Wednesday, April 15, 2026

Chapter 101 Sridevi Tamara Chiksurulanu Teganarukuta - అధ్యాయము 101 శ్రీదేవి తామ్ర చిక్షురులను తెగనఱకుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 101

శ్రీదేవి తామ్ర చిక్షురులను తెగనఱకుట

అట్లు దుర్ముఖుడు చనిపోయిన పిమ్మట మహిషుడు కోపాంధుడై యేమయ్యె నేమయ్యెనని పల్మరు దానవుల నడుగుచుండెను. దుర్ముఖ బాష్కలులు శూరదానవులు. వారొక పడతి చేతిలో రణమున కూలుటయా? ఆహా! దైవమెంత యాశ్చర్యకరమైనదో చూడుడు. నరుడు పుణ్యపాపము లొనర్చుటలో పరతంత్రుడు. కాలము బలవత్తరమైనది. దానినిబట్టి నరులకు సుఖదుఃఖములు గల్గుచుండును. దానవీరు లిద్దఱును రణమున హతులైరి. ఈ సంకటస్థితిలో మీరెల్లరును గలిసి తగిన కర్తవ్యము తెలుపుడు అని బలశాలియగు మహిషుడు పలుకగ 

మహారథుడు సేనాపతియగు చిక్షురు డతనితో నిట్లనియెను : ఒక్క యాడుదానిని చంపుట కింత చింత యేటికి? నే నొక్కడను చాలుదును. ఆమెను చంపుదును అని యతడు రథమెక్కి సేనతో తరలెను. అతని కంగ రక్షకుడుగ మహాబలుడగు తామ్రుడుండెను. అతని సేనాఘోషము వలన దిక్కులు పిక్కటిల్లెను. ఆ వచ్చు వానిని గని దేవి మహాద్భుతభీకరముగ శంఖారవము జ్యాటంకారము ఘంటాధ్వని ఒక్కపెట్టున నొనరించెను. 

ఆ గంభీర భీకరధ్వని వినిన దానవుల గుండె లదరెను. ఈ వింత యెన్నడును మనము గానమనుకొని వారు వచ్చిన దారి పట్టిరి. ఆ పారిపోవు వారిని గని కోపించి చిక్షురుడు వారికిట్లనెను:

మీకు వచ్చిన భయమేమి? చూడుడు. నేనిప్పుడీ మత్తబాలికను హతమార్తును. మీరు భయముపాసి పోరునకు నిలువబడుడు అని పలికి బలశాలియగు చిక్షురుడు చాపము చేబూని సమరమున దుమికి నిబ్బరముతో దేవితో నిట్లు పలికెను: 

తన్వంగీ! విశాలాక్షీ! ఊరక గర్జించి నరుల నేల భయ పెట్టుదువు? నీ చేతలకు నేను జంకువాడను గాను. వామాక్షీ! ఒక యాడు దానిని చంపిన దోషమును నపకీర్తియు గల్గునేమో యని నా మది యుపేక్షించుచున్నది.

సుందరీ! నెఱజాణలు హావభావములతో కడగంటి చూపులతో పోరు సల్పుదురు. నీ వంటి జవరాలికి శస్త్ర యుద్ధము తగదు. నీ వంటి లతాంగిని పూలతోగూడ గొట్టరాదు. మాలతీ మాలలుగూడ నీ వంటివారి మేనులు నొప్పించును. ఇక వాడి ములుకుల సంగతి చెప్పనేల? క్షత్త్రియ జన్మమున బ్రదుకు వ్యర్థము. 

ఈ నీ తనువు మమకారముతో పెరిగినది. దీనిని వాడి శరముల పాలు చేయకుము. తైలాభ్యంగము మృష్టాన్న భోజనము పూలవాసనలు మున్నగు వానిచే నీ శరీరము ముద్దుగ పెంచబడినది. ఇది పరుల బాణములకు గురిగావలసినదేనా? నరులు వాడి కత్తులతో కత్తుకలు కత్తిరించి విత్తము గడింతురు. ఆ పనికిమాలిన డబ్బు వలన దుఃఖమే కల్గును. 

ఇక సుఖమెట్లు గల్గును? వామోరూ! నీవు బవరమే వాంఛించెద వేని నీవు నిజముగ తెలివి మాలిన దానవు. ఈ రణమందేమి సుఖమున్నదని సంభోగ సుఖములు విడనాడుచున్నావు? ఈ యుద్ధమందేమున్నది? గదాఘాతము-ఖడ్గప్రహారము-బాణభేదనము-తుదకు మరణము. అపుడు నక్కలు పీకికొని తినును. 

కవులు ధూర్తులై రణమున చచ్చిన వారికి స్వర్గప్రాప్తి గల్గునని యర్థవాములు పల్కుచు దానిని పొగడుదురు. కనుక నీ నచ్చినచోటి కేగుము. లేక సురమర్దనుడగు మహిష భూపతిని పతిగ భజింపుము. ఇట్లు పలుకు దైత్యునకు జగదంబ యిట్లనియెను. 'ఓరీ మూఢా! నీవు పండితుడు ధీశాలి పల్కినట్లు ప్రజ్ఞావాదములు పల్కుచున్నావు. 

ఆన్వీక్షికీ విద్యను నీతిశాస్త్రమును నీవెఱుగవు. నీవు పెద్దలను సేవింపలేదు. నీకు ధర్మబుద్ధి లేదు. నీవు మూర్ఖుని గొల్చితివి. నీవును మూర్ఖుడవైతివి. రాజధర్మ మెఱిగిన వాడవుగావు. ఐనను నాముందేమేమో ప్రేలుచున్నావు. నే నా మూఢ మహిషుని యుద్ధమందు సంహరింప గలను. ఈ నేలను రక్తసిక్త మొనర్పగలను. 

కీర్తి స్తంభము గట్టిగ బాతి స్వేచ్ఛగ నేగగలను. దేవతలకు క్లేశములు గల్గించిన మదనమత్తుడగు దైత్యు నంతమొందింప గలను. ఇక ప్రలాపములు కట్టిపెట్టి పోరు సల్పుము. మూర్ఖుడా! నీకు నీ మహిషునకు బ్రదుకుతీపి యున్నచో నితర దానవులను వెంటగొని పాతాళ మేగుడు. 

మీ మనస్సులందు చావుకోర్కి యున్నచో శీఘ్రమే యుద్ధ మొనర్పుడు. అందఱి నిపుడే మట్టుపెట్టగలను. ఇదే నా దృఢనిశ్చయము.''

దేవి మాటలు విని దానవుడామెపై మేఘము వర్షించినట్లు బాణములు కురిసెను. వాని బాణముల నెల్ల జగదంబ ఖండించి మరల వాడి యమ్ములతో వానిని ప్రహరించెను. వారి పోరాట మచ్చెరువు గొల్పుచుండెను. వీర రసమున తేజరిల్లు తల్లి వానిని గదతో మోది రథము నుండి క్రింద పడవేసెను. 

ఆ దుష్టుడు గదా ప్రహారము తినియును రెండు మూర్తములు రథము క్రింద పర్వతమువలె మూర్ఛపడియుండెను. అట్లతడు మూర్ఛిల్లుటగని పరబల మర్దనుడగు తామ్రుడు రణ చాపల్యము కొలది చండికతో బోర ముందునకు వచ్చెను. ఆ వచ్చు వానిని గని చండిక పకపక నవ్వి యిట్లనెను: ' దానవ వీరా! రారమ్ము. నిన్నిపుడే యమునింటి కతిథిగ నంపుదను. మీరాయువు తక్కువవారు. దుర్బలులు - మీ రెందులకు వచ్చెదరురా! 

మూర్ఖ మహిషుడు తన యింట తన బ్రదుకు విధము చూచుకొను చున్నాడు! దుర్బలులగు మిమ్ము చంపిన నా శ్రమ యంతయును వ్యర్థమే. లోకంటకుడగు సురవైరి చచ్చిన నాడు నాశ్రమ ఫలించును. మీ రెల్లరేగి మహిషుని బంపుడు. ఆ మందుడు నన్నెట్లున్నదానిని నట్లు చూడగలడు.' 

దేవి మాటలు విని తామ్రు డాకర్ణాంతము చాపము లాగి చండికపై బాణవర్షము కురిసెను. ఓజో బలవతి యగు భగవతియును క్రోధతామ్రాక్షియై తామ్రుని చంపదలచి ధనువులాగి యతనిపై బాణములు వర్షించెను.

అంతలో చిక్షురుడు తెప్పరిల్లి లేచి విల్లమ్ములందుకొని దేవికెట్ట యెదుట నిలిచెను. తామ్ర చిక్షురు లిర్వురు గలిసి మహోత్కటముగ రణమున దేవితో బోరిరి. మహామాయ మహోగ్ర కోపముతో శరవర్షము వర్షించి దానవుల కవలచములు చిల్లులుపడ చేసెను. ఆ వీరులను బాణతాడితులై కోపముతో దేవిపై శరములు విసిరిరి. ఆ యుద్ధము నందు రాక్షసులు శరీరములు వసంత వనమున బూచిన మోదుగు పూల పొలుపు వహించెను. 

తామ్రునితో దేవికి జరిగిన యుద్ధమును మింట చూపఱగు సురలు పరమ విస్మయ మందిరి. తామ్రుడు సింహము తలపై లోహ మయమగు ముసలముతో గొట్టి నవ్వి పెద్దగ నినాద మొనర్చెను. విజయరూపిణియగు దేవి రోషాతిరేకముతో గర్జించు తామ్రుని తలతెగ నఱికెను. తల తెగినను వాడు ముసలము పట్టి క్షణముసేపు గిరగిర తిరిగి నేలకొరిగెను. 

తామ్రుడు పడిపోవుటగని చిక్షురుడు ఖడ్గము బూని వేగముగ చండికపై కురికెను. ఖడ్గపాణియై వచ్చు దానవునిగని దేవి సత్వరమే యైదు బాణములతో వానిని నొప్పించెను. దేవి యొక్క బాణముతో వానిచేతి కత్తిని మరొక శరముతో వాని చేతిని నింకను కొన్ని వాడి యమ్ములతో వాని తల తెగనఱికెను. 

దుర్మదులగు క్రూర దానవులు నిహతులుగాగా తక్కిన సేనలు భయంకంపముతో దిక్కులేక దిక్కులు పట్టెను. వారు రణనిహతులగుట గని మింట నమరులు హర్షమున పూలజల్లు గురిసిరి. జయజయధ్వానము లొనరించిరి. ఋషులు-దేవ-గంధర్వ-వేతాళ-సిద్ధ-చారణలులును సారెసారెకు దేవీ! అంబికా! నీకు జయము జయమని నినాదము లొనరించిరి.

అధ్యాయము 102 శ్రీదేవి యసిలోమ బిడాలులను సంహరించుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...