Monday, April 13, 2026

Chapter 70 Prahlad's pilgrimage - అధ్యాయము 70 ప్రహ్లాదుని తీర్థయాత్రాసేవనము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 70

ప్రహ్లాదుని తీర్థయాత్రాసేవనము

ఈ ప్రకారముగ జనమేజయుడు ప్రశ్నింపగా సత్యవతీ సుతుడగు వ్యాస భగవాను డతనికి సవిస్తరముగ నంతయు తెలిపెను. ధర్మాత్ముడగు జనమేజయుడును తన తండ్రి చిత్తము దుర్వర్తనముతో కూడినదను విషయమును స్మరించి మిగుల నిర్వేదమును చెందెను. 

బ్రాహ్మణు నవమానించి యమపురి కేగిన తన తండ్రి నెట్టులైన నుద్ధరింపవలయునని రాజు తన మదిలో నిశ్చయించెను. పుత్త్రుడు తన తండ్రిని పున్నామ నరకము నుండి సముద్ధరించినచో నతని పుత్త్రనామము సార్థకమగును. పరీక్షిన్మహారాజు విప్రశాపముచే స్నానదానము లుజ్జగించి తన భవనములో నుండగా సర్ప మతనిని కాటువేసెను. తనతండ్రికట్లు గల్గిన దుర్గతి విని మహాభాగుడగు జనమేజయుడు భయవిహ్వలత్వమున మిక్కుటముగ నిర్విణ్ణుడయ్యెను. తన గృహమునకు ఏతెంచిన వ్యాసమునీశ్వరుని ఉదాత్తుడగు జనమేజయరాజు తనకు నరనారాయణుల పుణ్యగాధ నెఱిగింపు మని కోరెను. 

వ్యాసుడిట్లనెను : హిరణ్యకశిపుడు పరాక్రమశాలి. అతడు మరణించగ నతని రాజ్యమున కతని సుతుడు ప్రహ్లాదుడభిషిక్తుడయ్యెను. ఆ దానవపతి దేవబ్రాహ్మణ పూజా నిరతుడు. అతని పాలనమున రాజులు శ్రద్ధతో పెక్కు జన్నములొనర్చిరి. ఆ ప్రహ్లాదుని యేలుబడిలో నెల్ల బ్రాహ్మణులు తపోధర్మరతులు - తీర్థయాత్రా చరణశీలురు నైరి. వైశ్యులు నిజవృత్తి నిరతులైరి. శూద్రులు సేవా తత్పరులైరి. శ్రీ లక్ష్మీనృసింహస్వామి ప్రహ్లాదుని పాతాళమందుండ నియమించెను. అందుచే ప్రహ్లాదుడచ్చటనే యుండి ప్రజాపాలన తత్పరుడై రాజ్యమేలు చుండెను. ఒకప్పుడు భృగుపుత్రుడగు చ్యవన మహర్షి నర్మదలో స్నానము చేయుటకు వ్యాహృతీశ్వర తీర్థమున కరిగెను.

అతడు పుణ్యతీర్థమైన రేవానదిలోనికి దిగుచుండగనే యొక భయంకర విషసర్ప మతనిని గట్టిగ పట్టుకొనెను. అది తన్ను పాతాళమునకు గొనిపోవుచుండుట గని మునిసత్తముడు భయముతో దేవదేవుడగు విష్ణుని మనసార సంస్మరించెను. ఆ పుండరీకాక్షుని దివ్యనామ మొక్కమారు స్మరించినంతనే సర్ప విషము దిగిపోయెను. అందుచే నతడు రసాతలమున కేగియు నెంత మాత్రము దుఃఖ మొందకుండెను. ఇతడు గొప్ప ముని-తపస్వి- కునుక తన్ను శపించునేమో'యని భయపడి పాము మునిని వదిలిపెట్టెను. 

ఆ చ్యవన మహర్షి నాగకన్యలచేత బూజింపబడుచు నెల్లెడల స్వేచ్ఛగ దిరుగుచు నాగదానవుల సుందరపురము ప్రవేశించెను. అచ్చోట భృగుపుత్రుడగు చ్యవన మహర్షి తిరుగుచుండగా ధర్మవత్సలుడగు ప్రహ్లాదుడా మునిని గాంచెను. ఆ దానవరాజు మునిరాజు నుచిత రీతిగ సత్కరించి ఓ ద్విజసత్తమా! దానవ విద్వేషియైన యింద్రుడు నా రాజ్యపాలన గాంచి రమ్మని పంపెనా యేమి? నిజము పలుకుము' అని యతడు పాతాళమునకు వచ్చుటకు గల కారణమడిగెను. 

ఆ యింద్రునితో నా కేమి పని? అతడు నన్ను దూతగ పంపుటేమి? నేను నీ నగరమునకు వచ్చుటేమి? నేను ధర్మతత్పరుడను - స్వతంత్రుడను - భృగుమహర్షి పుత్త్రుడను. నన్ను మహేంద్రుడు పంపలేదు. మనమున నీ వీ సందేహము విడువుము. 

రాజా! నేను స్నానార్థమయి నర్మదానదిలో నొక పుణ్యతీర్థమున దిగితిని. ఇపుడు నన్నొక భీకర సర్పము పట్టుకొనెను. నేను సత్వరమే శ్రీహరినామ సంస్మరణ మొనరించితిని. ఆ సర్ప విషము దిగిపోయెను. అట్లు నేను హరినామ స్మరణ ప్రభావమున పాము బారినుండి విముక్తి బొందితిని.

ఇచటికి వచ్చిన తోడనే మీ దర్శనభాగ్యము లభించినది. దానవేంద్రా! నీవు విష్ణుని పరమభక్తుడవు. నన్ను నట్లే యెఱుంగుము అని చ్యవనుడు పలికెను. 

ప్రహ్లాదుడు ముని యమృతవాక్కు లాకర్ణించి తనకు వివిధ తీర్థ విశేషములు విస్తరించి తెలుపుమని కోరుచు పరమప్రీతితో మునితో నిట్లనెను: 

"మునీశా! ఆకాశము భూమి పాతాళము - వీనియం దేయే పుణ్యతీర్థములు గలవో వాని నెల్ల నాకు స్పష్టముగ తెలియబలుకుము అన 

చ్యవనర్షి యిట్లనెను: రాజేంద్రా! ఎవ్వని మనో వాక్కాయ కర్మములు విశుద్ధములుగ నుండునో వాని యడుగడుగున తీర్థమే యుండును. మలిన చిత్తులకు గంగయును కీకట ప్రదేశముకంటె చెడ్డది. మొదట మనస్సు పాపరహితము గావలయును. చిత్తశుద్ధి యేర్పడవలయును. అపుడతనికి సర్వ తీర్థములును పవిత్రములగును. 

దైత్యసత్తమా! పవిత్రమైన పుణ్యగంగాతటమునందు పెక్కు నగరములు గ్రామములు గొల్ల పల్లెలు గలవు. అట బోయపల్లెలును గలవు. వానియందు హూణవంగవ్లచ్ఛాది జాతుల వారు నివాసముందురు. ఆ బ్రహ్మ సమానమైన పావన గంగాజలమందు పుణ్యాత్ములు త్రికాలముంలందును క్రుంకులిడుచు జలములు క్రోలుచు స్వేచ్ఛగనుందురు. 

కాని, వారి యందొక్కడును విశుద్ధాత్ముడు గానరాడు. ఇంక విషయోపభోగ చిత్తులకు తీర్థఫలమెట్లు గల్గును? ఇంతకును మనస్సు కారణము - ఇతర మేదియు గాదని యెఱుగుము. శుచిత్వము గోరువాడు తొలుత తన మనస్సును శుద్ధ మొనర్చుకొనవలమును. తీర్థవాసి యితరులను వంచించినచో నతడు మహాపాపి యగును. ఆ తీర్థములందొనరించని కొలది పాప మనంతగుణముల పెరుగును. ఇంద్రవారుణ మను పండు పండినను తీయగ నుండదు. అట్లే చిత్తశుద్ధి లేనివాడు కోటిమారులు తీర్థ మాడినను పవిత్రుడు గాజాలడు.

శుభము గోరువాడు మొదట చిత్తశుద్ధిని బడయవలయును. హృదయశుద్ధిచే ద్రవ్యశుద్ధి యగును. అంతేకాని వేరు విధమున గాదు. ద్రవ్యశుద్ధికి తరువాత నాచారశుద్ధి దాని తరువాత తీర్థశుద్ధి జరుగును. శుద్ధిలేనిచో నంతయు క్షణమాత్రమున వ్యర్థమగును. తీర్థ మేగినవాడు నీచజాతులతో సాంగత్యము చేయరాదు. అతడు స్థిరబుద్ధితో సత్కర్మములతో భూతదయ నెఱపవలయును. దివ్యతీర్థ కథలు చెప్పుమంటివి. వచింతును, ఆలకింపుము. 

రాజేంద్రా! మొట్టమొదట పుణ్యప్రదమైన తీర్థము నైమిషము. తరువాతిది చక్రతీర్థము. ఆ తరువాత పుష్కరతీర్థము ప్రశస్తము. ఈ భూమండలమందుగల పుణ్యతీర్థము లెన్నతరముగాదు. ఇంకను పావన తీర్థరాజము లెన్నియో కలవు, అను ముని మాటలు విని ప్రహ్లాదుడు నైమిషమున కేగ సిద్ధపడెను. అతడు సంతుష్టచిత్తుడై యితర దానవుల నిట్లు ప్రేరించెను. 

ఓ మహాత్ములారా! లెండు. మనము నైమిషమున కేగుదము. అచట పీతాంబరుడు పండరీకాక్షుడు నైన యచ్యుతుని సందర్శింతము'' అని యిట్లు ప్రహ్లాదుడు వచింపగా దనుజులెల్లరును లేచి సిద్ధపడిరి. వారెల్లరును పరమప్రీతితో ప్రహ్లాదునిగూడి పాతాళమునుండి వెడలిరి. అట్లు బలశాలురగు దైత్యదానవులెల్లరును గుమిగూడి ప్రమోదముతో నైమిశారణ్యము చేరి యచటి తీర్థమున తానములాడిరి. 

ప్రహ్లాదుడు నెల్ల దైత్యులంగూడి తీర్థము లెల్ల తిరిగెను. ఆ మహాత్ముడగు ప్రహ్లాదుడు విమలజలములతో పుణ్యప్రదమైన సరస్వతీ తీర్థమునందలి పావనజలములను గాంచెను. అతడందు మునిగినంతనే యతని చిత్తము సుప్రసన్నమయ్యెను. అతడా పరమపావన తీర్థమునందు సవిధిగ స్నానదానాదులొనర్చెను. ఇట్లు ప్రహ్లాదుడు పరమపావన తీర్థమున శుద్ధాత్ముడై పెక్కు శుభకర్మములాచరించెను. అని శ్రీ వ్యాసముని జనమేజయునితో వచించెను.

అధ్యాయము 71 నరనారాయణులు ప్రహ్లాదునితో పోరుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...