Monday, April 13, 2026

Chapter 73 Venus performing penance to attain the mantra - అధ్యాయము 73 శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 73

శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట

అట్లు దేవతులు వెళ్ళిన మీదట శుక్రుడు దనుజులను గని యిట్లు పలికెను: 

ఓ దానవులారా! తొల్లి బ్రహ్మ నాతో పలికిన కొన్ని వాక్కులు కలవు. మీకు వినిపింతును. వానిని వినుడు. జనార్దనుడైన శ్రీమహావిష్ణువు ధర్మరక్షణకై దైత్య వధ గావించును. అట్టే మున్ను హరి వరాహరూపమున హిరణ్యాక్షు నంత మొందించెను. శ్రీ నృసింహరూపమున హిరణ్యకశిపుని చీల్చిచెండాడెను. అదేవిధముగ నతడెల్ల దైత్యగణములను చంపగలడు. ఇందు సందేహము లేదు. 

ఇపుడు హరిశక్తి ముందు నా మంత్రబలము పనిచేయదు. మీరు నా చేత రక్షింపబడినచో దేవతలను జయింపగలరు. కొంతకాల మోపికపట్టుడు. నేనిప్పటికిప్పుడే వరమంత్ర ప్రాప్తికై మహాదేవుని సన్నిధానమున కరుగగలను. నేను మహామంత్రశక్తి బడసి వెంటనే రాగలను. దాని బలమున మిమ్ము తప్పక రక్షింపగలను' అనవిని 

దైత్యులిట్లనిరి : మునిసత్తమా ! మేమోటమి చెందితిమి. ఈ నేలపై నింకెట్లు నిలువగలము? మీరు తిరిగివచ్చునంతదనుక మే మెదురుతెన్నులు చూచుచుండజాలము. మాలో మహాబలశాలురందఱును మడిసిరి. కొందఱు మాత్రము చావుదప్పి బయటపడిరి. ఇట్టి దీనస్థితిలో మేము రణమున నిలువజాలము. 

శుక్రాచార్యు డిట్లనెను: నేను శంకరు నుండి మంత్ర విద్య గ్రహించు నంతకాలము శాంతులై తపమొనర్చు చుండుడు. విబుధులు సమయోచితముగ సామదానాది చతురుపాయముల నెఱిగి దేశకాల శక్తులు దెలిసి మెలగవలయు నందురు. భద్రము గోరు బుద్ధిశాలి యవసరమైనచో వైరికి సేవయైన చేయవలయును. పిమ్మట తఱియెఱింగి బలము పుంజుకొని శత్రువును తుదముట్టించవలయును. కాన మీరిపు డతివినయము నటించి సామ మార్గముతో మీ మీ నిలయములకేగుడు - నా రాకకు దారి తెన్నులు చూచుచుండుడు. నేను మహాదేవుని నుండి మంత్రశక్తి గ్రహించి వచ్చిన మీదట మంత్రబలముతో దేవతలతో బోరు సాగింతము.' 

అట్లు శుక్రుడు దానవుల నొప్పించి మంత్రార్థము దృఢ సంకల్పముతో శివతరుడైన పరమశివుని సన్నిధికరిగెను. అపుడు రాక్షసులు సంధికొఱకు సత్యవాదియు సురలకు విశ్వాసపాత్రుడునైన ప్రహ్లాదుని దేవతుల సన్నిధి కంపిరి.

ఆతడు వేల్పుల సన్నిధి కసురులను వెంటగొనియేగి నమ్రవచనములతో దేవతలతో ఓ దేవతలారా! మేము కవచ సంన్యాసము నస్త్ర సంన్యాసమును చేసితిమి. నారచీరలు దాల్చి తపమొనరింప దలంచితిమి. అనగా ప్రహ్లాదుని సత్యవాక్కు లాలించి యమరులు రణముమాని బాధలుపాసి ప్రమోదభరితులై నిబ్బరముగ నుండిరి. 

అసురులు శస్త్ర నంన్యాసము సేయగా వారిని నమ్మి యమరులు తమ తమ నివాసముల కరిగి క్రీడాసక్తులై సుఖముండిరి. ఆంత దానవులును నిగ్రహము వహించి శుక్రుని శుభాగమనము గోరుచు తపముచేయుచు కశ్యపాశ్రమమందు వాసముండిరి. 

అటు శుక్రుడు కైలాసరిగి కరిగి శంభునకు ప్రణమిల్లెను. హరుడతని రాకకు కారణమడుగ ఓ మహాదేవా! నేను గురునియొద్ద లేని మంత్రములు గోరుచున్నాను. వానివలన సురపరాజయము - అసురజయము గలుగుగాక! యని శుక్రుడనెను. అతని పలుకు లాలించి సర్వజ్ఞుడు శివుడునైన శర్వుడు తన కర్తవ్యము గూర్చి యించుక యాలోచించెను. 

రాక్షసగురుడు దేవతలయందలి ద్రోహబుద్ధిచే తనకడకు మంత్రార్థము వచ్చెనని శివుడు నిశ్చయముగ దెలిసికొనెను. ఎల్లభంగుల దేవతలు తనకు రక్షణీయులని పరమశివుడు మదితలంచెను. ఆ యుగ్రుడు శుక్రునితో - నీవు మహోగ్రము దుస్సాధనమునైన యొక వ్రత మనుష్టించ వలయును అని పలికెను. 

వేయేండ్లు తలక్రిందుగ నుండి పొట్టుపొగ పానమొనర్చు చున్నచో నీ కోర్కె యీడేరును. అపుడు మంత్రములు పడయగలవు అని పలికెను. అపుడు శుక్రుడు చేతులు జోడించి యిట్లనెను. "ఓ సర్వేశ్వరా! మహాప్రసాదము. మీ మాట పాటింతును. వ్రతమాచరింతును. అనుమతియిండు" అని పలికి శుక్రుడు ధూమపాయియై శాంతుడై మంత్రార్థము కఠిన వ్రత మాచరింప దొడగెను. శుక్రుడు వ్రతరతు డగుటయు రాక్షసులు దంభ నిరతులగుటయు విబుధు లెఱిగి మంత్రాలోచనలు సలుపుచుండిరి.

మఱియు దేవతలాయుధములు దాల్చి దృఢనిశ్చయముతో రణోద్యక్తులై దానవులున్నయెడ కరిగిరి. దేవతలు కవచ కార్ముకములు దాల్చి నలుదెసలనుండి వచ్చి యొక్కుమ్మడి ముట్టడించుటగని దనుజులు భీతిల్లిరి. వారు దిక్కులేకుండిరి. దేవతలు బలగర్వితులై హఠాత్తుగా యుద్ధసన్నద్ధులై తమపై పడుటగని రాక్షసులు చకితులైరి. 

వారు దేవతలతో నిట్లు నిజము పలికిరి: ఓ యమరులారా! మే మస్త్ర సంన్యాసము చేసితిమిగదా! మాయాచార్యవర్యుడు వ్రతనిష్ఠుడయ్యెను. ఈ సమయము గని పెట్టి మీరు మా మీది కెత్తి వచ్చితిరే? మీరిచ్చిన యభయ మేమయ్యెను? మీ సత్యవాక్యము లేమయ్యెను? వేదవిహిత ధర్మమేడగలిసెను? శస్త్రత్యాగి-భీతుడు-శరణార్థి-వీరు హంతవ్యులు గారని పెద్దలందరుగదా'! అనవిని 

దేవత లిట్లనిరి : మమ్ము గెల్చుటకై మీరు కృపణత్వముతో శుక్రుని మంత్ర ప్రాప్తికై పంపితిరి. మీ తపమెందులకో మేము తెలిసికొంటిమి! కనుకనే మేము యుద్ధమునకు కలిసికట్టుగ నాయత్తమైతిమి. ఇపుడు మీరును శస్త్రపాణులై యుద్ధసన్నద్ధులు గండు. శత్రువు దుర్బలుడగుటకని వానిని చంపుట సనాతన యుద్ధనీతిగదా! 

అను వారి వచనము లాలకించి దైత్యులు తమలో తామలోచించుకొని భయవికలులై అచ్చోటు వదలి పారిపోయిరి. వారెల్లరును శుక్రుని తల్లికడ కరిగి శరణు వేడిరి. ఆమె భయకాతరులగు దనుజులనుగని వారి కభయమొసగి ఇట్లు నుడివెను : 

దనుజులారా! మీరు భయపడకుడు. జంకు వదలుడు. నా సన్నిధానమందు మీరెట్టి భయమును జెందబనిలేదు. ఆమె మాట లాలకించి దనుజులు భ్రమలును వెతలును మాని నిరాయుధులై యా యాశ్రమమందు వాసముండిరి. దేవతలంత బలాబలము లెఱుంగక కాలికి బుద్ధిచెప్పుచున్న దానవుల వెన్నంటిరి. శుక్రుని తల్లి వారి నడ్డగించెను. 

కాని, దేవత లాశ్రమస్థులగు దానవుల నెక్కడివాని నక్కడ పట్టి పల్లార్ప దొడంగిరి. అట్లు దనుజులు దేవతల చేతిలో మడియుట గని శుక్రుని తల్లి కినుకపూని నా తపోబలమున నేనిపుడే దేవతలను నిద్రపోవునట్లు చేయుదునని పలికెను.

భృగుసతి నిద్రాదేవిని ప్రేరించగా ఆమె వారిని మోహితులనుగ జేసెను. ఇంద్రునితోడి దేవత లెల్లరును నిద్రావశులై మూగవోయి నేలపై బడిరి. అట్లు దీనత్వముతో నిద్రించి యున్న యింద్రునిగని విష్ణువు అతనితో ఓ సురోత్తమా ! నీవు నాలో ప్రవేశింపుము. నీకు మేలగు! అనెను. 

అది విని యింద్రుడు హరిలో ప్రవేశించెను. అపు డింద్రుడు నిర్నిద్రుడు-నిర్భయుడు-అనిరుద్ధరక్షితుడు నయ్యెను. అట్లు హరి రక్షితుడై యింద్రుడు వెతలు మానియుండుట గని శుక్రుని మాత కోపముతో, 

ఓ యింద్రా ! నేనిప్పుడే దేవతలందఱు చూచుచుండగ నిన్ను నీ హరిని మ్రింగివేయుదును. నా తపోమహిమ యట్టిది అనెను. అది విని ఇంద్రుడును విష్ణువును మహాయోగవిద్యలో జేరి స్తబ్ధులైయుండిరి. అట్లు హరింద్రులు తిరస్కృతులై పీడితులైయున్నందున దేవతలెల్లరు దీనమానసములతో హాహాకారములు చేసిరి. ఆర్తనాద మొనరించు దేవతలను గాంచి యింద్రుడు హరి కిట్లనెను. 

'ఓ మాధవా! నేను నీకంటెను మిక్కిలి తిరస్కృతుడనైతిని. జనార్దనా! ఈమె తపోగర్వితురాలు-దుష్టురాలు. ఈమె మనలను దహించుటకు ముందే యీమెను నాశ మొందింపుము' అనెను. ఇంద్రుని ప్రార్థనము మన్నించి శ్రీ విష్ణువు స్త్రీవధ విషయమై ఘృణను వదలి తన చక్రమును మది దలంచెను. క్షణమాత్రాన చక్రము హరికి వశమయ్యెను. హరి యింద్ర చోదితుడై మహాకోపమున చక్రము చేతబూని వేగమే యామె తల ఖండించెను. ఆమె నిహతురాలు కాగా ఇంద్రుడు ప్రమోద మందెను. దేవతలును విగతజ్వరులై ప్రమోదభరితులునై హరికి జయజయధ్వనులు చేసిరి. అట్టు లింద్రుడు నుపేంద్రుడును బాధాముక్తులైరి. 

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...