Monday, April 13, 2026

Chapter 74 Jayanthi and Shukra Samagammamu - అధ్యాయము 74 జయంతీ శుక్రుల సమాగమము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 74

జయంతీ శుక్రుల సమాగమము

ఓ జనమేజయా! ఆ ఘోరమైన స్త్రీ వధ గాంచి భృగుమహర్షి కంపితుడై దుఃఖార్తుడై మధుసూదనున కిట్లనెను : 

విష్ణూ! మహామతీ! నీ కీ దుష్కార్యము పాపమని తెలియును గదా! ఐన నీ పని కేల యొడిగట్టితివి? విప్ర స్త్రీ వధ మనసున సైతము దలంపరాదు గదా! విష్ణువు సత్వగుణ సంపన్నుడు - బ్రహ్మ రజోగుణయుక్తుడు - శివుడు తమోగుణుడని మహర్షులందురు. కాని, నేడా విషయము నీ యెడల విపరీతమైనది. సాత్త్వికుడవైన నీవు తామసుడ వెట్లయితివి? అతినిందిత కార్యమేల చేసితివి? స్త్రీని వధింపరాదు గదా! ఈమె యేపాప మెఱుగనిదే! మఱి యీమె నేల చంపితివి? నీవు కడు దురాచారుడవు. నిన్నేమి చేసినన తప్పులేదు. నిన్నిప్పుడే శపించివైతును. 

ఇంద్రుని మేలుగోరి నీవే దురిత మొనర్చితివి. నన్ను దుఃఖముల పాలు చేసితివి. నీవు కపటివి - దురాశయుడవు - నీచ యోని సంజాతుడవు. కనుక నేను నిన్నే శపింతును, ఇంద్రుని శపింపను. జనార్దనా! మునులు నిన్ను సాత్త్వికుడందురు. కాని నీవు తామసుడవు. నీవు చేసిన దుర్మార్గము నేను కనులార గంటిని. 

ఇదిగో! నా శాప కారణముగ నీవు మృత్యులోకమున నవతారములు దాల్చెదవు. ఈ పాప ఫలితముగ గర్భ దుఃఖమనుభవించి తీరుదువు.'' అట్టి భృగు శాప ఫలితముగ ధర్మము నశించి నపుడెల్ల ధర్మసంస్థాపనకై విశ్వ కల్యాణార్థము విష్ణువు మాటిమాటికిని మనుజలోకమం దవతరించును అను వ్యాస వచనములు విని 

రాజిట్లనెను : మహాతేజముగల సుదర్శన చక్రముతో భృగు పత్ని చంపబడెను గదా! అటు పిమ్మట భృగు మహర్షి గృహస్థ జీవిత మెట్లు గడపెను? అన 

వ్యాసు డిట్లనియెను : అట్లు కార్యకుశలుడగు భృగుమహర్షి మహారోషముతో విష్ణుని శపించి పిమ్మట తన భార్యతలను మొండెముతో జేర్చి యిట్లు వచించెను : 

"ఓ దేవీ! నేను సర్వధర్మ విదుడనేని ధర్మాచరణుడనేని విష్ణుని చేతిలో చచ్చిన నిన్ను పునర్జీవితురాలి నొనర్తును.

నేను నిత్యసత్యవాదినేని నా సత్య ప్రభావమున నీమె పునర్జీవితు రాలగును గాక! ఎల్లదేవతలు నేడు నా తపోమహిమ గాంతురు గాక! నేను సత్య-శౌచ-వేద-తపోవీర్యము గలవాడనేని నా తపో మహిమచే చల్లని మంత్రజలము సంప్రోక్షించి యీమెను పునర్జీవితురాలి నొనర్పగలను" అని మంత్రజలముచే ప్రోక్షించినంత భృగుపత్ని పునర్జీవితురాలై పరమ ప్రీతితో పవిత్రమగు నగవుతో నిదుర నుండి లేచినటులే లేచెను. 

వారిని సర్వభూతములును గాంచి నలుదెసల నుండి మేలు మేలనుచు ప్రణుతించెను. అట్లు భృగుముని భార్య మరల జీవించుట నింద్రాది దేవతలు గాంచి పరమ విస్మయ మందిరి. అట్లు భృగువు తన యర్ధాంగిని మరల బ్రతికించు కొనెను. 

అటు శుక్రుడు మంత్ర ప్రాప్తికై ఘోరముగ తపమొనర్చుచున్నాడు. ఆ శుక్రుడు మంత్ర లాభమున నింకేమేమి చేయగలడో? యని యింద్రుడు సురలతో ననెను. అట్లు నిద్రాదేవి తన్ను వదలగా నింద్రుడు మేలుకొని శుక్రుడు మంత్ర ప్రాప్తికై ఘోర తప మొనర్చుట ఎఱిగి దుఃఖాక్రాంతుడయ్యెను. 

అంత నింద్రుడు నెమ్మదిలో ముందుచూపుతో నంతయు నాలోచించి జయంతి యను యనుంగు కూతుతో నవ్వుచు నిట్లు పలికెను: 

"ఓ పుత్త్రీ! నిన్ను తపమొనర్చుచున్న శుక్రుని సేవకు నియోగించితిని. నీవిపుడేగి యతనిని సేవించి నీవానిగజేసికొమ్ము. నీవతని యాశ్రమమున కరుగుము. అతని చిత్తము మెచ్చునట్లుగ మసలుకొనుము. చేయదగిన తగిన యుపచారము లొనర్చుము. అతనిని బూజించి వేగమే నా భయ ముడుపుము. 

విశాలాక్షి మనోరమయగు ఆ జయంతి తన తండ్రిమాట లాకర్ణించి శుక్రు నాశ్రమమున కేగెను. శుక్రుడు ధూమపాన మొనర్చు చుండుట నామె కాంచెను. ఆ ముని మేనిని జూచి తన తండ్రి మాటలు మదిలో దలంచి జయంతి మునివరునకు లేత యరటి యాకులతో వీవ మొదలుపెట్టెను.

ఆమె పరమభక్తిమీర నిర్మలమైన చల్లని జలములు వేగమే కొనివచ్చి మునిపతి త్రాగుట కందించెను. పగటింటి సూర్యుడు నడినెత్తిమీదికి రాగా నా తన్వంగి తాను ధర్మమందు నిలిచి వస్త్రమును శుక్రాచార్యునకు గొడుగుగ బట్టి చల్లని నీడను కల్పించెను. ఆ యువిద బాగుగ పండిన తీపి పండ్లను దెచ్చి యారగించుటకు ఏర్పరచి ముని సమక్షమున నుంచెను. 

ముని నిత్యవిధులు నిర్వహించుటకై చిల్కల వంటి దర్భలు దెచ్చి యాతన్వంగి ముని యెదుట నుంచెను. ముని ప్రవరుడు నిద్రించుట కాప్రమద మెత్తని చిగురుటాకు సెజ్జ సమకూర్చెను. ఆ ముని యందలి ఆదర భావముతో మెల్లగ వీచుచుండును. ఆ నెలతుక యేనాడు గాని ముని శాపభయమున యతనికి వికారములు గొలుపు హావభావములు వెల్లడించలేదు. 

ఆ సుభాషిణి ప్రియము లొలుకుచు అతనికి ననుకూలములైన మాటలతో మునిని ప్రస్తుతించుచుండెను. ముని మేల్కనినంతనే యాలలన ముని కాచమనము కొఱకు నీరు దెచ్చి యిచ్చెను. ఈ తీరున నామె ముని మనస్సు నెఱిగి యనువర్తించుచుండెను. ఆతురుడగు సురపతి జితాత్ముడైన ముని చేష్టల నెఱుంగదలచి యచ్చోటికి తన సేవకుల నంపెను. 

ఈ ప్రకారముగ జితేంద్రియ - నిర్వికార - బ్రహ్మచారిణి యగు జయంతి మునినాథునకు పెక్కేండ్లు పరిచర్యలు చేసెను. అట్లు వేయేండ్లు నిండెను. అంత మహాదేవుడు ప్రీతమనస్కుడై సంతుష్టుడై ప్రసన్నుడై మునివరునకు వర మొసగవచ్చి నీ కేమి వరము కావలెనో కోరుమని ఇట్లనెను : 

"ఓ భృగునందనా! యీ విశ్వమందు ఏదేది కలదో యేది వాక్కున కందదో దేనిని నీవు గనదలతువో దానిని నీవు గందువు. 

వాని నన్నిటిని నీవు జయింపగలవు. నీవు సర్వభూతములలో వేనికిని వధ్యుడవు గావు. నీవు ప్రజాపతివి. ద్విజోత్తముడవు. ఇందు సందేహము లేదు అని ఇట్లు వరము లొసంగి శివు డదృశ్యుడయ్యెను. అంత శుక్రుడు కన్నెత్తి కాంచి జయంతితో నిట్లు పలుకసాగెను : 

"ఓ సుశ్రోణీ ! నీ వెవ్వతవు? ఎవ్వరి దానవు? నీలోని కోరిక యేమి? నీ వేమి చేయదలచితివి? నీవు నన్ను దేనికి జేరితివి? నీకు నావలన గాదగిన కార్య మేది? త్వరగ తెలియబఱచుము. ఓ సులోచనా! నీలోని కోరిక యెంతటి యసాధ్యమైన దైనను నేను తప్ప కీడేర్పగలను. నీ యింపైన చేతలకు నా మది ప్రీతినందినది. ఇప్పుడే వరము గోరుకొమ్ము, ఇదిగో యిత్తును అను మునివరుని మాటలకు జయంతి ముఖము సంతోషముతో వికసించగా ఆ మగువ 

"భగవన్‌! మీరు మీ తపోమహిమముననే నా మనస్సునందలి ఈప్సితమును తెలిసికొన వేడుకొనుచున్నాను అనగా శుక్రు డిట్లనెను : 

"నే నిదంతయు నెఱుంగుదును. ఐనను నీ మనస్సునందలి యీప్సితమును నాకు చెప్పుము. నీ కన్ని విధముల శుభము కలిగింతును. నీ పరిచర్యకు ప్రీతి నందితిని అను శుక్రుని వచనములు విని 

జయంతి యిట్లు పలికెను" ఓ ముని వరేణ్యా! బ్రాహ్మణోత్తమా! నే నింద్రుని కూతురను. జయంతుని చెల్లెలను. నా పేరు జయంతి. నన్ను నా తండ్రి మీకు సమర్పించెను. ఓ విభూ! నేను మీ విషయమున కామముతో నున్నాను. ఇపుడు నా కోరిక తీర్చుడు. ధర్మము ననుసరించి ప్రీతి పూర్వకముగా మీతో రమింతును అనగా శుక్రు డామెతో 

"సుశ్రోణివగు ఓ భామినీ! నీవు పదియేండ్లపాటు సర్వ భూతములకు అదృశ్యురాలవై నాతో కూడి ఇచ్చటనే నీ ఇచ్ఛానుసారము రమింపుము" అనెను. అని యిట్లు పలికి ముని వరుడు శుక్రు డామెను వెంటగొని తన యింటికేగి యామెను పెండ్లాడి ఆ చందముగ ముని జయంతిని గూడి పదేండ్లవఱకు నివసించెను. 

ఆ కాలములో శుక్రుడును మాయాశక్తితోగూడి సర్వభూతములకు కంటబడక యుండెను. శుక్రుడు మంత్రయుక్తుడై యేతెంచెనని దైత్యులు విని మునిని గన మదముమీద నాతని యింటి కరిగిరి. కాని, వారికి ముని కనబడలేదు. ఏలన, శుక్రుడెవరి కంటబడక జయంతిని కూడి యుండెను.

అంతట వారు భగ్న హృదయులై విమనస్కులై చింతాపరులై దీనులై మాటిమాటికి మునికై ఎదురు తెన్నులు చూచుచుండిరి. 

కాని మాయావృతుడైన శుక్రు డెంతకును వారికి గనబడలేదు. అంత వారు భయార్తులై చింతాపరులై తమ యిండ్ల కేగిరి. 

అట్లు శుక్రుడు జయంతితో రమించు చుండుట యింద్రుడెఱిగి తన గురునితో 'ఇక మీద మా కర్తవ్య మేమి? ఓ విప్రశ్రేష్ఠా! నీవు మాత్ర మిపుడే వెళ్ళి దానవుల కాసగొల్పుము. నీ చక్కని బుద్ధితో నాలోచించి మన కార్యము సాధింపుము' అనెను. బృహస్పతి యింద్రుని మాటలన్నియు వినెను. 

శుక్రుడు మాయావృతుడై జయంతితో రమించుచుండు టెఱింగెను. అపుడు గురుడు శుక్రునియున్న రూపుదాల్చి దానవుల చెంతకేగెను. గురుడుచటి కేగి దానవుల నతిప్రీతితో నాహ్వానించెను. అసురు లెల్ల రేతెంచి తమ ముందున్న శుక్రుని పొడగాంచిరి. వారు మాయా మోహితులై దేవగురుని దైత్యగురునిగ భావించి దోయిలించిరి. 

కాని, శుక్రరూపము దాల్చిన గురుని మాయ దెలియరైరి. మాయతో శుక్రరూపము దాల్చిన గురువు వారికి స్వాగతము పలికి నేను మీ మేలుగోరి వచ్చితిననెను. నేను మీ మేలుగోరి తపమొనరించితిని. శివుడు మెచ్చి నాకు విద్య నొసంగెను. దాని నిపుడు మీకు ప్రబోధింపగలను. అది విని రాక్షసులు ప్రీతమనస్కులైరి. మన యాచార్యులవారు మన పని సాధించిరని మోహితాత్ములై సంతసిల్లిరి. 

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...