Wednesday, April 15, 2026

Chapter 104 Mahishasura tells the story of Mandodari to Sridevi - అధ్యాయము 104 మహిషుడు శ్రీదేవికి మందోదరికథ వినిపించుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 104

మహిషుడు శ్రీదేవికి మందోదరికథ వినిపించుట

దానవుని మాటలు విని శ్రీదేవి ఆ మందోదరి యెవరు? ఆమె యెవనిని వదలివేసినది? ఆ శఠు డెవడు? ఆమెకు దుఃఖమెట్లు ప్రాప్తించెను? అంతయు నాకు తెల్పుము అన 

మహిషు డిట్లనెను : మున్ను సింహళమను దేశమీ భూమిపై ధన ధాన్య సంపదలతో విశాల తరువులతో నొప్పుచు వన్నె కెక్కెను. ఆ దేశపాలకుడు చంద్రసేన మహారాజు. అతడు ధర్మరతుడు శాంతుడు దండధరుడు. సత్యవాది-శూరుడు-నీతిసాగరుడు-సహనశీలి-ధనుర్వేదమున ధర్మశాస్త్రమునందు కుశలుడు. 

ఆ రాజు భార్య యందాలరాశి-పతివ్రత-సదాచార. ఆ రాణిపేరు గుణపతి. సర్వలక్షణ సంయుత. ఆమె తొలికాన్పున నొక బాలను గనెను. రాజు తన యందాల గాదిలి కూతును గని యామెకు మందోదరియని పేరు పెట్టెను. ఆ చిన్నారి పాప చంద్రకళవలె దినదిన ప్రవర్థమాన మయ్యెను. ఆమె పదేండ్లకు సౌందర్యరాశిగ చెన్నొందెను. 

అప్పుడు ఆమె తండ్రి యామెకు దగిన వరుని వెదుక నారంభించెను. ఆ నాళ్ళలో మద్ర దేశపతి సుధన్వుడనురాజుండెను. ఆతనికి కంబుగ్రీవుడని తెల్విగని కొడుకుండెను. అతడు తన కూతునకు తగినవరుడని రాజు విప్రులవలన నెఱింగెను. ఆ రాకొమరుడు సర్వలక్షణ సంపన్నుడు సర్వవిద్యాపారగుడనని తెలిసి రాజు తన భార్యతో -

''మన కన్నియను కంబుగ్రీవునకిత్తము అనెను. పతిమాట విని రాణి తన కూతుతో ప్రియము గదురీ నీ తండ్రి నిన్ను కంబుగ్రీవునకీయ నిశ్చయించుకొనెను'' అనెను తన తల్లి మాట విని యాబాలిక యిట్లనెను : 

అమ్మా! నేను పతిని గోరను. నాకు పెండ్లివలదు. ఇట్లే కౌమార వ్రతముతో కాలము వెళ్ళబుత్తును. నేను స్వతంత్రముగ నుందును. ఈ దుస్తర సంసార సాగరమందు పారతంత్య్రము దుఃఖకరము. ఆత్మ స్వాతంత్ర్యమున ముక్తి గల్గునని పండితులు వక్కాణింతురు. కాన ముక్తికి యత్నింతును. నాకిక పతితో బనియేమి? వివాహ మందగ్ని సన్నిధానమున పతి కధీనురాలనుగ నుందునని ప్రతిజ్ఞ చేయవలయును. 

అత్తవారింట నత్తమామలకు బావమఱదులకు లొంగి యుండవలయును. పతిబొందు సుఖ దుఃఖములను బట్టి సుఖదుఃఖము లనుభవింపవలయును. ఇది మిక్కిలి దుఃఖతరము. ఒకవేళ పతి వేరొక కామినిని వలచినచో నపుడు సవతి పోరు ఘటిల్లును. అది ఇంతింతనరానిది. అంత పతిపట్ల నసూయ ఏర్పడును. క్లేశములు గల్గును ఇట్టి సంసారమందు స్త్రీలకు సుఖమెక్కడిది? స్త్రీలు సహజముగ పరాధీనులు. 

ఈ జగమొక పెద్ద కలవంటిది. తల్లీ! తొల్లి యుత్తానపాదునకు ఉత్తముడను కొడుకుండెను. అతడు ధర్మజ్ఞుడు. ధ్రువుని కంటే చిన్నవాడు. అతడు రాజయ్యెను. ఉత్తమునకు పతివ్రతయగు భార్య గలదు. ఆమె నిరపరాధ. ఇట్టి తన భార్యను రాజడవుల కంపెను. పతి యుండగనే భార్య కిట్టి దుఃఖము గల్గుచుండును.

కాలము తీరినచో పతి చనిపోవును. అపుడా స్త్రీ దుఃఖము చెప్పనలవిగాదు. వైధవ్యము శోకసంతాప కారకము. అది దుఃఖమయము. పతి విదేశముల కేగినను స్త్రీకి దుఃఖము గల్గును. ఆమె మదనాగ్ని పీడితురాలైనచో నామెకు పతి సుకమెక్కడిది? కనుక పతిని చేసికొనకూడదు. ఇది నా మతము' 

అను తన కూతు మాటలను రాణి తన భర్త కీవిధముగా చెప్పెను. ఆమెకు పతి వలదట. కౌమార వ్రతమున జప వ్రతము లొనర్చునట. ఆమెకు సంసారము ఇష్టము కాదట. పతి యందు పెక్కు దోషము లుండును. అని యామె పెండ్లి చేసుకొనుట కంగీకరించుట లేదు.' 

రాణి మాటలు రాజు వినెను. తన కూతునకు పెండ్లి యిష్టము కాకుండు టెఱిగి రాజామెకు పెండ్లి చేయలేదు. ఆమె తన తల్లిండ్రుల యింట నుండి వారిచే పోషింపబడుచుండెను. సాధారణముగ స్త్రీలకు కామమును ఉద్దీపింపచేయు ¸యవనాంకురములు కలిగిన తరువాత కూడ మాటి మాటికి తన చెలులెంతగ ప్రేరించినను ఆమె జ్ఞానవిషయములగు మాటలనే ఆడుచుండెను కాని భర్తకావలెనని మాత్రము అనుకొనలేదు. 

ఒకనాడామె వన విహారమునకు వెడలెను. ఆ వనమందు తీవియలు విరియబూచియుండెను. మందోదరిని చెలికత్తెలు సేవించుచుండిరి. ఆ సుముః ప్రేమమీర వన శోభ తిలకించు చుండెను. అట్లు చెలియలు పూలుగోయుచు నామె చుట్టు మూగి యేమేమో పల్కుచుండిరి. 

అంతలోనే దైవయోగమున నచటికి కోసలపతి యేతెంచెను. అతనిపేరు వీరసేనుడు. మహావీరుడు. అతడు ఒంటరియై రథమెక్కి యుండెను. అతని వెంటకొలది సైన్యముండెను. వెనుకనుండి పెద్ద సైన్యము మెల మెల్లగ వచ్చుచుండెను. ఆమె చెలి వీరసేనుని దూరమందుండగనే చూచెను.

ఆమె మందోదరి కిట్లనెను: అదిగో, యొక యందగాడు - రెండవ కాముని వలె చూడనొప్పుచున్నాడు. ఇటే వచ్చు చున్నాడు. నీ యదృష్టమున నతడు రాజే యగునని తలంతుము అని ఆమె అనుచుండగనే యతడెట్ట యెదుటికి రానేవచ్చెను. అతడా సుందరిని కన్నారగాంచి ఆశ్చర్యపడెను. 

అతడు రథము దిగి యొక పరిచారికతో ఈ విశాలాక్షి యెవతె? ఎవరి కూతురు? వెంటనే చెప్పుము, అనగా సైరంధ్రి యతని కిట్లు మారు పలికెను: 

వీరవరా! మొదట నీవెవరో చెప్పుము. ఇటకేల వచ్చితివి? ఏమి పని? అన రాజు సైరంధ్రితో ఈభూమిపై కోసలమను పెద్ద దేశము గలదు. నేను దాని పాలకుడను. వీర సేనుడను. నా వెనుక చతురంగ బలము వచ్చుచున్నది. దారితప్పి వచ్చితిని.' 

సైరంధ్రి కిట్లనెను : రాజవర్యా! ఈ సుందరి చంద్రసేనుని ముద్దులపట్టి. పేరు మందోదరి. ఈ యుద్యానవనము నందు విహరించు కోర్కితో నీమె యిచటకు వచ్చినది అను సైరంధ్రి మాటలు విని 

రాజ మరల నిట్లనెను : సైరంధ్రీ! నీవు చతురవు. నీ రాకుమార్తెకు నచ్చ చెప్పుము. నేను కాకుత్థ్స వంశజుడను. రాజును. ఈ కామిని నన్ను గాంధర్వ విధితో పెండ్లి కావచ్చును. సుశ్రోణీ! నాకును పెండ్లి కాలేదు. ఈమె అబ్బురము గొలుపు నిండు పరువముతో మెండుకొనియున్నది. ఈమె కామిని-కులవతి-రూపవతి-యువతి. ఈమెను నేను కోరుచున్నాను. ఈమె తండ్రియైన ఈమెను నాకు యథావిధిగ నీయవచ్చును.

ఈమెకు నేను తగిన పతి నగుదును సందేహము లేదు అను రాజు పలుకులు విని కామశాస్త్ర విశారద యగు సైరంధ్రి తీయగ నవ్వి యిట్లనెను: 

'మందోదరీ! ఇదిగో! ఇతడు రాజవర్యుడు. సూర్యవంశజుడు. బలరూపవంతుడు. నీ కీడుజోడైనవాడు. నిన్నతడు నిండారగ కామించుచున్నాడు. నీకు వివాహోచిత వయస్సు వచ్చినను నీవు విరాగిణివై నందులకు నీ తండ్రి మిక్కిలి చింతించుచున్నాడు. నీ తండ్రి నిట్టూర్చుచు నాతో నీ వామెను సేవించుచు నామె మనస్సు మార్చుము' అనినాడు. 

కాని, నీవేమో పట్టిన మొండిపట్టు వదలుటలేదు. నీకు చెప్పలేకున్నాను. సతులకు పతి సేవయే పరమ ధర్మమని మనువు ప్రవచించెను. సతికి పతిసేవచేతనే స్వర్గము లభించును. కునుక నీవు విధి విధానమున పెండ్లి గమ్ము అన 

మందోదరి యిట్లనెను : 'నాకు పతితో నేమి పని? నేను తీవ్ర తప మాచరింతును. అతడు సిగ్గుమాలి యేల అట్లు చూపులతో నన్ను జూచుచున్నాడు? నన్నట్లు చూడవలదని అతనితో ననుము. 

సైరంధ్రి యిట్లనెను : దేవీ! కాముడు దుర్జయుడు. కాలము దాటరానిది. కాన నా మేలు మాట పాటించుట మంచిది. కానిచో నీకు తప్పక యాపద మూడును అను మాటలకు మరల 

కన్యక కిట్లనెను : ఓ సైరంధ్రీ! దైవయోగమున నేది కావలసినదో అది కాగలదు. నేను మాత్రము పెండిగాను.' అపుడు సైరంధ్రి రాజుతో రాజా! నీ యిష్టమున్నచోటి కరుగుము. ఈమె తగిన పతిని గోరుటలేదు' అనెను. ఆమె మాటలు విని రాజా కామిని యెడల నిరాశుడై మనసు మార్చుకొని సేనతో తన కోసలదేశ మేగెను.

అధ్యాయము 105 శ్రీదేవి మహిషుని సంహరించుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...