Wednesday, April 15, 2026

Chapter 98 Mahishasura sends envoys to Devi - అధ్యాయము 98 మహిషుడు దేవికడకు రాయబారులను పంపుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 98

మహిషుడు దేవికడకు రాయబారులను పంపుట

దూత పలుకులన్నియును విని మహిషుడు వృద్ధామాత్యులను పిలిపించి వారితో నిట్లనెను : మంత్రులారా! మీరాలసింపక విచారించి యిపుడేమి చేయవలయునో తెలుపుడు - ఆ వచ్చిన దేవి దేవతలచే పంపబడిన శాంబరీమాయయా యేమి? మీరాలోచన చేయుటలోను సామాద్యుపాయములు నెఱపుటలోను కడు నిపుణులు. నాకిపుడు కర్తవ్య మెఱిగింపుడు. 

మంత్రులిట్లనిరి : రాజా! పండితులెప్పుడును సత్యము ప్రియము హితకరమునగు పలుకులు పలుకుదురు. ఇష్టము లేకున్నను మందు త్రాగవలయును. అది తుదకు రోగమును పోగొట్టును. అట్లే సత్యము ప్రియముగాకున్నను తుదకు మేలే చేయును. 

రాజా! నిజము నిప్పువంటిది. ఈ లోకమున నిజము పలుకువాడు వినువాడు దాని నంగీకరించువాడు కంటికే కనిపించరు. ఏలన చాలమంది పై తీయగ పలుకువారే యుందురు. ఇపుడీ గహనమగు విచారము విషయమున ఏమని మేమెట్లు చెప్పగలము? ఈ ముజ్జగములందును శుభమేదో అశుభమేదో నిర్ణయించగలవాడెవ్వడు గలడు?' అన 

రాజు ఇట్లనెను : ఇపుడు మీరు మీమీ బుద్ధులకు తోచినట్లు వేరువేరుగ చెప్పుడు. ప్రతివాని భావమును విని తుదకు నేనొక నిర్ణయమునకు వత్తును. కార్యకుశలుడందఱి యభిప్రాయములును వినవలయును. వానిని మాటిమాటి కాలోచింప వలయును. తుదకు వానిలో తనకు మేలని తోచిన దాని నాచరింపవలయును అను నతని మాటలు విని విరూపాక్షుడను నొక బలశాలి వేగమే రాజునకిష్టము గులుగునట్టు లిట్టులనియెను : 

ఆ వచ్చిన తరుణీమణి సామాన్యురాలు - మదగర్వితురాలు. ఆమె మాటలు బెదరింపులుగ నెఱుగుము. ఒక నెలతుక చేతులు-తెంపు-పనికిమాలినవని ఎఱిగిన వాడామె యుద్ధమదమున పలికిన దుర్భాషల కేల జంకును? నీవు ముజ్జగములు గెలిచిన మహావీరుడవు. నేడొక కాంతకు నీవు భయపడినచో నీకింకేమైనా పరువు దక్కునా? నేనిపుడొంటరిగ నేగుదును. ఆ చండితో బోరి యామెను దెగటార్తును. నీవు గుండె నిబ్బరమున నుండుము.

లేదా - సేనతో గూడి యేగి ఆ చండవిక్రమరూపిణిని వివిధ శస్త్రాస్త్రములతో దునుమాడుదును. లేదా సర్పములవంటి పాశములతో బంధించి యామెను నీ చెంతకు దెత్తును. అప్పుడుగాని యామె నీకు వశవర్తిని గాదు - నా బలము నీ కవగతము గాదు అను నతని మాటలు విని 

దుర్ధరుడను వాడిట్లనెను : ధీశాలి యగు విరూపాక్షుడు నిజము పలికెను. ఇపుడు నా చక్కని పలుకును గూడ ధీమంతుడవగు నీవు వినవలయును. నే నా వరారోహను కామాతురనుగ నూహించుచున్నాను. తన రూపముపై విఱ్ఱవీగు నాయిక యిట్లే యుండును. మొదట నిన్నా వరారోహ బెదరించి తన వశము చేసికొన చూచు చున్నది. 

ఒక శృంగార నాయికలోని హావభావములు ఆమెకు తన ప్రియుని యెడ గల వక్రోక్తి భావములు నిటులే యుండును. వానిని రసవిదులలో నుత్తముడగు నాయకుడే గ్రహించగలడు. దీనిని కళాశాస్త్ర కోవిదుడు మాత్రమే యెఱుగును. ఆమె యుద్ధ మధ్యస్థితయై నిన్ను తన వాడి తూపులతో నెదుర్కొందుననెను. ఆమె యీ మాటలు నర్మగర్భితములని హేతువాదు లెఱుంగుదురు. ఇంతి కడగంటి చూపులు తూపులుగ నతిశయిల్లును గదా! 

ఆమె యితర వ్యంగ్య వాక్కులు పూలదోసిళ్ళ వంటివి. కానిచో నీ మీద బాణములు వేసి బ్రదుకు శక్తి హరిమర బ్రహ్మలకుగూడ లేదే! ఆమె పలుకుల సార మేమనగ, నామె తన వాడి చూపుతూపులతో మందుడగు మహిషుని బాధింతుననెను. ఆ వెళ్ళిన దూత సరసుడు గానందున విపరీతముగ భావించెను. ఆమె నీ పతిని రణశయ్యపై పడవైతుననెను గద! ఇట ప్రాణమనగ వీర్యము. దానిని హరించివేయుదునని భావము. అంతేకాని, వేరేమియుగాదు. ఉత్తములగు యువిదలు నరుల నిట్టి వ్యంగ్యములతో నలరింతురు. రసశాస్త్ర వివారదులిట్లు విచారించి తెలిసికొనిరి. ఇంక నామె నిట్టిదానిగ నెఱిగి రసికుడవై వ్యవహరింపుము.

ఆమె యెంతకోపము గలదైనను గర్వము గలదైనను సామదానముల రెంటిచేతనే నీ చేజిక్కును. మఱి దేని వలనను గాదు. నేను నా యీ తీయని మాటలతో నామెను నీ చెంతకు తేగలను. ఆమెను నీ దానిగ జేతును. నే నిపుడే వెళ్ళి యామెను నీ దాసిగ జేతును అను నతని మాటలు విని 

తత్వ వివేకియగు తామ్రుడిట్లనియెను : రాజా ! నయము-ధర్మము-కారణము-రసము గల నా మాటలు వినుము. ఆమె కామపీడితురాలు గాదు. నీయం దనురక్త గాదు. ఆమె పలుకులు వ్యంగ్యములును గావు. ఆ విచిత్రాంగియగు మనోరమ నిరాశ్రయగ నొంటరిగ వచ్చుట చూడగ చిత్రముగ నున్నది. అష్టాదశభుజములు గలిగిన పరాక్రమముగల చండరూప నీ ముల్లోకములలో నెవరును కనివిని యెఱుగరు. ఆమె శక్తిగల దివ్యాయుధములు ధరించినది. 

ఇదంతయు నేదో కాలవైపరీత్యమని తోచుచున్నది. ఈ రేయి నాకు దుర్నిమిత్తములైన కలలు వచ్చినవి. దానిబట్టి నేదో యాపద మూడినదని తోచుచున్నది. ఈ తెల్లవారుజామున నొక యాడుది నల్లచీరకట్టి యింటి ముంగిట నేడ్చుట కలగంటిని. దీన నేదో యశుభము మనకు వాటిల్లునని తెలియుచున్నది. రేతిరి ప్రతి యింట పక్షులు వికృతముగ నరచుచున్నవి. ఇంటింట పెక్కులుపద్రవములు పొడసూపినవి. దీనికి వెనుక నేదో కారణమున్నదని తెలియుచున్నది. 

కనుకనే యామె ముందుగ నన్నియు నిశ్చయించుకొని నిన్ను యుద్ధమునకు పురికొలుపుచున్నది. ఈమె మనుజ-రాక్షస-గంధర్వ కామినులలో నే యొక్కతెయు గాదు. దేవత లెల్లరును మనకు మోహము గల్గించుట కీ రూపు దాల్చిన మాయాశక్తిని పంపిరని యెఱుగవలయును. 

కనుక మనము పిరికితనము వదలి రణమొనర్పవలయును. కానున్నది కాక మానదని నా యభిప్రాయము. దేవతలు గలిగించు శుభాశుభము లెవని కర్థమగును? కనుక పండితులు నిశ్చలబుద్ధితో ధైర్యమూని యుండవలయును. ఈ త్రిభువనములందు ప్రాణుల చావుపుట్టువులు దైవాధీనములు. వాని నెంతటివాడును మార్పజాలడు.

అన విని 

మహిషు డిట్లనెను : తామ్రా ! నీవు పట్టుదలతో రణమునకేగి యామానవతిని ధర్మయుద్ధమున గెలిచి పట్టి తెమ్ము. యుద్ధముచే లొంగనిచో నామెను చంపివేయుము. వశమైనచో చక్కగ నామెతో మర్యాద నెఱపుము. నీవు వీరుడవు. కామశాస్త్ర విశారదుడవు. ఏదోయొక యుపాయమున నామెను లొంగదీయుము. 

మహావీరా! నీ వటకు సేనా సమేతముగ వెడలుము. ఆమె భావమును చక్కగ విచారించి తెలిసికొనుము. ఆమె కామముతో వచ్చెనో వైరముతో వచ్చెనో యెందులకు వచ్చెనో యెవరేని మాయచేసి ప్రయోగించిరో యంతయును నీవెఱుంగుము. మొదట వీనినన్నిటిని నిశ్చయించు కొనుము. ఆమె కోరిక తెలిసికొనుము. ఆ పిదప నీ బలమునకు యోగ్యతకు తగినట్లు యుద్ధము గూర్పుము. అప్రమత్తతతోగాని నిర్దయుడవై కాని యుండకుము. 

ఆమె మన యెడల నెట్లుండునో నీవు నట్లే యామెతో వ్యవహరింపుము అను మహిషుని మాటలు విని తామ్రుడు కాలవశుడై మహిషునకు నమస్కరించి సైన్యముతో తరలెను. 

అతడు త్రోవలో చావు సూచించు దారుణ దుర్నిమిత్తములుగని భయవిస్మితుడయ్యెను. అతడచ్చటికేగి శ్రీదేవిని గాంచెను. ఆమె దివ్యాయుధములు దాల్చి సింహవాహనయై నిఃల సురులచే నుతింపబడుచుండెను. అతడు వినయముతో తలవంచి తీయని మాటలతో నామెకిట్లు పలికెను :

ఓ స్వామినీ ! మా మహిష దైత్యపతి నీ రూప¸°వన గుణములకు పరవశుడై నిన్ను చేపట్టుట కుత్సహించుచున్నాడు. రూపాధికా! విశాలాక్షీ! మహిషు డమర దుర్జయుడు. అతనిని నీ మది నిల్పుము. నందనవనమున నతనితో విహరింపుము. సర్వాంగ సౌందర్యముగల మేను పడసితివి. కనుక నెల్ల విధములు నెల్ల సుఖములకు నెలవైన శాంతి సౌఖ్యము పడయుము. దుఃఖము వీడుము. నీ చేతులు కమలకోమలములు అవి పూబంతులు పట్టతగినవి. వానితో నాయుధము లేల దాల్చితివి? నీ కనుబొమలు మరుని వింటివంటివి. 

ఇంక నీ చేత ధనువేల? నీ కడగంటి వాడిచూపులుండగ తూపులతో ప్రయోజనమేమి? ఈ లోకములో తెలిసినవాడెవ్వడును దుఃఖప్రదమగు యుద్ధ మొనర్పడు. లోభము గలవారే పరస్పరము పోరుదురు. వాడి బాణములతోనే కాదు మెత్తని పూలు తీసికొనియు నెవనితోను పోరు సల్పరాదు. ఏలన, తన మేనునకు బాధ గలుగచుండగ నెవని మది ముదము గల్గును? కనుక నో విచిత్రాంగీ! సుప్రసాదినివి గమ్ము. 

దేవ దానవ పూజితుడగు మా నాథుని నాథునిగ భజింపుము. అట్లు జరిగిననాడు నీ కోరికలెల్ల నీడేరును. నీవతని పట్టమహిషివి కాగలవు. ఇందు సందేహ మెంతమాత్రమును లేదు. వరవర్ణినీ ! నా మాట నమ్ముము. నీకు మంచి సుఖము గలుగును. ఎంత కష్టించినను రణమున జయ మొందుట సంశయింపదగినదే. 

నీవు రాజనీతి తెలిసినదానవు. అతనితో నీవు పెక్కేండ్లు పూర్ణరాజ్యభోగము లనుభవింపుము. మీకొక చక్కని కొడుకు పుట్టును. వాడు రాజు గాగలడు. దీనివలన మీరు ¸యవన మందు సుఖక్రీడల దేలియాడి ముదుసలితనమందును సుఖములందగలరు.

అధ్యాయము 99 మహిషుని మంత్రాలోచనము

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...