Wednesday, April 15, 2026

Chapter 94 The gods take refuge in the Trimurthy - అధ్యాయము 94 దేవతలు త్రిమూర్తుల శరణు చొచ్చుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 94

దేవతలు త్రిమూర్తుల శరణు చొచ్చుట

దానవులు వ్యాకులు చిత్తులగుట గని మహిషుడు మహిషరూపము వీడి సింహరూపము దాల్చెను. అది తన జూలు విదలించుచు భీకరముగ గర్జించుచు వాడిగోళ్ళతో గీకుచు దేవసేనలోనికి దుమికెను. ఆ సింహము తన వాడిగోళ్ళ దెబ్బలచే గరుడుని చీల్చి యతనిని నెత్తుట ముంచెను. 

విష్ణుబాహువులను గోళ్ళచే గాయపఱచెను. అదిగని హరియును కోపాతిరేకమున దానిని చంపదలచి చక్రము చేబూని వేగమే దానిమీద కురికి దానిని చక్రముతో గొట్టెను. అంతలో నది మహిషమై తన వక్షమునకు దగిలిన దాని కొమ్ముల దెబ్బలకు తాళలేక హరియు వేగమే వైకుంఠమున కరిగెను. అట్లు విష్ణువేగుట గని మహిషుడు చంపబడడని శంకరు డెఱిగి తానును కైలాస మేగెను. బ్రహ్మయును భీతిల్లి త్వరగ బ్రహ్మలోక మేగెను. 

ఇంద్రుడు మాత్రము వజ్రము ధరించి యచ్చోటనే యుండెను. యముడు దండమును వరుణుడు శక్తిని దాల్చి ధైర్యము చిక్కబట్టుకొని వానినెదిరి నిలిచిరి. కుబేరుడును రణమునకు మోహరిల్లెను. అగ్నియును శక్తిగొని సమరమున కుద్యుక్తుడయ్యెను. సూర్యచంద్రులొక్కటిగజేరి యా దానవునితో బోరదలచిరి. అంతలో దానవ బలములు తీవ్ర క్రోధముతో క్రూర విషము వంటి బాణములు గురియుచు ముందునకు నడచెను.

దానవపతి తిరిగి మహిషరూపము దాల్చెను. అంత దేవదానవ యోధుల నడుమ చెలరేగిన తుముల నాదము మింట పిక్కటిల్లెను. వారి ఘోరసంగ్రామ మందు మేఘధ్వనులో యన వారి విండ్ల నారులు మ్రోతలును కరతాళ ధ్వనులును పెల్లు చెలరేగెను. ఆ మదమత్త దానవుడు తన శృంగములతో గిరి శృంగములు పెకలించుచు చిమ్ముచు సురసంఘమును బాధ పెట్టుచుండెను. 

ఆ మహిషు డద్భుతకరుడై రోషావేశమున గొందఱిని గిట్టల తావుల చేత మఱికొందఱిని తోకతో జుట్టి త్రిప్పుచు హింసించుచుండెను. అది కని దేవగంధర్వులు వెఱగందిరి. ఇంద్రుడు నతనిని గాంచి యట నిలువలేక వెన్నుచూపెను. ఇంద్రుడేగిన వెంటనే యమ - వరుణ - కుబేరులును భీతులై పరుగుదీసిరి. మహిషుడు స్వవిజయము ప్రకటించుటేకాక ఇంద్రుడు వదలిన యైరావతమును ఉచ్చైశ్శ్రవమును సూర్యుని కామధేనువును గ్రహించి సైన్యసమేతముగ వెంటనే స్వర్గమేగి భయాతురులగు దేవతలు విడిచి పెట్టిన స్వర్గ రాజ్యమును గ్రహించెను. 

ఇంద్రాసనమెక్కి దేవతల స్థానములలో నాయా దానవులను నియమించెను. అట్లు మహిషుడు మదగర్వముతో నూరేండ్లు పోర యింద్ర పదవి బడసెను. దేవతలు స్వర్గము నిర్గమించి భయపీడితులై పెక్కేండ్లు గిరి గుహలందు తలదాచుకొనిరి.

వారలసి సొలసి రజోరూపుడు చతుర్ముఖుడు నగు బ్రహ్మను శరణు వేడిరి. వేదగర్భులు వేదవేదాంగ పారగులు శాంతులు నగు మరీచి ముఖులగు మునుల చేతను కిన్నర - సిద్ధ - గంధర్వ - చారణ - పన్నగ గణముల చేతను సేవింపబడుచున్న వేద గర్భుడును జగద్గురువునగు పద్మగర్భుని భీతులగు దేవతలీ తీరుగ నుతింపదొడంగిరి. 

ఓ ధాతా! జలజసంభవా! అఃలార్తిహరా! మేము మహిషునిచేత వోటుపడి పీడితులమై పదభ్రష్టులమై గిరిగుహ లందిడుమలు గుడుచుచున్నాము. ఇట్టి సురలపై దయపూనవేమి? ఈ వింత ఏమి? తన కొడుకులు నూఱు తప్పులు చేసినను తండ్రి మమత చంపుకొని వారి నిడుమల పాలు చేయునా? ఇక నీ పరభక్తులు దైత్యభీతులు దిక్కులేనివారు నగు సురలను నీవుపేక్షించుకున్నావేమి? 

ఆ దుష్టుడు సర్వభోగము లనుభవించుచు యాగహవిర్భాగములు గైకొనుచు పారిజాత పరీమళములతో జలనిధి వంటి కామధేను సౌఖ్యము లనుభవించుచున్నాడు. 

దేవేశా! ఆ దానవుల యద్భుత చేష్టలెన్నియని చెప్పుదుము. నీవఃల కార్యవిదుడవు. జ్ఞానమున సర్వ మెఱుగుదువు - కనుక మేము నీ పదపద్మములకు ప్రణమిల్లుచున్నాము. మేమెక్కడి కేగిన నక్కడనెల్ల నానాచరణములతో ఆ పాపమానసుడు మాకు పెక్కు బాధలు గల్గించుచున్నాడు. 

మాకు నీవే రక్షకుడవు. మాకు మేలు చేకూర్పగదవయ్యా! మేము దుఃఖ దావాగ్ని పీడితులము; నీవు సృష్టికర్తవు; ధాతవు; శరణ్యము. ఇట్టి నిన్ను కాదని మరెవ్వడో మేలుచేయగలడని మేమింకొకని నెవని నాశ్రయింతుము?'' అని యీ తీరున సురలు దోయిలించి విషణ్ణ వదనులై మాటిమాటికి ప్రజాపతిని సన్నుతించిరి. అంతటి బాధలోనున్న సురలనుగని లోకపితామహుడు మధురవాక్కులతో వారికి సుఖము గలిగించుచు నిట్లనెను :

సురలారా! నా చేత నేమున్నది? నేనేమి చేయగలను? వాడు వరగర్వితుడు, వాడు స్త్రీవధ్యుడుగాని - పురుష వధ్యుడుకాడు. మనమిపుడు సర్వతోత్తమ మగు కైలాసమేగుదము. కార్యవిశారదుడగు శంకరుని సన్నిధికేగి అచట నుండి సర్వ కార్య విశారదుడగు శంకరుని మున్నిడుకొని మనము జనార్దనుని నివాసమగు వైకుంఠధామ మేగుదము. 

అచ్చట నందఱమును గలిసి దేవకార్యము గూర్చి విశేషముగ చర్చించుదము అని పలికి కార్యసిద్ధికై బ్రహ్మ రాయంచనెక్కి సురలను తోడుకొని కైలాసగిరికి పయనమయ్యెను. అంతలో శివుడును ధ్యానమున బ్రహ్మరాక నంతయు నెఱిగి కైలాసము నుండి వారి కెదురు వచ్చెను. శివబ్రహ్మ లొకరినొకరు చూచుకొని పరస్పరము నమస్కరించుకొని యానంద భరితులైరి. దేవతలును పరమశివున కంజలి ఘటించిరి. శివుడు వారి వారి కుచితములగు నాసనములందు వారివారి నాసీనులుగ జేసి తానును తన యాసన మధిష్ఠించెను. వృషభ వాహనుడు వారి కుశలమడిగి కైలాసమునకు వారి రాకకు కారణము నెఱుగ నిట్లనియెను : 

'ఓ విధీ! నీవు సురపతిని సురులను వెంటగొని రా కారణమేమి? తెలుపుము. 

బ్రహ్మ యిట్లనెను : మహాదేవా! సురేశానా! ఇంద్రునితోడి దేవతలెల్లరును మహిషునిచేత పీడితులై భయత్రస్తులై గిరి గుహలందు వసించు చున్నారు. మహిషుడును తదితరసురులును యజ్ఞభాగభోక్తలైనారు. వారిచేత పీడితులై లోకపాలురును నిన్ను శరణుజొచ్చియున్నారు. 

సర్వభూతేశ్వరా! వారిని నేనే ఈ కార్యభార వశమున తోకొని వచ్చితిని. ఈ దేవకార్యమునకేది తగునో దానిని చేయుము. 

భూతభావనా! సకల దేవతల భారము నీవొక్కడవే వహింప దక్షుడవు అను బ్రహ్మవాక్కులు విని శివుడు చిరునగవు నగియెను.

శివుడు తీయని మాటలతో బ్రహ్మతో నిట్లు పలికెను : 'విభూ ! మున్నతనికి నీవే వరమొసగితివి. దాని మూలమున దేవతలకు చేటు మూడినది. వాడు బలవంతుడు; భీకరుడు; దేవాంతకుడు. ఇపుడేమి చేయగలము? ఆ మదగర్వితుని చంపుటకు తగిన వీరనారీమణి యెవర్తుక గలదు. నీ భార్యయు నా భార్యయు యుద్ధము చేయదగరు గదా! వారొకవేళ యుద్ధమునకు బోయినను యుద్ధమెట్లు చేయగలరు? 

ఇంద్రాణికిని యుద్ధమందు నేర్పులేదే! వాడు మదదర్పితుడు; పాపి. వాని నింకెవరు చంపజాలుదురు? మనము జనార్దనుని చెంత కేగుట మంచిదని నా యభిప్రాయము. మనము విష్ణుని ప్రస్తుతించి యతనిని కార్యార్థము ప్రేరింతము. అతడు సత్వరముగ కార్యసిద్ధి గలిగించు బుద్ధిమంతుల లోపల మేటి సారమతి. మఱి మన మా వాసుదేవుని గూడి కార్య మాలోచింతము. 

అతడు తన మహాబుద్ధితో మన కార్యము చక్కబఱచగలడు అను రుద్రుని వచనము లాలకించి బ్రహ్మాదిదేవత లెల్లరు నట్లే యగుతమని లేచి శివుడు తోడురాగా కార్యసిద్ధిని సూచించు శుభశకునముల గనుచు విష్ణుధామమున కేగిరి. 

అపుడు శుభసూచకముగ చల్లని మెల్లని పిల్లగాలులు వీచెను. పక్షులు మంగళరావము లొనరించెను. ఆకాశము దిక్కులు నిర్మలములయి తోచెను. అట్లు దేవతల ప్రయాణమున నెల్లెడల నంతయు శుభ సూచకమయి కనిపించెను.

అధ్యాయము 95 శ్రీదేవి యావిర్భవించుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...