Monday, August 3, 2026

Why is Goddess Gauri made using turmeric? - గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

పసుపు శుభానికి చిహ్నం.. గాయాలకు ఔషధం.. పవిత్రకు ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును వృద్ధికారకం చూస్తారు. అందుకే వివాహాది శుభకార్యలప్పుడు వధువు తల్లి దండ్రులు ఆమెకు అల్లుడితో పాటు పసుపును బహుమతిగా అందిస్తారు. అంతేకాకుండా అత్తింటి వారింట్లో ఆయురారోగ్యఐశ్వర్యాలతో సంతోషాన్ని వ్యాప్తి చెందించాలని ఇస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును ఉపయోగించడం వల్ల కొన్ని ఉపయోగకరాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొదవ ఉండదు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సొంతమవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి అశుభం జరగకుండా ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం.

హిందూ సంప్రదాయంలో ఏ పూజ లేదా వ్రతం ప్రారంభించినా పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మను తయారుచేసి పూజించడం ఆనవాయితీ. 

గౌరిదేవిని పసుపుతో చేయడానికి ప్రధాన కారణాలు పవిత్రత, సౌభాగ్యం మరియు దైవిక శక్తికి అది చిహ్నంగా ఉండటం. పసుపును ప్రకృతి సిద్ధమైన పవిత్రమైన పదార్థంగా, మంగళప్రదంగా భావిస్తారు.

మంగళకరం & పవిత్రత:
పసుపును మంగళద్రవ్యంగా, శ్రీ మహాలక్ష్మి మరియు గౌరీ దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావిస్తారు.
'గౌరి' అంటే పసిడి (బంగారు) ఛాయ కలది అని అర్థం. పసుపు రంగు గౌరీ దేవి దివ్య తేజస్సుకు ప్రతీక.

సౌభాగ్యానికి ప్రతీక:
ముత్తైదువులు పసుపు గౌరమ్మను పూజించడం వల్ల మాంగల్య బలం (ఐదవతనం) పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి లభిస్తాయని నమ్ముతారు. వరలక్ష్మి వ్రతం, శ్రావణ మంగళవారం, వినాయక చవితి వంటి పండుగలలో పసుపు గౌరమ్మ పూజకు ప్రత్యేక స్థానం ఉంది.

పురాణ నమ్మకం: అమ్మవారు పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపుతోనే వినాయకుడిని సృష్టించింది. అందుకే పసుపుతో దైవ రూపాన్ని చేయడం ఆచారంగా వస్తోంది.

భక్తికి ఆడంబరాలు అవసరం లేదు:
అమ్మవారికి వెండి, రాగి లేదా ఇతర విగ్రహాలు లేకపోయినా, కేవలం ఇంట్లో ఉండే పసుపుతోనే దేవి రూపాన్ని తయారుచేసి అత్యంత భక్తితో పూజించవచ్చు.

భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, నిశ్చలమైన భక్తి మాత్రమే అని ఇది తెలియజేస్తుంది.

ఔషధ గుణాలు & ఆరోగ్నం:
పసుపుకు సహజసిద్ధమైన క్రిమిసంహారక మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రతికూల శక్తులను తొలగించి, ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు.

పూజా వాతావరణంలో పసుపును ఉపయోగించడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా, ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనాత్మక శక్తి వ్యాపిస్తుంది.

పర్యావరణ హితం:
పూజ పూర్తయిన తర్వాత పసుపు గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేయడం లేదా మొక్కల్లో వేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.

పసుపులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పసుపును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటుంటాం. ప్రతీ కూరలో కచ్చితంగా పసుపు వేయాల్సిందే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దెబ్బ తగిలిన వెంటనే పెద్దలు పసుపు రాయమని సలహాలిస్తుంటారు. ఇంతటి మేలు చేసే పసుపును రోజూ ఉదయం పరగడుపు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

The spiritual reason behind using sandalwood paste in worship - పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక కారణం

పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక కారణం

పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక, వైజ్ఞానిక మరియు ఆరోగ్యకరమైన అనేక ముఖ్య కారణాలు ఉన్నాయి.

గంధానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది.

మంచి గంధపు చెక్కను అరగదీసి బొట్టు పెట్టుకోవడం వల్ల ఏన్నో ప్రయోజనాలున్నాయి. అంతే కాకుండా ఇది ఎంతో శ్రేష్టమైనది కూడా. బజారులో డబ్బాల్లో లభించే గంధపుపొడి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దానిలో ఉండే హానికారక రసాయనాలతో ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గంధాన్ని ముందు దేవునికి సమర్పించి తర్వాత నుదిటిపై దిద్దుకోవాలి. భక్తితో దేవతలకు గంధాన్ని సమర్పిస్తే వారు అనుగ్రహిస్తారని హిందూ పురాణాల్లో తెలిపారు. అంతే కాకుండా పాప పరిహారానికి సాలగ్రామశిలపై ఉంచిన గంధాన్ని నుదిటిపై అద్దుకోవాలని కూడా తెలిపాయి.

హిందూ సంప్రదాయ ప్రకారం సీమంత సమయంలో మహిళలకు గంధాన్ని పూస్తారు. అది పుట్టే బిడ్డకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. గంధములో ఉండే సుగుణాలు మన శరీరంలోని కొన్ని రుగ్మతల నుంచి ఉపసమనం కలిగిస్తాయి. నుదిట గంధం ధారణ వల్ల మెదడు చల్లబడి కోపం, ఆవేశం, ఆక్రోశం లాంటి ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది. తలపైన గంధాన్ని పూయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది.

లలాట ప్రదేశంలో పూయడం వలన కనుబొమల మధ్య ఉండే జ్ఞాన తంత్రులకు అంటే (సైన్స్ పరంగా చూస్తే పిట్యూటరీ గ్రంథి) ప్రభావితమవుతాయి. దీనివల్ల సంకల్ప బలం సిద్ధిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయి. గంధాన్ని పూసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమమవుతుందని చెబుతారు. గంధ ధారణ వల్ల గలిగే ఆధ్యాత్మిక లాభాన్ని కఠోపనిషత్తు వివరించింది. అంతేకాదు చందన లేపం అన్నివిధాల ఆరోగ్యాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. శరీరంపై ఏర్పడే బొబ్బలు, గజ్జి, తామర లాంటి వ్యాధుల నుంచి గంధం ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అహంకార విసర్జన: చందనం చెట్టుకు పాములు చుట్టుకున్నప్పటికీ అది విషాన్ని ఆపాదించుకోకుండా తన సువాసనను ఎలా ఇస్తుందో, అలాగే మనసును మంచిగా ఉంచుకోవాలని ఇది గుర్తుచేస్తుంది.

షోడశోపచార పూజలో ఒక భాగం:
దేవునికి చేసే 16 రకాల ఉపచారాలలో (షోడశోపచారాలు) "గంధం" సమర్పించడం అత్యంత ముఖ్యమైనది. దేవుడి విగ్రహాలకు లేదా చిత్రపటాలకు గంధాన్ని సమర్పించడం ద్వారా దేవుని పట్ల మనకున్న భక్తిని, గౌరవాన్ని తెలియజేస్తాము.

ప్రశాంతత మరియు చల్లదనం:
గంధానికి సహజంగానే శరీరాన్ని, మనస్సును చల్లబరిచే నైజం ఉంటుంది. పూజ చేసేటప్పుడు దేవునికి గంధం పూయడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సులోని కోపం, అలజడి తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

సానుకూల శక్తి:గంధం నుంచి వచ్చే సువాసన ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, పవిత్రమైన మరియు సానుకూలమైన వాతావరణాన్ని నింపుతుంది. పూజలు, శుభకార్యాలలో గంధం ఉపయోగించడం వల్ల ఆ వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది. ఈ సువాసన మనస్సును పూజపై ఏకాగ్రత నిలిపేలా చేస్తుంది.

దైవిక అనుభూతి: గంధం ధరించడం వల్ల మనసు దైవంపై లగ్నం అవుతుంది. ఇది ధ్యానానికి, ఆధ్యాత్మిక భావనలకు సహాయపడుతుంది.

సంప్రదాయం: హిందూ సంప్రదాయంలో గంధానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవతలకు గంధం సమర్పించడం, భక్తులు నుదుట ధరించడం ఆచారంలో భాగం.

ఆజ్ఞా చక్రం ప్రేరణ:
పూజ పూర్తయిన తర్వాత గంధాన్ని నుదుటన (రెండు కనుబొమ్మల మధ్య) బొట్టుగా పెట్టుకుంటారు.
ఈ ప్రదేశంలో 'ఆజ్ఞాచక్రం' ఉంటుంది.ఇక్కడ గంధం పెట్టడం వల్ల నాడీ వ్యవస్థ చల్లబడి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

సాత్విక గుణానికి ప్రతీక:
హిందూ ధర్మంలో గంధాన్ని 'సాత్విక గుణానికి' (శాంతం, పవిత్రత) సంకేతంగా భావిస్తారు. మనలోని అహంకారాన్ని, కల్మషాలను కరిగించి పవిత్రమైన మనస్సుతో దేవుడిని పూజించాలని ఇది గుర్తుచేస్తుంది.

Dhanishtha Nakshatra - ధనిష్ఠ నక్షత్రము

ధనిష్ఠ నక్షత్రము

నక్షత్రం - ధనిష్ఠ
అధిపతి - కుజుడు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - జమ్మి
జంతువు - సింహం
నాడి - మధ్యనాడి
పక్షి - కాకము
అధిదేవత - అష్ట వసువులు
రాశి - 1,2 పాదాలు మకరం, 3,4 పాదాలు కుంభం

ధనిష్ఠా నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ధనిష్ఠా నక్షత్రము 23వ నక్షత్రము. ఈ నక్షత్రానికి దోషం లేదు. ధనిష్టా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము.

ఈ రాశిలో జన్మించినవారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు.

అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మొండితనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు.

ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనే నిలబడతాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందువలన నష్టపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు.


సంతానాన్ని అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం కుటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్దశలు, శుక్రదశ యోగిస్తాయి.

ధనిష్ఠా నక్షత్ర జాతకులు బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు చేసే ప్రతి పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఏ పరిస్థితినైనా వారు తమంతట తాము సర్దుబాటు చేసుకుంటారు. మనస్సు, చర్య, మరియు పదాలతో ఎవరికీ హాని చేయరు. మనస్సు చాలా పదునైనది మరియు ఎల్లప్పుడూ ఏదో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనోహరమైన చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక స్వభావం ఉంటుంది మరియు నైపుణ్యాలు, క్యారెక్టర్ మరియు ప్రభావాల విషయంలో చక్కగా ప్రవర్తిస్తారు. చక్కగా మాట్లాడే స్వభావం ఉండటం వల్ల, ప్రజల నుంచి ప్రేమ మరియు మద్దతును వీరు పొందుతారు. ఇతరులను ఎలా గౌరవించాలి మరియు మర్యాద ఇవ్వాలనే విషయం వీరికి బాగా తెలుసు.

చుట్టూ ఉండే ప్రజలు సంతోషాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు. ఉల్లాసం, సామాజికంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్ల, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. వ్యక్తులతో సమయాన్ని గడిపినప్పుడు చక్కగా భావిస్తారు. వీరు తమ బాధ్యతలను విడిచి పెట్టడానికి ఇష్టపడరు. అన్ని రకాల సమస్యలు మరియు అడ్డంకులపై పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు.

వాదనల విషయానికి వచ్చినప్పుడు, అత్యుత్తమంగా ఉంటారు, అందువల్ల పాలసీలు మరియు చట్టం విషయంలో వీరు అత్యుత్తమంగా ఉంటారు. విషయాలను రహస్యంగా ఉంచగలుగుతారు. ఎంత చదువుకున్నప్పటికీ, వీరు తమ జ్ఞానం కోసం పేరుప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఏదైనా పనిని లేదా ఇతర పనులను ఒకేసారి చేయడం వీరి అలవాటు.

అంకితభావం మరియు క్రియాత్మత కారణంగా, వీరు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. వీరు ఎంతో ఉత్సాహ భరితంగా ఉంటారు. ఏది నిర్ణయించుకున్నప్పటికీ, పనిచేస్తూనే ఉంటారు లేదా పూర్తయ్యేంత వరకు పనిచేస్తారు.వీరికి ఆత్మగౌరవం ఎక్కువ, దీని వల్ల గౌరవమర్యాదలు లభిస్తాయి.

మానసిక శక్తి బలంగా ఉంది మరియు వీరు ఏ నిర్ణయమైనా వేగంగా తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. దీనితో ఎలాంటి సమస్య ఉండదు. నిర్ణయం తీసుకునే సామర్ధ్యాల వల్ల, వీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు. వీరు వ్యాపారానికి కాకుండా ఉద్యోగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. అయితే, ఉద్యోగం లేదా వ్యాపారమైనా, వీరు ఉన్నత స్థానంలోనే ఉంటారు.


ధనిష్ఠా నక్షత్రము మొదటి పాదము
ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు. ఈ జాతకుల మీద సూర్య కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రము. కనుక వీరు ఏదైనా కార్యము యందు పట్టుదలగల వ్యక్తులై ఉంటారు. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, అతిశయం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కాస్త అధికంగానే ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి 6 సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

విద్యలో అడ్డంకులు ఎదురుకావచ్చు. వీరికి రాహుదశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక కష్టం తెలియకుండా గడిచిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు కాస్త తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము రెండవ పాదము
ఈ జాతకులకు ఆవేశం, బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. వ్యాపారం చేయడమంటే ఆసక్తి కనబరుస్తారు. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. సైనిక పరమైన వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం.

ఈ నక్షత్ర జాతకులకు 4 సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

విద్యలో అడ్డంకులు ఉంటాయి. వీరికి రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక అప్పుడు కష్టాలు తెలియకుండా జరిగిపోతుంది. రాహుదశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు క్రమంగా తగ్గి జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే తరువాత వచ్చే శనిదశ కాలంలో ఆర్థిక సమస్యలు వస్తాయి.

38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులే అధికమవుతాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సుఖంగా సాగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము మూడవ పాదము
ధనిష్ఠా నక్షత్ర మూడవ పాద జాతకులు పట్టుదలగల వ్యక్తులై ఉంటారు. వీరు కళాత్మకమైన వస్తు సేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్, జల భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 2 సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.

రాహుదశ కాలం తల్లి దండ్రుల నీడలో జరిగిపోవడం వల్ల వీరికి కష్టం తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గుతాయి. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు తప్పవు.

36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది.

72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన, తీర్థ యాత్రలు అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము నాలుగవ పాదము
ధనిష్ఠా నక్షత్ర నాల్గవ పాద జాతకుల మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. ఈ జాతకులకు ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి.

ప్రజా ఉద్యమాలలో వీరు ముందుంటారు. వీరికి సైనిక సంబంధమైన ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు ఒక సంవత్సరము వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంది. రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో ఉంటారు కనుక కష్టాలు లేకుండా జరిగిపోతుంది.

19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుతాయి. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. అయితే సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

35 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనిష్ఠా నక్షత్ర జాతకులు పెంచాల్సిన చెట్టు
ధనిష్ఠా నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్ర జాతకుల తారా ఫలాలు :

తార నామం - తారలు - ఫలం

జన్మ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - శరీరశ్రమ

సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ధన లాభం

విపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్యహాని

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - క్షేమం

ప్రత్యక్ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ప్రయత్న భంగం

సాధన తార - అశ్విని, మఖ, మూల - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - బంధనం

మిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం

అతిమిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: గోధుములు పుణ్యాత్ములకు శివాలయంలో దానం చేయాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అష్టౌ దేవా వస'వస్సోమ్యాసః' ।
చత’స్రో దేవీరజరాః శ్రవిష్టాః ।
తే య్ణం పాంతు రజ'సః పురస్తా”త్ ।
సంవత్సరీణ'మమృతగ్గ్' స్వస్తి ।
యం నః' పాంతు వస'వః పురస్తా”త్ ।
దక్షిణతో' భియంతు శ్రవి'ష్ఠాః ।
పుణ్యన్నక్షత్రమభి సంవి'శామ ।
మా నో అరా'తిరఘశగా సాగన్న్' ॥

నక్షత్ర గాయత్రి
ఓం అగ్రనాథాయ విద్మహే 
వసూప్రితాయ ధీమహి 
తన్నో శర్విష్టా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – వెల్వలపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి.
రెండవ పాదం – అయినవెల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.

మూడవ పాదం – మసకపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి.
నాలుగవ పాదం – కుందూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.

Saturday, August 1, 2026

Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివా! శంకరా! సర్వాత్మకా!
జగన్మాతా! జగదంబికా! ఆంటూ పార్వతీపరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవపురస్పరంగా ఎదురువచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథిమర్యాదలు జరిపి సముచితాసనంమీద కూర్చోబెట్టారు. కుశలప్రశ్నలతో కథలూ కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకీ - సమీపంలో ఉన్న కుంభీపాక నరకకూపంనుంచి ఆర్తనాదాలూ హాహాకారాలూ హృదయవిదారకంగా వినిపించాయి. దూర్వాసుడికి మనస్సు కలతపడింది. ఎవరివి ఈ అరుపులు? ఎక్కడినుంచి? ఆని ఆత్రంగా ప్రశ్నించాడు.

మునీశ్వరా! ఇక్కడికి చేరువలోనే సంయమినీపురం(యమలోకం) ఉంది. అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడున్నాడు. అతని అధీనంలో వేలమంది యమదూతలున్నారు. నల్లగా బలిష్ఠంగా భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో ఎనభయ్యారు నరకకూపాలు ఉన్నాయి. వాటిలోకెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం. మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణనాతీతం. నూరేళ్ళు వర్ణించినా తరగదు. శివుద్రోహులూ దేవీనిందకులూ విష్ణుద్రోహులూ వేదనిందకులూ సూర్యగణేశాదిదేవ నిందకులూ కామాచారులూ మాతృ పితృ గురు జ్యేష్ఠ భ్రాతృ - పురాణ స్మృతి నిందకులూ ఇంకా ఇలాంటి పాపాలు చేసినవారూ ధర్మం తప్పినవారూ కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రోమని దిక్కులు పగిలేలాగా అరిచి రోదిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ హాహాకారాలు మేము రోజూ వినేవే. వీటిని ఒక్కసారి వింటేచాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది - ఆని పితృదేవతలు వివరించారు.

వింటూనే దూర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ-అదేమిటో చూద్దామనిపించి ఆ నరకకూపం దగ్గరికి వెళ్ళాడు. గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు. ఆంతే, హహాకారాలు మాయమయ్యాయి. వహ్వాకారాలు మిన్నుముట్టాయి. ఆ కూపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్టు పరస్పరం ఆనందపరచుకుంటున్నారు. మృదంగ వీణా మురజ ఢక్కా దుందుభులు మోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధికనుఖమంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లీ పుష్పగంధాలూ శుకశారికాపికాలాపాలూ విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఇప్పుడిక్కడ కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

యమదూతలకు ఇందంతా చాలా వింతగా విడ్డూరంగా కనిపించింది. జరగరానిదేదో జరిగిపోయిందని కలవరపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా! ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీపాకంలో మహాపాపులు స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడంలేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాం - అన్నారు.

యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూతద్వారా పంపించాడు. ఇంద్రుడు దిక్పాలకులకూ బ్రహ్మదేవుడికీ, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికీ తెలియపరిచారు. అందరూ వెంటవెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాలమీద క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనందపరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. అహో! ఇది నరకకూవం కానేకాదు. పాపాత్ములకోసం నిర్మించిన భోగకూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవరికీ స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేదెవడు? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చిపడతారు. అక్కడా సుఖపడతారు. ఇక్కడా సుఖపడతారు. వేదమర్యాదలూ ధర్మమార్గాలూ ధ్వంసమైపోతాయి. ఎమిటి ఈ విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరచుకుంటున్నాడా ఆ భగవంతుడు! చాలా ఆశ్చర్యంగా ఉందే! - ఇలా తర్కించుకుంటున్నారు. కొందరు కారణమేమిటో తెలియక ఏమి మాట్లాడటానికీ తోచక తటస్థులై మౌనంగా నిలుచుండిపోయారు.

విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుబట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదు. సరే శివుణ్ణి అడుగుదామని మరికొందరు దిక్పాలకులనూ దేవముఖ్యులనూ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు.

కోటిమన్మథసుందరాకారుడు. సదా షోడశవర్షీయసుడు. లావణ్య నిధి. నానాలంకారభూషితుడు. పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చెయ్యకుండా యమలోకపు వింత విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వజ్ఞుడివి. కనక హేతువేమిటో చెప్పు - అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు.

శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజా! ఇందులో వింత ఏముంది? విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిదేదీ లేదు. దూర్వాసుడు వచ్చాడుగదా! ఆతడు పరమమాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడుగదా! మరింకేమి! అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే, విభూతి మహిమ నరకకూపం స్వర్గలోకంగా మారిపోయింది. ఇప్పటినుంచీ అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్టించండి. పిత్రీశ్వరీ పిత్రీశ్వరులుగా విడిది చేస్తాం. పితృలోకనివాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకీ ఇది ఉత్తమోత్తమమవుతుంది - అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు.

విష్ణుమూర్తీ ఆతడి అనుచరులూ సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగివచ్చి అక్కడున్న మిగతా దేవతలకందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరసులూపి బాగుబాగని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్టించారు. నిత్యమూ పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్యవిమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు.

యముడూయమదూతలూ ఇక చేసేదిలేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభిపాక కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటినుంచీ శైవులెవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు.

ఊర్ధ్వపుండ్ర ధారణ




Bhasma Snanam (Ritual bath with sacred ash) - భస్మస్నానం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మస్నానం

ర్ధ్రస్నానం కన్నా భస్మస్నానమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆర్ధ్రత ఆరిపోతుంది. అదీగాక ఆర్ధ్రస్నానం ప్రకృతిసిద్ధం. ప్రకృతి అంటే బంధనమేనని పెద్దలంటారు. కనక ప్రకృతిబంధ విమోచనంకోసం భస్మస్నానం చెయ్యాలి. సారాంశమేమంటే - ఆగ్నేయస్నానానికి సాటివచ్చేది ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుచేతనే సకలదేవతలూ రక్షణకోరి పవిత్రతకోరి మంగళంకోరి ఈ విభూతిని ఆదిపరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయస్నానం అశీతివాత రోగాలనూ చతుష్టష్టిపిత్తరోగాలనూ సప్తత్రిపంచక శ్లేష్మరోగాలనూ వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలనూ తక్షణం తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగుల్లాగా ఇవి మడిసిపోతాయి.

శీతలోదకాలతో స్నానంచేసి విభూతిని నెన్నొసట త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడనడంలో సందేహం లేదు. భస్మస్నానంకూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహం లేదు. లలాటలిఖితమైన బ్రహ్మరాతలలో పనికి రానివాటినీ హానికరమైనవాటినీ తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకుమాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ ఆవయవాన విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై దాలిస్తే మనస్సు చేసే పాపాలు బొడ్డున ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలూ అంతరిస్తాయి. కుడియెడమ పార్శ్వభాగాలలో ధరిస్తే పరకాంతాలింగనాది దోషాలు నశిస్తాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే. మూడురేఖలుగా ధరిస్తే త్రిమూర్తులనూ ధరించినట్టే. త్రిగుణాలనూ ధరించినట్టే, త్రిలోకాలనూ ధరించినట్టే. ఒళ్ళంతా బూడిద పులుము కున్నవాడు సర్వపాపవిముక్తుడై సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడంటారు. భస్మదిగ్ధసర్వాంగుడూ భస్మదీప్త త్రిపుండ్రకుడూ భస్మశాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచోరగాదులూ దుస్సహరోగాలూ భస్మనిష్ఠుణ్ణి చూస్తే పదిఆమడల దూరం పారిపోతాయి.

భాసిస్తుందికనక భసితమనీ, కల్మషాలను భక్షిస్తుంది కనక భస్మమనీ, విభూతిని(ఐశ్వర్యం) కలిగిస్తుంది కనక భూతి అనీ, రక్షిస్తుంది కనక రక్ష అనీ దీనికి పేర్లు ఏర్పడ్డాయి.

రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే త్రిపుండ్రాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి. ఆంతరిస్తాయి. అకృత్యాలు వెయ్యి చేసినా భస్మస్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి. కనీసం ప్రాణావసానదశలో అగ్నిస్నానం చేసినా పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు. నిత్యమూ చేసేవాడు జితక్రోధుడై జితేంద్రియుడై శివసన్నిధికి వెడతాడు. అతడికింక పునర్జన్మ ఉండదు. పున్నమినాడు భస్మోద్దూళితశరీరుడై శంకరార్చన చేసినా చూసినా ముక్తీ పాపవిముక్తీ తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా విద్య కావలన్నా కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణమొక్కటే శరణ్యం.

కేవలజలస్నానం శరీరం పైని ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది. విభూతిస్నానమో బాహ్యాభ్య న్తరమలినాలను తొలగిస్తుంది. అంతశ్శుద్ధీ బహిశ్శు
ద్ధీ రెండూ సిద్ధిస్తాయి. కనక జలస్నానం చెయ్యకపోయినా ఫరవాలేదుగానీ భస్మస్నానం చేసితీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు. కాబట్టి వైదికకర్మలకన్నింటికీ ముందు విధిగా ఇది చేసితీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచవిధులన్నీ నిర్వర్తించాక భస్మస్నానం చేస్తేనే పరిపూర్ణశౌచం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడూ ఆవులించినప్పుడూ దగ్గినప్పుడూ తుమ్మినప్పుడూ శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్దికోసం భస్మస్నానం చెయ్యాలి.

నారదా! భస్మస్నానమాహాత్మ్యం గురించి ఇప్పటికి ఒకవంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది. విను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనక వీరినే ద్విజులు అంటారు.
ద్విజులందరూ తప్పకుండా శ్రౌతపద్దతిలో విభూతి త్రిపుండ్రధారణ చెయ్యాలి. ఇది లేకుండా. గాయత్రీమంత్రాన్ని ఉపదేశించడానికిగానీ స్వీకరించడానికిగానీ వీలులేదు. అధికారం లేదు. కనక మరిచిపోకుండా విభూతిపెట్టుకునే గాయత్రీజపం చెయ్యాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలూ మణులూ అలంకరించుకోవడంమీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో, విభూతిని పెట్టుకోవడం మీదకూడా అంత ఆదరమూ అంత సహజంగానూ ఉండాలి. నొసట విభూతిలేకుండా ఏది తిన్నానరకానికి పోతారు. ఇక శూన్య లలాటంతో శివపూజ చేసినా వ్యర్థం. అతడు శివద్వేషితో సమానం. నరకానికి పోవడం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసినా నిష్ఫలం. నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపవీతమే లేని సంధ్యావందనంతో సమానం. నిరర్ధకం. యజ్ఞోపవీతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి. జపాలూ ఉపవాసాలూ ఏవో ప్రాయశ్సిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మరిచిపోతే ఏ ప్రత్యామ్నాయమూ లేదు. ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. సరాసరి నరకలోకానికి పోవడమే.

అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌతభస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరక్కపోతే స్మార్తమూ అదీ దొరకకపోతే లౌకికమూ - ఏదో ఒక భస్మం ధరించితీరాలి. అది పవిత్ర భస్మమైతే చాలు. కుడిచేతి మధ్యాంగుళిత్రయంతో (బొటనవేలూ చిటికెనవేలూ కాక) నుదుట కనీసం ఆరంగుళాల పొడవు ఉండేట్టు ఈ కంటి కొసనుంచి ఆ కంటి కొసదాకా ఉండేట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో ఆనామికను(చిటికెనవేలుకి ప్రక్కనున్నది) అకారమనీ, మధ్యమాంగుళిని (నడిమివేలు) ఉకారమనీ, తర్జనిని(చూపుడువేలు) మకారమనీ అంటారు. ఈ మూడింటి సంయోజనతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం, (అ + ఉ + మ్‌ = ఓమ్‌). అట్టడుగు అనామికారేఖ బ్రహ్మతత్త్వం. కనక రజోగుణం. నట్టనడిమి మధ్యమాంగుళీరేఖ విష్ణుతత్వం. కనక సత్వగుణం. తుట్టతుది తర్జనీరేఖ శివతత్త్వం. కనక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం.

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ




Bhasmadharana Mahima - The Glory of Wearing Sacred Ash - భస్మధారణ మహిమ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ మహిమ

నారదా! ఈ భస్మధారణ మాహాత్మ్యం ఎంత చెప్పినా తరగదు. ఇంకా ఉంది. విను. ఇప్పటికి జాబితాలోకెక్కిన పాతకాలేకాక ఇంకా మహాపాపాలు ఏమైనా ఉంటే అవ్వికూడా నశిస్తాయి భస్మోద్దూళన భస్మధారణలతో అనడం ముమ్మాటికీ సత్యం. ఇది యతీశ్వరులకు జ్ఞానాన్నీ, వానప్రస్థులకు విరక్తినీ, గృహస్థులకు ధర్మవృద్ధినీ, బ్రహ్మచారులకు స్వాధ్యాయశక్తినీ, శూద్రులకు పుణ్యాన్నీ, ఇతరులకు పాపక్షయాన్నీ అపారంగా కలిగిస్తుంది. సర్వభూతరక్షణకోసం విభూతిని ధరించాలనీ ఉద్దూళన చేసుకోవాలని వేదం చెబుతోంది. ఇది యజ్ఞంతో అన్నివిధాలా సరిసమానమంటోంది. మాహేశ్వరులకు ఇది చిహ్నం, సర్వులకూ విజ్ఞానప్రదం అని పేర్కొంటోంది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులూ వారి అంశావతారాలూ ఇంద్రాది దేవతలూ వరుణాది దిక్పాలకులూ సరస్వతీ లక్ష్మీపార్వతులూ వారి అంశదేవీమూర్తులూ శచీప్రముఖ సకలదేవ కాంతలూ యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సమస్తజాతులవారూ మునులూ ఋషులూ యోగులూ తపస్వులూ చతుర్వర్ణాలవారూ సంకరజాతులవారూ అపభ్రంశులూ - వారూ వీరూ అని తేడా లేకుండా అందరూ భస్మోద్దూళన భస్మధారణలు చేసినవారే. చేస్తున్నవారే. చెయ్యవలసినవారే. శిష్టులు అంటే వీరే. ఇంకెవరూ కారు. ఒక్కమాటలో దీని మాహాత్మ్యం చెప్పాలంటే శివలింగంలాగా చింతామణిలాగా పంచాక్షరీ మంత్రంలాగా ఈ విభూతి అనేది మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్యౌషధం.

విభూతిని ధరించివస్తే మూర్ఖుడా పండితుడా అనే ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే పార్వతీపరమేశ్వరులు వచ్చి భుజించినట్టే

భస్మధారిని అనుసరించినా స్తుతించినా శ్రద్ధగా సేవించినా పాపాలు తొలగిపోతాయి. పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారికి భిక్షవే స్తే సర్వవేదాలూ చదివినంత, సకలసత్కర్మలూ అనుష్ఠించినంత పుణ్యం వస్తుంది. నిత్యమూ శిరస్సున విభూతిని ధరించేవాడు అడవుల్లో ఉన్నా అరణ్యాల్లో ఉన్నా అది కాశీక్షేత్రమే. భస్మధారిలో మిగతా యోగ్యతలు పరిశీలనీయాలు కానేకాదు. అవగుణాలు ఎన్ని ఉన్నా పరిగణనీయాలు కానేకాదు. శివసంతతితో సమానుడు. పూజనీయుడు. ఒకవేళ దుశ్శీలుడయ్యుండి ఎదుటివారిని మోసగించడంకోసమనే విభూతి పెట్టుకున్నా ఒళ్ళంతా పులుముకున్నా అతడు ధన్యుడే. పావనుడే. నూరు యజ్ఞాలు చేసినవారు వెళ్ళే లోకాలకు తానూ వెడతాడు. అనుకోకుండా విభూతి వొంటికి తగిలినా క్రీడావినోదంగా ధరించినా భయపడి పెట్టుకున్నా అతడు శివుడితో సమానుడే. పూజనీయుడే. విభూతిధారణ ఏ కారణంగా ఎవరు ఎలా చేసినా ముగ్గురమ్మలకూ ముగ్గురయ్యలకూ తృప్తినీ ఆనందాన్నీ కలిగిస్తుంది. దాన యజ్ఞ తప స్తీర్థయాత్రలకు అందని పుణ్యం విభూతిధారణతో వచ్చి వాడిలో పడుతుంది. నిజం. అవి అందించే పుణ్యాలు ఈ పుణ్యంలో పదహారవవంతుకికూడా సాటిరావు. తన చిహ్నాలను ధరించిన ప్రజలను రాజుగారు ఎలా తనవాళ్ళని గుర్తిస్తాడో అలా శివుడు త్రిపుండ్రధారులను తనవాళ్ళుగా భావిస్తాడు. నిర్మలహృదయంతో విభూతిని ధరిస్తే సాక్షాత్తూ రుద్రుణ్ణి వశీకరించుకొన్నట్టే. మిగతా ఆచారాలూ అనుష్ఠానాలూ ఏమీ లేకపోయినా సరే నెన్నొసట విభూతితో అడ్డబొట్టు ఉంటేచాలు అతడు ముక్తిని పొందడం తథ్యం. కులమూ గోత్రమూ వ్రతమూ జ్ఞానమూ ఇత్యాదులతో పనీలేదు, పరీక్షా లేదు. నారదా! శివమంత్రంకన్నా గొప్ప మంత్రం లేదు. శివుడికన్నా గొప్ప దైవం లేడు. శివార్చనకన్నా గొప్ప పుణ్యం లేదు. విభూతి కన్నా గొప్ప తీర్థం లేదు. రుద్రవేత్రాగ్నికన్నా గొప్ప తీర్థం ఈ విభూతి. సర్వదుఃఖవిధ్వంసకం. సర్వపాప విమోచకం. విభూతిధారి - ఎవడైనా ఆగుగాక - ఎక్కడ ఉంటే అక్కడ సర్వభూతగణ - సర్వతీర్థగణ పరివృతులై పార్వతీపరమేశ్వరులుంటారు. పంచాక్షరీ శివమంత్ర పరిపూతమైన ఈ విభూతిని, శివుడుకోరి అలంకరించుకునే ఈ భస్మాన్ని నెన్నుదుట త్రిపుండ్రాలుగా ధరిస్తే చాలు - అక్కడ బ్రహ్మదేవుడు రాసిన చెడురాతలన్నీ చెరిగిపోతాయి.

నారదా! విభూతిని సర్వాంగాలకూ ఆలదుకొన్నవాడికి ధనం దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. శ్రుతులూ స్మృతులూ అఖిలపురాణాలూ విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతున్నాయి. అంచేత ఆందరూ దీన్ని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదట పెండెకట్టులుగా పెట్టుకుని మూడుపూటలా సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. యోగీశ్వరుడు ఆపాదతలమస్తకంగా త్రిసంధ్యల్లోనూ భస్మస్నానం చేస్తే చాలు అతడికి యోగసిద్ది కల్గుతుంది. ఇది జలస్నానంకన్నా ఎన్నోరెట్లు గొప్పది. గృహస్థులకు వంశవర్ధకం. సర్వతీర్థాలలోనూ క్రుంకులాడిన పుణ్యఫలం ఒక భస్మస్నానంతో లభిస్తుంది. మహాపాతకాలూ ఉపపాతకాలూ అన్నీ మండుతున్న అగ్నిలో ఎండుకట్టెల్లాగా దహించుకుపోతాయి. భస్మస్నానానికి సాటివచ్చే స్నానమే లేదు. ఇలాగని శివుడే సాక్షాత్తుగా ప్రశంసించి తానూ స్వయంగా నిత్యమూ భస్మస్నానాన్ని చేస్తున్నాడు. అప్పటినుంచీ బ్రహ్మాదిదేవతలూ ఋషి ముని గణాలూ సకలసత్కర్మాచరణలకూ ఆరంభంలో పనిబూని భస్మస్నానం చేస్తున్నారు. అందుచేత ఈ ఆగ్నేయమైన భస్మస్నానాన్ని చేసినవారందరూ ఈ శరీరాలతోనే రుద్రులుగా పరిగణింపబడుతున్నారు. భస్మస్నాతులనూ భస్మధారులనూ సందర్శించినవారు సైతం దేవాసురమునీంద్రులచేత వంద్యులవుతున్నారు. దర్శించి గౌరవసూచకంగా లేచి నిలబడినవారికి దేవేంద్రుడంతటివాడు సాష్టాంగపడతాడు. భస్మధారులకు అభక్ష్యభక్షణాది దోషాలు ఏమీ అంటవు. అన్నీ హాయిగా ఆరగించవచ్చు. జలస్నానం చేసినా భస్మస్నానం కూడా చేస్తేనే బ్రహ్మచారులూ గృహస్థులూ వానప్రస్థులూ సర్వపాపవినిర్ముక్తులవుతారు. సద్గతి(ముక్తి) పొందుతారు. యతీశ్వరులకు ఈ ఆగ్నేయభస్మస్నానం మరీ విశేషంగా ఫలప్రదమవుతుంది.

భస్మస్నానం




Bhasmoddulanam - Smearing with sacred ash - భస్మోద్దూళనం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మోద్దూళనం

కపిలగోవు పేడను నేలమీద పడకముందే పట్టుకోవాలి. ఒకవేళ నేలమీద పడిపోతే కడికి పైపేడనూ కిందపేడనూ వదిలేసి మధ్యలోది స్వీకరించాలి. అది దుర్గంధంతో ఉన్నా పుర్రుగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా పనికిరాదు. పట్టినపేడను ఇంటికి తెచ్చి చిట్టో పాట్టో కలిపి ముద్దలు చేసి ఎండబెట్టాలి. ఇదంతా ఆయా మంత్రాలతోనే చెయ్యాలి. హోమం చేసేటప్పుడూ భస్మం తీసేటప్పుడూ నియత మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసి తడిఆర్చిన గట్టిపాత్రలోకి కచికలు తీసి పరిశుభ్రవస్త్రం కప్పాలి. సమంత్రకంగా పరిమళద్రవ్యాలు కలపాలి. మంత్రయుక్తంగా పరిశుభ్రస్థలంలో భద్రపరచుకోవాలి. వెండి బంగారు కర్ర మట్టిపాత్రలు ఏవైనా పనికివస్తాయి. అందంగా శుభ్రంగా దృఢంగా ఉంటే చాలు. ధనవంతులైతే బంగారు పొత్రల్లోనే ఉంచుకోవచ్చు.

ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకువెళ్ళాలి. అనుచరులతోనైనా తెప్పించుకోవచ్చు. కానీ అశుచి చేతికి భస్మపాత్రను ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడం ఎగరవెయ్యడం దాటడం - ఇలాంటివి చెయ్యకూడదు. భక్తిశ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారుచేసుకోవాలి, రక్షించుకోవాలి, ధరించుకోవాలి. ఇది స్మృతులు చెప్పిన విభూతిధారణ విధానం. యథాతథంగా ఆచరించినవాడు శివుడితో సమానమవుతాడు.

శైవులు శివాలయాలలో సిద్ధం చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు. భస్మాన్నేకాదు ఇచ్చిన వారినీ గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్రమార్గంలో విభూతిని తయారుచేసుకొంటారు. ఒక వేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని ఇవ్వజూపితే వైదికులు స్వీకరించకూడదు.

కానీ శూద్ర కాపాలిక పాషండాదులు ఇస్తే తీసుకోవచ్చు, ధరించవచ్చు. విభూతిని ఏనాడూ ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్గొనూ తిరస్కరించకూడదు. కించపరచకూడదు. అసలు అటువంటి ఊహలే రాకూడదు. కించపరిచినా విభూతిధారణను విడిచిపుచ్చినా పతితుడవుతాడు. త్రిపుండ్రధారణమూ దేహావగుంఠనమూ భక్తిశ్రద్దలతో మంత్రపూర్వకంగా రోజూ ముప్పొద్దులా చేసుకోవాలి. లేకపోతే మోక్షం లేదు. కోటిజన్మలెత్తినా భవబంధ విమోచనం కలగదు. విభూతి ధరించనివాడి జన్మ నిష్ఫలం. మరుసటి జన్మలో పందిగా పుడతాడు. త్రిపుండ్రాలంకరణ లేని మానవ శరీరం శ్మశానసదృశం. పుణ్యాత్ములు వాడిని చూడనేకూడదు. విభూతి లేని ఫాలమూ, శివాలయం లేని గ్రామమూ, ఈశ్వరార్చన లేని జన్మమూ, శివాశ్రయం కాని చదువూ(విద్య) పరమనింద్యాలు.

విభూతిని నిందిస్తున్నాడంటే శివుణ్ణి నిందిస్తున్నట్లే, ధరిస్తున్నాడంటే శివుణ్ణి ధరిస్తున్నట్లే. వస్తు సామగ్రి ఎంత పుష్కలంగా ఉన్నా సాధనసంపత్తి ఎంత అధికంగా ఉన్నా విభూతిలేని శివార్చన (అగ్ని లేని పర్వతంలా?) శోభించదుగాక శోభించదు. ఉద్దూళన త్రిపుండ్రధారణలు శ్రద్ధగా ఆచరించనివారికి పూర్వజన్మ సంచితపుణ్యాలన్నీ నశిస్తాయి. స్మార్తులు వేదోచితాచారాలను పాటిస్తూ వేదమంత్రాలతోనే త్రిపుండ్రధారణ చెయ్యాలి. లేనినాడు అనర్ధదాయకమవుతుంది. విభూతి పెట్టుకోనివాడు ఏ మంచిపని చేసినా అది చెయ్యనట్టే, ఏ పవిత్ర విషయం విన్నా అది విననట్టే, ఏ గొప్పవిద్య నేర్చినా అది నేర్వనట్టే. ఆతడి వేదాలూ యజ్ఞాలూ దానాలూ తపస్సులూ వ్రతాలూ పూజలూ ఉపవాసాలూ అన్నీ వృధా వృధా - భస్మధారణ చెయ్యకుండా ముక్తి కావాలని కోరుకోవడం విషం తాగినా బ్రతకాలనుకోవడం.

అసలు, సృష్టికర్త నొసలును సృష్టించడమే త్రిపుండ్రధారణకోసం. అందుకే అడ్డంగా విశాలంగా సృష్టించాడు. లేకపోతే గుండ్రంగానే సృష్టించి ఉండేవాడు. అదీగాక సహజసిద్ధంగానే నొసట అడ్డగీతలు ఉంటాయి. ఆవంకన నిత్యమూ జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా విభూతి పెట్టుకోకపోతే పరమమూర్ఖులు గాక మరేమిటి!

నొసట తిర్యగ్రేఖలుగా విభూతి పెట్టుకోని విప్రుడు చేసే ధ్యానం ధ్యానమే కాదు, జ్ఞానం జ్ఞానమే కాదు, మోక్షం మోక్షమేకాదు, తపస్సు తపస్సేకాదు. వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్టే త్రిపుండ్రధారణలేని విప్రుడు శివార్చనకు పనికిరాడు.

తూర్పుదిక్కుకి అభిముఖంగా నిలిచి కాళ్ళూ చేతులూ కడుక్కుని ఆచమించి ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకుని భస్మస్నానం చెయ్యాలి. అగ్నిహోత్రంనుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకువి ఈశాన మంత్రంతో నెత్తిమీద జల్లుకోవాలి. పురుషమంత్రంతో నొసట దిద్దుకోవాలి. అఘోరమంత్రంతో హృదయం మీదా వామ మంత్రంతో గుహ్యప్రదేశంలోనూ సద్యోజాతమంత్రంతో కాళ్ళమీదా ప్రణవోచ్చారణతో సర్వాంగాలకూ అలంకరించుకోవాలి. అటుపైని ఉద్దూళనం చేసుకోవాలి. దీన్ని ఆగ్నేయక భస్మస్నానమంటారు. ఏ వైదికకర్మను ఆచరించాలన్నా ప్రారంభంలో ఇది చెయ్యాలి. తరవాత మళ్ళీ కాళ్ళూచేతులూ కడుక్కుని యథావిధిగా ఆచమించి లలాట హృదయ కంఠ ప్రదేశాలలో పంచబ్రహ్మమంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. అప్పటికి. కర్మానుష్ఠానానికి కావలసిన పవిత్రత సిద్దిస్తుంది. సత్కర్మలు ఫలిస్తాయి. లేకపోతే ఫలించవు. సత్య శౌచ జప హోమ తీర్థ దేవపూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి. రుద్రాక్షలూ త్రిపుండ్రాలూ ధరించిన విప్రుడు దురిత - రోగ - దుర్భిక్ష - తస్కరభయాదుల్ని తొలగించగలుగుతాడు. అపునర్భవంగా బ్రహ్మత్వం పొందుతాడు. పంక్తి పావనుడు అవుతాడు. దేవవిప్ర పూజ్యుడవుతాడు. శ్రాద్ధ - యజ్ఞ - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనల్లో విభూతిని ధరించినవాడు పూతాత్ముడు  మృత్యుంజయుడు.

భస్మధారణ మహిమ




Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...