Monday, April 13, 2026

Chapter 76 The belief that God is the most powerful - అధ్యాయము 76 దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 76

దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

అట్లు శుక్రాచార్యుడు తన మదిలో నాలోచించుకొని నవ్వుచు దైత్యులతో నిట్లు పలికెను. 'ఓ దైత్యులారా! మీరు నా రూపుదాల్చి వచ్చిన దేవగురుని నమ్మి మోసపోసితిరి. వాస్తవ శుక్రుడను నేను. నా యాజ్యులు మీరు. ఇతడు దేవకార్యము సాధింపవచ్చిన బృహస్పతి. మీరితని చేత నిజముగ వంచితులైతిరి. 

ఇతడు నా రూపరేఖలు దాల్చిన దాంభికుడు. ఈతని మాటలు నమ్మకుడు. ఈ బృహస్పతిని వీడి నన్ననుసరింపుడు' అను శుక్రుని మాటలు విని వారెల్లరును పరమ విస్మయమందిరి. వారా యిరువురి యాకారములను సరిగ పోల్చుకొనలేకపోయిరి. తమకు బోధించుచున్న గురుని వారు శుక్రునిగ భావించిరి. 

అంత బృహస్పతి మాయామోహితులైన రాక్షసులను గని యిట్లు పలికెను, 'దైత్యులారా! ఇతడు శుక్రుడు గాడు. ఆ బృహస్పతి నా రూపమున నిపుడు మీ కడకు వచ్చెను. ఇతడు దేవతల పని నెరవేర్ప మీ కడకు వచ్చి మిమ్ము వంచింపజూచుచున్నాడు. ఇతని మాట నమ్మకుడు. నేను శంభునినుండి విద్య బడసితిని. దానిచే మీకు దేవతల తోడి యుద్ధమున జయము గల్పింతు'నని శుక్రరూపుడైన గురువు పలికెను. 

దానవులును అతడే తమ గురువగు శుక్రుడని తమ మదిలో నిశ్చయించుకొనిరి. అపుడు శుక్రుడు వారి కెంతయో నచ్చజెప్పి చూచెను. కాని, వారు గురుమాయా మోహితులై కాల విపర్యయమున శుక్రుని మాటలు పెడచెవిపెట్టిరి. వారట్లొక నిర్ణయమునకు వచ్చి శుక్రునితో నిట్లనిరి : 

"ఇతడే మా గురువు. ధర్మాత్ముడు. మాకు మంచిబుద్ధి నొసగి మా మేలుగోరువాడు. ఈ శుక్రుడే పదేండ్లనుండి మమ్మెడబాయక శాసించుచున్నాడు. నీవు టక్కరివలె బొడగట్టుచున్నావు. నీవు మా గురువు గావు. ఇచ్చోటు వదలి వెళ్ళుము."

అట్లు మూఢదైత్యులు నిజమైన శుక్రుని పలుమారులు నిందించిరి. శుక్రరూపముననున్న గురుని నమస్కరించి యతనిని ప్రేమతో గురునిగ దలచిరి. అతని మాటలే నమ్ముచు తన్మయులై యున్నారని శుక్రుడు కోపాతిరేకమున వారినిట్లు శపించెను: "నేనెంతగ చెప్పినను మీరు నా మాట నమ్ముటలేదు. కనుక చైతన్యరహితులై తిరస్కార మొందుదురుగాక! నన్ను నిందించిన దాని ఫలితముగ కొలదికాలములోనే మీరు తగిన ఫలితమనుభవింతురుగాక! ఇతని కపట వర్తనము లానాడుగాని మీకు బోధపడవు" అని యిట్లు శుక్రుడు పలికి కోపముతో నచ్చోటువదలి వెళ్ళెను. 

అంత బృహస్పతి ముదముతో నచటనే స్థిరచిత్తుడై యుండెను. అట్లు శుక్రుడు దానవులను శపించిన విషయము గురునకు తెలిసెను. ఆతడు వెంటనే యచ్చోటు వదలి నిజరూపము దాల్చి వెడలి ఇంద్రునిజేరి యతనితో నిట్లనియెను: 

"ఓ సురసత్తమా! నేను నా పని నెరవేర్చితిని. శుక్రుడు వారిని శపించెను. నేను వారిని వదలి వచ్చితిని. ఇపుడు దానవులు నిరాశ్రయులు. నావలన శాపదగ్ధులు. కనుక నిపుడు పోరాటమున కాయత్తపడుము అను గురువాక్యము లాకర్ణించి యింద్రుడు ప్రమోదభరితుడయ్యెను. 

సురలు సంతసిల్లిరి. వారు గురుని పెక్కు రీతుల బూజించిరి. అపుడు దేవతలెల్లరు పరస్పరము మంతనము జరుపుకొనిరి. యుద్ధమే కర్జమని యెల్లరు నిశ్చయించుకొనిరి. వారు మూకుమ్మడిగ దానవులపై బడిరి. అట్లు దేవతలు గొప్ప బలముతో ముందు ప్రయత్నముతో బవరమునకు గడంగుటయును తమ గురువు వెళ్ళిపోవుటయు గని దానవులు చింతాక్రాంతులైరి.

వారు తమలో తామిట్లనుకొనిరి: 'మనము గురుని మాయచే విమోహితులమైతిమి. శుక్రుడు కోపమువచ్చి వెళ్ళిపోయెను. ఇపుడా మహాత్ముని శుక్రుని ప్రసన్నుని జేసికొనుట మన కర్తవ్యము. ఆ గురువు కపటచతురుడు - పాపి - భ్రాతృభార్యాగామి. లోన మలినము బయట నైర్మల్యము గలవాడు. మనమిపుడేమి చేయుదము? ఎచటికేగుదము? 

శుక్రుడు కోపముతో మండిపడుచున్నాడు. మనకిపుడు సాయ మవసరము. మఱి యతనిని మనమెట్లు ప్రసన్నునిగ జేసికొనగలము? ఇట్లు దైత్యులు తమలో తామాలోచించుకొని భయకంపితులైరి. వారు ప్రహ్లాదుని ముందిడుకొని శుక్రాచార్యుని సన్నిధి కరిగిరి. 

వారందఱు మౌనముగ నున్న శుక్రుని చరణములకు నొకేసారి నమస్కరించిరి. శుక్రుడు నిప్పులు గురియుచు వారికిట్లు పలికెను. 'నేనానాడు మీకు హితముగ నెంతయో చెప్పితిని. కాని, మీరు గురుమాయా మోహితులై నాడు నా మాట పెడచెవిని బెట్టితిరి. మూఢాత్ములై నన్ను తూలనాడితిరి. మదోన్మత్తులగు మీరు తత్ఫలితము వెంటనే పొందితిరి. ఈనాడుగూడ మీరు కపటాకృతి - వంచకుడు. సురకార్యార్థియైన మీ గురుని చెంతకే వెళ్లుడు. మీరు భ్రష్టులైపోతిరి. నేనతనివలె వంచకుడనుగాను.' అట్లు శుక్రుడు సందిగ్ధ వాక్యములు పలుకగ 

ప్రహ్లాదుడ తని పాదములు పట్టుకొని యిట్లు పలికెను:' ఓ భార్గవమునీశ! నీవు సర్వజ్ఞుడవు. మేము నీ యాజ్యులము. నీకు హితకరులము. పుత్రతుల్యులము. భయాతురులమై వచ్చినవారము. అట్టి మమ్ము నీవీ పరిస్థితిలో విడువ తగదు. నీవు మంత్రార్థ మరిగితివి. అపుడా దురాత్ముడు కపట నటునివలె నీ వేష భాషలతో వచ్చి తియ్యగ బలుకరించుచు మమ్ము వంచించెను. 

తెలియక పొరపడిన వారి దోషములకు శాంతులు కోపింపరు.' నీవు సర్వవిదుడవు. మా చిత్తములు నీయందే లగ్నమైనవని నీవెఱుగుదువు.

నీ తపఃప్రభావ మతీతము. కోపముడుగుము. సాధుసత్తములు క్షణకోపులని మునులందురుగదా! నీరు సహజముగ చల్లగా నుండును. అది నిప్పుతో గలిసిన వేడియగును. వేడిమి తగ్గిన నీరు మరల చల్లబడును. క్రోధము చండాలుని వంటిది. బుధులు దాని నెల్లవిధముల వదలిపెట్టుదురు - కాన నీవు నటులే రోషము విడనాడి మాపట్ల ప్రసన్నుడవు గమ్ము. 

నీవు కోపము విడువక దుఃఖితులమైన మమ్ము వదలినచో మేము పాతాళమున కేగుదుము అను ప్రహ్లాదుని మాటలు విని శుక్రుడు జ్ఞాననేత్రముతో సర్వము నెఱింగి సుమనస్కుడై చిరునగవుతో వారితో నిట్లనెను: 

'దానవులారా! మీరు భయపడి పాతాళమునకు వెళ్ళవలదు. మీరు నా యాజ్యులు. నా మంత్రబలముచే మిమ్ము రక్షింతును. పూర్వము బ్రహ్మ సత్యము హితకరమునైన యొకమాట చెప్పెను. అది మీకు వినిపింతును వినుడు. 

ఈ నేలపై మేలుగాని కీడుగాని జరుగవలసినది తప్పక జరిగితీరును. దైవమునకు విరుద్ధముగ నెవ్వడు నేమియు జేయజాలడు. మీరిపుడు కాలయోగమున నిజముగ బలహీనులైతిరి. దేవతలచేత నోటమిచెంది యొకమారు పాతాళ మేగవలయును. కాలము కలిసివచ్చినప్పుడు మీరు సర్వసమృద్ధమైన త్రైలోక్య రాజ్యమనుభవింతురని తొల్లి బ్రహ్మ వచించెను. 

మీరొకప్పుడు దైవయోగమున దేవతలను తలదన్ని పదియుగముల వఱకు పూర్తిగ త్రైలోక్య సంపద లనుభవించితిరి. సావర్ణిక మన్వంతరమందు మరల సామ్రాజ్యము మీ కైవసమగును. అపుడు ప్రహ్లాదుని మనుమడైన బలి విజయుడై ముల్లోకముల కేలిక గాగలడు.

మున్ను విష్ణువు వామనావతారమున బలి సర్వస్వము హరించెను. అప్పుడు హరి బలితో నేను దేవ వాంచాసిద్ధికి లోకత్రయ సామ్రాజ్య మిపుడు హరించితిని. ఇకముందు సావర్ణిక మన్వంతరమందు నీవే యింద్రుడవగుదువు' అని పలికెను. ఓ ప్రహ్లాదా! ఆనాడు విష్ణువట్లుపలుక నీ పౌత్రు డెల్ల భూతముల కదృశ్యుడై గుప్తముగ భీతునివలె నేడు చరించుచున్నాడు. 

ఒకప్పుడు బలి యింద్రుని భయమున గర్దభరూపముదాల్చి యొక శూన్యగృహమందు తలదాచుకొనెను. ఒకనాడింద్రుడు బలినిగని ఓ రాక్షస సత్తమా! నీవు సర్వలోక భోక్తవు. దానవ శాస్తవు. అంతటి నీకీ గాడిదరూపు సిగ్గు గల్గించుటలేదా? అన విని దైత్యరాజిట్లనియెను: 

"ఓ శతక్రతూ! ఇందు వింతేమి గలదు? విష్ణువంతటివాడు చేప-తాబేలు మున్నగు రూపులు దాల్చెనుగదా! తొలుత నొకప్పుడు నీవును బ్రహ్మహత్యవలన మానస సరోవమందలి కమలమున లీనమై దాగియుంటివి కదా! అట్లే నేనును కాలవశమున యీ ఖరరూపమున నున్నాను. 

దైవపరాధీనునకు సుఖమెక్కడికి? దుఃఖమెక్కడికి? అఖండమైన కాలము నిజముగ నెట్లు దలచునో యట్లు జరిగితీరును! ఇట్లు బలి యింద్రుడు తమలో తాము సంభాషించుకొనిరి. వారు పిదప తెలివొంది నిజనివాసముల కరిగిరి. ఈ యుపాఖ్యానము దైవమే బలవత్తరమైనదను విషయము తెలుపుచున్నది. దీనిని మీకు తెలిపితిని. ఈ సురాసుర నరజంతుయుతమగు జగమెల్ల దైవాధీనమే.

అధ్యాయము 77 ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుట

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...