటూ దేవకీ వసుదేవులకు పుట్టిన కొడుకులను వెంటవెంటనే వధించాడు. తండ్రి అనికూడా చూడకుండా యదువంశసంజాతుడు, భోజాంధక వంశాలకు రాజు, నిర్మలుడూ అయిన ఉగ్రసేనమహారాజును బంధించాడు. మితిమీరిన పట్టుదలతో విజృంభించి శూరసేనదేశాలను పాలించసాగాడు.

లోకంలో రాజులు తమకు గొప్పజీవితం ఉండాలని, రాజ్యకాంక్షతో తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, బంధువులననా చంపుతారు.

అంతేకాదు. కంసుడు - బాణాసుర, నరకాసుర, జరాసంధ, మహాశన, కేశి, ధేనుకాసుర, బకాసుర, ప్రలంబాసుర, తృణావర్త, చాణార, ముష్టిక, అరిష్ట ద్వివిద, పూతన మున్నగు దుష్టుల్ని తనకు సహాయులుగా చేసుకొని, యుద్దాల్లో యాదవులను ఓడించాడు. యాదవులు తమ పదవులు వదలుకొని దిక్కులేక వలస వెళ్ళి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వదేశాల్లో తలదాచుకొన్నారు. అందులో కొందరు యాదవులు అభిమానాలు వదలుకొని కంసుణ్ణి సేవించారు. ఆ తర్వాత

కంసుడు వెంట వెంటనే దేవకీదేవికొడుకులను ఆరుమందినీ వధించాడు. ఆదిశేషుడనే మహనీయమైన, మనోహరమైన విష్ణుతేజస్సు దేవకీదేవిగర్భంలో ఏడవదిగా ప్రవేశించింది.

ఆ సమయంలో విశ్వరూపుడైన శ్రీహరి, తనను నమ్మి బ్రతుకుతున్న యాదవులకు కంసునివల్ల భయం ఏర్పడుతుందని తెలుసుకొని యోగమాయాదేవితో ఇలా అన్నాడు.

శుభస్వరూపిణివైన ఓ యోగమాయాశక్తీ! నీవు గోపస్త్రీలు, గోపాలకులు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలందరు కంసునిచేత బంధింపబడి ఉన్నారు. కాని రోహిణి అనే ఒక భార్యమాత్రం ఆ నందగోకులంలో తలదాచుకొని ఉన్నది. ఆమె మంచి గుణగణాలు కలది. దేవకి కడుపులో ఉన్న నా శేషునితేజస్సును నీవు బయటికి తీసి, నేర్పుగా రోహిణిగర్భంలో ప్రవేశపెట్టు. నేను నా అంశతో సకల శక్తులతో వైభవంగా దేవకీదేవికి కుమారుడిగా జన్మిస్తాను. ఆ తర్వాత నీవు నందునిభార్య అయిన యశోదగర్భంలో పుడతావు.

(వసుదేవునిభార్యలు - ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే ఏడుగురు. ఈ ఏడుగురు దేవకుని కుమార్తెలు. దేవకుడు ఆహుకునికుమారు లిద్దరిలో పెద్దవాడు, ఆహుకునిరెండవకొడుకు ఉగ్రసేనుడు.)

నిత్యమంగళస్వరూపిణివైన ఓ యోగమాయాదేవీ! నీవు అనేకవిధాలైన సంపదలకు నిలయమైనదానవు, అన్నికోర్కెలు తీర్చగలదానివీ అయిన నీకు మానవులు కానుకలను, పూజలో భాగంగా బలులను ఇస్తూ భక్తితో నిన్ను కొలుస్తారు.

'అంతేకాదు. మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాల్గుపేర్లుతో దేశంలోని ఆయా స్థానాల్లో నిన్ను పూజిస్తారు అని శ్రీమహావిష్ణువు చెప్పి, వెళ్ళుమని ఆనతి ఇవ్వగా, యోగమాయాదేవి మహాప్రసాదమని అంగీకరించి, వెంటనే విష్ణులోకాన్ని విడిచి, భూలోకానికి వచ్చి

('కాశీక్షేత్రం - దుర్గ; భద్రేశ్వరక్షేత్రం - భద్రకాళి; వరాహశైలక్షేత్రం - విజయ; మాతృకాక్షేత్రం - వైష్ణవి; మానసక్షేత్రం- కుముద; అమరకుండకక్షేత్రం - చండిక; హస్తినాపుర
క్షేత్రం - కృష్ణ; శ్రీశైలక్షేత్రం - మాధవి; కన్యాకుబ్జక్షేత్రం - కన్యక; మాయానగరక్షేత్రం - మాయ; సుపార్వక్షేత్రం - నారాయణి; రుద్రకోటిక్షేత్రం - ఈశాన; బ్రహ్మక్షేత్రం - శారద; సిద్ధవనక్షేత్రం - అంబిక'.)

యోగమాయాదేవి దేవకీదేవికడుపులో దివ్యకాంతితో వెలుగుతున్న పిండాన్ని మెల్లగా బయటికి తీసి, రోహిణీదేవి గర్భంలో ఉంచి వెళ్ళింది. అప్పుడు మధురానగరప్రజలంతా దేవకీదేవిగర్భం పోయిందని కలత చెందారు.

అంతలో, రోహిణీదేవికి శ్రేష్ఠుడైన ఒక కుమారుడు జన్మించాడు. మిక్కిలి బలవంతుడు కావటంవల్ల బలభద్రుడని, లోకానికి ఆనందం కలిగించేవాడు కనుక రాముడని, దేవకీదేవిగర్భంనుండి (మొదట) బయటికి లాగబడినవాడు కావటంవల్ల సంకర్షణుడని అతనికి పేర్లువచ్చాయి.

రోహిణీదేవికి బలరాముడు పుట్టిన తరువాత

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీమహావిష్ణువుఅంశ వసుదేవునిలో ప్రవేశించగానే అతడు సమస్తప్రాణులచూపులను ఆకర్షిస్తూ, సూర్యతేజస్సుతో ప్రకాశించాడు.

అఖిలమై, సర్వాత్మస్వరూపమై, తేజోవంతమై, భువనాలకంతటికి శుభదాయకమై ప్రకాశిస్తున్న విష్ణుతేజస్సు, వసుదేవుని శరీరంలో ప్రవేశించింది. అలాంటి విష్ణుతేజస్సును అచ్చొత్తినట్లుగా వసుదేవుడు దేవకీదేవిగర్భంలో ప్రవేశపెట్టినాడు. ఆ తేజస్సును గర్భంలో ధరించినందువల్ల, చంద్రునితో కొత్తకాంతులీనుతున్న తూర్పుదిక్కాంతవలె దేవకీదేవి ప్రకాశించింది.

(భువనాలు పదునాలుగు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు ఏడూ అధోలోకాలు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్య లోకాలు ఏడూ ఊర్ధ్వలోకాలు.)

అని చెప్పగా విని, పరీక్షిన్మహారాజు తరువాత ఏమి జరిగిందని అడుగగా, శుకమహర్షి ఈ విధంగా చెప్పాడు.

ఎంతో గొప్పగా బ్రహ్మండ భాండాల నన్నింటిని తన కడుపులో దాచుకొన్న శ్రీహరి, ఈ భూమిని ఉద్ధరించటానికై దేవకీదేవికడుపులో ఒదిగి బాలభానునివలె వృద్ధి పొందాడు.

ఆ తరువాత, దేవకీదేవిగర్భంలో విష్ణుమూర్తి వృద్ధిపొందే కొద్దీ శత్రువుల ముఖాలు వెలవెలపోగా, గర్భవతి అయిన దేవకీదేవి ముఖం తెల్లబడసాగింది. ఉద్యమించే వైరులకీర్తి మాసి నల్లబడిపోగా, ఆమెచనుమొనలు నలుపెక్కాయి. దుర్మార్గుల ఇండ్లలో పొగలెగయగా, ఆమెనూగారు క్రిక్కిరిసిన వెంట్రుకలవరుసతో ప్రకాశించింది. శత్రువులకు ఆహారంమీద కోరికలు అడుగంటగా, ఆమెకు అన్నంమీది కోరిక తగ్గింది. శత్రువులు అలసిపోతుండగా, ఆమెకు అలసట ఏర్పడింది. శత్రువులకు శారీరక మానసిక మాంద్యం కలుగగా, ఆమెకు కూడా బుద్ధిమాంద్యం ఏర్పడింది. శత్రువులు మట్టిలో కలియగా, ఆమెకు మట్టి రుచించసాగింది.

(దుష్టశిక్షణ అవతరిస్తున్న శ్రీహరి తల్లిగర్భంలో పెరుగుతూ ఉండగానే, ఆమెలో వచ్చే మార్పులతోపాటు దుష్టశత్రువుల స్థితిగతుల్లో ఏలాంటి మార్పులు వచ్చాయో, మున్ముందు వాళ్ళు పడేపాట్లు ఏ స్థాయిలో ఉంటాయో భావార్థసూచనగా కవి ఇందులో అద్భుతంగా ధ్వనింపచేయటం గొప్పవిశేషం.)

ఆ తర్వాత, పంచభూతాత్మకుడైన శ్రీమహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉండగా పంచభూతాలు ఆయన్ను సేవించడానికై వచ్చాయా అన్నట్లు ఆ గర్భవతిలో మార్పులు అనేకం అగుపించాయి. జలం ఆ బాలకుణ్ణి సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం చెమటలు పట్టసాగింది. అగ్ని ఆ బాలకుణ్ణి సేవించడానికై వచ్చిందా అన్నట్లు ఆమె దేహకాంతి అధికమై మెరిసింది. వాయుదేవుడు సేవించడానికి వచ్చినాడా అన్నట్లు ఆమె నిట్టూర్పులు అధికమయ్యాయి. ఆ బాలుణ్ణి పూజించటానికి భూమివచ్చిందా అన్నట్లు ఆమె మన్ను తినటం ఎక్కువైంది. ఆకాశం రూపుదాల్చి ఆ బాలుణ్ణి సేవించటానికి వచ్చిందా అన్నట్లు, అంతకు ముందు ఆకాశంవలె శూన్యమై లేదనిపించే ఆమెనడుము లావైంది.

ఆ తర్వాత, ఇంకా దేవకీదేవిగర్భంలో రాక్షసులశత్రువైన శ్రీహరి ఉన్నందువల్ల, ఆమెమొలనూలు నెమ్మదిగా బిగుసుకపోతుంటే శత్రువుల భార్యల మంగళసూత్రాలు సడలిపోతున్నాయి. ఆమె శరీరకాంతి ఎక్కువగా పెరుగుతూంటే - పగవారిభార్యల శరీరకాంతులు తరిగి పోసాగాయి. ఆమెకు ఆభరణాలు బిగువు లౌతూ ఉంటే, శత్రువుల భార్యల ఆభరణాలు తెగిపోసాగాయి. ఆమె కడుపు పెద్దదౌతూ ఉంటే, శత్రువుల భార్యల కడుపులు పగిలి పోసాగాయి. ఆమెకు ప్రసవించే రోజులు దగ్గరయ్యేకొద్దీ, శత్రువుల భార్యలు ముత్తెదువులుగా ఉండే దినాలు క్రమంగా కడచిపోసాగాయి.

ఈ విధంగా లోకాలన్నింటినీ తన గర్భంలో మోస్తున్న శ్రీమహావిష్ణువును, తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి, దుష్టుడైన పండితునిలోని సరస్వతివలె, కుండలోని దీపకళికవలె అన్న కంసుని ఇంట్లో నిర్భంధింపబడి ఉండింది.

దేవకీదేవి చెరలోఉన్నా ఆమె ముఖతేజస్సును, దేహకాంతిని, నడకతీరులోని సొగసును చూచి, కంసుడు ఆశ్చర్యపడి, తరచుగా భయపడుతూ తనలో ఈ విధంగా అనుకొన్నాడు.

దేవకీదేవిగర్భం మనస్సుకు ఆందోళన కలిగేటట్లుగానూ, చూడడానికి భారంగానూ ఉంది. ఇదివరకటి ఈమెగర్భాలు ఇలా లేవు. బహుశః విష్ణుమూర్తి ఈమె గర్భంలో ప్రవేశించాడేమో!

ఇక నేనేమి ఆలోచించాలి? ఏమి చేయాలి? రోజురోజుకూ దేవకీదేవిగర్భం పెరుగుతూ ఉంది. గర్భవతి అయిన చెల్లెలిని, అబలను నేను ఏ కారణం చూపి చంపేది. న్యాయాన్యాయాల విచారణ ఎందుకులే అని చంపితే - నా ఐశ్వర్యం, కీర్తి, ఆయువూ, ధర్మం అన్నీ నాశనమై పోవా?

వావివరుసలు చూడకుండ ప్రవర్తించే క్రూరుడు, బ్రతికినా చచ్చినవాడితో సమానమని లోకులు నిందిస్తారు. ఆలాంటివాడు నరకానికి పోతాడు. విచారించి చూస్తే దురాలోచనతో జీవించేవాడి బ్రతుకు ఒక బ్రతుకేనా?

అని నిర్ణయించుకొని క్రోర్యాన్ని వదలి, ధైర్యం తెచ్చుకొని, గాంభీర్యాన్ని వహించి, శౌర్యాన్ని ప్రదర్శిస్తూ, చెల్లెలిని చంపటం అనే కార్యం మహాపాపంగా భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించి, ఏమీ మాట్లాడకుండ మౌనివలె ఊరకుండగా

తొలగించేందుకు వీలులేని పెద్దవైరం ఏర్పడింది. మున్ముందు ఏ మౌతుందో? దేవకీదేవికి ఎప్పుడు విష్ణువు పుడతాడో? పుట్టగానే పురిటింటిలోనే వాణ్ణి పట్టుకొని చంపివేస్తాను అని కంసుడు ఆమె ప్రసవించేసమయంకోసం ఎదురు చూడసాగాడు.

దేవకీదేవికి పుట్టబోయే విష్ణువుమీద శత్రుభావన పెంచుకొన్నకారణంగా, కంసుడు, ఇతరవిషయాలన్నింటిని మరచిపోయాడు.

కంసుడు విష్ణుమూర్తి మీది ఎడతెగనికోపంతో తిరుగుతున్నా భోజనంచేస్తున్నా, త్రాగుతున్నాా నడుస్తున్నా కూర్చున్నా లేస్తున్నా ఇలా అన్ని వేళల్లో ఆ విష్ణుమూర్తినే తలచుకొంటూ జగత్తంతా విష్ణమయంగా చూడసాగాడు.

(విష్ణువు విశ్వమయుడు కదా! ఒక విధంగా కంసునిది విష్ణుభక్తే - కాకుంటే వైరభక్తి అందువల్లనే ఆ వైరభక్తునికి జగత్తంతా విష్ణుమయంగా గోచరిస్తున్నది.)

ఇంకా, కంసుడు చెవులకు ఏ శబ్దం వినపడినా అది విష్ణుదేవునిమాటేమో అని వింటాడు. కంటికి ఏది కన్పించినా అది విష్ణుమూర్తి రూపమే కాబోలు అని చూస్తాడు. తాను తిరిగేటప్పుడు శరీరానికి గడ్డిపరక తగిలినా అది విష్ణుమూర్తిచేతి దెబ్బేమో అని ఉలిక్కి పడతాడు. ముక్కుకు ఏ సువాసన సోకినా అది ఆ హరిమెడలోని వనమాలికాసుగంధమేమో అని అదరిపడతాడు. ఏ మాటలు పలికినా, అవి విష్ణునామాలని భ్రమపడతాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణుమూర్తిని గూర్చిన ఆలోచనలేమో అని ఆగ్రహపడతాడు.

(భక్తికంటే వైరభక్తే ప్రగాఢమైందేమో! అది వ్యక్తిని హరిదగ్గరికి త్వరగా చేరుస్తుందేమో! అందుకే కాబోలు జయ విజయులు రాక్షసజన్మలెత్తి శ్రీహరికి వైరభక్తులై త్వరగా శాపనివృత్తిని పొందారు.)

ఆ సమయంలో అనుచరులతో కూడి దేవతలు, నారదాది మహామునులు వెంటరాగా బ్రహ్మదేవుడూ, శివుడూ దేవకీదేవి ఉండే చెరసాల కేగి, ఆమెగర్భంలో శిశువురూపంలో ఉండే శ్రీమహావిష్ణువును ఈ విధంగా స్తుతించారు.

(నలువ - నాలుగుముఖాలు గలవాడు - బ్రహ్మ, ముక్కంటి - మూడుకన్నులు గలవాడు - శివుడు.)

బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట



Tuesday, March 31, 2026

Ashta Bhairava in Kashi(Varanasi) - అష్ట భైరవులు, కాశీ, వారణాసి

అష్ట భైరవులు, కాశీ, వారణాసి

వారణాసిలో ఎనిమిదిప్రధాన భైరవ రూపాలు ఉన్నాయి , వీటిని సమిష్టిగా అష్ట భైరవులు అని పిలుస్తారు . ఈ ఎనిమిది రూపాలు కాశీ పవిత్ర నగరంలోని ఎనిమిది దిక్కులను రక్షించే సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. కోటివాల్‌లోని కాల భైరవుడు అత్యంత ప్రముఖమైనవాడు ("కాశీ కొత్వాల్"), కాగా మరో ఏడు రూపాలు కూడా ఉన్నాయి.

వారణాసిలోని ఎనిమిది మంది భైరవులు:
అసితంగ్ భైరవ్: మహా మృత్యుంజయ ఆలయ సముదాయంలో ఉంది.
రురు భైరవ్: హనుమాన్ ఘాట్ సమీపంలో ఉంది. కర్ణాటక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్‌కు దగ్గరగా ఉంటుంది
చండ భైరవ్: దుర్గా కుండ్ వద్ద కనుగొనబడింది.
క్రోధన్ భైరవ్: కామచలోని కాళికా గలిలో ఉంది.
ఉన్మత్త భైరవుడు: కమచలో నెలకొని ఉన్నాడు.
కపాల్ భైరవ్ (అకా లాట్ భైరవ్): ఈశాన్య శివార్లలో/గిరిజఘర్‌లో ఉంది.
సంహార్ భైరవ: గై ఘాట్, పటాన్ దర్వాజా వద్ద ఉంది.
భీషణ భైరవుడు: 
మైదాగిన్ చౌరహాకు మరీ దూరంలో కాకుండా మహేశ్వరి ధర్మశాలకు దగ్గరగా ఉంటుంది. 

1. చండ భైరవ – దుర్గా మందిర్ దుర్గా కుండ్

దుర్గా మందిర్ అదే పేరు గల ప్రాంతంలోని దుర్గా కుండ్ పక్కన ఉంది. ఎరుపు రంగులో నిర్మించబడిన చాలా ప్రసిద్ధ దేవాలయం, ఇది నవ దుర్గా యాత్రలో కూడా ఒక భాగం. ఇక్కడి దుర్గాదేవి యొక్క కూష్మాండ రూపాన్ని చూడొచ్చు. ఈ దేవాలయం పక్కన ఒక చిన్న కాళీ దేవాలయం కూడా ఉంది.

కాళీమాత విగ్రహం పక్కనే నల్లరాతితో చేసిన ఒక చిన్న చండ భైరవ విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నల్లని వస్త్రంలో చుట్టబడిన రెండు భైరవ విగ్రహాలు కనిపిస్తాయి. వాటిలో చిన్నదే మనం ఈ యాత్రలో భాగంగా దర్శిస్తున్న చండ భైరవుడు.

ఈ యాత్రను పూర్తి చేయడానికి ఆశీస్సులు కోరుతూ, ఒక సంకల్పంతో దీనిని ప్రారంభించాలి.

2. రూరూ భైరవ్ – హరిశ్చంద్ర ఘాట్‌కు సమీపంలో ఉన్న కర్ణాటక ఘాట్
దుర్గా ఆలయం నుండి, ప్రసిద్ధ బాబా కినారామ్ ఆశ్రమం మీదుగా వెళుతూ, హనుమాన్ ఘాట్ వైపు నడవాలి. మొదటి మజిలీ నరసింగేశ్వర ఆలయం, ఇక్కడ ఆనంద్ భైరవ మరియు రూర్ భైరవ మూర్తులు కూడా ఉన్నాయి. దీన్ని గూగుల్ మ్యాప్స్‌లో సులభంగా గుర్తించవచ్చు.

ఆ తర్వాత, కర్ణాటక ఘాట్ వైపు ముందుకు సాగాలి. నీలి రంగులో ఉన్న ఈ చిన్న ఆలయం కర్ణాటక ఘాట్‌కు సరిగ్గా బయట ఉంది. దీనికి దగ్గరలో ఉన్న హరిశ్చంద్ర ఘాట్ మరింత ప్రసిద్ధి చెందింది.

తాజా బంతిపూలను ధరించి, కుక్కపై స్వారీ చేస్తున్న నల్లరాతి మూర్తి కనిపిస్తుంది. దాని వెనుక ఇంకా చిన్న మూర్తులు ఉన్నాయి, కానీ వాటిని చూడటం కష్టంగా ఉంది.

3. క్రోధన్ భైరవ్  – కామాఖ్య దేవాలయం, కమాచ్చా
వారణాసిలోని కమాచ్చా ప్రాంతంలో ఉన్న గంగా ఘాట్‌ల నుండి కామాఖ్య దేవాలయం వరకు చాలా దూరం నడవాల్సి వస్తుంది. BHU ప్రధాన క్యాంపస్‌కు వెలుపల ఉన్న ఒక విభాగాన్ని దాటి వెళ్లాలి. అది వారణాసి యొక్క మరొక వైపుకు వెళుతోంది.

కామాఖ్య దేవాలయం, కామాఖ్య మాతకు అంకితం చేయబడిన ఒక అందమైన ఆలయం. దీనిలోని ఒక ప్రత్యేకత ఆలయంలో ఒక భారీ శ్రీచక్రం కూడా ఉంది. శ్రీచక్రం వస్త్రంతో కప్పబడి ఉండటం వల్ల దానిని సరిగ్గా చూడలేరు, కానీ దాని ఆకృతులను మాత్రం స్పృశించగలరు. ప్రత్యంగిరా దేవికి చెందిన మరో చిన్న ఆలయం కూడా ఉంది.

కామాఖ్య దేవాలయం యొక్క పక్క గోడపై క్రోధన భైరవుడు కొలువై ఉన్నాడు. దానిని ఒక్కసారి చూడాలంటే ఒక పక్కకు వెళ్లి లోపలికి తొంగి చూడాలి. దీనిని ఆది భైరవుడు అని కూడా పిలుస్తారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన గ్రిష్ణేశ్వర మహాదేవుడిని కూడా దర్శించవచ్చు.

ఈ ఆలయాన్ని శ్రద్ధగా సందర్శించే వారికి మాత్రమే ఆయన దర్శనం లభిస్తుంది. సాధారణంగా వచ్చే చాలామంది సందర్శకులు దీనిని గమనించలేరు.

4. ఉన్మత్ భైరవ – బటుక్ భైరవ దేవాలయం, కామాచా
బటుక్ భైరవ అంటే అక్షరాలా బాల భైరవుడు అని అర్థం మరియు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి దారితీసే ఒక నడవను నిర్మించారు, దాని గోడలపై శిల్పాలు మరియు ఆలయం గురించి తెలియజేసే ఒక బోర్డు ఉన్నాయి. 

ఆ చిన్న ఆలయం చాలా అందంగా అలంకరించబడి ఉంది. అక్కడ బటుక భైరవుని ముఖం, ఆయనకు ఇరువైపులా రెండు కుక్కలు కనిపిస్తాయి. అక్కడ మరొక చిన్న విగ్రహం కూడా కనిపిస్తుంది, అదే ఉన్మత్ భైరవుడు. ఈ అష్ట భైరవ యాత్రలో దీనినే దర్శించుకోవాలి. ఈ ఆలయంలో ఒక మనోహరమైన పంచముఖి హనుమాన్ విగ్రహం ఉంది.

మరొక ఉన్మత్ భైరవ ఆలయం పంచ క్రోషి మార్గంలో ఉన్న డియోరా గ్రామంలో ఉంది, ఇది సుమారు 15-16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

5. భీషణ భైరవుడు – కాశీపుర

దీన్ని గూగుల్ మ్యాప్స్‌లో సులభంగా గుర్తించవచ్చు, ఇది మైదాగిన్ చౌరహాకు మరీ దూరంలో కాకుండా మహేశ్వరి ధర్మశాలకు దగ్గరగా ఉంటుంది. ఇది జ్యేష్ఠేశ్వర ఆలయానికి కూడా దగ్గరగా ఉంది.

6. అసితాంగ భైరవ  – మహామృత్యుంజయ దేవాలయం

మైదాగిన్ చౌరహాకు సమీపంలో ఉన్న మహామృత్యుంజయ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది అనేక శివాలయాలను కలిగి ఉన్న ఒక ఆలయ సముదాయం. ఇక్కడి ధన్వంతరి కూపం కూడా దాని ఔషధ గుణాలకు అంతే ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు వచ్చి దాని నీటిని తాగడం చూడవచ్చు.

ఈ బావికి కుడి వైపున, అసితాంగ భైరవునికి ఒక చిన్న ఆలయం ఉంది.

లోపలికి అడుగుపెట్టగానే విశాలంగా ఉండే ఈ ఆలయ సముదాయంలో మహాకాలేష్ మరియు మహామృత్యుంజయ ఆలయాలను చూడవచ్చు. సాంకేతికంగా ఇది కృతి వాస క్షేత్రం కిందకు వస్తుంది. ఇది ఎంత పవిత్రమైనదంటే, ఇక్కడ చేసే ఏ ప్రార్థన లేదా సాధన అయినా అనేక రెట్లు ప్రయోజనాలను ఇస్తుంది.

7. కపాల భైరవ్, అకా లాట్ భైరవ్ – అలయ్‌పూర్

కపాల భైరవ్‌ను లాట్ భైరవ్ అని కూడా పిలుస్తారు. ఇది కాశీకి ఈశాన్య శివార్లలో ఉంది.

కపాల మోచన తీర్థం లేదా కొలను కూడా ఇక్కడే ఉంది. శివుడు తన చేతికి ఇరుక్కున్న బ్రహ్మ తలను ఈ కొలనులోనే వదిలించుకున్నాడని నమ్ముతారు.

8. సంహార్ భైరవ  – గై ఘాట్, పటాన్ దర్వాజా

ఈ ఆలయాన్ని మచోదరి నుండి గానీ లేదా గై ఘాట్ మెట్ల నుండి గానీ చేరుకోవచ్చు. పేరుకు తగ్గట్టుగానే, ఈ భైరవ బాబా పోగు చేసుకున్న పాపాలన్నింటినీ నాశనం చేస్తారు. ఈ యాత్రలో, ఆయనను చివరిలో దర్శిస్తారు, కాబట్టి యాత్ర ముగిసేసరికి మీ పాపాలు తేలికయ్యేలా చూసుకోండి.

కాల భైరవ 
కాశీ కొత్వాల్ 

కాల భైరవుడు రుద్ర యాత్రలో భాగం ఆయన కాశీ కొత్వాల్. కాశీలో ఏ పని చేసే ముందు, తర్వాత అయినా ఈయన ఆశీర్వాదం కోరాలి, కాబట్టి ఈ యాత్రలో ఆయనను దర్శించుకుంటే చాల మంచిది.

Chaitra Purnima - చైత్ర పౌర్ణమి

చైత్ర పౌర్ణమి

పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది. కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చైత్రం మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథినే చైత్ర పూర్ణిమ అని అంటారు. తెలుగు సంవతర్సంలో చైత్రం మొదటి నెల కాబట్టి దీన్నే చంద్రమాసం అని కూడా అంటారు. చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసముండటం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

చైత్ర పూర్ణిమ మహిమ
పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధివిధానంతో పూజలు చేయడంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. చంద్రుడికి వ్రతం చేయడం వల్ల కావాల్సిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తారు.ఈ రోజు గంగానదిలో స్నానం చేయడం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు.పురాణాల ప్రకారం ఈ రోజు తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చని ప్రస్తావించారు.

చైత్ర పూర్ణిమ వ్రత విధానం:
ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు. ఇదే నియమం చైత్ర పూర్ణిమలోనూ వర్తిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ద్వారా ఉపవాసవ్రతమాచరించాలి. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇందుకోసం మీకు కనకధర స్తోత్రం పఠించవచ్చు. అనంతరం రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించాలి. అనంతరం బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయాలి. లేదా పేదవ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని చెబుతారు.

చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తారు. రామాయణం లేదా భాగవత కథను వినలేనివారు ఈ రోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు. పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి.

చైత్ర పూర్ణిమకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: ప్రతి పూజా మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్నే పౌర్ణమి అంటారు. దీనర్థం చీకటిపై కాంతి విజయం సాధించడం. అంటే చెడుపై మంచి విజయం సాధించడం అని అంటారు.

Hamsaladeevi Sri Venugopala Swamy Temple - హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయం

హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయం

కృష్ణానది సముద్రంలో పాలకాయి తిప్ప వద్ద కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారి పోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ప్రబలంగా విన్పిస్తోంది. అలాంటి అత్యంత పవిత్ర స్థలంలో కొలువైవున్నాడు వేణుగోపాల స్వామి.

హంసలదీవిలోని వేణుగోపాల స్వామి మందిరం గాలి గోపురం. శ్రీ వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి కాకపోయినా, అద్భుతమైన మహిమాన్విత వైష్ణవ ఆలయం.

పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకి లాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధిం చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భవించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి.

నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకి వలె ధరించి కృష్ణా సాగ రసంగమ పవిత్ర ప్రదేశం లో మునిగింది. పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం.

ఆలయ విశేషాలు
ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక రాత్రిలో దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం. దేవాలయ నిర్మాణం పూర్తయి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవతలు వెళ్లి పోయారని, అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని చెప్పేవారు. ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. 1977లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు దీన్ని ప్రారంభించారు.మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండ వచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.

క్షేత్రపురాణం
శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రాదుర్భావాన్ని గూర్చి కథ ఒకటి జనశృతిగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవాడట. మేతమేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు. ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక, చెత్తంతా పోగు చేసి పుట్టమీద వేసినిప్పుపెట్టారట. పుట్టలోని స్వామికి వేడితగలడం, ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం, క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది. కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో ఉన్నానని చెప్పడంతో కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరప
ఱ్ఱు వెళ్ళి మునసబు గారి ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకరపర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.గ్రామస్తులు వెళ్లి ఊరేగింపుగా స్వామి వారిని తీసుకొచ్చి ప్రతిష్టించారట. ఆ విగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటున్నది. భిన్నమైన విగ్రహం ఇప్పటిక్కూడా అలంకరించబడిన మూలవిరాట్‌ ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.

ప్రత్యేక పూజలు
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది (తుంగ - భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మాఘ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. మాఘ శుద్ధ త్రయోదశినాడు ఉదయం స్వామివారిని శాస్త్రోక్తంగా పెళ్ళికుమారునిచేసి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమినాడు రథోత్సవం మరుసటిరోజున చక్రస్నానం (వసంతోత్సవం) మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.

సరిగంగ స్నానాలు
ఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదేశంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరేళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిద్ర చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని చెపుతారు. ఆలయం చుట్టూ ఉన్న కుడ్యాలలో ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయానికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణమండపం కన్పిస్తుంది.

ఎక్కడుంది?
కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచి వెంట ఉన్న కాలిమార్గం సముద్రం పోటు సమయంలో అంత క్షేమం కాదు.

దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుండి సుందరమైన సాగర సంగమం దృశ్యాన్ని చూడవచ్చును. పాలకాయతిప్ప వద్ద కృష్ణానదీ బంగాళాఖాతం సాగరసంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు. అక్కడ విహంగ వీక్షణం చేయడానికి వీలూగా నిర్మించిన నిర్మాణం పైకి చేరుకుంటే కృష్ణాజలాలు సాగరంలో కలవడాన్ని చూడవచ్చు.1977 తుఫానులో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

హంసల దీవికి విజయవాడ నుండి, గుడివాడ నుండి బస్సు ద్వారా చేరుకోవచ్చును. కొత్తమాజేరు, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 88 కి.మీ

ఈ దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉంది.

Sree Maha Bhagavathamu Part 10 - శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీరస్తు శీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీకంఠచాపఖండన!, పాకారిప్రముఖవినుతభండన! విలస
త్యాకుత్థ్సవంశమండన!, రాకేందుయశోవిశాల! రామనృపాలా!


శ్రీరామనృపాలా! నీవు శివధనుస్సును విరిచినవాడవు. దేవేంద్రుడు మున్నగు దేవతలచేత ప్రశంసలందుకొన్న యుద్ధవీరుడవు. ప్రకాశిస్తున్న కాకు
త్థ్సవంశానికి అలంకారమైనవాడవు. పరిపూర్ణకాంతితో వెలిగే పున్నమచంద్రుని వెన్నెలవంటి విశాలమైన కీర్తికలవాడవు.

('శ్రీ' కి ఉన్న లక్ష్మి, వృద్ధి, శోభ మొదలైన అనేకార్ధాలో, 'విషం' అన్న అర్థం కూడ ఉంది. శ్రీకంఠుడు అంటే శివుడు. శ్రీని-విషాన్ని-కంఠమునందు కలవాడు.

కకు
త్థ్సడు సూర్యవంశపురాజు. ఇతని మరొక పేరు పురంజయుడు. దేవాసురయుద్ధంలో విష్ణుమూర్తి ఆదేశానుసారం ఇంద్రుడు వృషభమయ్యాడు. పురంజయుడు ఆ వృషభంయొక్క మూపురాన్ని అధిరోహించి రాక్షస సంహారం చేశాడు. కకుదం అంటే ఎద్దుమూపురం. ఎద్దు మూపురాన్ని అధిరోహించినవాడు కనుక కకుత్థ్సడయ్యాడు. ఇతని వంశం కాకుత్థ్సవంశమైంది. ఈ రాజవంశం అయోధ్యను పాలించింది.

అమృత, మానద, పూష తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత-ఈ పదునారు పూర్ణచంద్రుని కళలు.

పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడుప్రశ్న
























శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట





















































Monday, March 30, 2026

Description of Vasudeva's lineage - వసుదేవుని వంశానుక్రమవర్ణనము

వసుదేవుని వంశానుక్రమవర్ణనము

ఓ రాజసింహా! గొప్ప బుద్ధిమంతుడు, నీతిశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంటనే దేవతలు 'అచ్యుతుడైన హరి ఇతనికి పుత్రుడౌతాడు' అంటూ ఆనందించి దేవదుందుభులు మ్రోగించారు. ఆ కారణంగా వసుదేవునికి 'ఆనకదుందుభి' అనే పేరు వచ్చింది.

తన స్నేహితుడైన 'కుంతి' అనేవానికి సంతానం లేదు. ఆ విషయం వసుదేవుడు గ్రహించాడు. తన కుమార్తె పృథను మిత్రుడు కుంతి తనకు కుమార్తెగా ఇమ్మనగా మైత్రితో శూరుడు తన కుమార్తెను కుంతికి ఇచ్చాడు.

వసుదేవుని కుమార్తె పృథ కుంతిభోజుని ఇంట పెరుగుతోంది. ఒకనాడు కుంతిభోజుని ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఈ కుంతి ఆ దుర్వాసునికి కాంతకాలం సేవలుచేసి దేవతలను ఆహ్వానించి రప్పించే విద్యపొంది, ఆ విద్యామాహాత్యం తెలిసికొనే ఉద్దేశ్యంతో ఏకాంతంగా సూర్యుని ఆహ్వానించింది. అతడు రాగా ఆశ్చర్యపడి ఇలా అన్నది.

ఓ దేవా, సూర్యభగవానుడా! మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనే ఆలోచనతో నిన్ను ఆహ్వానించాను. అంతేకాని నీతో పొందు కోరాలని కాదు. కాబట్టి నేను ఆహ్వానించిన తప్పు క్షమించి మరలిపో.

అలా అనగా కుంతికి సూర్యుడు ఇలా బదులిచ్చాడు.

ఓ మానవతీ! నీ మాటలు అలా ఉండనిమ్ము. దేవతలను పిలువడాలు సామాన్యం కాదు. దాపరికం కూడనిది. వేల్పులను పొందటం వ్యర్థం కానిది. నీవు ఇప్పుడు గర్భాన్ని ధరిస్తావు. నీకు పుత్రుడు కలుగుతాడు. నీ కన్యాత్వం పూజింపబడుతుంది. భయపడవలసిన పని లేదు. సిగ్గుపడవద్దు.

సూర్యుడు ఈ విధంగా పృథను ఒప్పించి ఆమెకు గర్భంచేసి ఆకాశానికి వెళ్ళిపోయాడు. 'రెండవ సూర్యుడా' అనే విధంగా పుత్రుని గాంచి పృథ లోకాపవాద భీతితో పుత్రుని గంగలో విడిచి తన తండ్రి గృహానికి వెళ్ళిపోయింది.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ కుంతిని నీ తాత తండ్రి అయిన పాండురాజు పెళ్ళి చేసికొన్నాడు. ఆమెకు పాండురాజువల్ల ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలైన శ్రుతదేవను కరూశ దేశపురాజు వృద్ధశర్మ వివాహం చేసికొన్నాడు. ఆ ఇద్దరికి ముని శాపంవల్ల దంతవక్త్రుడనే రాక్షసుడు పుట్టాడు.

ఆమె తోబుట్టువైన శ్రుతకీర్తిని కేకయరాజు పెండ్లాడాడు. ఆ దంపతులకు ప్రతర్దనుడు మొదలైనవారు ఐదుగురు సుతులు జన్మించారు. వారి సోదరి రాజాధిదేవిని జయత్సేనుడు వివాహం చేసికొన్నాడు. వారిద్దరికి విందానువిందులు జన్మించారు. చేది దేశపురాజైన దమఘోషుడు శ్రుతశ్రవసను పెండ్లాడాడు. వారికి శిశుపాలుడు జన్మించాడు. వసుదేవుని తమ్ముడైన దేవభాగునికి కంస అనే భార్యయందు చిత్రకేతుడు, బృహద్బలుడు జనించారు. వాని సోదరుడైన కంకునకు కంకవల్ల బకుడు, సత్యజిత్తు, పురుజిత్తు అనేవాళ్ళు పుట్టారు.

వాని సోదరుడు సృంజయునికి రాష్ట్రపాలివల్ల వృషుడు, దుర్మర్షణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. వాని తమ్ముడు శ్యామకునికి సురభూమియందు హరికేశుడు, హిరణ్యాక్షుడు పుట్టారు. వాని సోదరుడు వత్సుడు మిశ్రకేశి అనే అప్పరః కాంతవల్ల వృకుడు మొదలైన కొడుకులను పొందాడు.

వాని తమ్ముడు వృకుడు దూర్వాక్షివల్ల తక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మొదలైనవారిని పొందాడు. వాని సోదరుడు అనీకుడు కర్ణికవల్ల ఋతధాముడు జయుడు అనే సుతులను పొందాడు. వసుదేవునికి రోహిణి గర్భంలో బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మొదలైన సుతులు కలిగారు.

పౌరవియందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మొదలైన పన్నెండుమంది పుత్రులు మదిర గర్భంలో నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు మొదలైన కొడుకులు ఉద్భవించారు. 

ఇళయందు యదుప్రముఖులైన ఉరువల్కలాదులు, ధృతదేవయందు త్రిపృష్ఠుడు, శాంతిదేవాత్మజయందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు అనేవారు, ఉపదేవయందు కల్పవృష్టి మొదలైన పదిమంది, శ్రీదేవయందు వసుహంస, సుధన్వ మొదలైనవారు ఆరుగురు, దేవరక్షితయందు గదాదులు తొమ్మిదిమంది, సహదేవయందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనే ఏడ్గురు పుట్టారు ఇంకా

దుష్టజనశిక్షణ, శిష్టజనరక్షణ చేయడంకొఱకు గుణోన్నతుడై విష్ణువు దేవకికి అష్టమగర్భంలో జన్మించాడు.

ఓ రాజా! దేవకి విష్ణుమూర్తిని కన్న తరువాత మంగళప్రదురాలైన సుభద్రను కన్నది. ఆమె అర్జునుని భార్య కావడంవల్ల ఆ సుభద్ర నీకు ముత్తవ్వ అవుతుంది.

లోకాధీశుడైన హరి తాను ఈశ్వరుడైనప్పటికీ లోకంలో ధర్మలోపం జరిగినపుడు, పాపం పెరిగినపుడు తనను తాను సృష్టించుకొంటాడు.(యదాయదాకి ధర్మస్య... భగవద్గీత)

ఓ రాజా! తన మాయావిలసనం తప్ప ప్రకృతికి అతీతుడై, మహాత్ముడై, ప్రభువై ఆత్మకర్త ఐన విష్ణుమూర్తికి జన్మములకుగాని, కర్మములకుగాని కారణం ఉంటుందా?

ఆలోచించగా ఎవని మాయావిలాసాలు ఈ జీవులకు పుట్టుక, వృద్ధి, లయం, కలిమి, దయ, మోక్షాలకు కారణభూతమై ఉన్నాయో అలాంటి

అటువంటి సర్వేశ్వరునికి పుట్టుట మొదలైన అస్వతంత్రభావం ఎక్కడ ఉంటుంది? (ఉండదు.. రాక్షసరాజులు రాజచిహ్నాలతో సేనాధిపతులై భూమిమీద జన్మించి, జనులను బాధిస్తున్న వేళ, వారిని అదుపు చేయడానికి, బలరామునితో ప్రభవించి, దేవతలు మనసుతో కూడా లెక్కించడానికి వీలులేనన్ని క్రియలుచేసి, కలియుగంలో జన్మించే మానవులకు కలిగే దుఃఖం, శోకం, తమస్సునూ (దుఃఖశోకాలనే చీకట్లను) పోగొట్టి, భూభారాన్ని తొలగించి, అన్నిదిక్కులా స్వచ్చమైన కీర్తులు వెదజల్లి విష్ణువు ప్రకాశించాడు.

ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టాడు. వ్రేపల్లెలో పెరిగాడు. శత్రుసంహారం చేశాడు. పదహారువేల ఎనమండుగురు భార్యలను పెండ్లాడాడు. వందల పుత్రులను కన్నాడు. ఆదిపురుషునిగా తనను గుర్తించి శరణన్నవారిని కరుణించాడు. కురుపాండవుల యుద్ధంలో అందరిని చంపి అర్జునునకు విజయం చేకూర్చాడు. ఉద్దవునకు తత్త్వబోధ చేశాడు. మగధ, పాండవ, సంజయ, మరు, దశార్హ, భోజ, వృష్ణి అంధకులు మొదలుగా గలవారిచే పూజింపబడ్డాడు. భూభారం తొలగించాడు. ఈ భూలోకంలో ఉండుటకు ఇష్టపడక స్వస్వరూపమైన ఆదినారాయణ మూర్తిలో కలిసిపోయాడు.

ఓ రాజా! విష్ణుమూర్తి కీర్తి అనే గంగామృతాన్ని తమ చెవులనే దోసిళ్ళతో ఎవరు త్రాగుతారో వారి కర్మలు మొత్తం నశిస్తాయి.

ఓ పరీక్షిన్మహారాజా! పద్మాక్షుడైన విష్ణుమూర్తియొక్క చిరునవ్వుతో గొప్ప కుండలాల కాంతితో ప్రకాశించే చెక్కిళ్లతోకూడిన ముఖాన్ని చూస్తూ స్త్రీలు, పురుషులు తమకు రెప్పపాట్లు ఉన్నందుకు బాధపడతారు.

నగుమోము, చక్కని నడుము, నీలదేహం, లక్ష్మికి నిలయమైన వక్షఃస్థలం, దీర్ఘబూహువులు, ప్రకాశించే కుండలాలతో కూడిన చెవులు, మదించిన ఏనుగు నడక, నల్లని కురులు, దయారసంతో నిండిన చూపులు గల విష్ణుమూర్తి కనులు మూసినా, తెరిచినా కనుపించుగాక.

అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో వచించి

జానకీ హృదయచోరా! తండ్రి ఆజ్ఞను శిరసావహించి అడవులు, పర్వతాలు తిరిగినవాడా! ప్రజలకు కల్పవృక్షమా! జనకుడు మొదలైన రాజులను మించిన చక్కని ప్రవర్తన గల ఓ రామచంద్రా!

జగద్రక్షకా! శత్రునిర్మూలకా! సుగుణవనములందు విహరించువాడా! సుందరీ హృదయచోరా! పుణ్యజనపరిపోషా! పరాక్రమ విద్యాప్రియా! గురుహృదయానందకారీ! నిరంతర సత్యభాషణ తత్పరా!

॥ శ్రీకృష్ణార్పణమస్తు 

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...