శ్రీరామకృష్ణుల యవతార వర్ణనము
అట్లు దేవకి యారుగురు కొడుకులు కంసునిచేత చంపబడిరి. సప్తమ గర్భము పతన మందెను. అపుడు కంసునకు నారద వచనము జ్ఞప్తికి వచ్చి తన చావు దేవకి యెనిమిదవ గర్భము వలన గలుగునని యెఱిగి యా గర్భమును జాగ్రత్తగ రక్షించెను.
ఇట శ్రీ విష్ణుని మహాంశము వసుదేవు నాశ్రయించెను. ఆ తేజోంశ మతనినుండి యథాక్రమముగ దేవకి గర్భము జొచ్చెను. అదే సమయమున యోగమాయాశక్తి దేవకార్యార్థము స్వేచ్ఛగా యశోదాగర్భము ప్రవేశించెను. వసుదేవుని రెండవ భార్య రోహిణి. ఆమె కంసు భయముతో విచారమున మునిగెను.
ఆమె గోకులమందు బలరాముని ప్రసవించెను. కంసుడు దేవసన్నుతయగు దేవకిని కారాగారమందుంచి యామె సంరక్షణకు తన సేవకులను నియోగించెను. వసుదేవుడు తన ప్రియురాలి గాఢ ప్రేమ పాశములచే బద్ధుడు. కాన నతడును పుత్రోత్పత్తిచే సంతోషమున భార్యతోపాటు చెఱసాలయం దుండెను.
అట్లు శ్రీహరి దేవకార్యార్థము దేవకీ గర్భము ప్రవేశించి దేవతలచే నన్నుతింపబడుచు క్రమక్రమము వర్ధిల్లుచుండెను. కొన్ని నాళ్ళకు పదియవ నెల రానే వచ్చెను. శ్రావణ కృష్ణ పక్షమందు రోహిణీ నక్షత్రమున నష్టమినాడు హరి యవతరించెను.
అపుడు కంసుని గుండె దడదడలాడెను. అతడు దానవులతో నిట్లు పలికెను:
'ఇపుడు మీరెల్లరు దేవకీ గర్భము గాపాడుడు. దేవకి కష్టమ గర్భమున నా శత్రు వుద్భవించును. కనుక నా పాలిటి మృత్యువైన బాలకుని జాగరూకతో రక్షింపుడు. నాకు సుఖశాంతులు గలిగించని యామె యష్టమ సుతుని చంపిననే కాని నాకు సుఖశాంతులు గలుగవు. అపుడు గాని నా కంటి నిండ నిద్దుర పట్టదు. మీ రెల్లరు నిదురమాని యేమరక విల్లు ఖడ్గము ప్రాసము ధరించి యెల్ల దిక్కు మొగముల చూచుచుండుడు.
అట్లు భయవిహ్వలుడు క్షీణాత్ముడు నగు కంసుడు రాక్షసగణము నాదేశించి తన మందిరమున కేగెను. కాని యతని మది కట సుఖము లేకుండెను. ఇచట నడికిరేయి దేవకి వసుదేవునితో నిట్లు పలికెను:
అట్లు భయవిహ్వలుడు క్షీణాత్ముడు నగు కంసుడు రాక్షసగణము నాదేశించి తన మందిరమున కేగెను. కాని యతని మది కట సుఖము లేకుండెను. ఇచట నడికిరేయి దేవకి వసుదేవునితో నిట్లు పలికెను:
'మహారాజా! నాకు ప్రసవ సమయము సమీపించినది. ఇపుడేమి చేయుదు? ఇచట భయంకరులైన ఆరక్షులు కాపు గలరు. మున్నొకప్పుడు నందుని భార్య నాతో నిట్లొక ఒప్పందము చేసినది.
'ఓ మానినీ! నీ మనసు పరిపరి విధముల వికలమైనది. కాన నీ పుత్రుని నా యింటికి బంపుము. నే నతని నిట చక్కగ లాలించి పాలింతును. కంసునకు నమ్మిక గలుగుటకు నేను నీకు నా సంతాన మిత్తును అని యామె యనెను. ప్రభూ! ఇట్టి విషమస్థితిలో మన కర్తవ్య మేమి? అట్లు మనము మన సంతానము మార్చుకొందము.
నా కిపుడు మిక్కుటముగ సిగ్గు ముంచుకొని వచ్చుచున్నది. నీవు కొంచెము దూరముగ నుండుము. నీవు కొంచెము మొగము త్రిప్పుకొని యుండుము. ఇంతకు మిక్కిలి నేనేమి చేయుదు? అని దేవకి దేవసన్నుతుడు మహాత్ముడు నగు వసుదేవునితో ననియెను. ఆ పిదప దేవకి నడిరేయి పరమాద్భుత దివ్యకాంతులు విరజిమ్ము సుందరబాలుని ప్రసవించెను.
ఆ శుభంకరుడగు బాలకుని గని యామె పరమాశ్చర్యమందెను. ఆమె మేనెల్ల హర్షమున పులకించెను. ఆమె తన పతికిట్లు పలికెను :
'ప్రభూ! ఈ సుపుత్రుడు కడు దుర్లభుడు. ఇతని యందములు చిందులాడు నెమ్మొగమును కనులార గనుమా! అక్కటా! కాలరూపుడగు కంసు డీ బాలుని యిపుడే వధించునేమో కదా! వసుదేవుడును నిజమేయని ముద్దు లొలుకు బాలు నెత్తుకొనెను.
ఆ యద్భుత సుందరమూర్తి యగు తన తనయుని మోము దమ్మి కన్నుల కరవు దీర తిలకించి వసుదేవుడిట్లు చింతించెను :
'నే నిపు డేమి చేయుదు? నా కీ పుత్రనాశ దుఃఖ మెట్లు తొలగును? అని యిట్లు వసుదేవుడు చింతించు నంతలో గగనవాణి వసుదేవునితో స్ఫుటాక్షరముతో నీ విధముగ పలికెను :
'ఓ వసుదేవా! నీవు త్వరత్వరగా నీ బాలుని గోకులము చేర్చుము. నా మాయచే ఆరక్షు లెల్లరును నిద్రామోహితులైరి. ఎనిమిది వాకిళ్ళు తెరువబడినవి. ఈ బాలుని నందు నింటికి జేర్చుము. అచటి నుండి యోగమాయను దెమ్ము' అను నింగి పలుకులు కారాబద్దుడగు వసుదేవుడు వినెను.
అతడు చూడగా తలుపులు తెరవుబడియుండెను. వసుదేవుడు వేగిరమే బాలకు నెత్తుకొని ద్వారపాలకుల కంట బడక బయటికేగెను. అతడు యమునా తటము చేరి ప్రవాహ వేగము గని చింతితుడయ్యెను. కాని, నది మొలబంటి లోతు గలదయ్యెను.
అతడు చూడగా తలుపులు తెరవుబడియుండెను. వసుదేవుడు వేగిరమే బాలకు నెత్తుకొని ద్వారపాలకుల కంట బడక బయటికేగెను. అతడు యమునా తటము చేరి ప్రవాహ వేగము గని చింతితుడయ్యెను. కాని, నది మొలబంటి లోతు గలదయ్యెను.
అతడు యోగమాయా ప్రభావమున నది దాటి కాఱు చీకటిలో విజనమార్గమున గోకులము జేరెను. అతడు నందుని ద్వారము జేరి యచటి పశుసంపద చూచుచుండు సమయమందు యశోదాగర్భమున నొక శిశువుదయ మందెను. ఆ శిశువు త్రిగుణముల రాశి. దివ్య స్వరూపిణి యగు యోగమాయాంశమున జనియించిన దివ్య బాలిక.
అపుడొక దేవి యా ముద్దులు మూట గట్టు బంగారు పాపను తన కైదమ్ముల నుంచుకొని సైరంధ్రి వేషమున వచ్చి వసుదేవుని కిచ్చినది. వసుదేవుడును తన నందనుని సైరంధ్రి కయిదమ్ముల నుంచెను. వసుదేవుడు సంతోషముతో బాలనుగొని శీఘ్రముగ కారాగారమందున్న దేవకి పురిటిసెజ్జపై నుంచెను. అతడు భయచింతాగ్రస్తుడై యచ్చోట కూర్చుండియుండెను.
అంతలో వెంటనే యా బాలిక పెద్ద యెలుంగున నేడ్చెను. ఆ రోదనము విని రాజభటులు మేల్కాంచి వ్యాకుల చిత్తముతో నపుడే నరపతిని జేరి యిట్లు విన్నవించిరి.
మహామతీ! దేవకికి కొడుకు గలిగెను. వేగమే యేగుము' అను వారి మాటలు విని కంసుడు వడివడిగ పురిటింటి మొగ మేగెను. కారాద్వారములు తెరువబడెను. కంసుడు వసుదేవుని బిలిచి యిట్లనెను:
మహామతీ! వసుదేవా! నీ నందునుని దెమ్ము. దేవకి కష్టమ గర్భమున గలిగిన హరి నా పాలిటి మృత్యువు. కాన నేతని నిపుడే సంహరింతును' అను కంసుని మాటలు విని వసుదేవుడు భయగ్రస్తుడయ్యెను.
వసుదేవుడు పరితపించుచు వణకుచు పసిపాపను కంసుని చేతిలో బెట్టెను. కంసు డా కన్నియను గని పరమ విస్మయ మందెను. దేవవాణి కల్లయైనది. నారదభాషితము వ్యర్థమైనది. ఎట్టి సంకటస్థితిలోను వసుదేవుడు మాత్ర మెట్టు లసత్యమాడును?
నా ఆ రక్షులు కడు జాగరూకులై యున్నారనుటలో నెట్టి సందియము లేదు. ఇట్టిచో నీ కన్నియ యెట్టుల వచ్చెను? బాలు డేమయ్యెను? ఇందు సంశయము లేశమును లేదు. అంతయు కాల వైపరీత్యము అని తలచి కంసుడా పసిబాల పదములు పట్టుకొనెను. కఠినాత్ముడు ఖలుడు కులపాంసనుడు నైన కంసు డా చిన్నారి పాపను బండపై వేయ నుంకించెను.
అంతలో నాబాల యతని చేతి నుండి వెడలి గగన మండలము చేరినది. ఆ దివ్య బాలిక తేజోరూపమున మృదు వచనములతో నతని కిట్టు లనియెను :
'ఓరీ పాపీ! నన్ను చంపిన నీకేమి లాభమురా? నీకు బలవంతుడైన శత్రువెపుడో పుట్టెనురా! ఓరీ నరాధమా! బండగుండెవాడా! దురారాధ్యుడగు ఆ లీలామానుస విగ్రహుడు నిన్ను వధించి తీరును అని శివరూపిణియైన దివ్యబాల పలికి గగన తలమున అదృశ్యయయ్యెను. కంసుడాశ్చర్య చకితుడై యింటికేగి దానవుల నందరను పిలిచెను. అతడు క్రోధభయాతురుడై బక ధేనుకవత్సాది దానవుల కిట్లనెను :
'ఇపుడు మీరెల్లరును నా కార్యసిద్ధికి పూనుకొనుడు. మీరిపు డెక్కడ పుట్టిన బాలు నక్కడ మట్టు పెట్టుడు. బాలఘాతిని యగు పూతన యిపుడే నంద గోకులమున కేగ గలదు. ఆమె పుట్టిన ప్రతి శిశువును వెంటనే చంపగలదు. కేశి - వత్సక - బక - ధేనుక - ప్రలంబాది దానవులును నా కార్యము నెఱవేర్చుట కచటనే యుందురు గాక! అని యసురుల నాజ్ఞాపించి దుష్టకంసుడు తన యాలయమున కేగెను.
ఈ రీతిగ కంసుడు చింత్రాకాంత్రుడై మాటిమాటికి తన చావును దలపోయుచు దీనాతిదీను డయ్యెను.
అధ్యాయము 86 శ్రీ కృష్ణుని యత్యద్భుత చరిత్రము
అధ్యాయము 86 శ్రీ కృష్ణుని యత్యద్భుత చరిత్రము
No comments:
Post a Comment