Monday, April 13, 2026

Chapter 80 Bhudevi prays gods to control population - అధ్యాయము 80 శ్రీభూదేవి తన భారముబాప దేవతలను వేడుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 80

శ్రీభూదేవి తన భారముబాప దేవతలను వేడుట

వ్యాసమునీంద్రు డిట్లనెను :
ఓ రాజా! శ్రీకృష్ణుని మహాద్భుతమైన పవిత్ర చరిత్రము - అతని యవతారములు - శ్రీ త్రిభువనేశ్వరీదేవి మహాద్భుత ప్రతిభలు వెల్లడింతును, శ్రద్ధగ నాలింపుము. 

మున్నొకప్పుడు శాంతమూర్తియగు భూదేవి పాపాత్ముల బరువు మోయలేక కృశించి భయపడి దీనయై యేడ్చుచు గోరూపముతో దేవలోకమున కేగెను. ఇంద్రుడామెను గని, 

ఓ వసుంధరా! ఇపుడు నీకు వచ్చిన భయమేమి? నిన్నెవరు బాధించిరి? నీ కీ తీరని శోక మేల గల్గెను? అనగా 

భూమాత యిట్లనెను: ఓ మానదా ! నీవు నా దుఃఖ బాధలను గూర్చి యడుగుచున్నావు కావున చెప్పెద - వినుము. నేనిపుడు మోయలేనంత బరువు మోయుచున్నాను. మగధపతియైన జరాసంధుడు పాపాత్ముడు. చైద్యుడగు శిశుపాలుడు దుర్మార్గుడు. దుర్దంతుడగు కాశీపతియు దుర్మార్గుడే. బలశాలురైన నరకుడు - రుక్మి - కంసుడు - సౌభపతియగు శాల్వుడు - క్రూరుడగు కేశి - ధేనుకవత్సకులు - వీరెల్లరును పరస్పర విరోధులు - ధర్మహీనులు - పాపమతులు - మదోన్మత్తులు - కాలభయంకరులు - ఇట్టి దురహంకారులచే నేను మిక్కిలిగ పీడింపబడితిని. 

నేను వారి భారము మోయజాలకున్నాను. ఇంద్రా! ఇపుడు నేనేమి చేయుదు? ఎటకేగుదును? అను తీరని చింతతో బాధపడుచున్నాను. నేను మునుపు వరాహరూపము దాల్చిన ప్రభవిష్ణువైన విష్ణునిచే నెక్కువుగ బాధింపబడితిని. అది ఇతర దుఃఖముల కంటె దుఃఖతరమైనది. 

ఎట్లు నీ మున్ను కశ్యపాత్మజుడు దుష్టదైత్యుడు నగు హిరణ్యాక్షుడు నన్ను హరించి సాగరమునందు పడవైచెను. నాడు శ్రీ విష్ణువు వరాహరూపము దాల్చి యా రాక్షసుని జంపి నన్ను సముద్ధరించి నాలోని బాధ దీర్చి నన్ను స్థిరముగ నిలిపెను. హిరణ్యాక్షుచేతను - అతని నుండి రక్షించుటకుగా విష్ణునిచేతను కదల్చబడనిచో రసాతలమున సుఖముగ నుండెడి దాననే కదా! 

ఓ దేవేశా! నేను నే డా దురాత్ముల భారము మోయలేకున్నాను.

ఇక ముం దిరువదెనిమిదవ కలియుగము రాగలదు. అపుడు నేను కడు ఇడుములు వడి వడిగ పాతాళమున కేగుదును. ఓ దేవేశ్వరా! నన్నీ దుఃఖసాగరమునుండి కాపాడి నా భార ముడుపుము. నీ పాదములకు మ్రొక్కుచున్నాను. అన విని 

ఇంద్రుడిట్లనెను : ఓ భూదేవి! ఇపుడు నేను నీ కేమియు సాయము చేయజాలను. నీవు బ్రహ్మను శరణువేడుము. అతడు నీ దుఃఖములు తొలగింపగలడు. అచటికి నేను రాగలను. అను మాటలు విని భూదేవి సత్వరముగ బ్రహ్మలోకమేగెను. ఆమె వెనుక దేవతలతోగూడి దేవేశుడు నరిగెను. 

ప్రజాపతి తనకొరకు వచ్చిన భూదేవిని గని ఆమెరాకకు కారణమును ధ్యానయోగమున గ్రహించి ఇట్లనెను : 

'ఓ కల్యాణీ! భూదేవీ! నీవేల వెతతో గుందుచున్నావు? నీకు గలిగిన శోకమేమి, నిన్నే పాపాత్ముడు బాధించెను? నాకంతయు వెల్లడింపుము'. 

ధరాదేవి యిట్లు పలికెను: ఓ జగత్పితా! పాపిష్టమగు కలియుగము రానున్నది. దానికి భయపడుచున్నాను. అపుడు ప్రజలు పాపాచారులగుదురు. రాజులెల్లరును పరస్పర విరోధులు దురాచారులు గాగలరు. రాక్షసులు వైరభావములతో దొంగతనమునకు పాల్పడుదురు. 

ఓ పితామహా! మహాప్రభు! ఆ దుష్ట నరపతులు నంతమొందించి నా బరువు దింపుము. ఆ రాజుల సైన్యవాహినుల భారముతో నేనెంతయో బాధపడుచున్నారు అను భూదేవి పలుకులు విని 

బ్రహ్మ యిట్లనెను : ఓ క్షమాదేవీ! ఇంద్రునివలె నేను గూడ నీ బరువు దింపజాలను. కనుక దేవదేవుడును చక్రియునైన విష్ణుని సన్నిధి కరుగుదము. జనార్దనుడొక్కడే నీ యీ పాపభారము దింప సమర్థుడు. నీ యీ బాధల గూర్చి నే నింతకు మున్నే యాలోచించుచుంటిని. 

ఓ యింద్రా! నీవును వైకుంఠమునకు రమ్ము అని వేదకర్త పలికి భూదేవి తోడను దేవతలతోడను బయలుదేరెను.

అపుడు బ్రహ్మ హంస వాహనమెక్కి మధుసూదనుని దివ్య ధామమున కరిగెను. అతడా వేదాతీతుని వేద వాక్కులతో నిండైన భక్తి భావములతో నీవిధముగ ప్రస్తుతింప దొడగెను. 

బ్రహ్మ యిట్లనెను : ఓ మహాదేవా! నీవు సహస్ర శీర్షుడవు. సహస్రాక్షుడవు. సహస్ర పాదుడవు. వేద పురుషుడవు. దేవదేవుడవు-సనాతనుడవు-పురుషోత్తముడవు. రమాపతీ! ఈ భూత భావి వర్తమానములు నీవే. నీవే మాకు పూర్వ మమరత్వము ప్రసాదించితివి. ఈ సర్వమునకు కర్తవు-భర్తవు-హరవు నీవే. నీవు సర్వగతివి. నీ వీశ్వరుడవు. ఈ ముజ్జగములందు నీ యిట్టి మహిమ నెవడెఱుగ గలడు, అని యిట్లు బ్రహ్మ ప్రస్తుతింపగ 

శ్రీహరి ప్రసన్నాత్ముడై గరుడారూఢుడై నిర్మలాత్ముడై బ్రహ్మాదులకు దర్శనభాగ్య మొసగెను. హరి వారినెల్లరను స్వాగతము అడిగి వారి రాకకు కారణమడిగెను. 

అపుడు బ్రహ్మ హరికి మ్రొక్కి యిట్టులనెను : జనార్దనా ! నీవీ భూదేవి భారముడుపవలయును. దానికి నీవే సమర్థుడవు. 

దయానిథీ! ద్వాపర యుగము పూర్తికానున్నది. నీవు భూమిపై నవతరించి దుష్టనరపతుల సంహరించి భూభారము దింపుము అన విని 

విష్ణు విట్లనెను : ఈ విషయమున నేనుగాని - బ్రహ్మగాని - శివుడుగాని స్వతంత్రులము గాము. ఇంద్రాగ్నులు - యమ వరుణులు - సూర్యుడు - విశ్వకర్మ - వీరిలో నేయొక్కరును స్వతంత్రులు గారు. ఈ చరాచరాత్మకమైన విశ్వమంతయును యోగ మాయాశక్తి వశమందున్నది. 

ఆ జగదేకమాత యొక్క గుణ సూత్రములలో నీ బ్రహ్మాదిస్తంబ పర్యంతముగల జగమంతయు గ్రుచ్చబడినది. 

ఆ బ్రహ్మాండ జనని స్వేచ్ఛచే స్వతంత్రించి తానేది చేయదలచునో దానిని చేసి తీరును. మే మెల్లర మా చిద్రూపిణి చేతి కీలుబొమ్మలము. నాకే స్వాంతంత్య్రమున్నచో నేను మహా సముద్రములో చేప - తాబేలు - రూపము లేల దాల్తునో నీ మదిలో నీవే యాలోచించుకొమ్ము. 

నేను పెక్కు నీచయోనులందు జన్మించితిని. అట్టి నాకు భోగమేది? సుఖమేది? కీర్తి యెక్కడిది? పుణ్య ఫలితము లెక్కడివి? నేను స్వతంత్రుడ నైనచో వరాహముగ - నృసింహుడుగ - వామనుడుగ - పరశురాముడుగ నేల యవతరింతును? భూమిపై హింసాకర్మమేల యొనర్తును? ఈ గుంటలను కురుక్షేత్రమందలి స్యమంత పంచకమను హ్రదములను నెత్తురు టేర్లతో నేల పరిమార్తును? 

దేవేంద్రా! నేను శ్రీరామావతారమెత్తి దండకవనము చేరితిని. నారచీరలు దాల్చితిని. నేనా విజన ప్రదేశమున సహాయము లేక - దారిబత్తెములేక - లజ్జవదలి - వ్యాధుని వృత్తితో సంచరించితిని. ఆనాడు నన్నేదో తెలియని మాయ యావరించెను. 

కనుకనే బంగారులేడి నిజరూప మెఱుగలేక జానకిని పర్ణశాలలో వదలి జింక వెంట బడితిని. లక్ష్మణుడు గూడ నా యాన దాటి ప్రకృతి గుణములకు మోహితుడై సీతను విడిచి నన్ననుసరించెను. 

కపట వేషధారియగు రావణుడు దొంగసన్యాసి రూపమున వచ్చి వేగమే శోకపీడితురాలగు సీత నపహరించెను. నేనపుడు తీరని దుఃఖార్తితో బావురుమని విలపించుచు వనము వనము గ్రుమ్మరితిని. 

నా కార్యము నెరవేరుటకు సుగ్రీవునితో నేస్తము నెఱపితిని. నే నన్యాయమున కొడిగట్టి వాలి నంతమొందించి యతనిని శాపముక్తుని చేసితిని. వానరుల కండగ నిలిచి లంకను జొచ్చితిని. అట నేనును లక్ష్మణుడును నాగపాశములచే బంధింపబడితిమి. స్పృహదప్పి పడిపోతిమి. మమ్ముగని వానరులు భయ విస్మయములందిరి.

అంతట నాగాంతకుడైన గరుడు డేతెంచి మా నాగబంధములు త్రెంచి మమ్ము విముక్తులనుగ జేసెను. దైవము మమ్మింకేమేమి చేయునో యని నే నపుడు తలచితిని. నాకు రాజ్యము పోయెను. వనవాసము మిగిలెను. తండ్రి వెళ్ళిపోయెను. భార్య హరింపబడెను. సంకట ప్రదమగు సమరము దాపురించెను. 

ఇకముందేమి మూడన్నదోయని తలచితిని. రాజ్యము పోగొట్టుకొనుట కాఱడవుల పాలగుట రాచకూతురు సిరిసంపదలు కోల్పోవుట వీని మించిన దుఃఖము లింకేమి యుండును! నేను వనముల కేగునపుడు నా తండ్రి నాకు చిల్లిగవ్వగూడ ఈయలేదు. ఆనాడు దిక్కులేక కాలినడకతో నిర్ధనుడనై యిల్లు వీడితిని. 

ఆ ఘోరాటవిలో క్షత్రియ ధర్మమునకు స్వస్తి చెప్పి వ్యాధ వృత్తి చేపట్టి పదునాలుగేడు లెటో గడిపితిని. ఆ రావణాసురుడు దైవయోగమున చంపబడెను. నన్ను జయలక్ష్మి వరించెను. తిరిగి సీత తేబడెను. నే నయోధ్య చేరితిని. నే నెన్నియో కష్టము లెదుర్కొని పిమ్మట రాజ్యము బొందితిని. 

కోసల రాజ్యమునకు శాసకుడనై కొన్నేండ్లు సంసార సుఖము లనుభవించితిని. అంతలో నొక లోకాపవాదము తలయెత్తెను. దాని మూలమున సీతను మరల నడవుల కంపితిని. అపుడు మరల మోయరాని భార్యా వియోగ భారము మోయవలసి వచ్చెను. 

ఆ పిమ్మట భూమి జాతయగు సీత భూమిని చీల్చుకొని పాతాళమున కేగెను. ఆ తరువాత కొన్నాళ్ళకు నా తమ్ముల గూడి స్వర్గమును చేరితిని. 

ఇట్లు నేను శ్రీరఘురామావతారమందు స్వతంత్రత లేక నిరంతర దుఃఖము లనుభవించితిని. ఇక నీ భూమిపై స్వతంత్రుడైనవా డెవ్వడుండును? పరతంత్రుని బాధలు పండితులైనవారే పలుక జాలుదురు. 

బ్రహ్మా! వినుము. ఇట్లు నేను పరతంత్రుడను. అటులే యథార్థముగ నీవును రుద్రుడును సకల దేవతలును పరతంత్రులే సుమా!

అధ్యాయము 81 దేవతలు శ్రీ జగదంబను సంస్తుతించుట

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...