Wednesday, August 19, 2026

Sridevibagavatham - Phalashruthi - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శౌనకాది మహామునులారా! మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది. ఆదిలో ఈ దేవీభాగవతం సాక్షాత్తూ జగదంబికా ముఖపద్మంనుంచి అర్ధశ్లోకాత్మకంగా ఆవిర్భవించింది. 

వేదసారంగా వటపత్రశాయికి ఉపదేశించింది. అటుపైని దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు. దాని సారమంతా ఒకచోటికి చేర్చి పద్దెనిమిదివేల శ్లోకాలూ పన్నెండు స్కంధాలుగా సంగ్రహపరచి శుకుడికోసమని వ్యాసుడు ఉపదేశించాడు. 

ఇదీ దీని చరిత్ర. అలనాటి ఆ శతకోటి విస్తర దేవీమహాభాగవతం నేటికీ దేవలోకాన బహుళప్రచారంలో ఉంది.

మహామునులారా! ఈ దేవీభాగవతంతో సాటివచ్చే మరొక పవిత్రగ్రంథం ఈ సృష్టిలోనే లేదు. ఇది సర్వపాపవినాశకం. ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధఫలం దక్కుతుందంటే అది స్తవం కాని వాస్తవం. పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాద్యాభరణాలతో అర్చించి సంతుష్టిపరచి వ్యాసుడిగా సంభావించి అతడి నోటినుంచి ఏకాగ్రచిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారూ నిజహస్తాలతో లిఖించినవారూ పఠించినవారూ లిఖింపజేసినవారూ సర్వకిల్బిషవిముక్తులై సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకలసమృద్దులతో నిండు నూరేళ్ళు జీవించి కట్టకడపట మణిద్వీపం చేరుకుంటారు. 
తరతరాలనూ తరింపజేస్తారు. 

పురాణ శ్రవణం పూర్తయ్యాక ప్రౌష్టపదీ పూర్ణిమనాడు పౌరాణికుణ్ణి సత్కరించాలి. బంగారంతో సింహప్రతిమ తయారుచేయించి ఇవ్వాలి. దక్షిణగా కపిలగోవును(పాడిఆవును) దూడతోసహా సమర్పించాలి. బంగారు గొలుసుతో అలంకరించి మరీ ఇవ్వాలి. అధ్యాయసంఖ్యకు సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి. 

అంతేసంఖ్యలో సువాసినుల్నీ కుమారీముణుల్నీ వటువుల్నీ అర్చించాలి. దేవీబుద్దితో వీరిని వస్త్రాభరణ పుష్పమాలికలతో పూజించాలి. పాయసాన్నాలు పెట్టాలి. ఈ పురాణగ్రంథాన్ని ఎవరికి దానం చేసినా భూదానఫలం దక్కుతుంది. ఇహలోకంలో సుఖంగా జీవించి అంతంలో దేవీపట్టణం చేరుకుంటారు. 

నిత్యమూ దేవీభాగవతాన్ని. పఠించేవారికీ వినేవారికీ ఎప్పుడూ ఎక్కడా అసాధ్యమంటూ ఎదీ ఉండదు. పరాజయం అనే మాటకూడా వినిపించదు. అపుత్రకులకు సంతానప్రాప్తి, నిర్ధనులకు ధనలాభం, విద్యార్థులకు విద్యాలబ్దితోపాటు కీర్తి - కలుగుతాయి. 

వంధ్యగానీ కాకవంధ్యగానీ మృతవంధ్యగానీ వింటే ఆ దోషాలు తొలగిపోతాయి. ఇంటిలో నిత్యమూ ఈ గ్రంథాన్ని పూజిస్తే చాలు లక్ష్మీదేవి ఇక ఆ ఇంటిని విడిచి పెట్టదు. బేతాళ డాకినీ రాక్షసాదులు అటువైపు తొంగిచూడటానికి సైతం భయపడతారు. జ్వరంతో బాధపడేవారిని స్పృశించి ఈ పురాణాన్ని మండలంరోజులు పఠిస్తే జ్వరముపశమిస్తుంది. 

నూరుసార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుంది. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యాసమయంలో పారాయణచేసిన వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. శరన్నవరాత్రుల్తా పఠిస్తే జగదంబిక సంతోషించి కోరినదానికన్నా వెయ్యి రెట్టుగా వరాలు కురిపిస్తుంది.

శైవులు పఠిస్తే పార్వతి, వైష్ణవులు పారాయణచేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు. సౌరమతంవారూ గాణపత్యులూ ఎవరు పఠించినా వారి ఇష్టదేవత ఆనందిస్తుంది. వైదికులు గాయత్రీదేవి ప్రీతికోసం తప్పకుండా దీన్ని పఠించాలి. ఎవరు ఏ ఉపాసన చేసినా అది శక్తి ఊపాసనమే అవుతుంది. 

కనక ఆ శక్తి సంతుష్టికోసం ఈ భాగవతాన్ని పారాయణ చెయ్యవలసిందే. చదువురానివారూ చదవలేనివారూ చదవరానివారూ పురాణశ్రవణం చేస్తే చాలు. వారికీ అంతపుణ్యమూ లభిస్తుంది. ఇది నిర్ణయం. ఇది నిశ్చయం. ఇది నిస్సందేహం. 

శౌనకాది మహామునులారా! ఊరికే వెయ్యిమాటలు ఎందుకుగాని సారాంశమేమిటంటే - ఇది వేదసారం. వేదపఠన సదృశం. వేదశ్రవణ సమానం. సచ్చిదానందరూప గాయత్రీప్రతిపాదిత హ్రీమయి ఆ మహాదేవి మనకు సద్బుద్దివైభవాన్ని ప్రసాదించుగాక!

సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితామ్‌ ।
నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్‌ ॥

సూతమహర్షి కన్నులు ముకుళించి దేవిని ధ్యానిన్తూ నమస్కరించాడు. నైమిశారణ్యవాసులు శౌనకాది మహామునులు ఆనంద పారవశ్యంనుంచి మెల్లగా తేరుకున్నారు.

సూతమహర్షిని శ్రద్ధాభక్తులతో ఘనంగా సత్కరించారు. అందరూ ప్రసన్న హృదయులయ్యారు. దేవీపాదాంబుజార్బకులయ్యారు. ఈ పురాణ శ్రవణ ప్రభావంతో అందరూ పరనిర్వృతిని (బ్రహ్మానందాన్ని) పాందారు. అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టామో శ్రమపెట్టామో క్షమించమంటూ సూతుణ్ణి బతిమాలుకున్నారు. లెంపలు వేసుకుంటూ మళ్ళీమళ్ళీ నమస్కరించారు. 

సంసారసముద్రాన్ని దాటించేందుకు మాపాలిటి నావవు నువ్వేనని మ్రొక్కారు. 

అంబాచరణకమలభృంగాయమాణుడు సూతుడు సంతోషించి. అందరినీ ఆశీర్వదించి పునరాగమనాయ చ అని వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు.

శ్రీదేవీభాగవతం సంపూర్ణం






Janamejayudiki Manashanthi - జనమేజయుడికి మనశ్శాంతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - జనమేజయుడికి మనశ్శాంతి

జనమేజయా! నారదుడికి నారాయణమహర్షి చెప్పినదంతా నీకు నేను చెప్పాను. నువ్వు ఆడిగినదంతా వివరించాను. మహాద్భుతమైన ఈ మహాదేవీ పురాణాన్ని విన్నవారందరూ కృతకృత్యులవుతారు. దేవికి అత్యంతప్రియతములవుతారు. 

కనక నువ్వుకూడా దేవియజ్ఞం చెయ్యి. నీ పూర్వీకులను ఉద్ధరించు. నీ తండ్రిపొందిన దుర్గతికి అసలే ఖిన్నుడవై ఉన్నావు కనక దేవీయజ్ఞం నిర్వహించి పరీక్షిత్తుకు ఉత్తమగతులు కల్పించు. మహాదేవీమంత్రం నీకు ఉపదేశిస్తాను. గ్రహించు. విధివిధానంగా జపిస్తే జన్మ సఫలమవుతుంది. -' అన్నాడు వ్యాసభగవానుడు.

శౌనకాది మహామునులారా! ఈ మాటవిన్న జనమేజయుడు సంబరపడి పరిశుద్ధుడై ఆ మునీశ్వరుణ్ణి ప్రార్థించి దేవీప్రణవసంజ్ఞకమైన మహామంత్రాన్ని దీక్షావిధితో ఉపదేశం పొందాడు. 

నవరాత్రి సమయంలో ధౌమ్యాదిమహర్షులను ఆహ్వానించి దేనికీ లోభించకుండా మహాదేవీ యజ్ఞం నిర్వహించాడు, బ్రాహ్మణులను రావించి ఈ దేవీభాగవత పురాణ పారాయణ జరిపించాడు. 

సువాసినీ పూజలూ కుమారీపూజలూ బ్రహ్మచారిపూజలూ అసంఖ్యాకంగా చేశాడు. బ్రాహ్మణులకు అన్నసంతర్పణ జరిపాడు. దీనులకూ అనాథులకూ పుష్కలంగా ధన కనక వస్త్రాదులను కానుకలుగా సమర్పించాడు. యజ్ఞం ముగిసింది. 

జనమేజయుడు సంస్థానంలో కొలువుతీరాడు. ఆకాశంనుంచి నారదుడు ఆవతరించాడు. మహతి మోగించుకుంటూ వచ్చాడు. ప్రకాశిస్తున్న అగ్నిశిఖలాగా ఉన్నాడు. నారదుణ్ణి చూడటంతోనే మహారాజు హడావిడిగా అభ్యుత్థానం చేశాడు. స్వాగతంపలికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి సముచితాసనం మీద కూర్చోబెట్టాడు. కుశలప్రశ్నలు అయ్యాయి.

మహర్షీ! నీ రాకతో ధన్యుణ్ణి అయ్యాను. సనాథుణ్ణి అయ్యాను. ఆజ్ఞాపించు - ఏమి చెయ్యమంటావో! 

మహారాజా! ఇవ్వేళ దేవలోకంలో ఒక వింత చూశాను. ఆశ్చర్యంనుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము, ఆ విశేషం నీకు చెప్పి వెడదామనిపించి వచ్చాను. దుర్గతిని పాందిన నీతండ్రి ఇవ్వేళ దివ్యరూపం ధరించి స్వర్గంలో కనిపించాడు. దేవతలూ అప్సరసలూ అతణ్ణి స్తుతిస్తున్నారు. 

దివ్యవిమానం అధిరోహించాడు. మణిద్వీపానికి తరలివెళ్ళాడు. ఇదంతా దేవీభాగవతశ్రవణంవల్ల కలిగిన పుణ్యఫలం. నువ్వు నిర్వహించిన మహాదేవీయజ్ఞానికి వెంటనే దక్కిన పుణ్యం. నీతండ్రి దుర్గతినుంచి విముక్తుడై సుగతిని పొందాడు. 

ఇలా కన్నతండ్రికి సద్గతి కల్పించి కృతకృత్యుడవయ్యావు. నువ్వు ధన్యుడవు. నిజంగా నీ జీవితం సఫలం. తండ్రిని నరకంనుంచి ఉద్ధరించావంటే నువ్వు కులభూషణుడివి. ఇవ్వేళ దేవలోకంలో నీకీర్తి మారుమ్రోగిపోతోంది. సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెబుదామనీ, నువ్వూ ఆనందిస్తావనీ వచ్చాను.

నారదుడి మాటలు వింటూంటే జనమేజయుడికి తనువు పులకించింది. కన్నుల్లో ఆనందబాష్పాలు తాండవించాయి. ఆపుకోలేక వ్యాసభగవానుడి పాదాలమీద సాష్టాంగపడ్డాడు. 

మహానుభావా! ఇది ఆంతా నీ అనుగ్రహమే. నన్ను కృతార్థుణ్ణి చేశావు. నమస్కరించడం తప్ప నేను చెయ్యగలిగివ ప్రత్యుపకారం ఏదీ లేదు. ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించు. 

జీరవోయిన గొంతుతో ఇలా పరవశించి పలుకుతున్న జనమేజయుణ్ణి మనసారా ఆశీర్వదించి తల నిమిరాడు వ్యాసుడు. రాజా! అన్ని బంధనాలనూ తెగతెంపులు చేనుకుని దేవీపాదపద్మాలను నిరంతరం సేవించు. ధ్యానించు. ఉపాసించు. 

దేవీభాగవతాన్ని రోజూ పారాయణగా పఠించు. అంబాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో చెయ్యి. చేయించు. నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది. భవబంధనాలు తమంతట తామే తెగిపోతాయి. హరి-హరుల పురాణాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కలిపివా ఈ దేవీ భాగవత మహిమలో. పదహారవవంతుకైనా సాటిరావు. ఇది నిజం. ఇది అఖిలవురాణసారం. అఖిలవేదసారం.

మూలప్రకృతిని ప్రతిపాదించేది కనక ఇదొక్కటే నిజమైన పురాణం. మిగిలినవన్నీ నామమాత్రపురాణాలు. దీన్ని చదివితే వేదపఠనఫలం దక్కుతుంది. కనక ఇదొక్కటే పండితులకూ పామరులకూ జ్ఞానులకూ యోగులకూ ముముక్షువులకూ - అందరకూ అవశ్యపఠనీయం. మరచిపోకుసుమా! ఇక మరి నేను వెళ్ళివస్తా. 

నీకు శుభమగుగాక! - అని పలికి వ్యాసుడు నిర్మమంగా నిష్క్రమించాడు. నారదుడూ దీవించి వెళ్ళిపోయాడు. ధౌమ్యాది మహర్షులు సెలవు తీసుకున్నారు.

అందరూ తమ తమ ప్రదేశాల్లో ప్రాంతాల్లో దేవీభాగవత ప్రశంసలు చేశారు. పారాయణలు జరిపారు. జనమేజయుడు రోజూ పఠిస్తూ పఠింపజేసి వింటూ సంతుష్టుడై రాజ్యపరిపాలన ధర్మబద్ధంగా సాగించాడు.

శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి





Chintamani Gruham - Srimatha - చింతామణి గృహం - శ్రీమాత

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - చింతామణి గృహం - శ్రీమాత

జనమేజయా! అదే దేవీసదనం. వేయిస్తంభాల మండపాలు నాలుగు ఉంటాయి. శృంగారమండపం - ముక్తిమండపం - జ్ఞానమండపం - ఏకాంతమండపం అని వరసగా వాటిపేర్లు. 

ఆనేక వితాన సంయుక్తాలు(మేల్కట్టులు). అనేక ధూప పరిధూపితాలు. కాంతిలో కోటిసూర్యసమానాలు. ఆ శుభమండ పాలకు చుట్టూ కాశ్మీరవనం. మల్లికావనం. కుందవనం. వాటిలో అసంఖ్యాక కస్తూరిమృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. 

ఆక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణం. దానికి రత్ననిర్మిత సోపానపంక్తి. అందులో మహాపద్మవనం. పద్మాల పై ముసురుకొనే గండుతుమ్మెదలు. వాటి ఝంకారాలు. హంసకారండవాది జలపక్షి బృందాలు. వాటి కలకూజితాలు. దిక్తటాలకు వ్యాపించే సుమధుర పద్మపరిమళం. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా ఘుమఘుమలాడుతూ ఉంటుంది.

శృంగారమండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూంటుంది. ముక్తిమండపంలో తపస్వులకూ దేవీ ఆరాధన తత్పరులకూ యోగులకూ ముక్తి ప్రసాదిస్తూంటుంది. మూడవ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తుంటుంది. నాల్గవ ఏకాంత మండపంలో మంత్రిణులతో కలిసి నిత్యమూ జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూంటుంది.

జనమేజయా! చింతామణి గృహంలో పది సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తితత్త్వాలు పదీ - పది సోపానాలు. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నల్గురూ దానికి ఖురాలు(కోళ్ళు). ఫలకమేమో సదాశివుడు. దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లు తుంటాడు. మహాదేవియే విలాసార్థం ద్విధాభూత(రెండుగా) అయ్యిందని తెలునుగదా! 

సృష్టికి ఆదిలో ఇతడే తదర్ధాంగ మహేశ్వరుడు. కందర్ప దర్పనాశకుడు. కోటి కందర్ప సుందరుడు. పంచవక్త్రుడు. త్రినేత్రుడు. మణిభూషణ భూషితుడు. పరశు - హరిణ - వరద - అభయహస్తుడు. పదహారేళ్ళ పడుచువాడు. మహాసర్వేశ్వరుడు. కోటి సూర్యప్రతీకాశుడు. కోటిచంద్ర సుశీతలుడు. శుద్ధస్పటిక సంకాశుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి.

నవవిధ రత్నాలు పొదిగిన కాంచీదామం(వడ్డాణం). మేలిమిబంగారంలో వైదూర్యాలు తాపించిన అంగదాలు. శ్రీచక్రరూపంలో ఉండే తాటంకాలు. వాటి తళతళలతో మెరిసిపోతున్న ముఖపద్మం. అర్జచంద్రరేఖను జయించే నెన్నొసలు. దొండపండుల్లాంటి పెదవులు. కస్తూరీకుంకుమతిలకాలు దిద్దుకున్న ఫాలభాగం. శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి. ఉదయభానుబింబంలాంటి నాసాభరణం(ముక్కుపుడక). మేలిముత్యాలు వేలాడుతున్న చింతాకపతకం. చందనం కర్పూరం కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలం.

విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూంటుంది. శంఖంలాంటి మెడ. దానిమ్మగింజల్లాంటి పలువరుస. అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు. మదించిన తుమ్మెదలు(వంటి) కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మం.

ఏనాడూ క్షీణించని - మచ్చలేని చందమామలాంటి ముఖం. జాహ్నవీజలావర్తం(నీటిసుడి) వంటి పొక్కిలి. మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరాలు అన్నివేళ్ళకూ. పద్మపత్రాలలాగా ముచ్చటైన మూడుకన్నులు. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరీశరీర కాంతికి సాటిరావచ్చు.

చేతులకు రత్నకంకణాలు. వాటికి రత్నకింకిణులు(చిరుమువ్వలు). మెడలో ముత్యాలదండలు. మణిహారాలు. వాటికి అందాల పతకాలు. రత్నాంగుళీయకాల కాంతులతో రత్నకంకణాల ప్రభలతో ధగధగలాడుతున్న చేతులు. 

అమ్మవారు ధరించిన కంచెలకు (రవిక) రత్నాల బుటాలు. మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాశం. అందులో తురిమిన మళల్లెచెండ్లు. వాటికోసం మూగుతున్న తేటిపిండ్లు (తుమ్మెదగుంపులు).

సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలస - ఆ శివ. పాశాంకుశవరదాభయ హస్తచతుష్టయవిరాజిత - ఆ సురపూజిత. సర్వశృంగారవేషాఢ్య. సుకుమారాంగవల్లరి. సౌందర్యధారాసర్వస్వ. అనిర్వ్యాజ కరుణామయి. నిజసల్లాపమాధుర్య తిరస్కృతకచ్చపి, కోటీందు కోటీనకాంతిమయి. సఖీజన - దాసీజన - దేవాంగనా - దేవతాబ్బంద పరివేష్టిత.

ఇచ్చా జ్ఞానక్రియా శక్తిత్రయ సమన్విత. లజ్జ - తుష్టి - పుష్టి - కీర్తి - కాంతి - క్షమ - దయ - బుద్ధి - మేధ - స్మృతి - లక్ష్మి - వీరు అక్కడుండే దేవాంగనలు. జయ - విజయ - అజిత - అపరాభిత - నిత్య - విలాసిని - దోగ్ద్రి - అఘోర - మంగళ - ఈ తొమ్మిదిమంది పీఠశక్తులూ పరాంబికను సేవిస్తుంటారు.

పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ - పద్మనిధులు రెండు ఉంటాయి. వాటినుంచి నవరత్నవాహిని కాంచనవాహిని సప్తధాతువాహిని అనే నదులు వెలువడుతుంటాయి. ఇవి సుధాసముద్రంవరకూ ప్రవహించి అందులో లీనమవుతాయి.

భువనేశ్వరీదేవి తన వామాంకభాగాన విరాజిల్లుతోంది. కాబట్టే మహేశుడికి సర్వేశత్వం సిద్ధిస్తోంది. జనమేజయా! ఆ చింతామణిగృహం సహస్రయోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూంటుంది. 

మహాప్రళయంలోగాని పునస్సృష్టిలోగానీ అవసరాన్నిబట్టి ఇది సంకోచ - వికాసాలు (పటవత్‌) నిత్యం పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తోంది కనక శాలలన్నింటిలోకీ ఈ చింతామణి గృహమే కాంతిపరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ - నాగ - మనుష్యజాతుల దేవీ ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే.

దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికీ దేవీ నిరంతరార్చన తత్పరులకూ గమ్యం ఇదే. ఇక్కడ దేవి మహోత్సవస్వరూపిణి. ఘృత - దుగ్ధ - దధి - మధుకుల్యలేకాక ద్రాక్షారస - జంబూరస - ఆమ్రరస - ఇక్షురస జీవనదులు వేలసంఖ్యలో ప్రవహిస్తుంటాయక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే (కోరికలను ఫలింపజేసే) వృక్షాలూ వాపీకూపతటాకాలూ కోకొల్లలు. 

అన్నీ ఇష్టపాన ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించేవారికి రోగాలుగానీ జుట్టునెరిసే ముసలితనంగానీ ఏనాటికీ రావు. చింతలులేని కామక్రోధమాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యౌవనులే. స్త్రీ సహితులే. సహస్రాదిత్య వర్చసులే. శ్రీభువనేశ్వరిని సతతమూ భజిస్తూ ఉంటారు. 

వారిలో కొందరు సాలోక్యం పొందితే, కొందరు సామీప్యాన్నీ, కొందరు సారూప్యాన్నీ, కొందరు సాన్నిధ్యాన్నీ పొందుతున్నారు. ప్రతిబ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తుంటారు. సప్తకోటి మహామంత్రాలూ సకలమహావిద్యలూ రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను ఆ శివను ఆ కారణ బ్రహ్మరూపను ఆ మాయాశబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి.

మహారాజా! మహత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్యచంద్రులుగానీ కోటి మెరుపులుగానీ, కోటి ఆగ్నులుగానీ దాని కాంతిలో కోట్యంశంలో కోట్యంశానికైనా సాటిరావు.

ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాశం. ఒక్కొక్కసారి మరకతచ్చవిమంతం. ఒక్కొక్కసారి విద్యుద్భాను సమచ్చాయం. ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండననిభం. ఒక్కొక్కసారి విద్యుక్కోటి మహాధారాసారకాంతితతం. ఒక్కొక్కసారి సిందూరనీలేంద్రం. ఒక్కొక్కసారి మాణిక్య సదృశచ్చని. 

హీరసార మహాగర్భ ధగద్ధగితదిక్తటం.. దావానలసమం. తప్తకాంచనసన్నిభం. చంద్రకాంతమణి కాంతితుల్యం. సూర్యోద్గారసమం. దాని శృంగాలూ ప్రాకారగోపురాలూ(బురుజులు) రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నపత్రాలు, రత్నఫలాలు. నర్తించే మయూరాలు. మణితధ్వనులు చేసే పావురాలు. కాకలీస్వరాలు వినిపించే కోకిలలు. శుకాలాపాలు - మారుమ్రోగుతుంటాయి. 

తేటనీటితో నిండిన సరోవరాలు. వాటిలో వికసించే రత్నపంకజాలు. శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు. మందమారుతానికి కదలాడుతున్న చెట్లు - ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేద్రియతర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశం. రత్నకాంతులతో ధగధగలాడుతున్న దిగంతాలు. వృక్షలతాకుసుమగంధ పరిపూరితం. ధూపధూపితం. 

రాజా! ఇదీ మహోజ్ఞ్యలమణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీలనుంచి(సోరణగండ్లు) వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలనూ సమ్మోహపరుస్తూంటుంది.

అది ఐశ్వర్యానికి పరకోటి. శృంగారానికి పరాకాష్ఠ. సర్వజ్ఞతకు పరమావధి. తేజస్సుకి పరసీమ. పరాక్రమానికి చివరిమాట. సర్వోత్తమగుణానికి తుదిపలుకు. దయాగుణానికి చివరిపలుకు. బ్రహ్మలోకాంతంవరకూ ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూంటాయి. అది ఆనందానుభవానికి చివరిమెట్టు..

జనమేజయా! ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానం. సర్వలోకోత్తమోత్తమం. దీన్ని స్మరిస్తేచాలు పాపాలు నశిస్తాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగినవారు అక్కడికే చేరుకుంటారు.

ఈ అయిదు అధ్యాయాలనూ సమాహిత చిత్తంతో నిత్యమూ పఠించేవారికి భూతప్రేతపిశాచాది బాధలు ఉండనే ఉండవు. నూతన గృహనిర్మాణ సమయంలో వాస్తుయజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చెయ్యాలి. సకల శుభాలూ కలుగుతాయి. 

జనమేజయుడికి మనశ్శాంతి





Panchabhuta, Aamnaya Devibrndam - పంచభూత, ఆమ్నాయ దేవీబృందం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - పంచభూత, ఆమ్నాయ దేవీబృందం

మరకతసాలం దాటాక ప్రవాళప్రాకారం. దశయోజన సమున్నతం. కుంకుమారుణవర్ణం. కక్ష్యలో అన్ని ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాల స్వామినులుంటారు. 

హృల్లేఖ - గగన - రక్త - కరాళిక - మహోచ్చుష్మ అని వీరి పేరు. పంచభూతసమప్రభలు. పాశాంకుశవరదాభయహస్తలు . అమితభూషణలు. దేవిసమానవేషాఢ్యలు. నవయౌవనగర్వితలు.

ప్రవాళసాలం గడిచాక నవరత్నప్రాకారం. ఇది మహాప్రాకారం. బహు యోజనోన్నతం. కక్ష్యలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవీబృందం ఉంటుంది.

మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే. మహావిద్యామహాభేదాలూ ఉంటాయి. నిజావరణదేవీ బృందంతో నిజభూషణవాహన సహితలై సర్వదేవీ సమూహమూ కోటిసూర్యప్రభలు విరజిమ్ముతూంటుంది. సప్తకోటిమహామంత్రాల అధిష్ఠాన దేవతానీకమూ ఉండేది ఇక్కడే.

నవరత్నసాలం దాటివెడితే చింతామణిగృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేలసంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత - చంద్రకాంత - విద్యుత్కాంతమణి నిర్మితాలు. 

వీటికాంతుల తళత్తళలలో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువూ ఒకపట్టాన కంటికి కనిపించదు.

చింతామణి గృహం - శ్రీమాత





Shatkona Padmam - షట్కోణ పద్మం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - షట్కోణ పద్మం

ముక్తాప్రాకారం దాటాక మరకతప్రాకారం. ఈ సాలమూ దశయోజనోన్నతమే. నానా సౌభాగ్యసంయుక్తం. నానాభోగసమన్వితం. కక్ష్యలో మధ్యభూమీ సదనాలూ సమస్తమూ మరకతమయమే.

ఇక్కడ షట్కోణపద్మం ఉంది. పూర్వకోణంలో గాయత్రీసహితుడై చతుర్ముఖుడు కుండికా - అక్షమాలా - అభయహస్త - దండాయుధధరుడై నివసిస్తుంటాడు. గాయత్రీదేవికూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రీచతుర్ముఖుల సర్వరూపాలూ ఇక్కడే ఉంటాయి. నాలుగు వేదాలూ సకలశాస్త్రాలూ వ్యాహృతులూ స్మృతులూ పురాణాలూ మూర్తిధరించి సేవిస్తుంటాయి. 

నైరృతికోణంలో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి సావిత్రీవిష్ణుమూర్తులుంటారు. వీరి సకలరూపాలూ ఇక్కడే ఉంటాయి. 

వాయుకోణంలో పరశు - అక్షమాలా - వరదాభయదహస్తాలతో సరస్వతీమహారుద్రులుంటారు. వీరి రూపభేదాలూ ఇక్కడే ఉంటాయి. అరవైనాలుగు ఆగమాలు అన్నీ రూపుదాల్చి సేవిస్తుంటాయి. 

ఆగ్నేయకోణంలో రత్నకుంభ - మణికరండాలు ధరించి మహాలక్ష్మీ కుబేరులుంటారు. 

వారుణ మహాకోణంలో(పశ్చిమం) పాశ - అంకుశ - ధనుర్పాణధరులై రతిమన్మథులుంటారు. వివిధ శృంగారభేదాలు మూర్తిధరించి సేవిస్తుంటాయి. 

ఈశాన్యకోణంలో పాశాంకుశధరులై పుష్టివిఘ్నేశ్వరులుంటారు. గణేశవిభూతులన్నీ ఇక్కడే ఉంటాయి.

జనమేజయా! ప్రతిబ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమష్టిరూపాలు వీరందరూ. జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు.

పంచభూత, ఆమ్నాయ దేవీబృందం





Ashta Mantrinulu - అష్ట మంత్రిణులు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - అష్ట మంత్రిణులు

ఇంద్రనీలప్రాకారాన్ని గడిచివెడితే ముక్తామయప్రాకారం. ఎత్తు దశయోజనాలు. కక్ష్యలో సమస్తమూ ముక్తామయం. ఇక్కడ అష్టదళపద్మం ఉంటుంది. ముక్తామణిగణాకీర్ణం. అతివిసృతం. సకేసరం. 

దీనిలో అష్టమంత్రిణులుంటారు. మహాదేవీ సమానాకారాలలో ఆ తల్లి ఆయుధాలు ఎనిమిదింటినీ ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తుంటారు. దేవికి ఇంగితజ్ఞలు. పండితలు. సర్వకార్యనిర్వహణ దక్షలు. స్వామికార్యపరాయణలు. 

దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో నేర్పరులు, అతి సుందరలు. నానాశక్తి సమన్వితలు. ప్రతీ బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతీప్రాణికి సంబంధించిన ప్రతీసమాచారాన్నీ జ్ఞానశక్తితో ప్రతీక్షణమూ తెలుసుకుంటూ ఉంటారు.

మహాదేవికి మంత్రిణులైన ఈ ఎనమండుగురి పేర్లూ ఏమిటంటే - అనంగకుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, ఆనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ.

వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాశ - అంకుశ - వర - అభయహస్తలు. విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తుంటారు.

షట్కోణ పద్మం





shodashadala padmam - షోడశదళ పద్మం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - షోడశదళ పద్మం

వైదూర్యప్రాకారం గడిస్తే ఇంద్రనీలప్రాకారం. ఇదీ దశయోజనోత్తుంగమే. కక్ష్యలో మధ్యభాగమంతా ఇంద్రనీలమణిమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతం. షోడశారం(పదహారు రేకలుంటాయి). షోడశకోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూంటుంది. 

ఇందులో పదహారు శక్తులకూ పదహారు సౌధాలున్నాయి. అన్ని సౌకర్యాలతో అన్ని సౌందర్యాలతో అన్ని సమృద్దులతో తులతూగుతుంటాయి. 

ఈ షోడశశక్తుల పేర్లు ఏమిటంటే - కరాళి, వికరాళి, ఉమ. సరస్వతి, శ్రీ, దుర్గ, ఉష, లక్ష్మి, శ్రుతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. 

వీరంతా నీలమేఘాల్లాగా ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు. ఆఖేటక ధారిణులు (కూడా వేటకుక్కలుంటాయని), యుద్ధప్రియలు. వీరు జగన్మాతకు సేనానులు. ప్రతిబ్రహ్మాండశక్తులకు నాయికలు. 

దేవీశక్తిని ఆవహింపజేసుకుని బ్రహ్మాండాలను క్షోభపెడుతుంటారు. నానా రథసమారూఢలు. నానాశక్తి సమన్వితలు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు.

అష్ట మంత్రిణులు





Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకా...