శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట
ద్వారకలో అందరూ సుఖంగా కాలంగడుపుతున్నారు. నీళ్లల్లో మునిగి యమలోకం చేరిన గురుపుత్రుని తీసుకొని వచ్చిన వృత్తాంతమంతా జనులనుంచి దేవకీదేవి విని శ్రీబలరాములను పరిపరివిధాల స్తుతిస్తూ, కన్నుల కన్నీరు కారుస్తూ మొరపెట్టుకొంది.
దుర్మార్గులైన మురాసురుడు, కంసుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు మొదలైన మహా బలశాలులైన రాక్షసులను సంహరించి భూభారాన్ని తొలగించినవారు మీరే కదా! (అని దేవకి ప్రశంసించింది.)
జగత్తుకు సృష్టి స్థితి లయకారకులు మీరే! మీకు అవన్నీ లీలావినోదాలు. మిమ్మల్ని నమ్ముకున్నాను. దయచేసి నా కోరికతీర్చండి అని దేవకి ప్రార్ధించింది.
బలరామ, కృష్ణుల్ని అనేక విధాల నుతించి, “అయ్యా! మీరు మహానుభావులు. గతంలో చనిపోయి యమపురం చేరిన మీ గురుపుత్రుణ్ణి బతికించి, యమునివద్దనుండి తీసుకొనివచ్చి గురుదక్షిణగా గురువుకు సమర్పించారు. మహానుభావులారా! ఇదేవిధంగా కంసుడు చంపిన నా కుమారుల్ని కూడా సజీవులుగా తెచ్చియిచ్చి నా దుఃఖాన్ని పోగొట్టండి” - అని ప్రార్థించింది. ఆమె మెత్తని తియ్యని పలుకులు విని గౌరవపూర్వకంగా స్వీకరించి, మాయాప్రభావంతో సుతల(పాతాళ) లోకానికి వెళ్లారు.
సుతల లోకాధీశుడైన బలిచక్రవర్తి బలరామ, కృష్ణుల్ని కన్నులార చూశాడు. వారు కమలదళాలవంటి కన్నులు కలవారు. కార్యసమర్జులు. పచ్చని, నీలివర్ణాల దేహచ్చాయలు గలవారు. సమస్తలోకాల్లో కాంతిమంతులైనవారు. హలాన్ని చక్రాన్ని ధరించినవారు. భక్తులను పరిరక్షించేవారు. ఎప్పుడూ శుభాలతో ఒప్పేవారు. ఎల్లవేళల జయం పొందేవారు. జయశీలురు. అట్టివారు తనలోకానికి రాగా చూచాడు.
బలిచక్రవర్తి తన సన్నిహితులతో ఎదురుగా వెళ్లి బలరామ, కృష్ణులను ఆహ్వానించాడు. వారిపైగల భక్తివల్ల వారి రాకపట్ల కుతూహలుడై సాష్టాంగ దండప్రణామంచేసి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి, వారికాళ్లుకడిగి, సమస్తలోకాల్లో పవిత్రాలైన ఆ జలాల్ని భక్తితో తలపై చల్లుకొన్నాడు.
బలిచక్రవర్తి తన లోకానికి వచ్చిన బలరామకృష్ణుల్ని స్వాగతించి, అర్చించాడు. విశ్వమే రూపమైన వారిని సంపెంగ, అగరు, చందన, ఏలాది ధూపాల్ని (వేసి), భువనాల్ని వెలిగించేవారికి బంగారు పాత్రలలో రత్నదీపాలు, కర్పూరదీపాలతో హారతిచ్చి, వేదాలచే తెలియబడే మహానుభావులకు పాయసాన్నఫలాదుల్ని నైవేద్యంగా ఇచ్చి, దేవతలకు శత్రువులైనవారికి నూత్న రత్నాభరణాల్ని నీల పీతాంబరాలు ధరించేవారికి మంచువంటి పలుచని, తెల్లని విశిష్టవస్త్రాల్ని కట్టబెట్టి, అహంకారరహితులైన, వారికి చందనాది లేపనాలు, పూలమాలల్ని (సమర్పించి)
వివిధపూజలుచేసి, ఉపాయన సమర్పణంకావించి, శ్రీకృష్ణుని కమలాలవంటి చరణాలను ఒత్తుతూ, ఆనందంతో ఉబికిన కన్నీరు కారుతుండగా, పులకించిన శరీరంతో రెండుచేతులు నుదుట జోడించి, నమస్కరిస్తూ ఇలా ప్రార్ధించాడు.
బుద్ధిమంతుడైన బలిచక్రవర్తి “ఓ కృష్ణా! భగవంతుడా! హరుడా! పరమాత్మా! ముకుందుడా! సమస్త భక్తరక్షకా! పురుషోత్తమా! మునులచే నమస్కారాలందుకొనేవాడా! రాక్షసాంతకా! సాంఖ్యస్వరూపా! నీలకేశా! చక్రధారీ! బ్రహ్మా! నీ కొరకు నమస్కారాలని” స్తుతించాడు.
పైవిధంగా భగవంతునిలీలలు నామగ్రహణరూపమున పొగడి ఇంకా ఇలా అన్నాడు.
శ్రీకృష్ణా! కేవలం సాత్వికులు మాత్రం దర్శించగలిగే నిన్ను రజస్తమోగుణులైన వారు చూడలేరు. పద్మాక్షా! నీ పవిత్ర చరిత్రలు మునులు దర్శించి గానం చేస్తున్నారు. శివబ్రహ్మేంద్రాది దేవతా ప్రముఖులు మిమ్ము నమస్కరించుటచే వారి శిరోరత్నాలచే నీ పాదపీఠం ప్రకాశిస్తోంది. నీ దర్శనంచే జన్మబంధాలు తొలగిపోతాయి.
యోగిశ్రేష్ఠులుసైతం నీ మాయలో చిక్కుకొని నీ తత్త్వాన్ని తెలుసుకోలేరు. మా వంటి తామసులు, అహంకారులు నిన్ను ఎలా తెలుసుకోగలరు? మాకు చక్కని జ్ఞానం, చక్కటి వివేకం ఇచ్చి నిన్ను చేరే ముక్తి మార్గం చూపి, ఈ సంసారకూపం నుండి ఉద్ధరించి నీ దగ్గరకు చేర్చుకోవయ్యా!
(మాయ : “మునుపులేనిది, ముందు ఉండబోనిది - ఈ రెంటి నడుమ కొంతకాలంపాటు వ్యవహారగోచరమయినది మాయ. ఎప్పుడూ ఒకే విధంగా ఉండక మారుతుండటం దీని స్వభావం. ఏది సత్తుకాదో, అసత్తును కాదో అది మాయ. కావున, ఈ ప్రపంచం మాయ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏది మార్పు చెందుతుందో, ఏది ఎల్లకాలమూ ఉండదో, ఏది నశిస్తుందో అది మాయామయం. దీనికి విరుద్ధంగా మార్పుచెందక, నశింపక, ఎల్లకాలం ఉండేది ఆత్మ!)
శత్రువులుగా ఉండి చైద్యుడు మొ॥వారు, ప్రేమతో గోపికాస్త్రీలు, భక్తితో పాండవయాదవాదులు నిరంతరం మనస్సులో మీ రూపగుణాదుల్ని ధ్యానిస్తూ మోక్షం పొందుతున్నారు. మహాజ్ఞానులైనాకూడా దేవతలు నీ ధ్యానం లేక కైవల్యపదం అందుకోలేకపోతున్నారు.
(నిరంతరం క్రోధంతో పగవారైన శిశుపాలాదులు స్మరించడంవల్ల వారికి ముక్తి. భగవద్ధ్యానం నిరంతరం చేయనివాడు వివేకి, విద్వాంసుడైనా వానికి కైవల్యం దూరమే.
పద పద్మమన్నచోట ధ్యానకేంద్రమని, భవత్పదమన్నచోట విష్ణుపదం అనగా ఆకాశమని పదశబ్దానికి అర్ధద్వయం భిన్నంగా మహాకవి నిక్షేపించినాడు. చిదాకారుడుకాబట్టి ధ్యానంవలనేగాని గ్రంథాలవలన దొరకడని సారాంశం.)
శ్రద్ధచేత నిన్ను సేవించే వాడెవ్వడైనా భవబంధాలనుండి విముక్తి పొందుతాడు. యోగీశ్వరుడవైన నీవు నీచే పాలింపబడేవారమైన మమ్ము పాపరహితులుగా అనుగ్రహింపుమని ప్రార్థించి, ఇంకా ఇలా అన్నాడు.
నిన్ను తనివిదీరా చూచాను. సంసారబంధమనే సముద్రాన్ని దాట గల్గాను. మోక్షనిధిని చూచాను. నీదయా దృష్టులు నాపై ప్రసరింపగా చూశాను. బ్రహ్మ మహేశ్వరులు కూడా చూడలేని నా పాపాల్ని పోగొట్టావు. అట్టి నీవు, నా యింటికి వచ్చి నన్ను కృతార్జుణ్ణి చేశావు.
స్వామీ! నేను మీ దాసుణ్ణి. మీరు ఏది చెపితే అది చేస్తాను. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని చేతులు జోడించి ప్రార్ధించగా కృష్ణుడు బలి వినయానికి సంతోషించి ఇలా అన్నాడు.
ఓ బలిరాజా! పూర్వం కృతయుగంలో మరీచికి వర్ష అనే భార్యవలన ఆరుగురు కుమారులు పుట్టారు. బ్రహ్మ ఒక రోజు తన కూతురినే కామించి రమించగా చూచి పరిహసించారు. బ్రహ్మ అందుకు కోపించి రాక్షసులుగా పుట్టుడని శపించాడు. శాపవశాత్తు వారు హిరణ్యకశ్యపునికి కొడుకులుగా పుట్టారు. దేవతల కోరికమేరకు యోగమాయాదేవి ఈ ఆరుగురుని దేవకీదేవి గర్భాన ఉంచగా
(కంస నిర్యాణంలో యోగమాయ పాత్ర పెద్దది. వీరార్గురితో బాటు తానూ దేవకీ గర్భాన జన్మించి, జన్మలు చాలించి, అష్టమగర్భ శిశువుగా విష్ణునిరాకకు సుగమం చేసింది. ఇదంతా విష్ణుమాయే.)
దేవకీదేవి తన ఆరుగురు కుమారుల్ని కంసుడు వెనువెంట చంపివేయగా పుత్రవియోగదుఃఖంతో శోకించి, ఆమె ఆ పుత్రుల్ని చూడాలని మమ్మల్ని కోరింది. ఆ కారణంగా మేము వచ్చాము.
ఓ పుణ్యపురుషా! మాకు ముందు జన్మించిన ఆ ఆరుగురుని తిరిగి మా తల్లి దేవకీదేవికి చూపించెదమని ఆమె కోర్కె తీరుటకై మేమునీ వద్దకు వచ్చాం. నీవద్ద సుఖంగా ఏ విరోధమూ లేకుండా ఉంటున్న ఈ ఆరుగురు వీరే అని చెప్పారు.
వీరిని ఇపుడే తీసుకొనిపోయి తల్లి పుత్రశోకాన్ని తీరుస్తాం. వీరుకూడా శాపవిముక్తులై నా అనుగ్రహాన్ని పొందుతారు.
పిదప వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తాయి అని కృష్ణుడు చెప్పి, వారిపై కరుణగల్గి, బలి అనుమతి పొంది భూలోకానికి తీసుకొనివచ్చాడు.
ఆ విధంగా బలి అధీనంలోని సుతలలోకంనుండి ఆ ఆరుగురు అన్నలను తీసుకొనివచ్చి కృష్ణుడు దేవకీదేవితో ఇలా అన్నాడు.
ఆ పిల్లలను సంతోషంగా తీసుకొనివచ్చి "వీరే నీ కుమారులు అని తల్లికి చూపించగా ఆమెకుకూడా పిల్లలమీద వాత్సల్యంతో మోహం కలిగిందై
పిల్లలను చూడగానే స్తనాలనుండి క్షీరధారలు స్రవింపగా, ఆనందబాష్పాలతో కౌగిట్లోకి(ఒడిలోకి) తీసుకొని నా కన్నబిడ్డలు వచ్చారంటూ తమకంతో లాలిస్తూ
(తాను కన్నబిడ్డలే అయినప్పటికీ ఒక కన్నతల్లి తనబిడ్డను దేవుడిగా భావించి, గౌరవవాచకంతో సంబోధించి లాలించడం లోకసహజమైందే! ఆ విధంగా దేవకీదేవి తన ఆరుగురు బీడ్డల్ని “నను గన్న అన్నలు” అని వారిపై లాలన, ప్రేమ చూపింది.)
తల్లి దేవకీదేవి చనిపోయిన తన ఆరుగురు పిల్లలు బతికిరాగా సంతోషంగా కౌగిట్లోకి తీసికొని, ఒడిలో కూర్చోబెట్టుకొని, తలలు ఆఘ్రాణించి, చెంపలు, గడ్డం ప్రేమతో పుణికి, వాత్సల్యంతో గగుర్పాటురాగా, పాలివ్వగా, వారు విష్ణమాయకు లోబడి బాలకులవలెనే పాలుతాగి, భగవంతుడైన కృష్ణుని స్పర్శతో పాపాలు పోయి విధిశాపసముద్రాన్ని హరిదయ అనే నావతో దాటి, నిజరూపాలతో, తల్లిదండ్రులకు, కృష్ణునికి నమస్కరించి, ఆకాశమార్గాన స్వర్గోకానికి చేరుకున్నారు. దేవకీదేవి తన మనస్సులో (ఇలా ఆలోచించింది)
ఓ పరీక్షిన్మహారాజా! మరణించిన తన బాలకులను తిరిగి బతికించి తేవడం చాలా చిత్రమని మనసులో దేవకీదేవి ఆశ్చర్యపడి, ఇది అంతా అచ్చంగా విష్ణమాయ అని భావించింది.
ఓ పరీక్షిన్మహారాజా! పరమాత్మా, సమస్తలోకాధిపతి అయిన కృష్ణుడు లీలలుగా సత్కార్యాలు ఎన్నో చేసినాడు అని అనగా శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.
సుభద్రా పరిణయము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం