Saturday, August 22, 2026

Suuryaastamaya Chandrodayamula Varnanamu - సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము

కాలమనే కిరాతుడు, ఆకాశమనే అరణ్యంలో, చీకటి అనే ఏనుగును బంధించడానికై పూనుకొని మచ్చుపెట్టుటకు తయారుచేసిన మామిడిచిగుళ్ల చెండా అన్నట్లుగా మార్తాండుడు మందగించిన కాంతితో పడమటి పర్వతంమీద చూడముచ్చట గొలిపాడు.

పరీక్షిన్మహారాజా! ఆకాశమనెడి వనిత లేతవయసువాడూ, చల్లని కిరణాలుగలవాడూ (చల్లని చేతులవాడు) అయిన చంద్రుణ్ణి వలచి, వృద్ధుడూ వాడికిరణాలు గలవాడూ (కరకు చేతులవాడు) అంటూ తన్ను త్రోసి రాజన్న విధంగా భానుడు పడమటి కొండదగ్గర అస్తమించాడు.

తాను షోడశ కళాపూర్ణుడగు గాక! లక్ష్మీదేవి తనకు తోబుట్టువగుగాక! తాను శివుని సిగనెక్కి నిక్కుగాక! అన్యుడైన ఆ చంద్రుడిపొత్తు మాకు అక్కరలేదు. తపింపజేసేవాడయినప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రతవలె పద్మినీజాతి మూతి ముడుచుకుంది.

ఒప్పిదమైన సాయంకాలసంధ్యావందనంలో బ్రాహ్మణులయొక్క అర్ఘ్యప్రదానజలాలనే వజ్రాయుధంచేత ఖండించబడిన మందేహులనే రాక్షసులయొక్క దేహాలనుంచి వెలువడే రక్తస్రావమో అన్నట్లుగా సంజకెంజాయ పడమటి దిక్కులో వ్యాపించింది.

(అమృత పానవిషయంలో ఏర్పడిన నష్టం కారణంగా - రాక్షసుల్లోని - మందేహుడు, అరుణుడు అనేవాళ్లు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, సూర్యునితో యుద్ధం చేస్తుండేటుగా వరంపొందారు. వీళ్లు సూర్యగమనాన్ని అడ్డుకొంటుంటారు. వీళ్లను చంపడానికి మూడుసంధ్యల్లో బ్రాహ్మణులు గాయత్రీ మంత్రంతో వదిలే అర్ఘ్యంకారణంగా - ఆ యిద్దరూ హతులవుతారు. కానీ బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం వల్ల మరలా బ్రదుకుతుంటారు. ఈ విషయం సాయంసంధ్యావర్ణనమైన అని ఇక్కడ ప్రస్తావించబడింది.

నారాయణమూర్తియొక్క కీర్తి అనే క్షీరసాగరం భూమినుండి గగనం వరకు వ్యాపించింది. అది కర్కట, మకర, మీనరాశులచే అతిశయించింది. అట్టి పాలవెల్లిలోని తుంపురులో అన్నట్లు చుక్కలు ఆకాశంలో ప్రకాశించాయి.

(కీర్తి అనే క్షీరసాగరంలోని తుంపురు - ఆకాశంపైకి ఎగిరాయి. అది ఆకాశంలో కర్కటక, మకర, మీన రాశుల్లాగా ఉన్నాయి.)

అన్ని దిక్కులందు నిండిన లక్ష్మీనాథునిమహిమ పరిమళించుటకై బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలు అన్నట్టు ఆకాశ వీథులన్నింటిలో చీకట్లు ముసురుకున్నాయి.

(కస్తూరి నల్లగా ఉంటుంది కనుక చీకట్లను కస్తూరిగా భావించడమైంది.)

గగనవీథులంతటా నిండిన కారుచీకటి తన వెంటబడి తరుమగా భయపడి సూర్యుడు తూర్పుదిక్కునుంచి చౌకళిస్తూ పరుగెత్తి, మేరుగిరిని అడ్డదారిలో క్షేమంగా చేరినాడే తప్ప - ఆ చీకటిని ఎదిరించి నిలిచితే అతడు తప్పక పరాజయం పాలయ్యేవాడే!

సూర్యుడు అస్తమించాడు. చీకటి ఏర్పడబోతున్నది. ఆ చీకటి తామరలను జూచి ఓ తమ్ములారా! చంద్రుడు మీకూ మాకూ శత్రువే. అతడు దోషాకరుడు - అంటే రాత్రిని కలుగజేసేవాడు. అడుగో రాబోతున్నాడు. మా బాలకులను స్వీకరించి భద్రంగా మీ కడుపుల్లో పెట్టుకొని కాపాడండి అంటూ చీకటి తన పిల్లలను దాచడానికి అప్పగించిన రీతిగా తుమ్మెదలు తామర మొగ్గలందు చిక్కుకొని, వెలుపలికి రాలేక రాత్రి అంతా అక్కడే నివసించాయి.

చకోరపక్షులకు ప్రీతినీ, విటకాండ్రకు భీతినీ కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. అతడు తూర్పుదిక్కనే కోమలి ముఖంపై దీపించే కుంకుమబొట్టు అన్నట్లుగానూ, వియోగుల ధైర్యమనే తీగల్ని త్రెంచడానికి గర్వంతో మన్మథుడెత్తిన కొడవలి అన్నట్లుగానూ, కాలుడనే బోయవాడు చీకటి అనే మృగాన్ని ఖండించడానికి జళిపించే కత్తి అన్నట్లుగానూ, ఆకాశమనే కానుగుచెట్టు యొక్క తూర్పుకొమ్మలో మెరిసే మెత్తని చిగురాకు అన్నట్లుగానూ ఉన్నాడు. అతణ్ణి చూచి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. సాగరం తరగలెత్తి అంబరమంటింది.

ఓ పరీక్షిన్మహారాజా! త్రుళ్ళిపడుతున్న చుక్కలరేడు చక్కగా ప్రకాశించగా పండువెన్నెల గగనతలమంతా వ్యాపించడంచేత బ్రహ్మాండం కర్పూరంతో నిండిన బరణి మాదిరి వెలుగొందింది.

ఆ వెన్నెలరాత్రి బలరామకృష్ణులు గోపకులతో కలసి పాలబువ్వ ఆరగించి, మనసులో కంసుని ప్రయత్నాలన్నీ గమనిస్తూ యథేచ్చావిహారాలతో ఆ నగరోపవనంలో జాగరూకులై గడిపారు.

కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావటమూ, తన అనుచరులను వధించడమూ, పెను ధనుస్సును విరిచి వేయడమూ విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు. మనసు కలక బారింది.

భోజభూపతి కంసుడికి మరణకాలం సమీపించడంవల్ల చెవిరంధ్రాలను చేతులతో మూసినపుడు తనలోపలి ప్రాణవాయువుయొక్క సంచారధ్వని వినిపించడం లేదు. నీళ్ళు, అద్దం మొదలైన వాటిలో తన ప్రతిబింబాన్ని చూచినపుడు తన శరీరంమీద తల కనిపించడం లేదు. 

ముక్కుకొసను వ్రేలుంచి పైకి వీక్షించినపుడు ఆదిత్యాదిగ్రహాలు, అశ్వని మొదలైన నక్షత్రాలు ఒక్కొక్కటి రెండు రెండుగా కనిపించాయి. వెలుతురులో నిలబడి తన నీడను చూచినప్పుడు ఆ నీడ నడుమరంధ్రాలు కనిపించసాగాయి. నేలమీద తాను నడచిన అడుగుల గుర్తు కనిపించడంలేదు. అతని కంటికి కనిపించే చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. అతని బుద్ధి కలత చెందింది.

(మరణం దగ్గర్లో రానున్నవారికి - ఇక్కడ చెప్పిన దుస్సంఘటనలు గోచరిస్తాయి. ఇలా జరిగితే మృత్యువు తప్పదని శాస్త్రం.)

కంసుడు విషం తిన్నట్లు, శవాన్ని కౌగిలించుకొన్నట్లు, దిసమొలతో ఉన్నట్లు, నూనెతో తలంటుకొన్నట్లు, గాడిద నెక్కినట్లు కలగన్నాడు. (ఇలాంటి స్వప్నాలూ సన్నిహిత మృత్యువునే సూచిస్తాయి.)

ఇంకా ఎర్రని పూలదండలు ధరించి ఏకాకై ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కల గాంచాడు. మరణానికి కారణమైన భయంతో కంసుడు దుఃఖాక్రాంతుడై నిద్రపోక ఆ రాత్రి ఎలాగో వేగించాడు.

సూర్యోదయ వర్ణనము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Srikrishnundu Rajakuni Jampi Vaayakasudamu Losangu Poojala Nangikarinchi Melosanguta - శ్రీకృష్ణుండు రజకుని జంపి వాయకసుదాము లొసంగు పూజల నంగీకరించి మేలొసంగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుండు రజకుని జంపి వాయకసుదాము లొసంగు పూజల నంగీకరించి మేలొసంగుట

ఓ రజకకులశిరోమణీ! మేము మీ రాజుగారినగరానికి అతిథులమై అరుదెంచాము. మా మందలో మాకు ధరించడానికి మంచిగుడ్డలు లేవు. నీ మూటలో ఉతికిన అందమైనబట్టలు ఉన్నాయి. మేము రాజుగారికి మేనల్లుళ్ళం. ఆ వస్త్రాలు మాకు ఇవ్వు. నీకు మేలు కలుగుతుంది.

శ్రీకృష్ణుడు అలా అడిగిన మీదట ఆ చాకలి కోపంతో ఇలా అన్నాడు.

ఏమిరా బాలా! ప్రభువుగారివస్త్రాలు మీ కివ్వమంటారా? ఇది న్యాయమా? మీరు ఆ వస్త్రాలు ధరించడానికి అర్హులా? పాలు, నెయ్యి, పెరుగు మెక్కి తలకొవ్వి ఇలా కూశారు. కాకపోతే గొల్లలైన మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? అయ్యో! కంస మహారాజుగారి ఆగ్రహానికి గురియై నీవు ప్రాణాలు పోగొట్టుకుంటావు సుమా!

ఓ గొల్లపిల్లవాడా! మా రాజుగారిసొమ్ము అంటుకోవడానికి ఏ రాజులైనా భయపడతారు. నీకింత వేళాకోళంగా ఉందా? రాజులకు రాజైన కంసునిరాజ్యంలో నీకింత రాజసమా? తొలగిదూరంగా పో!

చాకలివాని మాటలు విని శ్రీకృష్ణుడు కోపించి

ధీరుడైన శ్రీకృష్ణుడు - బీరంతో రెచ్చినవాడూ, పొగరుబోతూ, తెలివిమాలినవాడూ అయిన ఆ చాకివాణ్ణి భయంకరమైన తన ముంజేతితో తల ఊడిపడేటట్లు కొట్టాడు. దీన్ని చూచి పురవాసులగుండెలు పగిలిపోయాయి.

ఇలా నేల గూలిన చాకలిని చూచి వానిమనుషులు బట్టలు అక్కడ వదలి భయంతో పరుగెత్తిపోయారు. అంతట బలరాముడూ, శ్రీకృష్ణుడూ తమకు కావలసిన వస్త్రాలు కట్టుకొని కొన్నిటిని గోపకులకిచ్చి ముందుకు సాగాగా

ఆ సమయంలో ఒక నేత పనివాడు ఆ దారిలో వస్తున్న వసుదేవునికుమారులైన రామకృష్ణులను చూచి, వారు మెచ్చుకొనేటట్లు పలురంగులు కలిగి మిక్కిలి మెత్తనివైన వస్త్రాల్ని నగల్ని పరమ సంతోషంతో ఇచ్చాడు

శూరులైన రామకృష్ణులు వాటిని దయతో స్వీకరించి, అలంకరించుకొని సింగారించబడిన దిగ్గజాల గున్నలమాదిరి ప్రకాశించారు. అంతట మాధవుడు ఆ చేనేత పనివాని పరిచర్యకు పరమసంతుష్టుడై అతనికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి, దేహావసానంలో సారూప్యమనే ముక్తిని ప్రసాదించాడు.

అనంతరం రామకృష్ణులు పూలదండలుకట్టే సుదాముని ఇంటికి వెళ్ళారు. అతడు వీరిని చూచిన వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా అర్ఘ్యం, పాద్యం మొదలైన పూజావిధులతో సత్కరించాడు రామకృష్ణులకు, వారివెంటవచ్చిన వారికీ తాంబూలాలు, పూలు, గంధాలు ఇచ్చి ఈ రీతిగా అన్నాడు.

ప్రపంచానికి ఆదికారణమూర్తులై ధరణీచక్రాన్ని రక్షించడంకోసం ఇట్లా అవతరించిన మహానుభావులు మీరు. మీ రాకవల్ల నా వంశం పవిత్రమయింది. నా తపస్సు ఫలించింది. నా యిల్లు సిరిసంపదలతో నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ ప్రకారం నడుచుకోవాలి? ఏ పనులు చెయ్యాలి? నేను మీ సేవకుణ్ణి, సెలవియ్యండి.

అతిశయించిన కీర్తిచే చంద్రుణ్ణి అపహరించేవారూ, మగువల పాలిటి మన్మథులూ అయిన ఆ బలరామకృష్ణులకు సుదాముడు మిక్కిలి పరిమళంతో కూడిన పూలమాలలు సమర్పించాడు.

బలరామశ్రీకృష్ణులు సుదాముడిచ్చిన పూలమాలలతో అలంకరించుకొని, 'ఏమికావాలో కోరుకో. నీవు కోరినవరం ఇస్తాము' అని దయతో పలుకగా సుదాముడు శ్రీకృష్ణునితో ఇట్లన్నాడు.

తపస్వులకు కల్పవృక్షం వంటివాడా! కృష్ణా! కమలములవంటి నీ పాదాలపరిచర్యనూ, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సకలప్రాణులమీద అత్యంతమైన, అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించండి.

(భగవత్ప్రార్థనా పరమైన భాగవత పద్యాలలో "ఎవ్వనిచే జనించు", “నీ పాదకమలసేవయు” బహుళవ్యాప్తిలోఉన్న ఆణిముత్యాలు. అసాధువులైనవారు భౌతిక సంపదలు కోరుతారు. సుదాముడు మహాత్ముల కోవలోనివాడు గనుక స్వామి పదసేవనే కోరుకున్నాడు.)

ఇలా వేడుకొన్నవన్నీ అనుగ్రహించి, ఇంకా శ్రీకృష్ణుడు సుదాముడికి బలం, ఆయుస్సు, తేజం, యశస్సు, సిరిసంపదలు కరుణించి, వానిఇంటినుండి బలరామసహితుడై బయలుదేరి రాజవీధిలో సాగిపోయాడు.

కమలములవంటి కన్నులుగల శ్రీకృష్ణుడు పలురకాల మైపూతలుంచిన పాత్ర పట్టుకొని వస్తున్న కుబ్జను చూచాడు. దానిముఖకాంతిముందు పద్మం తలవంచుకుంటుంది.

కు
బ్జను చూచి శ్రీకృష్ణుడు ఇట్లన్నాడు

ఓ పద్మాక్షీ! నీవు ఎవ్వరిదానవు? ఈ కలపములు ఎవరికోసం తీసుక వెళుతున్నావు? నీ పేరేమిటి? ఈ మైపూతలన్నీ మాకివ్వు. అలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు.

శ్రీకృష్ణుణ్ణి మాటలకు కు
బ్జ ఇలా బదులాడింది.

ఓ సుందరాంగుడా! నీవు బలే అందగాడివిలే. పరిహాసవచనాలతో నన్ను వేధించకు. లోకంలో అందరికీ అందాలు ఎక్కడినుండి వస్తాయి? నన్ను త్రివక్ర అంటారు. నేను కంసుడిదాసిని. అచ్చమైన మైపూతలు చేయడమే నా నేర్చిన విద్య. నన్ను రాజు మిక్కిలి మెచ్చుకుంటాడు. మీరు ఈ చందనాదివిలేపనాలు పూసుకొనండి.

ఇలా పలికి పడుచువారైన ఆ బలరామకృష్ణుల నెమ్మేనులు, నవ్వులు, చూపులు, పలుకులు తనమనస్సును కరగించగా ఆ కు
బ్జ ప్రేమతో వారికి మైపూతలు ఇచ్చింది.

ఈ విధంగా కు
బ్జ ఇచ్చిన విలేపనాలు అన్నింటినీ వెన్నుడు తన ఒంటినిండా పూసుకొని ఆమెపట్ల ప్రసన్నుడయినాడు. మువ్వంపులుగల ఆమె దేహాన్ని చక్కనొత్త దలచాడు. కుబ్జమీగాళ్ళమీద తన అడుగులుంచి అదిమిపట్టినాడు. తనచేతి రెండు బొటన వ్రేళ్ళను దాసి గడ్డం క్రిందపెట్టి ఒడలు చక్కగా సాగునట్లు పైకెత్తినాడు. అంతలో అది వంపులు దీరి మన్మథుని సమ్మోహనాస్త్రంవలె పొలుపారింది. పిరుదులు, చనుగవ, సాంపునింపగా కుబ్జ చక్కని చుక్కై కమలాక్షుడివైపు కాంక్షతో చూచింది.

కాముకురాలైన కు
బ్జహృదయం మదనుడి బాణసమూహంతో చెదరిపోయింది. ఆమె మన్మథాకారా! నా యింటికి దయచెయ్యి అంటూ పద్మనాభునిపయిపంచె చెంగుపట్టుకొని లాగింది.

ఆ కాముకురాలు అలా లాగగా కృష్ణుడు బలభద్రుణ్ణి జూచి, నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు. ఓ చంద్రముఖీ! నా వచ్చిన పని సాధించిన తర్వాత నీ గృహానికి వస్తాను. నేడు కోపించకు.

ఇలా అంటూ ఆమెను సాగనంపి కృష్ణుడు అంగడి వీధిలో వెళ్ళి వెళ్ళీ పురప్రజలిచ్చిన తమ్ములములూ, పూలదండలూ, చందనాలూ ఇంకా పలువిధాలైన కానుకలు స్వీకరిస్తూ ధనుశ్శాలకు వెళ్ళాడు. అక్కడ

ఇంద్రధనుస్సువలె మిక్కిలి గొప్పదైై, మేటి వీరులచే రక్షింపబడుతున్న దుర్భరమైన ఆ వింటిని అతడు వీక్షించాడు. రక్షకులు వద్దని అంటుండగా పక్కున నవ్వి ఉత్సాహవంతుడైనాడు.

ధైర్యానికి సాగరం వంటివాడైన శ్రీకృష్ణుడు తనచుట్టాలు మెచ్చగా ఎడమచేతితో అలవోకగా ధనుస్సును పైకెత్తాడు. తీగవంటి అల్లెత్రాటిని కొద్దిగా లాగి తగిలించి నారిని మొరయిస్తూ మదపుటేనుగు చెరకు గడను తునిమే రీతిగా జనులు చూస్తుండగా వింటిని రెండుగా విరిచి వేశాడు.

పరీక్షిన్మహారాజా! విల్లు విరిగినప్పుడు పుట్టిన చప్పుడు చెవులకు భీతి గొల్పుతూ, దిగంతరాలను పూరిస్తూ భోజభూపాలుడైన కంసుడి ధైర్యాన్ని భేదించింది.

“ఔరా! ఈ బాలు డేమాత్రం సందేహించక శౌర్యంతో ఇపుడు రాజుగారిధనుస్సు ఖండించాడు. ఇది సహించరాని సాహసకార్యం. ఇతణ్ణి పౌరుషంతో పట్టాలి” అంటూ చాపరక్షకులు కోపోద్రేకంతో వెంటనే లేచి మీదికి వచ్చారు. అంతట రామకృష్ణులు ఇద్దరూ ఆ వింటితుంటలు చేతపుచ్చుకొని వారిని పట్టి కొట్టి మట్టు పెట్టారు.

ఈ విధంగా బలరామకృష్ణులు మథురాపురంలో విహారంచేసి అక్కడినుంచి బయలుదేరి తమ విడుదులకు వెళ్ళిపోయారు. పిమ్మట

సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnamurthy Madhuraa Nagara Pravesamu Seyuta - శ్రీ కృష్ణమూర్తి మథురా నగర ప్రవేశము సేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణమూర్తి మథురా నగర ప్రవేశము సేయుట

పుణ్యాత్ముడివైన అక్రూరా! యాదవవంశానికి శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత ఇల్లు చూడడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకొని నగరానికి వెళ్ళుము.

అని ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు నగరంలోనికి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెల్పి తన ఇంటికి వెళ్ళాడు. కృష్ణుడు అపరాహ్ణకాలంలో బలరామునితో, గోపకులతో కూడినవాడై మథురానగరం ప్రవేశించాడు.

శ్రీకృష్ణు డల్లంతలో అగడ్తలు, కోటలు, బురుజులు, టెక్కెములు, రాజభవనాలు, వీథులు, గుర్రాలు, రథాలు, గజాలు, మేడలు, శూరభటులు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్పఉద్యానవనాలు, నడబావులు, మొదలైనవాటివల్ల అత్యద్భుతమైన శోభతో విరాజిల్లే మధురానగరాన్ని వీక్షించాడు

శ్రీకృష్ణుడు మధురాపురిలో ప్రవేశించి వచ్చేవేళలో

ఓ రమణులారా! నందుని తపస్సుకు ఫలమైనవాడు, మేల్మిగుణాలరాశి, గొల్లవనితల నోములపంట, ఇందిరా సుందరిడెందానికి ఆనందం కలిగించేవాడు, కరుణకు సముద్రుడు, యోగిసమూహాలు తమమనసుల్లో కోరుకొనే అపురూపమైన పెన్నిధీ అయిన అచ్యుతుడు వస్తున్నాడు. కన్నుల కోర్కే తీరేటట్లు వెళ్ళి దర్శిద్దాం, రండి.

అంటూ పట్టణంలోని అందగత్తెలు గోవిందుణ్ణి సందర్శించడానికి ఉబలాటపడి ఒకరి నొకరు పిలుచుకున్నారు. వారు అన్నం తింటున్నప్పటికీ పాత్రలను అవతలికి నెట్టివేశారు. పరుండి ఉన్నప్పటికీ పడకలనుంచి లేచారు. తలంటుకొంటున్నప్పటికీ స్నానం చేయలేదు. పెద్దలచే దండింపబడుతున్నప్పటికీ జంకినవారు కారు మగలతో క్రీడిస్తున్నప్పటికీ క్రీడించడం చాలించారు. పసిపాపలను పట్టుకొన్నవారైనప్పటికీ దింపివేశారు. అలంకరించుకుంటున్న వారయినప్పటికీ పరస్పరం చీరలు, నగలు, పూలదండలు, మైపూతలు తారుమారుగా ధరించి వెళ్ళీ

పట్టణంలో ఉండే స్త్రీలంతా రత్నాలు తాపిన ఎత్తయిన బంగారు మేడలపై గుంపులు గూడి విశాలమైన వక్షస్థ్సలం కలవాడూ, తామరరేకులవంటి కన్నులుగలవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి చూశారు.

పూతన అనే రాక్షసి అసువులు వీడేటట్లు స్తన్యపానం చేసిన అసాధ్యుడైన అర్భకుడు వీడేనంట! నందుని ఇల్లాలు యశోదకు, తన నోట విశ్వమంతా చూపించిన ముద్దుబిడ్డడు వీడేనట! గర్వించి మందలోని వెన్నలు దొంగిలించి భక్షించిన దొంగ వీడేనట! మనసులు కరిగించి గొల్లకన్నెల మానాన్ని కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనట! ఇతడు లేనిపట్టణం అరణ్యప్రదేశం. ఇతణ్ణి కలియని జన్మ నిరుపయోగం. ఇతణ్ణి పలుకరించని పలుకు పక్షిపలుకు. ఇతణ్ణి దర్శించని చూపులు నిజంగా వ్యర్థాలు.

ఓ చెలీ! పడుచువారిలో మిన్నయైన ఈ కృష్ణుణ్ణి గోపికాస్త్రీలు చేతిలో ఉసిరిక కాయమాదిరి క్రీడకు తెచ్చి ధ్యానిస్తూ, కీర్తిస్తూ సంభాషిస్తూ స్పృశిస్తూ, నవ్వుతూ, లాగుతూ, లాలిస్తూ నిత్యం ఆనందిస్తున్నారు. వారు ఇలాంటిఆదరాన్ని పొందడానికి గడచిన పుట్టుకల్లో ఏ అడవుల్లో ఎటువంటి నోములు నోచారోగదా!

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధంగా ఆ పట్టణంలోని అతివలు అదేపనిగా తమ నేత్రాలతో హరిరూపాన్ని ఆస్వాదిస్తూ హృదయాలలో నిల్పుకున్నారు. సంతోషంతో పూలజల్లులు చల్లారు.

అనంతరం మథురానగరంలోని బ్రాహ్మణులు పలురకాల చందన ద్రవ్యాలనూ, పూలు, పండ్లు మొదలైనవాటినీ, శుభకరాలైన పచ్చని అక్షతలనూ కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవకుమారులను ఉత్సాహంతో పూజించారు.

ఆ సమయంలో నగరంవాకిటినుంచి వస్తున్న బట్టలు ఉదికి రంగులు వెసే ఒక చాకివాణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుండు రజకుని జంపి వాయకసుదాము లొసంగు పూజల నంగీకరించి మేలొసంగుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Akrurundu Yamunalo Ramakrishnula Darsinchi Nuthinchuta - అక్రూరుండు యమునలో రామకృష్ణుల దర్శించి నుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
అక్రూరుండు యమునలో రామకృష్ణుల దర్శించి నుతించుట

ప్రజ్ఞానిధి అయిన అక్రూరుడు చాలసేపు యమునలో స్నానంచేసి ఆ చల్లనినీటిలో రామకృష్ణుల్ని దర్శించాడు. తీరమందలి చెట్లనీడలో, రథమధ్యంలో ఉన్న వీరు నీళ్ళలోపలికి ఎప్పుడు వచ్చారని ఆశ్చర్యపడి నీళ్ళలో ముంచిన తల పైకత్తి లేచి దృష్టిసారించి చెట్లనీడలో మునుపటివలె రథమధ్యంలో కూర్చున్న ఆ బలరామకృష్ణులను మరల చూశాడు.

(శ్రీకృష్ణుడు భగవంతుడు. భగవంతుడు సర్వవ్యాపకుడు కావడంచేత ఏక కాలంలోనే కాళిందీజలాల్లోనూ, గట్టుమీది రథంలోనూ కనిపించాడు.)

చూచి అక్రూరుడు ఆశ్చర్యపడి

పావనమైన నడవడిగల ఈ రామకృష్ణులను తొలుత రథంమీద వీక్షించాను. తరువాత నీటిలో దర్శించాను. ఇప్పుడు మరలా మునుపటి రథంలోనే ఉండటం చూస్తున్నాను. ఈ పుణ్యపురుషులు అటు రథంమీద, ఇటు నీళ్లలో ఇలా రెండు చోట్లా ఏకకాలంలో కనిపిస్తున్నారు. ఇది మహాద్భుతం. నా చిత్తభ్రాంతి కావచ్చు. మళ్ళీ పరిశీలిస్తాను అంటూ అక్రూరుడు నీళ్ళలో మునిగాడు.

చుట్టపక్కాలను పోషించేవాడు, యాదవులలో శ్రేష్ఠుడు అయిన అక్రూరుడు యమునలోని బ్రహ్మ తీర్థ జలాలలో ఆదిశేషుణ్ణి దర్శించాడు. ఆదిశేషుడు చక్కగ మాట్లాడగల్గినవాడు. వేయి పడగలమీద వెలిగే మణిభూషలు గలవాడు. రాజవేషదారి; దయయందు అపేక్షగలవాడు. వీరశత్రుసేనల్ని జయించే కోరికగలవాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు. కోపం లేనివాడు. దోషరహితుడు. అనేక విశేషాలు గలవాడు. అతడు సర్పాలకు దొర.

(శేషుడంటే - సర్వకాలసర్వావస్థలలో ప్రత్యభీజ్ఞ కల్గి ఉండే 'అహమ్‌' అని చెప్పబడే ప్రజ్ఞ.

నల్లని వస్త్రం ధరించి, సిద్ధులు, నాగులు మొదలైనవారిచే చక్కగా కొనియాడబడుతున్న సర్పరాజును కనురెప్పవాల్చక చూచి

అక్రూరుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని, ఆ మధ్యభాగంలో పవళించి ఉన్న అందగాడైన పురుషోత్తముణ్ణి అవలోకించాడు- ఆ దివ్యపురుషుడు మిసిమిగల పసుపువన్నె పట్టువస్త్రం ధరించి ఉన్నాడు. మేఘంమీద మెరిసే మెరుపులాగా అతనివక్షస్థ్సలంలో లక్ష్మీదేవి ఒప్పులొలుకుతున్నది.

మూగినతుమ్మెదలు చెదిరిపోగా ఆయన నాభికమలంలో నాల్గు మోములుగల నందనుడు బ్రహ్మ ఆడుకుంటున్నాడు. కదలినపుడు ఆ పురుషోత్తముడికాలిఅందెలు పదం, క్రమం మొదలైన విశేషాలతో వేదనినాదాలు వెలువరిస్తున్నాయి. బ్రహ్మ ఈశ్వరుడు, సనకసనందనులు, సద్బ్రాహ్మణులు, దేవతలు ఆతనిచరిత్రను ప్రశంసిస్తున్నారు.

రమ్యాలైన శుభలక్షణాలతో కూడిన గోళ్ళు, పాదాలు, మడమలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, పిరుదులు, బొడ్దు, నడుము, కడుపు కలవాడూ, ఆదరంతో కూడినవాడూ, శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభమనే మణి, వనమాల అనే పేరు కల్గి, పూలు, ఆకులు చేర్చి కట్టి, మెడనుంచి కాళ్ళవరకు వ్రేలాడే తోమాల - అనే వీటితో విరాజిల్లే విశాలమైన వక్షం కలవాడును, తెలదామరలవంటి కన్నులుగలవాడూ, జందెం, మొలనూలు, ముత్యాలపేరు, సందిటకట్టు కొనే సొమ్ములు (భుజకీరులు), అందెలు, మురుగులు, మొసలి ఆకారంతో ఉన్న చెవిపోగులు, కిరీటం మొదలైన ఆభరణాలు కలవాడూ, భక్తులను కాపాడేవాడూ, చక్కని చెక్కిళ్ళు, నొసలు, ముక్కు పెదవులు, ముఖం, చెవులు కలవాడూ, నల్లని మబ్బువంటి శరీరచ్చాయ కలిగినవాడూ, శంఖంలాంటి మెడగలవాడూ, దయాగుణంతో నిండినవాడూ, ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మొదలయిన వారిచేత పూజించబడేవాడూ, లక్ష్మి, పుష్టి తుష్టి కీర్తి, కాంతి, భూమి, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి మాయ మొదలైన తేజోమూర్తులచే సేవించబడేవాడూ అయిన ఆ పరమేశ్వరుడికి అక్రూరుడు నమస్కరించాడు. భక్తిసంభ్రమాలు అధికంకాగా వెంటనే చేతులు జోడించి, డగ్గుత్తికతో భగవంతుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు.

దండకము
శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలంగా, బాలకేళలీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతి శోభిల్లు నీ నాభి కంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణియై మన్న యా బమ్మ యుత్పన్నుం డయ్యేం గదా! పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్‌ హృషీకాదులున్‌ లోకముల్‌ లోకబీజంబులున్‌ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్‌; వసించున్‌, నశించున్‌, జడత్వంబు లేకాత్మయై యొప్పు నీయొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్‌ విచారింపం దా రెంతవా? రెంతవారైన మాయాదు లా మాయతోంగూడి క్రీడించు లోకానుసంధాత యా ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మలందున్న శేషాధిభూతంబులందు న్ననేకాధిదైవంబులందున్‌ సదా సాక్షివై యుందు వంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం, ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిధానంబులన్‌, నిక్క మొక్కండ వంచున్‌ మఱిం గొంద రారూఢకర్మంబులం ద్రుంచి, సంసారముం ద్రెంచి, సన్న్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్‌, మఱిం బాంచరాత్రానుసారంబుగాం దన్మయత్వంబుతోం గొంద ఱీ వాత్మ వంచున్‌, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్‌ నల్వురై చెల్వు వాటింతు వంచున్‌; మఱిన్‌ నీవు నారాయణాఖ్యుండ వంచున్‌, శివాఖ్యుండ వంచున్‌, మఱిం బెక్కుమార్గంబులన్‌ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యెఱుల్‌ పయోరాశినే రాసులై కూడు క్రీడన్‌ విశేషంబు లెల్ల న్నశేషంబులై డింది నీయం దనూనంబు లీనంబులౌ; నేకరాకేందు బింబంబు కుంభాంత రాళంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్న నేలా? ఘటాంతర్గతాకాశముల్‌ తద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్‌ వీంక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్‌ కర్ణముల్‌, భూమి పాదంబు, లంభోనిధుల్‌ గుక్షి, శల్యంబు లద్రుల్‌, లతాసాలముల్‌ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్‌ సురేంద్రుల్, ఘనంబుల్‌ కచంబుల్‌, నభోవీథి నాభిప్రదేశంబు, రేలుంబగళ్లున్‌ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్ననీ మేనిదండం బయోజాతగర్భాండముల్‌ మండి తోదుంబరానోకహానేకశాఖా ఫలాపూరి తానంతజంతుప్రకాండంబు లీలం బ్రసిద్భొదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుందున్‌; మహారూప! నీ రూపముల్‌ వెగ్గలం బుగ్గడింపన్‌; లయాంభోధిలో మీనుమేనన్‌ విరోధిన్‌ నిరోధించి మున్‌ వేధకున్‌ వేదరాశిం బ్రసాదింపవే? త్రుంపవే కైటభ శ్రీ మధుం జక్రివై మొత్తవే! యెత్తవే మందరాగంబు రాగంబుతోం గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్‌ మీందికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్‌ నెమ్ములన్‌ జిమ్ముచున్‌ గ్రువ్వవే త్రవ్వవే ఘోరవైరిన్‌ నృసింహుండవై, దండివై దండి వైరోచనిం జూచి యాచింపవే? పెంపవే మేను బ్రహ్మాండము న్నిండం, బాఱుండవై రాజకోటిన్‌ విపాటింపవెే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్‌ విదారింపవే, నొంపవే క్రూరులన్‌ వాసుదేవాదిరూపంబులన్‌, శుద్ధబుద్దుండవై వైరిదారాంతరంగంబుల న్నంతరంగంబులుంగా గరంగింపవే? పెంపు దీపింపవే? కల్కిమూర్తిం బ్రవర్తించి, నిన్నెన్ననే నెవ్వండన్‌, నన్ను మాయావిపన్నున్‌ విషణ్ణుం బ్రసన్నుం డవై ఖిన్నతం బాపి మన్నింపవే! పన్నగాధీశతల్పా! కృపాకల్ప!, వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.


అభిమానవతియైన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా! మంగళకరమైన స్వరూపం కలవాడా! ఓ వీరుడా! సకల ప్రపంచసృష్టికి కారణమైన పృథివ్యాది పంచమహాభూతాలకు కారణమైనవాడా! మిక్కిలి చలించే తరంగ శ్రేణిచేత కలతచెందిన భయంకర జలరాశిలో సర్వ ప్రపంచం రూపుమాసి లీనమై పోయినపుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై ఆ ప్రళయసాగరంలో తేలియాడావు.

అప్పుడు నీ నాభి కమలంనుంచి సకలభువనాలను సృజించే విజ్ఞానసంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని, ఆకాశం, వాయువు, భూమి, నీరు, అహంకారం, మాయ, మహత్తత్వం, మనస్సు మొదలైనవీ, ఇంద్రియాలూ, ఇంద్రియ వృత్తులైన శబ్దస్పర్శ రూపరసగంధాలూ, లోకాలూ, లోకకారణాలూ-ఈ సమస్తం నీ మహాశరీరంనుంచి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. 

జడస్వభావంలేక ఆత్మస్వరూపుడవై ఉన్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించడానికి ఎంత గొప్ప వారయినా సమర్థులు కారు. మాయ మొదలైన ముప్పదియారు తత్త్వాలు జడాలు కనుక నీ స్వరూపం గ్రహించలేరు. లోకాలను సృజించే పరమేష్ఠి మాయాసంబంధమైన గుణాలచేత ఆవరించబడి ఉన్నాడుకనుక, అతడు నిన్ను ఇలాంటివానిగా నిర్ణయించలేడు. హిరణ్యగర్భుడు మొదలైనవారు నిన్ను అధ్యాత్మ, అధిదైవ, అధిభూతాలకు అనగా దేహేంద్రియాధి దేవతలకు సాక్షిగా, అంతర్యామిగా, నియామకుడయిన ఈశ్వరునిగా భావిస్తారు.

వేదమార్గగాములైన కొందరు కర్మయోగులు నీ వొక్కడవే ఇంద్రాదినామధేయాలతో నెగడుతుంటావు. ఇది నిజమంటున్నారు. మరికొందరు జ్ఞానయోగులు అన్నికర్మలను వదలి, సంసారం త్యజించి, సన్న్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపుడుగా వేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమపద్ధతిని అనుసరించి నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధ భేదాలతో నలువురై సొంపు ఘటిస్తున్నావని అంటున్నారు. కొందరు నీవు నారాయణుడివనీ, కొందరు శివుడివనీ అనేకమార్గాలలో నిన్ను శ్లాఘిస్తున్నారు.

నదులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబం ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించినంత మాత్రాన ఆ చంద్రబింబంకంటె ఈ ప్రతిబింబాలు వేరు కావుగదా! ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు, లోకాలన్నీ నశించగానే నీవు ఏ జాడలనూ తొక్కక ఒంటరివాడవై ఉంటావు. ఓ ప్రభూ! అగ్ని నీ ముఖం. చంద్రుడూ సూర్యుడూ నీ కన్నులు. దిక్కులు నీ చెవులు. భూమి నీ పాదాలు. సముద్రాలు నీ కడుపు. కొండలు నీ ఎముకలు. తీగలూ, చెట్లూ నీ రోమాలు, గాలి నీ ప్రాణం. ఇంద్రాదులు నీ బాహువులు. మేఘాలు నీ తలవెండ్రుకలు. ఆకాశం నీ బొడ్డు. రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు. బ్రహ్మ నీ మేఢ్రం. వర్షం నీ వీర్యం. స్వర్గం నీ శిరస్సు. ఇలా నీ శరీరంలో బ్రహ్మాండాలు అత్తిచెట్టుకొమ్మల్లోనిపండ్లల్లో ఉన్న అనంతమైన ప్రాణి సమూహంలా, మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి.

ఓ విరాట్పురుషా! నీ రూపాలు పొగడ్తకు అందవు. మునుపు మత్స్యరూపంతో ప్రళయ సముద్రంలో శత్రువైన సోమకాసురుణ్ణి ఎదిరించి సాధించి వేదప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు. హయగ్రీవుడవై చక్రం చేతధరించి మధుకైటభుల్ని చంపావు. కూర్మరూపంతో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు. వరాహరూపం దాల్చి క్రుంగుతున్న భూమండలాన్ని లేవనెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపావు. భయంకర శత్రువైన హిరణ్యకశిపుణ్ణి నరసింహాకారంతో నీవు సంహరించలేదా! ప్రతాపశాలివైన నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించలేదా? బ్రహ్మాండాలు నిండేటట్లు శరీరం పెంచలేదా? పరశురాముడివై క్షత్రియసమూహాన్ని వధించలేదా? దశరథరాముడివై చంద్రబింబంవంటి ముఖంగల జానకికోసం దుర్మదంతో కూడిన రావణుణ్ణి తునుమాడలేదా? వాసుదేవాది రూపాలను దాల్చి దుష్టులను శిక్షించలేదా? శుద్ధబుద్ధ స్వరూపివై శత్రుభార్యల మనస్సులు రహస్యంగా కరగించినావుగదా! కల్కిరూపం ధరించి పెంపుతో వెలుగొంద లేదా! దేవా! నిన్ను పొగడుటకు నేను ఏ పాటివాణ్ణి? నేను మాయచేత ఆపదలపాలైనవాణ్ణి. దుఖం చెందినవాణ్ణి. అనుగ్రహబుద్ధితో నా దిగులు తీర్చి నన్నాదరించు. ఆదిశేషుడు తల్పంగా ఉన్నవాడా! కరుణా స్వభావమే అలంకారంగా కలవాడా! నమస్కరించేవారికి కల్పవృక్షం వంటివాడా! నీకు నమోవాకం. నీకు వందనం. నీకు ప్రణామం. నమస్కారం.

లక్ష్మీనాథా! దప్పిక తీర్చుకోడానికి నీళ్లవలె తోచే ఎండమావులకు ఆసపడేవిధంగా కలల వంటివైన పుత్రులు, మిత్రులు, భార్యలు, గృహాలు-ఈ మొదలైన జంజాటం సత్యమని భావిస్తుంటాను. నేను తెలివిమాలినవాణ్ణి. అసత్యాలను సత్యాలని తలంచేవాణ్ణి. ఇట్టినాకు ప్రకాశించే నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు.

అక్రూరుడు ఈ విధంగా స్తోత్రం చేయగా శ్రీకృష్ణుడు ఆయనకు యమునా జలాలలో చతుర్భుజాలతో దీపించే తన మునుపటి దేహాన్ని చూపి, నర్తకుడు రంగస్థలంమీద ఆడి ఆడి తెరమరుగు జొచ్చినట్లు అంతలోనే అంతర్ధానం చెందాడు. అక్రూరుడు ఆశ్చర్యపడుతూ నీటినుండి వెలుపలికివచ్చి రథాన్ని అధిరోహించగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

అక్రూరా! దగ్గరలోనే నీళ్ళున్నాయి. నీవు స్నానానికి వెళ్ళి చాలసేపయింది. ఆకాశంలో, భూమిలో లేని వింతలు ఏమైనా నదీజలాలలో నీకు కన్పించాయా?

శ్రీకృష్ణు డలా ప్రశ్నించగా అక్రూరు డిలా సమాధాన మిచ్చాడు.

ఇలా అడిగిన కృష్ణునితో అక్రూరుడు ఇలా అన్నాడు. స్వామీ! నీలో లేనివింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు. ఇక నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా?

అలా చెప్పి అక్రూరుడు సాయంకాలానికి మథురాపురి చేరేటట్టుగా రథాన్ని నడిపాడు. ముందుగా వెళ్ళిన నందుడు మొదలైనవారు పొలిమేరలోని తోపులో బసచేసి ఉన్నారు. కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుణ్ణి చూచి 'నీవు రథాన్ని తోలుకొని పట్టణానికి వెళ్ళు. మేము తర్వాత వస్తాము' అని చెప్పగా అక్రూరుడు ఇట్లా అన్నాడు.

లక్ష్మీ సంపన్నుడ వయిన శ్రీకృష్ణా! నీవు నా ఇంటికి విజయం చేయాలి. నీ పద్మాలవంటి పాదాలధూళి సమూహం సోకి నా ఇల్లు పావనమవుతుంది. నీ బంటునైన నన్ను ఆమాత్రం ఆదరించకూడదా?

అక్రూరుడు ఈ విధంగా వేడుకోగా కృష్ణుడు ఇలా అన్నాడు.

శ్రీ కృష్ణమూర్తి మథురా నగర ప్రవేశము సేయుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Kamsuni Pampuna Nakrurundu Brndhavanambunaku Janudenchuta - కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట

గతజన్మలో నేను ఎటువంటి తపస్సుచెశానో? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నానో? యోగ్యులైనవారికి ఎటువంటి దానాలు చేశానో? ఆద్యులైన పరమయోగుల దివ్యదృష్టికి సైతం గోచరించని ప్రభువూ, పరబ్రహ్మస్వరూపుడూ అయిన శ్రీ కృష్ణుణ్ణి నేను చూడబోతున్నాను.

పూర్వం ప్రాజ్ఞులైనవారు ఏ పరమపురుషుని ప్రకాశించే పాదాలగోళ్ళ కాంతిపుంజాన్ని ఆశ్రయించి జననమరణాలు అనే చీకట్లలో చిక్కుకొనక తరించారో, అలాంటి పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి పగచేతనైనా జయించదలచి పిలుచుకొని రమ్మని నన్ను అవ్యాజమైనప్రేమతో పంపి, కంసుడు నా కెంతో మేలు చేశాడు. కంసుడితో సమానుడైన చెలికాడు నాకు మరొకడు లభించడు.

ఈ అక్రూరుడు కంసుడి ఆజ్ఞచేత నన్ను బాధించడానికి వచ్చిన పరమ దుర్మార్గుడని భావిస్తాడో! లేక సకలప్రాణుల లోపలా వెలుపలా నడుమా చక్కగ వ్యాపించి ఉన్న పరమాత్మ కనుక నాతత్త్వ మెరిగి నన్ను మంచివాణ్ణిగా ఎంచి ఎంతగా గౌరవిస్తాడో! నాతో ఏ విధంగా సంభాషిస్తాడో చూడాలి. ఇంతకూ నా భాగ్యం ఎట్లుందో తెలియదు.

అని ఇంకా

ఈ అరణ్యంలోని మృగాల సమూహం ఈ మార్గాల గుండా నా కుడివైపునుంచి వెళుతోంది. ఈ శుభశకునాన్నిబట్టి ముంగురులతో శోభిల్లే, చంద్రుడితో సమానమైందీ, నవ్వుల వెలుగులతో విరాజిల్లే, పద్మాలవంటి నయనాలు గల, చెవులలోని మకరకుండలాలచేత దీపించే బుగ్గలు గల, తామర రేకులవంటి కన్నులుగలదైన ఆ శ్రీకృష్ణునిముఖం దర్శించే భాగ్యం నాకు తప్పక లభిస్తుంది.

నేను సంజపొద్దున నందగోకులానికి వెళ్ళి, లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణునిపాదాలచెంత సాష్టాంగ నమస్కారం చేస్తాను. అలా మొక్కగా ఆయన శీఘ్రగమనం కల్గిన కాలమనే సర్పంయొక్క విజృంభణానికి తల్లడిలే భక్తజనుల భయాన్ని తొలగించే పద్మంవంటి తనహస్తాన్ని నా తలపై మోపి, చిరునవ్వు లొలికిస్తూ కరుణతో నాకు అభయ ప్రదానం చేయక మానడు.

అక్రూరుడు ఈ ప్రకారం పలురీతుల శ్రీకృష్ణుని సందర్శనం కోరుతూ వేగంగా వెళ్ళే అందమైన రథాన్ని అధిరోహించి చాలదూరం వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి

అక్రూరుడు ఎదుట బృందావనాన్ని సందర్శించాడు. ఆ బృందావనం గొప్పగందపుచెట్టు, మొల్ల, అడవిమల్లె, తాటి, మద్ది, ఎర్రగోరింట, మర్రి, తియ్యమామిడి మొదలైన, వృక్షాలనూ కలిగి ఉంది. వికసించిన ఎర్రతామరలతో అది విలసిల్లుతూ ఉంది. ఆ బృందావనం బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి సంతోషపరుస్తున్నది.

అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు. సంజవేళలో దూడలూ, కోడెలూ, తొలిచూలు గేదెలూ గుంపులు గుంపులుగా మేతకై వెళ్ళి అక్కడక్కడ పచ్చని పచ్చికలు మేస్తూ ఎంత సేపటికీ ఇండ్లకు మరలి రాకపోతే వాటిని వెదకటానికి వెళ్ళి పొదలూ, మరుగులూ, మిట్టపల్లాలూ లెక్కించక పొదల్లో దూరి పరుగెత్తుతూ వెదకి ఎక్కడా కనిపించక గోపాలురు ఒకరి నొకరు ఎలుగెత్తి పిలిచే సవ్వడిని ఆలకించాడు. 

మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి, అంతలో తమ లేగ దూడలను తలచుకొని ఆలసించక మమకారంతో తమకు తామే అంభారావాలు సలుపుతూ, పొదుగులనుండి పాలు కార్చుకుంటూ పరుగెత్తి వస్తున్న ఆవులను ఆలోకించాడు. అపుడే పుట్టినదూడల్ని దగ్గర ఉంచుకొని, పలుపులు చేత పుచ్చుకొని, కొత్తగా ఈనిన బాలెంతగోవులు వెంబడించగా, మెల్లగా వెళుతున్న గొల్లలను విలోకించాడు. 

చిరుతలు, సివంగులు, పెద్దపులులు మొదలైన క్రూరజంతువుల బారిన పడకుండా జాగరూకులై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్లు, ఈటెలు, విండ్లు ధరించి కావలి కాస్తున్న పసుల కాపర్లను దాటి ముందుకు సాగాడు.

అక్కడ పలురకాలైన మిసిమిగల కసవులు మేసి చక్కగా బలిసి కొట్టాలలోచేరి ఆవులు హాయిగా నెమరు వేస్తున్నాయి. దూడలు పాలుగుడిచి తల్లులయెదుట చెలరేగి చెంగు చెంగున దుముకుతున్నాయి. ఎదకు వచ్చిన ఆవులను దాటుతూ వృషభాలు ఎదురునిలిచి ఒకదానితో ఒకటి డీకొని కొమ్ములతో కుమ్ములాడుతున్నాయి. 

ఆరునెలల వయసుగల దూడలు మొక్కవోని బలంతో మెడపలుపులు తెంచుకొని పొదలు దూరి కుప్పించి దుముకుతూ తల్లిపొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి.

వాటిని అదలించి ఇవతలకు పట్టి ఈడువలేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను, భర్తలను, మామలను, మరదులను మోసగించి మన్మథ శరపీడితలై గొల్లమగువలు ఇంటిపనులు మరచి, జంకు గొంకులు వదలి, సంకేత స్థలాలకు చేరి శ్రీకృష్ణుని రాకకై వేచి ఉన్నారు.

గోపకులు పసుల కొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ, తిరిగి వెనుకకు లాగి కట్టివేస్తూ, మరల విడుస్తూ, పట్టి ఈడుస్తూ ఇలా క్రీడిస్తున్నారు. ఆవులగిట్టలవల్ల పొడిపొడిగా పరుచుకొన్న ఎండుపేడయొక్క దుమ్ము గోవులను పిదికేటప్పుడు చిందిన ఆ పాల తుంపురలవల్ల తడిసి, అణగిపోయి అడుసుగా మారింది.

గోపాలురు పాలుపిండేటప్పుడు ఆవుల చనులనుండి చెంబులలోనికి కారే క్షీరధారలు జుంజుమ్మని చప్పుడు చేస్తున్నాయి. ఆబోతులు తమ మెడ దురద తీర్చుకోడానికని, ఒరసికొనగా నునుపారిన గృహద్వారసీమల్లోని స్తంభాల సమీపాన పరుండి ఉన్న కుక్కలు ఉలికిపడి కొత్తగా వచ్చినవారిని చూచి కోపంతో భౌ భౌ అని మొరుగుతున్నాయి. 

బలరామశ్రీకృష్ణుల భుజదండాలు అనే ప్రాకారంతో పరిరక్షించబడుతూ ఈ రీతిగా ఉన్న ఆ వ్రేపల్లె లోనికి అక్రూరుడు ప్రవేశించాడు.

పద్మం, అంకుశం మొదలైన శుభచిహ్నాలతో కూడిన శ్రీకృష్ణుని అడుగుల గుర్తులను ఆ వ్రేపల్లె దారులలో అక్రూరుడు దర్శించాడు. ఆనందంతో అతడిశరీరం పులకించింది. కనులలో ఆనందబాష్పాలు నిండాయి. శ్రీ కృష్ణుణ్ణి సందర్శించ వలెననే తహతహతో ఆయన రథం నుంచి కిందికి దిగి

అక్రూరుడు కమలాలవంటి కన్నులు గలవారూ, ఒప్పిదమైన దేహాలు గలవారూ, ఆవుల పాలుపిండే వాడలలో మెలగే వారూ, అలంకరించబడినవారూ, మిక్కిలి ప్రకాశమానులూ, పచ్చనివి, నల్లనివి, ప్రకాశించేవి అయిన కొత్త బట్టలు కట్టినవారూ, పుష్పమాలికలు ధరించినవారూ, ధైర్యవంతులూ, మగువల పాలిటికి మన్మథులూ, భువనాలు నమస్కరించదగ్గ విధానాలచేత అధికులూ అయిన శ్రీకృష్ణబలరాముల్ని దర్శించాడు.

బలరామకృష్ణులను చూచి వారిపట్ల తనకుగల భక్తిచేత అక్రూరుడు పరవశించిపోయాడు. శరీరంలో గగుర్పాటు కలుగగా కనులనుండి ఆనందబాష్పాలు వానగా కురియగా వారిపాదాలకు నమస్కరించాడు.

అక్రూరుడు అలా నమస్కరించిన తరువాత

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు భక్తజనులపట్ల ప్రేమగలవాడు. క్రూరులుగాని మానవుల్ని మంచిస్వభావంతో రక్షించేవాడతడు. అక్రూరుడు తమకు నమస్కరించిన తరువాత సుదర్శన చక్రం ధరించే తన కుడిచేతిని ముందుకు సాచి అతణ్ణికౌగిలించుకొన్నాడు.

అనంతరం అక్రూరుడు బలభద్రుడికి ప్రణమిల్లాడు. అతడు అక్రూరుణ్ణి కౌగిలించి, అతని చేయిపట్టుకొని, కృష్ణునితో గూడ తన గృహానికి తీసుకొని వెళ్ళాడు. కుశలప్రశ్న కావించాడు. 

గద్దెమీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగాడు. మధుపర్కం సమర్పించాడు. ఆవు నిచ్చాడు. సాదరంగా కమ్మనిభోజనం పెట్టించాడు. తాంబూలం, చందనం, పూలదండలు సమర్పించాడు. ఆ సమయంలో నంద మహారాజు ఆసీనుడై ఉన్న అక్రూరుణ్ణి ఆదరించి ఇలా అన్నాడు.

అక్రూరా! చెల్లెలు వేడుకొంటున్నా ఆమె కొడుకుల్ని చంపిన క్రూరుడైన కంసుడు బ్రతికి ఉండగా దశార్హవంశస్థులైన మీకు భూమిమీద మనుగడ లభిస్తుందా? ఇట్టి స్థితిలో మీ క్షేమాన్ని గూర్చి ఏమని విచారించేది?

నందమహారాజు ఆ విధంగా అన్నాడు. ఆ పిదప అక్రూరుడు ఒక మంచం మీద హాయిగా కూర్చొని ఉండగా శ్రీకృష్ణుడు అతనితో ఈ విధంగా అన్నాడు.

అక్రూరా! నీకు కుశలమేగదా! మన స్నేహితులు సంతోషంగా ఉన్నారా? బంధువులు క్షేమంగా ఉన్నారా? మథురా నగరంలోని ప్రజలంతా భయంలేకుండ ఉన్నారు గదా! మన వంశంలో జన్మించినవా రందరూ మనస్సంతోషంతో ఉన్నారా? మా మేనమామ కంసుడు భయంలేకుండా ఉన్నాడా? నన్ను కన్నారనే సాకుతో చెరసాలలో బంధితులైన దేవకీవసుదేవులు ఊపిరితో జీవించియున్నారా?

అక్రూరా! నా తలిదండ్రులైన దేవకీ వసుదేవులు ఈ రోజు నీ విక్కడికి వస్తున్నప్పుడు నాకు చెప్పుమని నీతో ఏమైనా చెప్పారా? ఆ వార్తయేమి? కంసుడివల్ల భయపడి తమ కేదారీ లేదని వారెంత కృశించి పోయారో! ఎంత దుఃఖించారో! ఎట్టి దీనావస్థకు లోనయ్యారో! ఎన్నికష్టాల పాలైనారో? నాకు వినిపించు.

అక్రూరా! నీవు ఏమి కారణంగా ఇక్కడికి వచ్చావో చెప్పుమని శ్రీకృష్ణుడు అడిగాడు. అప్పుడు అక్రూరుడు కంసుడి దగ్గరకు నారదుడు వచ్చి విరోధం పెరిగే మాటలు చెప్పి వెళ్ళడం, కంసుడు దేవకీ వసుదేవులను చంపడానికి పూనుకొని, మానుకోవడం, ధనుర్యాగమనే నెపంతో కంసుడు తన్ను పంపించినవిధం బలరామశ్రీకృష్ణులకు తెలిపాడు. ఆ మాటలకు రామకృష్ణులు నవ్వారు. తమ చుట్టూ చేరిన నందుడు మొదలైన గొల్లపెద్దలను చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

గోపకులారా! ప్రభువైన కంసుడు ధనుర్యాగం చూడటానికి మనల్ని పిలుచుక రమ్మని అక్రూరుణ్ణి పంపించాడు. కనుక మనం యాగం దర్శించడానికి వెళ్ళాలి. మీ శక్తి కొలదీ మీ మీ ఇండ్లలో పాలు పెరుగు, నెయ్యి, నూతనవస్త్రాలు మొదలైన కట్నాలూ, కానుకలు సమకూర్చుకొనండి. మథురానగరానికి యాత్రగా మనం వెళ్ళాలి. వాహనాలను తీసుకొనిరండి, వెళ్లండి.

అని శ్రీకృష్ణుడు గొల్లలను ఆజ్ఞాపించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని మధురకు తోడ్కొని పోతాడని గ్రహించి గోపికలు కలత చెంది

లేడి చూపులవంటి చూపులుగల గొల్ల భామలందరూ తమ ఏకాంతగ్భహాలలో గుంపులుగా చేరి, శ్రీ కృష్ణుని చిరునవ్వులూ; పలుకులూ; సరససల్లాపాలూ, విలాసచేష్టలూ, వినోదాలూ, ఆదరణలూ, పద్మాలవంటి హస్తాల ఆలంబనాలూ, పిలుపులూ తమ మనసుల్లో మెదిలి వేదన గల్గించగా ఇక మీద ఇవన్నీ అనుభవించడానికి ఆయనను తమవద్ద నిలుపుకొనే ఉపాయ మేమిటా? అని మంతనాలు సలిపారు.

ఇంకా తమలో తాము ఇలా అనుకొన్నారు.

బ్రహ్మదేవుడు పెద్ద సంసారి అని చాల విశ్వసించాం. ఆలోచించగా ఆయనలో ఉత్తమగ్భహస్థలక్షణం ఏ మాత్రం లేదు. మన ప్రభువైన కృష్ణుణ్ణి మనతో ఇక్కడ ఉండనీయక వేరొక చోటికి వెళ్లేందుకు నిర్ణయించి చిన్న పిల్లవాడివలె ఆటలాడుతున్నాడు. అయ్యో! ఆతని ఈ దుండగపు చేష్టలుగురించి ఆయన ఇల్లాలు సరస్వతికైనా చెప్పండి.

అని గొల్లపడతులు బ్రహ్మను నిందిస్తూ మన్మథ తాపానికి లోబడ్డ హృదయాలు గలవారై

అక్రూరుడు మధురకు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు వెళ్ళడానికి సంసిద్దుడయ్యాడేగాని, అయ్యో! ఈ గోపయువతులు నన్నే నమ్ముకొని ఉన్నారు. వీళ్లను మన్మథబాణాల పాలుచేసి నేను వెళితే అధికమైన మదనతాపంతో కుమిలి కృశించి పోతారేమో అని ఏ మాత్రం అనుకోవడం లేదు. ఇకపోతే మన అమ్మలక్కలుగాని, మన గొల్లపెద్దలుగాని మధురకు పయనం మానుకొమ్మని అచ్యుతునితో మాట వరుసకైనా అనడంలేదే! అయ్యో! ఇక మన గతిఏమి?

అక్రూరుడని పేరుపెట్టుకొని వచ్చి ఈ క్రూరాత్ముడు ఈ రోజు మా హృదయేశ్వరుడూ చక్రాయుధుడూ అయిన కృష్ణుణ్ణి మాచెంత ఉండనీయక తనవెంట మథురానగరికి తోడ్కొని వెళ్ళడానికి చక్కగా యోచించి విచ్చేశాడు. ఇతడు క్రూరాత్ముడు. అక్రూరుడే అయితే కుటిల బుద్దులు మానుకొని శ్రీకృష్ణుణ్ణి ఇక్కడే దిగవిడిచి తనదారిని తాను వెళ్ళాలని అనుకోడా?

అయ్యో! క్రూరుడైన ఈ అక్రూర నామధేయుడు శ్రీకృష్ణుణ్ణి మధురానగరికి తోడ్కొని వెళ్ళగానే విప్పారిన తామర రేకులవంటి ముఖాలు గలవారూ, పూర్ణచంద్రబింబాలవంటి ముఖాలు గలవారూ అయిన ఆ మధురానగరిలోని స్త్రీలు రేపు మేడలమీదినుంచి తనమీద పసిడి పేలాలు మెల్లగా చల్లగా వారిని కనులార చూచి, వారితో సాంగత్యం సల్పడానికి యత్నిస్తాడే గాని, వ్రేపల్లెవాడలోని గొల్లపడతులమైన మనమీద పడటానికి అతడు ఉత్సాహపడడుగదా!

పట్టణంలోని నీటుకత్తెల చూపులు, సరససంభాషణాలు, తెరచాటు కలయికలు మరగి, మాధవుడు మనల్ని ఇచ్చగించడు. ఓ యమ్మా! రాజులు కొత్తలను కోరుతుంటారు గదా!

కఠినాత్ముడైన ఆ దేవుడు పుట్టినప్పటినుండి శ్రీహరి ఎలాంటివాడో తెలియని మథురాపురిలో నివసించే యువతులకు ఈయన్ను పతిగా చేసి, అధికమైన విరహాగ్నితాపం అనుభవించడానికి గొల్లపల్లెలోని మగువలమైన మనల్ని వెదకి తెచ్చాడు.

మా మాధవుణ్ణి ఎందుకు మథురకు తీసుక వెళుతున్నావు? అలా తీసుక వెళ్ళవద్దు అని మన మందరం కలిసి ఆ అక్రూరుణ్ణి వేడుకొందామా? యదువల్లభుణ్ణి మధురకు వెళ్ళనివ్వకండి, వ్రేపల్లెలోనే నిల్పండి అని దేవతలను పూజిద్దామా? మథురకు వెళ్ళవద్దని గోవిందుని కాళ్ళకు అడ్డం పడదామా? ఓ దైవమా! మాకీ దుఃస్థితి ఎందుకు కల్పించావని ఆ గోపకాంతలు మన్మథతాపచేత భ్రాంతిచెంది, కొప్పులు వీడడం, కట్టిన చీరలు జారడంకూడా మరచిపోయారు.

గోపకాంతలు లజ్జలు వదలి, కనులజంట నుండి ఎడతెగకుండా దుఃఖబాష్పాలు కారుతుండగా, శరీరాలు మరచి, చెక్కిళ్ళయందు కమలాలవలె కోమలాలైన చేతులుచేర్చి, గాలిచేత మిక్కిలి చలింపజేయబడిన తీగలకు పోల్చదగినవారై, గోవిందా! మాధవా! దామోదరా! అని పిలుస్తూ మమ్మల్ని దయతో రక్షించుమని స్వరబద్ధంగా, లయబద్ధంగా కీర్తనలతో విలపించారు.

ఆ మరుసటిరోజు సూర్యోదయవేళలో తనతో ప్రయాణానికి పూనుకొని నడచివచ్చే గోపికల్ని నేను మథుర నుంచి తిరిగి వస్తానని దూతికలద్వారా చెప్పించి, వారిపయనాన్ని శ్రీకృష్ణుడు మాన్పించాడు. బండ్లలో కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన పదార్థాలను ఉంచుకొని, నందుడు మొదలైన గొల్లపెద్దలు వెంబడించగా అక్రూరుడు తోలే రథమెక్కి మథురానగరంవైపు వెళ్ళే సమయంలో

శ్రీకృష్ణుడు మథురకు రథమెక్కి వెళుతుండగా గోపవనితలు గుంపులుగూడి అక్కడనే కదలక నిలిచి 'అడుగో! మన ప్రాణనాయకుడు మథురకు వెళుతున్నాడు. ఆయన ఎక్కిన రథం అదే. జెండా మాత్రం కనిపిస్తున్నది. ఆ వైపు ఆ రథానికి గట్టిన గుర్రాల కాలిగిట్టలవల్ల రేగిన ధూళి చూడండి' - అంటూ తమ హృదయాలలో నెలకొన్న ప్రణయంవల్ల శౌరి వెళ్ళిన రథంవైపే దృష్టి మరల్చి తమ కనులకు అందినంతవరకు ఆ దృశ్యాలనే ఉన్నచోటనే కదలకుండా నిలబడి, వారు చూశారు.

ఈ విధంగా రథమెక్కి శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో, బంధువైన అక్రూరుడితో వెళ్ళీ

శ్రీకృష్ణుడు ఎంతో నిర్మలములైన అలలమీదినుంచి వెడలే చల్లని వాయువుతో కూడిందీ, సకలపాపాలను నశింపజేసేదీ, కవులూ, పండితులచే గౌరవింపదగిన దాన్ని, పరమధన్యాత్మురాలూ, కళిందపర్వతపుత్రీ అయిన యమునానదిని చూచాడు.

శ్రీకృష్ణుడు యమునను చూచి సానబెట్టిన మణిసముదాయంవలె తళతళ మెరుస్తున్న ఆ నదీజలాన్ని తాగి బలరామునితోగూడ చెట్ల సమీపాన ఉన్న రథంలోపలికి చేరాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి, అనుజ్ఞ పుచ్చుకొని, కాళిందీనదిమడుగులో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ, స్నానం చేశాడు.

అక్రూరుండు యమునలో రామకృష్ణుల దర్శించి నుతించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Friday, August 21, 2026

sri krishnundu kesivyomasurula samharinchuta - శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెల్లిపోయాడు. కంసుడుకూడా సభాసదుల్ని వీడ్కొల్పి, తన అంతఃపురానికి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కంసప్రేరితుడై ఇంధ్రవరుణులను మించినవాడూ, పరాక్రమానికి సముద్రంవంటివాడూ అయిన కేశి అనే రాక్షసుడు కంసుని ప్రోత్సాహంతో గుర్రమై వాయువేగంతో నందుని మందలోకి ప్రవేశించి సంకటం కలిగించాడు. 

ఆ కేశిదానవుని దిట్టమైన గిట్టల తాకిడికి సంచలించిన భూమండలం నాగరాజైన ఆదిశేషునిపడగలకు బరువయింది. అతనిభయంకరమైన సకిలింతలకు మిక్కిలి భీతిచెంది ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు.

ఆ రాక్షసుడు తన జూలు అటూ ఇటూ ఆడించడంవల్ల జనించిన గాలికి మేఘాలు ఎగిరిపోయి దేవతలవిమానాలను కమ్ముకొన్నాయి. అతని బిలంవంటి నోరు తెరచినపుడు నోటిలోని పెద్దపండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలవలె ప్రకాశించాయి. అతనితోక యమపాశంవలె కనిపించింది.

దారుణమైన గుర్రం రూపంలో ఉన్నఆ కేశిరాక్షసునిసకిలింత వినేసరికి అక్కడి ఆవులు, దూడలు, గోపికలు, గోపాలకులు, పిల్లలు - అందరి హృదయాలూ దద్దరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే మంద దీనంగా మొరపెట్టే పెద్దధ్వనిగా మారిపోయింది. ఆ సమయంలో

"శక్తిహీనులైన మందలోని గోపాలకులను భయపెట్టడం నీవంటి వీరునికి ధర్మం కాదు. ఈ గోకులంలో దానవనాశకుడైన కృష్ణుడెక్కడ?” అంటూ తనను వెదకుతున్న కేశిదానవుణ్ణి కృష్ణుడు చూశాడు. 

గోపాలురకు అడ్డం వచ్చి కృష్ణుడు "ఓరీ రాక్షసుడా! ఇక పోలేవు" అంటూ సింహంవలె గర్జించి వాణ్ణి యుద్దానికి పిలిచాడు. ఆ రాక్షసుడు కూడా గోవిందుణ్ణి ఎదిరించాడు.

అశ్వరూపంలోని కేశిదానవుడు భయంకరంగా, కర్కశంగా సింహనాదంచేస్తూ ఆకాశాన్ని మింగే విధంగా నోరు పెద్దదిగా తెరిచి, కృష్ణుణ్ణి కరవబోయాడు. వాని కాటును కృష్ణుడు తప్పించుకున్నాడు. దానవుడు కృష్ణుణ్ణి ఎగిరి తన్నినాడు.

జాగ్రత్తగా ఆ తన్ను తప్పించుకొని రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు రణోత్సాహం పొందాడు. కండ్లలో ఎరుపుదనం అతిశయించగా ఆ అశ్వదానవునిగర్వం తరిగేటట్లు అతనికాళ్లు పట్టుకొని గరుత్మంతుడు పాముపిల్లను పట్టుకొని విసిరి పారవేసినట్లు నూరువిండ్ల దూరంలో విసిరి పారవేశాడు.

అలా కృష్ణుడు విసరిపడవేయగా, కేశిదానవుడు నేలపై పడి వెంటనే పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ, సంకోచం లేకుండా కృష్ణునిపైన పడ్డాడు. భయంకర సర్పాన్ని గుహలోనికి చొప్పించిన విధంగా కృష్ణుడు దిగ్గజం తొండంవలె బలిష్ఠమైన తన బాహుదండాన్ని కేశిదానవుని నోటిలోనికి చొప్పించాడు.

ఓ రాజశ్రేష్ఠుడవైన పరీక్షిన్మహారాజా! అఘాసురసంహారి అయిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవలె కఠినమై పైకి చాచబడిన స్తంభంవంటి తన ఎడమచేతిని రాక్షసుని దంతాలు చూర్ణమై రాలిపోయేటట్లు వాని కడుపులోనికి చొప్పించాడు. అలా చొప్పించిన చేతిని ఉత్సాహంతో పెంచుతూ ఆ దానవుని ప్రాణవాయువును నిరోధించాడు.

ఇలా కృష్ణుడు చేసినందువల్ల, పొట్టలోని గాలి వెలుపలికి వెడలక నిలిచిపోయింది. రాక్షసునిదేహం పై చెమటలుపట్టాయి. కనుగుడ్లు బైటికి వచ్చాయి. తన మాయలు చెడిపోయి, తన్నుకొంటూ, రొప్పుకుంటూ కేశి నేలపైన కూలిపోయాడు.

ఓ రాజా! ఇలా అశ్వాసురుని కడుపులో కృష్ణుని బాహువు పెరిగి పెరిగి పట్టక పోవడంతో, వాని కడుపు దోసపండువలె రెండుముక్కలుగా పగిలిపోయింది.

పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు వీరావేశీ, మాంసాశనుడూ, ఆనాటి లోకంలో నూతనశక్తిరాశిగా ఉన్నావాడూ, ఇంద్రవరుణులను ఓడించినవాడూ అయిన కేశిరాక్షసుణ్ణి అలవోకగా సంహరించాడు

ఆ ఆనందసమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. శ్రీకృష్ణునిమహిమలను కొనియాడారు. అప్పుడు విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి, కృష్ణునిదర్భనం చేసుకొని, రహస్యంగా ఇలా అన్నాడు.

కృష్ణా! జగదీశ్వరా! అచింత్య ప్రభావంగల యోగీశ్వరా! అఖిల ప్రాణులకు ఆధారమైనవాడా! అంతటా నిండిన మహానుభావా! సర్వనియామకుడా! కట్టెలో నిక్షిప్తమై ఉన్న అగ్నివలె, సమస్తప్రాణులలో ప్రవేశించి ఎలాంటి వికారాలు లేక ఏకరూపుడవై విరాజిల్లుతున్నావు. 

ప్రాణుల హృదయగుహల్లో గూఢంగా ఉన్నావు. జీవులు చేసే పనులకు సాక్షిభూతుడవై ఉన్నావు. నీవు సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమైన మాయాశక్తితోకూడి సత్త్వరజస్తమోగుణాలను కల్పిస్తున్నావు. ఈ త్రిగుణాల చేత బ్రహ్మ, విష్ణు, రుద్రరూపుడవై జగత్తును సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, సంహరిస్తున్నావు.

ఇలాంటి నీవు నేడు రాజుల ఆకారాలు ధరించి ఉండే రాక్షసులను సంహరించి, ఈ భూమండలాన్ని కాపాడడానికి అవతరించావు.

దేవా! ఇంకా నీచేత చాణూరుడు, ముప్టికుడు, గజాసురుడు, కంసుడు, శంఖుడు, యవనుడు, మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రకవాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైనవారు సంహరించబడతారు.

దేవలోకంనుండి పారిజాతవ్బక్షాన్ని పెకలించి భూలోకానికి తెస్తావు. నీవల్ల నృగునికి శాపవిమోచనం కలుగుతుంది. శమంతకమణిని స్వీకరిస్తావు. మృతులైన బ్రాహ్మణకుమారులను తిరిగితెచ్చి ఇస్తావు. అర్జునునికి రథసారథివై కురుక్షేత్ర యుద్ధంలో పదునెనిమిదిఅక్షౌహిణుల సైన్యాన్ని సంహరిస్తావు. ఇంకా -

కృష్ణా! వర్ధనశీలుడైన విధాతకూడా నీవు చేసే ఘనకార్యాలను లెక్కించ లేడు. నీ వల్లనే సత్త్వరజస్తమోగుణాలు మూడూ పుడతాయి, వృద్ధి పొందుతాయి, నశిస్తాయి. నీరూపం మేరలేనిది. సర్వవ్యాపివీ, జయశీలివీ, సహనశీలివీ, పరమేశ్వరుడివీ, ప్రమాణరహితుడివీ, ప్రపంచనియామకుడివీ అయిన నీకు ప్రణమిల్లుతున్నాను.

ఇలా దేవదేవుణ్ణి ప్రస్తుతించి సెలవుతీసుకొని నారదుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒకనాడు గోపబాలకులు కృష్ణునితో కలసి పశువులను తోలుకొని అడవికి వెళ్లారు. అక్కడ పసులను మేపుకుంటూ దాగుడు మూతల్లాంటి - దొంగ - రక్షకుడు అనే ఆట ఆడడం ప్రారంభించారు.

గోపబాలురు తమలో కొందరు గొర్రెలుగా, కొందరు కాపరులుగా, మరికొందరు దుస్స్వభావంగల దొంగలుగా ఏర్పడి కనుమూసి గంతలాటను(దాగుడుమూతల్లాంటి) ఆడడానికి ఆరంభించారు.

అంతలో మయుడనే రాక్షసుని పెద్దకొడుకు వ్యోమాసురుడు గోపాలరూపం ధరించాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురైదుగురిని తప్ప మిగతా బాలురనందరినీ మెల్లమెల్లగా ఆ కొండ గుహలోనికి తీసుకొని వెళ్లాడు.

ఇలా ఆ వ్యోమాసురుడు గోపబాలకులను మెల్లమెల్లగా కొండగుహలోనికి చేర్చి, ఒక పెద్దరాతితో ఆ గుహద్వారాన్ని మూసివేశాడు. అలా చేసిన తర్వాత ముందులాగా ఆ రాక్షసుడు రాగా

సర్వజ్ఞుడూ, రాక్షసాంతకుడూ, మహావీరుడూ అయిన శ్రీకృష్ణుడు నవ్వుతూ "ఓరీ! రాక్షసా! నీదొంగతనం గుట్టు బట్టబయలైంది. బలే దొంగవులే! యాదవ బాలకులందరినీ కొండగుహలో బంధించావు. మిగిలిన వారిని కూడా పట్టు కొందువుగాని రా! రారా! అంటూ సింహం తోడేలును పట్టుకున్నట్లు వాణ్ణి ఒడిసి పట్టుకొన్నాడు.

పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఇలా ఒడిసిపట్టగా అతడు గోపాలకునిరూపం వదిలి కొండలాంటిరాక్షసరూపంతో ఉప్పొంగి మిడిసిపడ్డాడు. కానీ విడిపించుకోవడానికి బలంచాలక, తన శక్తిమీద సందేహం గలిగి, ఎంతగానో గుంజులాడాడు. అపుడు ఆకాశంలో దేవతలు 'ఓహో' అని జయజయధ్వానాలు చేస్తుండగా కృష్ణుడు ఆ వ్యోమాసురుణ్ణి సంకోచం లేకుండా సంహరించాడు.

బలవంతుడైన శ్రీకృష్ణుడు ఆ భయంకరరాక్షసుణ్ణి సంహరించి, కొండగుహద్వారంలో అడ్డంగా ఉంచిన రాతిని పగిలిపోయేలా తన్నాడు. గుహలోపల చిక్కుబడిపోయి, తిరుగుతూ ఉన్న గోపబాలకులను కొండ గుహనుండి వెలుపలికి తీసుకొని వచ్చి గోకులానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు.

ఆ తర్వాత, అక్రూరుడు ఆ రాత్రి మథురానగరంలో బసచేసి, నియమంలో ఉదయమే లేచి, నిత్యకర్మానుష్ఠానాలు తీర్చుకొని, రథమెక్కి కదలి నందునిగోకులానికి ప్రయాణిస్తూ, దారిలో తనలో తాను ఇలా అనుకున్నాడు.

కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Vrushabhasura Samharamu - వృషభాసుర సంహారము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - వృషభాసుర సంహారము

ఎవని మూపురం చూచి మేఘాలు కొండశిఖరం అని భ్రమించి ఆశ్రయిస్తాయో - ఎవనిరంకె చెవులకు సోకితే గర్భవతులకు గర్భస్రావం అవుతుందో - ఎవని పాదఘట్టనలచే ఎగసే ధూళిరేణువులు సూర్యుణ్ణి ఆవరిస్తాయో - ఎవడు కొమ్ములతో కోరాడి చిమ్మితే కొండలే పెల్లగిల్లుతాయో - అలాంటి వృషభాసురుడు అహంకరించి, తీగలాంటి తన వాలాన్ని ఎత్తి, పెద్దరంకె వేసి, కాలితో నేలను తవ్వుతూ, ఆవులమంద భీతిల్లేటట్లు వాడికొమ్ములు చాచి అతివేగంగా వచ్చిపడ్డాడు.

అలా వృషభాకారం దాల్చిన అరిష్టుడనే రాక్షసుడు హరికి కీడుచేయదలచి అతనిపైకి దూకగా
వెంటబడగా దూడలు ఆవులవద్దకు పరుగెత్తాయి. దూడలు, ఆవులుచేరి ఎద్దులలో వచ్చిపడ్డాయి. దూడలు, ఆవులు, ఎద్దులు ఏకమై గోపాలకుల వద్దకు పరుగెత్తాయి. గోపాలకులు, ఎద్దులూ, ఆవులూ, దూడలూ చెల్లాచెదరై పరుగెత్తడం గోవిందుడు చూశాడు.

ఈ విధంగా భయంతో పరిభ్రమిస్తూ తామూ, తమకాంతలూ కృష్ణ కృష్ణా! రక్షించు! అని మొరపెడతూ కృష్ణుణ్ణి శరణుచొచ్చారు. దీనరక్షకుడైన శ్రీకృష్ణుడు గోపాలకులకు అడ్డంవచ్చి రాక్షసునితో ఇలా అన్నాడు.

ఓరీ! వృషభాసురా! పిల్లలనూ, స్త్రీలనూ, పశువులనూ పారదోలడం పరాక్రమమా? నీ ప్రతాపం వారిమీద చాలించు. నీ బలం చూపెట్టి భయపెట్టడానికి మేము సామాన్యులమైన గోపగోపీజనులం కాదు. వెళ్లిపో! మీదికి వచ్చావంటే నేడు ఈ కృష్ణుడనే పెద్దపులి నీ కంఠం ఖండించకుండా, నిన్ను చంపకుండా విడిచిపెట్టడు సుమా!

ఇలా రాక్షసుణ్ణి ధిక్కరించి పలుకుతూ, అరచేతులతో చరుస్తూ, నవ్వుతూ, పట్టుదల అతిశయించగా, సర్పరాజంవలె భీతిగాలిపే బాహుదండాన్ని చాచి, శౌర్యంతో దనుజుని పక్కనే కృష్ణుడు నిలిచాడు.

ఆ సమయంలోనే...

ఆ వృషభాసురుడు గిట్టలతో నేలతవ్వుతూ, అడ్డులేని విధంగా తిప్పే తనతోకవల్ల ఏర్పడే గాలులకు మేఘాలు విచ్చిపోతుండగా, కొమ్ములు ఒడ్డుకొంటూ, కన్నులలో నిప్పులు రాలుతుండగా, దుస్సహమైన రూపంతో రివ్వురివ్వున వచ్చి, శత్రువుల దుర్గర్వాన్ని నశింపజేసే పద్మనేత్రుడయిన శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు.

యాదవశ్రేష్ఠుడయిన కృష్ణుడు వృషభాసురుని రెండు కొమ్ములు పట్టి, పద్దెనిమిది అడుగులదూరం ఏనుగు మరో ఏనుగును పడదోసినట్లు తోసివేశాడు. ఆ రాక్షసుడు తల్లడిల్లి శరీరమంతా చెమటలు కమ్మగా సొమ్మసిల్లి నేలపైపడి, మళ్లీ తేరుకొని దనుజమర్దనుడైన కృష్ణుణ్ణి దుర్మదంతో ఢీకొట్టాడు.

రాజా! యదుసింహుడైన శ్రీకృష్ణుడు వృషభాసురునికొమ్ములు పట్టుకొని, భూమిమీద పడవేసి, కాలితో తొక్కిపట్టి రాక్షస వీరుల బలం అణగారగా, దేవతల ఉత్సాహం అతిశయించగా వానికొమ్ము ఊడబెరికి, దానితోనే వాణ్ణి కొట్టి చంపాడు.

వృషభాసురుడు బలముడిగి రొప్పుతూ, ముక్కులో, నోట్లో నెత్తురుకారుతూ ఉండగా, మలమూత్రాలు ఎక్కువగా విడుస్తూ ప్రజలకు ఆనందం కలిగేటట్లు ప్రాణాలు విడిచాడు.

ఈ విధంగా కృష్ణుడు వృషభాసురుణ్ణి చంపగా, దేవతలు గుంపులుకూడి, పూలుకురిపించారు. గోపాలకుల ఆనందించారు. స్త్రీలు ఉప్పాంగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి పరమానందంతో గోకులానికి వెళ్లాడు ఆ తర్వాత -

మహానుభావుడైన నారదుడు ఒకనాడు కంసునితో - “యశోద కూతురును కన్నది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భసంజాతుడు. బలరాముడు రోహిణికుమారుడు. ఆ ప్రభువులిద్దరూ గోకులంలో ఉన్నారు” అని తెలియజెప్పాడు. ఆ మాటలు విన్న కంసుడు 'ఇదిమహాద్భుతం” అనుకుంటూ కోపావేశంతో కంపించిపోయాడు.

(నారదుడు చెప్పిన విషయాలన్నీ కంసునికి కొత్తవే. అందువల్లనే మహాద్భుతం అని ఆశ్చర్యపోయాడు. తనకు ప్రాణగండం అయిన దేవకీదేవి అష్టమగర్భం అయిన కృష్ణుడు బతికి ఉండడంతో కంసుడు ఆగ్రహావేశంతో కంపించిపోయాడు.)

బక్క చిక్కిన ఈ వసుదేవుడు కొడుకులను గోకులంలో దాచి, వంచనతో నన్ను మోసం చేశాడు. ఇతణ్ణి పట్టిచంపడమే సరైంది అంటూ కత్తి చేతబూని వసుదేవుణ్ణి సంహరించడానికి వడివడిగా వచ్చే కంసుణ్ణి చూచి, నారదుండు "ఆగు! ఆగు! వసుదేవుణ్ణి చంపడం భావ్యంకాదు" అని గట్టిగా చెప్పి, వారించి, దేవలోకానికి తరలిపోయాడు.

ఇంకా కంసునికి కోపం తీరక దేవకీవసుదేవులను ఉక్కుసంకెళ్లతో బంధింపబేశాడు. 'కేశి' అనేవాణ్ణి  పిలిచి బలరామకృష్ణులను చంపుమని పంపాడు. మంత్రులను, భటులను, మావటివాండ్రను; చాణూరుడు ముష్టికుడు అనే మల్ల యోధులను; సాల్వుడు కోసలుడు మొదలైన ప్రముఖులను రప్పించాడు. వారితో ఇలా అన్నాడు.

"నన్నెదిరించి పోరాడడానికి ఎక్కడైనా ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. బలరామకృష్ణులు అనే మదించిన యాదవ బాలురు ఇప్పుడు బృందావనం గోకులంలో పెరుగుతున్నారట! యుద్ధభూమిలో కంసుణ్ణి సంహరిస్తామంటూ గర్వోక్తులు పలుకుతున్నారట! మీరు ఈ వింతమాటలను విన్నారా”

మల్లయుద్ధం ఏర్పాటు చేయండి. మల్లరంగస్థలానికి నాలుగు వైపులా దట్టంగా మంచెలు వేయించండి. మధురానగరంలో మల్లయుద్ధం జరుగుతుందని చాటింపు చేయండి. పట్టణ ప్రజలందరూ చూస్తారు.

ఓ చాణూర ముప్టికులారా! మీరు నైపుణ్యాలతో మల్లయుద్ధం చేయగలవారు. మహాశౌర్య పరాక్రమసంపన్నులు. మేటిమల్లయుద్ధవీరులలో కీర్తివహించి అతిశయంతో విరాజిల్లేవారు. ఈ మధురాపుర జనులు పొగడగా ఆ బలరామకృృష్ణులను మల్లయుద్ధంలో మర్దించి నాకు ప్రీతిపాత్రులు అవండి.

ఓ మావటివాడా! ఇలారా! ఆ గోపాలకులైన బలరామకృష్ణులు ఎత్తెన మన భవనద్వారందగ్గర గడపవద్దనున్న స్తంభం దగ్గరకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్లపై ఏర్పడిన మదధారల సువాసనలచేత గండుతుమ్మెదలసమూహాన్ని ఆశపెట్టి ఆకర్షించే నా కువలయాపీడమనే గజరాజాన్ని అదలించి, వారిమీదికి డీ కొలుపు! (ఢీ కొట్టించు)

మన విజయంకోసం చతుర్దశినాడు ధనుర్యాగం చెయ్యాలి. పశుపతికి ప్రీతిగా జంతుబలులు సమర్పించండి.

కంసుడు ఇలా చెప్పి, తనవాళ్లనందరినీ ఆయా పనులు చేయడానికి నియమించి, యాదవశ్రేష్ఠుడైన ఆక్రూరుణ్ణి పిలిపించాడు. అతనిచేతిని తన చేతిలో ఉంచుకొని ఇలా అన్నాడు.
(ఎవరినైనా చేయిపట్టుకుని ఆదరిస్తే రాజు అతణ్ణి సన్నిహితుడుగా భావిస్తున్నాడనడానికి సంకేతం.)

క్రౌర్యం లేకుండా నీవు మనుగడసాగిస్తూ ఉన్నందువల్ల నీకు అక్రూరుడనే సార్థకనామం సరిపోతూ ఉంది. నీతో మైత్రి చేయవచ్చు. నీవు కోపంలేనివాడివి. గోకులంలో బలరామకృష్ణులు అనే యాదవులు నన్ను చంపాలనే ఆసక్తితో ఉన్నారట. వారిని ఉపాయంతో తెచ్చి నాకప్పగించు!

నాకు భయపడి దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగా, అతడు యదువంశంలో వసుదేవునికి కృష్ణుడనే పేరుతో పుట్టాడని ఒక వార్త విన్నాను.

కాబట్టి నీవు గోపాలకులనుండి కప్పాలు పుచ్చుకొని, ధనుర్యాగం చూడడానికి రండి అని ఆ బలరామకృష్ణుల్ని తోడ్కొని రా. అలా వస్తే -

అక్రూరా! నా ఇంట్లో ఉండే కువలయాపీడం అనే గజరాజం తన దంతాల చివర్లతో కొండలనుకూడా కూలదోస్తుంది. మగటిమితో డీ కొంటే దండధరుడు అయిన యముణ్ణి అయినా కిందు పరుస్తుంది. అది బ్రహ్మాండాన్నయినా కదిలిస్తుంది. అలాంటి గజరాజుకు బలరామకృష్ణులను చీల్చి చెండాడడానికి ఎంతసేపు పడుతుంది? ఒక వేళ అదీ కాకుంటే -

చాణూరుడూ, ముప్టికుడూ సభలలో గణింపదగిన మల్లయోధులు. బలసంపదలో వారు వాయుదేవుణ్ణి కూడా లెక్కచేయరు. బాహాబాహి యుద్ధంలో వారు మిక్కిలి ప్రవీణులు. అలాంటివారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని సహిస్తారా? పోరాటంలో ప్రాణాలు తీసి వారిని సంహరిస్తారు. ఇది ముమ్మాటికీ నిజం.

ఆ బలరామకృష్ణులు అంతరించిన తర్వాత వసుదేవాదిప్రముఖులను తెగటారుస్తాను. సాహసంతో మెఅసి వృష్ణి, భోజ, దశార్హ జాతుల వీరులను సంహరిస్తాను. వృద్దుడు, రాజ్యకాముకుడు, నీచుడు అయిన మా అయ్య ఉగ్రసేనుణ్ణి, మాపినతండ్రి దేవకుణ్ణి చంపేస్తాను. 

ఇంకా మిగిలిన నాశత్రువులందరినీ నాశనంచేసి, నేను నామిత్రులైన జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైనవారితో కలిసి భూమండలం అంతా పరిపాలిస్తాను. 

నువ్వు వెళ్లి వెంటనే బలరామకృష్ణుల్ని తీసుకొనిరా! యాగం పేరు చెప్పి శత్రువులను నాశనం చేసే మంత్రాంగం చేయాలి. వైరుల్ని వృద్ధి పొందనీయరాదు.

(కంసుడు చెడ్డకమారుడు. తండ్రిని రాజ్యకాముకుడు, ఖలుడు, ముదుకడు అని పరుషపదజాలంతో నిందించాడు. చంపుతానన్నాడు. భారతంలో దుర్యోధనుడు కూడా తన తండ్రిని అంధుడని, ముసలివాడని నిందించడమేకాక అతణ్ణి లెక్కచేయలేదు. అందుకే తగిన ఫలాన్ని అనుభవించాడు.

జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు కంసుని మిత్రులు. జరాసంధుని భీమునిచేత కృష్ణుడు చంపిస్తాడు. నరకుడు సత్యభామ చేతిలో సంహరింపబడతాడు. బాణుడు, శంబరుడు కృష్ణుని చేతిలో ప్రాణాలు కోల్పోతారు.)

ఇలా కంసుడనగా అక్రూరుడు ఇలా పలికాడు.

ఓ రాజా! నీవు పంపిస్తే పోక తప్పుతుందా? మానవులు తమశక్తిని సరిగ్గా ఊహించుకోలేరు. దైవలీలలను కొంచెం కూడా తెలుసుకోలేరు. తమకు తోచినట్టుగా నిర్భయంగా వ్యవహరిస్తుంటారు. దాన్ని కాదనవచ్చా? విధినిర్ణయం తప్పించలేము. నీకు విరోధి అయిన వసుదేవునిబిడ్డలైన బలరామకృష్ణుల్ని తోడ్కొని వస్తాను. వెళ్లి వస్తాను.

శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...