Wednesday, August 26, 2026

Anirudduni Vivaha Samayamuna Balaramudu Rukmi Modalagu Varinim Jamputa - అనిరుద్దుని వివాహ సమయమున బలరాముడు రుక్మి మొదలగు వారినిం జంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
అనిరుద్దుని వివాహ సమయమున బలరాముడు రుక్మి మొదలగు వారినిం జంపుట

కృష్ణునిచే అవమానం పొంది, అతణ్ణి జయించాలని అనుకొంటున్న రుక్మి శత్రుకుమారుడగు ప్రద్యుమ్నునితో తన కుమార్తె వివాహం ఏ విధంగా చేశాడు? ఓ శుకమునీ! ఈ విషయం నాకు తెలిసేటట్లు విశదంగా చెప్పు.

శుకమహర్షి పరీక్షిన్మహారాజున కిలా చెప్పాడు. ఓ రాజా! నీవు అన్నట్లుగానే రుక్మిణీ వివాహ సందర్భంలో కృష్ణునిచే పొందిన అవమానానికి రుక్మి బాధపడుతూ, తన పగను తీర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. 

కానీ, అవి ఏమియు ఫలింపలేదు సరికదా! తన సోదరియందలి ప్రేమతో - తన కుమార్తె రుక్కవతిని కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నున కివ్వడానికి పూనుకున్నాడు. స్వయంవరానికి రాజకుమారులను అందరిని ఆహ్వానించాడు. ఆ వార్త విని కృష్ణుని కుమారుడగు ప్రద్యుమ్నుడూ వచ్చాడు.

ఉత్తమ మణిభూషణాలతో ప్రకాశిస్తూ, రమణీయరథమెక్కి రాజకుమార్తె స్వయంవరానికి వచ్చిన రాజకుమారులున్న రుక్మి నగరానికి ప్రద్యుమ్నుడు చేరాడు.

యదుసింహ కిశోరమైన ప్రద్యుమ్నుడు రుక్మినగరంలో ప్రవేశించి, స్వయంవరానికి వచ్చిన రాజకుమారులకు తన బాణసంపదనుచూపగా వారు భయపడిపారిపోయారు. అంతట ప్రద్యుమ్నుడు రుక్మవతిని తీసుకొని వచ్చి, వేడుకతో తన భవనంలో ప్రవేశించాడు.

తన భవనంలో ప్రవేశించిన తరువాత ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడి, అన్ని సుఖాలను పొందసాగాడు. 

పిదప కృతవర్మ కుమారుడు రుక్మికుమార్తె చారుమతిని వివాహమాడాడు.

(కృతవర్మ భోజదేశపురాజు హృదికుని కుమారుడు. దుర్యోధనునకు మిత్రుడు. కౌరవపాండవుల యుద్ధంలో దుర్యోధనుని పక్షంలో ఉండేవాడు.)

ప్రసిద్ధుడగు రుక్మి తన మనుమరాలగు రుక్మలోచన వివాహాన్ని అనిరుద్ధునితో చేస్తున సమయంలో

(అనిరుద్దుడు శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నుని కుమారుడు. ఈతడు మొదట మేనమామ కుమార్తెయగు రుక్మలోచనను, తదుపరి బాణాసురుని కుమార్తెయగు ఉషను వివాహం చేసికొన్నాడు)

రత్నభూషణాల నలంకరించుకొని తేజస్వంతుడై శుభసమయంలో వివాహానికి రుక్మిరాజధానీ నగరానికి

రుక్కిణీ కృష్ణులు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, మొదలగు రాజకుమారులతో సైన్యయుక్తులై వివాహానికి వెళ్ళి, వివాహం జరిగినన్ని రోజులు సంతోషంగా గడిపారు. అనంతరం

యాదవకుమారులు మిక్కిలి ఉత్సాహంతో ఉండడం చూడలేక, కొందరు రాజులు పరిహసించగా

కళింగ దేశప్రభువు రుక్మిముఖంవైపు చూచి, హెచ్చరిస్తున్నట్లుగా, నీ యొక్క అవమానాన్ని తీర్చికొనేందుకు ఇదే సరైన సమయం అని చెప్పాడు. బలరామునికి జూదమాడే కోరిక ఉంది. కాని, ఆటయందు నేర్పరికాడు. ఆతడు నీకు విజయమిస్తాడు. నీవు పూర్వం పడ్డ అవమానాలు తీర్చుకో.

ఈ విధంగా కళింగదేశరాజు రుక్మి
ని ప్రోత్సహించాడు. రుక్మికోరికను బలరాముడు అంగీకరించాడు. విధివ్రాతను ఎవరు తప్పించగలరు?

రుక్మి కావాలనే కపటవినోదియై బలరాముణ్ణి జూదమాడటానికి పిలిచాడు.

ఓ బలరామ! పాచికలాట నీకు తెలుసునని విని ఉన్నాను. కనుక, కాలక్షేపానికి పాచికలు పందెంవైచి ఆడదాం - ఆడదాం అనగానే బలరాముడు ఉత్సాహం చూపాడు.

మనస్సులోని పట్టును వదలక పది, ఇరవై, నూరు, వేయి, పదివేలు అంటూ పందెం వేస్తూ రుక్మియు, బలరాముడును దురభిమానంతో పాచికలాటను ఆడసాగారు.

బలరాముడు ఆడిన ప్రతి ఆటా ఓడిపోవడంవల్ల శత్రురాజసమూహానికి సంతోషం కలిగింది. బలరాముణ్ణి పరిహాసమాడుతూ అవమానపరుస్తూ కళింగరాజు వెళాకోళపుమాటలు పలుకసాగాడు.

బలరాముడు కోపంతో ఒక లక్షపందెం కట్టి, ఆట గెల్చాడు. నేను పందాన్ని గెలిస్తే, విజయం నీదని మోసగిస్తున్నావా? అని రుక్మి పలికినాడు.

బలరాముడు అచ్చట ఉన్న రాజకుమారుల్ని చూచి, నిజం చెప్పండని కోరాడు. వారు రుక్మి పక్షంవాళ్లు కనుక మొగమోటమి చెంది సమాధానం చెప్పలేదు.

బలరాముడు పందెంవేసి మరో ఆటలో కూడా గెలిచాడు. ఈ విజయం నాదా? రుక్మిదా? అని అచ్చట ఉన్నవారిని అడిగాడు. అప్పుడు ఆకాశవాణి ఈ ఆటను బలరాముడే గెల్చాడు. రుక్మి ఓడిపోయా డని స్పష్టంగా చెప్పింది. తర్వాత

ఆకాశవాణి మాటలు విని, అక్కడివారంతా సంతోషించారు. రాజులలో కొందరు కపటస్వభావంతో రుక్మిని ప్రేరేపించగా అతడు "ఈ ఆటను కూడ నేనే గెల్చాను. కాని, నీవు వ్యర్థంగా వక్రమైన మాటలు చెబుతున్నావు అంటూ జూదమాడటంలో నేర్పరులైన రాకుమారులతో పసులకాపరులు సరితూగగలరా?" అని పల్కాడు.

ఆ మాటలకు బలరాముడు తోక త్రాక్కిన పాములాగా, కొట్టబడిన పెద్దపులిలాగా విజృంభించి బలమైన చేతులు చాచి రుక్మినీ, అతనికి అనుకూలురైన రాజుల్నీ ఇనుపగుదెతో చావమోదాడు.

ఇంతకుముందు తనను చూచి నవ్విన కళింగ ప్రభువును కిందికి పడవైచి ఎడమచేతితో ముఖంపై ఒకదెబ్బ వేయగానే వాని పండ్లు ఊడి పడిపోయాయి.

అంతటితో ఆగక, రుక్మియొక్కపండ్లు ముందే ఊడగొట్టి, శరీరాన్ని భేదింపగా రాజులందరూ భయపడేటట్లుగా వాణ్ణి యముని నగరానికి పంపాడు(చంపాడని భావం).

ఆ విధంగా యాదవ సింహమైన బలరాముడు అసామాన్య పరాక్రమంతో విజృంభించాడు.

శ్రీ కృష్ణునకు తన బావమరదియగు రుక్మి హతుడైన విషయం తెలిసినా కూడా భార్య రుక్మిణి, సోదరుడు బలరాముడు ఏమి అనుకుంటారో అని తన అభిప్రాయం ప్రకటించలేదు.

రుక్మి బలరామునిచే చంపబడిన తర్వాత వారు విదర్భానగరం నుండి బయలుదేరి

యాదవవీరులు ఎంతో ప్రేమ ఉప్పొంగే హృదయంతో, ఆదరంతో, వధూవరులను రథంలో కూర్చుండబెట్టి, బలరాముని, శ్రీకృష్ణుని, రుక్కిణీదేవిని సేవించి

శుభకరాలైన వాద్యాలశబ్దం పెద్దపెట్టున వ్యాపించగా, మదించిన ఏనుగులతో, గుర్రాలతో, ఉత్తములైన సైనికులతో వెళ్ళి, నారింజ, లవంగ, మాది ఫలవృక్షాలలో స్వేచ్చగా సంచరిస్తున్నవై మదించిన తుమ్మెదల ఝుంకారనాదాలతో, నిరంతరం పుణ్యనదులతో కూడి స్వచ్చతనొందిన కుశస్థలీనగరాన్ని చూచారు.

ఈ విధంగా కుశస్థలీపురంలోని ఉద్యానవన సమీపానికి వెళ్ళి

ఆ ఉద్యానవనంలో చందన, మందార, కుంద, చూతవృక్షాల నీడలలో బలరామ, కృష్ణులు మొదలగువారు విడిది చేశారు.

తరువాత నగరప్రవేశం చేసినా రని శుకమహర్షి పరీక్షితుకు చెప్పాడు.

బాణాసురుడు ఈశ్వర ప్రసాదంబు నొందుట






Krishnudu Rukminidevi Nuradinchuta - కృష్ణుడు రుక్మిణీదేవి నూరడించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - కృష్ణుడు రుక్మిణీదేవి నూరడించుట

ఓ రుక్మిణీ! కేవలం నవ్వులకు మాట్లాడిన మాటలకు బాధపడుతున్నావా? వేట సమయాల్లో, కలహాల్లో, రతి సమయాల్లో బాధించేమాటల్ని పలికినా విచారిస్తారా? నీ మనస్సు తెలియగోరి పలికాను. నీవు మనస్సులో బాధపడకు.

ఓ హరిణలోచనా! అలుకలు, ముద్దుపలుకులు, ఎర్రవారిన కన్నులు, తియ్యని పెదవి, బెదరింపులు, వేళాకోళాలు, కనుబొమల చిట్లింపులు, విదిలింపులకు సంకోచించక వలపుగల స్త్రీ సమాగమం లభిస్తే అది జన్మఫలం లభించినట్లే కదా!

అని ఇంకా ఈ విధంగా చెప్పాడు.

ఓ రుక్మిణీ! నీవు పతివ్రతవు, పుణ్యాత్మురాలవు, మహాసద్గుణశీలవు, బాల్యంనుండీ నీవు స్థిరమైన భావంతో నన్ను సేవించావు. ఇదంతా తెలిసికూడా తప్పుగా మాట్లాడిన నన్ను క్షమించుము.

నీ మాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి. నీవు పతివ్రతవు. ఏకాంతసేవలో నేర్పరివైన నీకు అన్నీ నెరవేరుతాయి. నీ పాతివ్రత్యం, నీకు నాయందుగల ప్రేమ స్పష్టమైనాయి. కాబట్టి, ద్వారకానగరంలో గృహస్థునిమాదిరి నీయందు గాఢానురాగంతో ఉంటాను. 

ఇంద్రియలోలవై కాంతలు నన్నుపొందడం మిక్కిలికష్టం. వ్రతాలవల్ల, తపస్సుచేత, నన్ను పొందాలని ప్రయత్నించి, విఫలవై నరకాన్ని పొందుతారు. నీవు వివాహకాలంలో ఎందరో రాజశ్రేష్ఠులను తిరస్కరించావు. "నా శరీరంపై ఇతరులకు అధికారం లే"దంటూ చెప్పి - బ్రాహ్మణుణ్ణి నాయొద్దకు పంపావు.

నిన్ను వివాహమాడే సమయంలో నీ సోదరుణ్ణి వికృతుణ్ణి కావించాను. నా ఎడబాటును సహించలేక, ఏమీ మాటాడక ఊరకున్నావు. ఇట్టి నీ మంచిగుణాలకు మిక్కిలి సంతోషించాను-” అని పలికి దేవకీదేవి కుమారుడగు శ్రీకృష్ణుడు సామాన్యగృహస్థునివలె ద్వారకలో గృహకృత్యాలు నిర్వహిస్తూండినాడని శుకమహర్షి పరీక్షిత్తుకు తెలిపాడు.

అని పలికిన శ్రీకృష్ణుని వినయ, వివేచనాపూర్వకమైన మాటలకు అమృతం చల్లినట్లై సంతోషాన్ని కల్గించగా, వికసించిన ముఖకమలం కలదవుతూ

రుక్మిణి చిరునవ్వును ఆహ్వానిస్తున్న చూపులతో శ్రీకృష్ణుణ్ణిచూచి, చేతులు జోడించి, గరుడవాహనుడూ, అందగాడూ, ఉత్సాహపూర్ణుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి పొగడింది.

దేవతాగణాలచే ప్రశంసింపబడి, సాటిలేని ప్రకాశవంతమైన ముఖంతో శుభప్రదమైన ఆకారంతో, దయతో కూడిన శ్రీకృష్ణుడు, చిగురులవలె ఎర్రగానున్న(సుకుమారమైన) చేతులు కలిగిన రుక్మిణికి వస్త్రాలు, నగలు, వరాలూ కోరినరీతిగా ఇచ్చాడు.

రుక్మిణిని సన్మానించిన పిదప, తానును రుక్మిణియు

శ్రీకృష్ణుడూ, రు
క్మిణీదేవీ చెట్లనీడల్లో మల్లైలలతలసమూహాల్లో, విరజాజిపొదల్లో, శిలావేదికలపై, కొలనుల అందమైన తీరాల్లో కలసి,

కేళీ ఉద్యానవనాల్లో విలాసంగా విహరించడానికి అనుకూలమైన స్వచ్చమైన ప్రదేశాలలో సుఖలీలావిలాసాలతో, ఎంతో సంతోషంతో, ఆ రు
క్మిణీదేవితో కలిసి జంటగా బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు చరించాడు.

రకరకాలైన మణులచే ప్రకాశించే రాజసౌధాల పైభాగాలలోను; నెమళ్ళు, కోకిలలు, ఊరపిచ్చుకలు, చిలుకలు ఉండే ప్రాంతాలలోను, చల్లనిసరస్సులలోను, జలప్రవాహాలలోను, ధాతువులతో కూడిన సెలయేర్లలోను, కొండలలోను, క్రీడా గృహాలలోను, ఉత్సాహంగా శ్రీకృష్ణుడును రు
క్మిణియును మన్మథక్రీడల్లో మునిగారు. 

ఆ తరువాత శ్రీకృష్ణునివల్ల ఆమెకు పదిమందికుమారులు కలిగారు. వారు - 1. ప్రద్యుమ్నుడు; 2.చారుధేష్ణుడు; 3. చారుదేవుడు; 4. సుధేష్ణుడు; 5. సుచారువు; 6. చారుగుప్తుడు; 7. భద్రచారువు; 8.చారుభద్రుడు; 9. విచారువు; 10. చారువు. ఆ విధంగానే సత్యభామ, 2. జాంబవతి 3. నాగ్నజితి 4.కాళింది 5. మాద్రి 6. మిత్రవింద 7. భద్రలకూ వేరువేరుగా పదిమంది కుమారులు కలిగారు.

పుణ్యాత్ముడా! పదహారువేల భార్యల్లో ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు శ్రీకృష్ణునకు కలిగారు. ఇలా వారికి పిల్లచెరకు ప్రసవించినట్లు పిల్లలు కలిగారు. పుత్రులతో, మనుమలతో, మునిమనుమలతో శ్రీకృష్ణుడు సంతోషంగా ఉన్నాడు.

ఆ ప్రకారం యదు, వృష్టి, భోజ, అంధక, మున్నగునవి నూటొక్కవంశాలై మిక్కిలి అభివృద్ది చెందాయి. ఆ రాజపుత్రులకు విద్యనేర్పడానికి ప్రావీణ్యం కలిగిన

వారందరికి మూడుకోట్ల, ఎనభైఎనిమిదివేల ఒక నూరుమంది విద్యనేర్చే గురువులున్నారంటే, ఆ బాలుర సంఖ్య లెక్కించడానికి ఈశ్వరునకీ, బ్రహ్మకూ శక్యంకాదు(గురువులు 3 కోట్ల, 88 వేల, 100 మంది).

శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునికి రుక్మి కూతురైన 
రుక్మవతికి అనిరుద్ధుడనే కుమారుడు కలిగాడనిచెప్పగా పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఈ విధంగా అడిగాడు.

అనిరుద్దుని వివాహ సమయమున బలరాముడు రుక్మి మొదలగు వారినిం జంపుట






Rukminidevi Srikrishna Lalithayai Yathanini Stuthinchuta - రుక్మిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
రుక్మిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట

ఓ కృష్ణా! ప్రాతఃకాలంలో వికసిస్తున్న తామరరేకులవంటి కన్నులుకలిగినవాడా! అంతులేని నిర్మలమైన కాంతిచే ప్రియమైన రూపం కలిగినవాడా! నీవనింది - తగినమాటే!

సర్వలోకేశ్వరులకు ప్రభువైన ఓ కృష్ణా! జ్ఞానం, సుఖం, శక్తి సంపన్నత మున్నగు మంచిగుణాలు గలిగిన, పాపరహితుడవైన మీ దృష్టిలో నేను యోగ్యురాలినా? నేను తగుదునా? అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నది.

(శ్రీకృష్ణుడు ఆత్మసంతృప్తుడు. సచ్చిదానందశాలి అనడంవల్ల సర్వం కలిగినవాడని స్ఫురిస్తున్నది. రుక్మిణీదేవి మాటలవల్ల నామెలోని ఆత్మానందం వ్యక్తమవుతూంది. సచ్చిదానందం అనగా సత్‌, చిత్‌, ఆనంద స్వరూపుడని అర్థం. కృష్ణుడు తనను తక్కువ చేసుకొని, రు
క్మిణిని గొప్పగా పొగడాడు. ప్రస్తుతం రుక్మిణి కృష్ణుని పరతత్త్వాన్ని గుర్తించి, తనను తక్కువ చేసుకొని, ఆయన్ను ప్రశంసిస్తూ - అసలు నీకు నేను తగినదాన్నా? మీ తాహత్తుకు మా తాహత్తు చాల తక్కువదని ఎదురు ప్రశ్నలతో బదులివ్వడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనం.)

ఓ మహాత్మా! ప్రకృతికీ, మానవులకూ, కాలాలకు నీవు ప్రభుడివి. సుందరం, పవిత్రం అయిన లీలామాధుర్యంతో కూడిన నీ రూపమెక్కడ? సత్త్వాదిగుణాలతోకూడిన తెలివితక్కువదానినైన నేనెక్కడ? నీయొక్క శుభప్రదాలయిన గుణసంపద దానం చేయబడుతుందనే భయంతో సముద్రమధ్యభాగంలో శేషతల్పంపై నిద్రిస్తున్నావు. ఇట్టి నీ లీలలు దివ్యమైనవి.

శబ్దం, స్పర్శ, రూపం, రసం, అనే గుణాలచేత గ్రహించబడిన శుభప్రదం, సుందరం అగు శరీరం కలవాడివై నీవు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే రూపాన్ని స్వీకరించి, నీ సేవకులకు సదా అనుభవించదగినవాడివై ఉన్నావు. నీ పాదారవిందమకరందాన్ని ఆస్వాదించే యోగిశ్రేష్ఠులుసైతం నీ మార్గాన్ని తెలుసుకోలేరు.

ఇక ఈ పశుప్రాయులైన మనుషులకు అది భావించరానిదని వేరే చెప్పవలెనా? నీ ఇచ్చ స్వతంత్రమైంది, నీకు ఇష్టమైంది. అందువల్ల నేను నిన్ను అనుసరిస్తాను. ప్రభూ! నీవు ఏమీలేని దరిద్రుడవైతే బలిని స్వీకరించే బ్రహ్మేంద్రాదులు బలి ఎవరికిచ్చినట్లు?

నీవు పురుషార్థస్వరూపుడివి. ఫలరూపుడివి. నీపైగల ప్రేమచేత విజ్ఞానదీప ప్రకాశంతో దోషాంధకారం నశించగా బుద్ధిమంతులు లౌకికసాఖ్యాలు వదిలేస్తారు. నీ దాసులతో కలయికను అభిలషిస్తారు. అలా చేయకుండా, అధికారమనే అంధకారంలో మునిగినవాళ్లు నీ తత్త్వం గ్రహించి బలిసమర్పణం చేయలేక అజ్ఞానులై సంసారమనే చక్రంలో తగుల్కొని తిరుగుతూ ఉంటారు.

జన్మపాపాలులేనివాడా! శ్రేష్ఠులైనమునులచే, మహాయోగులచే, దేవతాసమూహాలచే, వర్ణింపబడిన ప్రభావం కలవాడివై సర్వజీవులకు విజ్ఞానమిస్తున్నావు.

దేవా! మీ నిశిత దృష్టి ప్రభావంతో ప్రేరణపొందిన కాలవేగంచేత శుభాలకు దూరమైన బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనవారిని తిరస్కరించిన నా మనస్సుతో

(శివ, బ్రహ్మ ఇంద్రాలకు మంగళత్వం విష్ణుదేవుని కాలవేగ తీవ్రదృష్టి పడనంతవరకే! నని రు
క్మిణి - విష్ణువును (కృష్ణుణ్ణి) ఆదిమూలతత్త్వంగా భావించింది.)

పద్మాక్షా! ఈశ్వరా! శ్రీకృష్ణా! నిన్నే పెండ్లి చేసుకోవాలని నేను నిశ్చయించి ఉండగా, ఆ విషయం తెలిసి, నీవు నీ శార్ఙ్గమనే ధనుస్సుయొక్క ధ్వనిమాత్రంతోనే సమస్త శత్రురాజులైన శిశుపాల పక్షంవాళ్లను జయించి, సింహం తన మహాబలశౌర్యాలతో ఇతర పశువుల్ని పారద్రోలి, తన మాంసభాగాన్ని తాను తెచ్చుకొన్నట్లు - నీవు మొక్కవోని మహాశౌర్యంతో నన్ను నీ సొమ్ముగా గ్రహించావు కదా!

అట్టిరాజుల్ని యుద్ధరంగంలో ఎదిరించలేక భయపడ్డట్లు నటించి, సముద్రుణ్ణి శరణుకోరావు. నిజంగా ఇది నీ మాయకాక యథార్థమైన విషయమా? నీ భక్తులైన చక్రవర్తులు, రాజర్షులు సంతోషంతో

(ఇక్కడ శ్రీకృష్ణుడు భయంనటిస్తూ సముద్రుని శరణుకోరుట ఆతని యుద్ధనీతికి ఉదాహరణంగా పేర్కొనవచ్చు.)

ఓ కృష్ణా! నిన్నెదిరించిన రాజులు తమమనస్సులలో నీ పాదకమలాలను నిలుపుకొని గాలి, నీరు, ఆకులు ఆహారం కాగా, కఠిననియమాలతో అరణ్యంలో నివసిస్తూ ఉన్నారు. అంటే మోక్షమార్గాన్ని పొందే స్థితిలో ఉన్నారని అర్దం.

నిర్మలమైన జ్ఞానంతో ప్రసిద్ధులైనవారు చూస్తుండగా మీపాదపద్మాలలోని మకరందంయొక్క సువాసనను ఆస్వాదించి మోక్షాన్ని కలిగించేదీ, సజ్జనులచే స్తుతింపబడిందీ, శోభా లక్ష్మికి నివాసమూ అయిన మిమ్ము సేవింపక మరేబుద్ధి కలిగిన అల్పమానవుణ్ణి సేవిస్తానా? (సేవించను)

(రుక్మిణీదేవి ఆత్మసంకల్పం వర్ణింపబడింది.)

ఓ దేవా! సర్వప్రపంచానికి ప్రభువైన నిన్ను భూలోకంలోను, వైకుంఠంలోను, అన్ని ప్రదేశాల్లోను నీవు కోరిన రూపంలో సేవిస్తాను. నీ పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించటంలో నైపుణ్యంగల ఆడుతుమ్మెద అయిన స్త్రీ అతినీచమైన చర్మ నఖ, కేశాదులచేత కప్పబడి, లోపల మాంసము, ఎముకలు, రక్తము, క్రిములు, మలము, కఫము, పిత్తము, వాతముగల జీవచ్చవమైన మానవాధముణ్ణి మూఢురాలై ప్రేమించగలదా? అంతేకాక

భక్తమందార! దుర్భరభవవిదూర! నిర్మలాకారా! వర్షాకాలంలో మేఘాలనుండి వచ్చేనీటిని తాగే చాతకపక్షి చవిటిగుంతల్లోని నీటిని తాగుతుందా? మామిడిపండు రసాన్ని తాగే చిలుక ఉమ్మెత్తలకొఱకు వెళ్ళుతుందా? మేఘ శబ్దాన్ని వినే నెమలి ఈలపురుగు ధ్వని కోరుతుందా? ఏనుగుకుంభస్థలమాంసం కోరే సింహం కుక్కమాంసాన్ని మంచి ఆహారంగా భావిస్తుందా? మీ పాదద్వయాన్ని కోరి, ఆశ్రయించే హృదయం అన్యుల్ని కోరుతుందా?

త్రిలోకాధిపతియైన ఇంద్రునిచే నమస్కరింపబడినవాడా! కైలాసంలో, సత్యలోకంలో నీ చరిత్ర అందమైన పాటలుగా పాడబడుతున్నది.

విషయాసక్తులైన రాజులు మిమ్మల్ని తెలుసుకోలేక తమతమ అంతఃపురకాంతల మందిరాలలో ఎద్దులు, గాడిదలు, పిల్లులమాదిరి బద్ధులై సంచరిస్తారు.

(ఈ జంతువులు సంసారంలోపడి తలమున్కలవుతున్న వాళ్లకు - ప్రతీకలుగా చెప్పబడ్డాయి. ఇవి అజ్ఞాన సంకేతాలు.)

ఓ కృష్ణా! సర్వలోకాలలోనూ అంతరాత్మవైన దేవా! నీ పాదపద్మాలపై నాహృదయంలో అనురాగం నిరంతరం ఉండేటట్లు చేయవయ్యా!

పద్మాలవంటి కన్నులుకలిగిన కృష్ణా! నీవు రాజసంతో నిండిన కన్నులతో నన్ను చూచుట నాపైగల గొప్ప దయగా భావిస్తాను.

ఓ మధుసూదనా! నీమాటలు అసత్యంకాదు. కన్నతల్లిమాటలు ప్రియమైనకుమార్తెకు సమ్మతమే కదా! వయస్సువల్ల కలిగిన గర్వంతో జారిణియైన స్త్రీ పరపురుషాసక్త ఐతే తెలివిగల ప్రేమికుడు ఆమెను వదలివేస్తాడు.

వివేకం లేనివాడు ఆ జారిణితోనే సంబంధం పెట్టుకొని, ఆమెతోనే సంసారం చేస్తూ, ఇహపరాలకు కాకుండాపోతాడు. నీకు తెలియనివేమైన ఉన్నాయా? అని చెబుతున్న రుక్మిణిమాటలకు కృష్ణుడు సంతోషించి ఇలా అన్నాడు.

కృష్ణుడు రుక్మిణీదేవి నూరడించుట






Srikrishnudu Keligrhamunandu Rukminidevitho Virasocktu Laduta - శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట

ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మందిరాన్ని వర్ణిస్తున్నాడు. రుక్మిణీదేవి అభ్యంతరగ్భృహం నవరత్నాలు పొదిగిన స్తంభాలు, ముంజూరులు, పావురాళ్లగూళ్లు మొదలయినవానితో వెలిగే ఆ మందిరం గోడలు, కిటికీలు, అరుగులు, మెట్లు బంగారుమయాలు. 

దానిలో ముత్యాలదండలు వ్రేలాడుతున్న పట్టు మేలుకట్లు ఉన్నాయి. అవి రత్నదీపాలతో ప్రకాశిస్తున్నాయి. సువాసనలకు మూగిన తుమ్మెదలతో కూడియున్న మల్లెపూలదండలతో ఆ భవనం ఒప్పారుతూ ఉంది.

అందలి కిటికీల సందులనుండి అగరు కర్పూరాల పొగలు బయటికి వస్తున్నాయి. గవాక్షాలలో చంద్ర కిరణాలు వ్యాపించాయి. పారిజాత పుష్పాల పరిమళం గ్రహించి గాలులు మనస్సులకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి. 

ఇట్టి అభ్యంతరగృహంలో ఒకనాడు శ్రీకృష్ణుడు శరత్కాలంనాటి పండువెన్నెలవలె తెల్లనైన పాన్పునడుమ కూర్చుని ఉన్నాడు. రుక్మిణి చెలికత్తెలతోకూడా ప్రాణేశ్వరునివద్దకు వచ్చి సేవిస్తూ ఉన్నాడు.

రుక్మిణీ కుచాలమీది కుంకుమంతో ఒరసికొన్న హారాలు ఎర్రనివి కాగా, చేతిని చాచినప్పుడు ఉంగరాల గాజులకాంతులు చుట్టు వ్యాపింపగా, కదలినప్పుడు కాళ్లయందలి కడియాల గంభీరధ్వని అతిశయింపగా, రత్నాలు పొదిగిన బంగారు చెవికమ్మల కాంతులు చెక్మిళ్లపై చిందులు త్రొక్కగా, తలవెండ్రుకలు చలింపగా, పైటకొంగు అల్లలనాడగా చెలికత్తె చేతిలో ఉన్న వింజామరాన్ని తాను తీసుకొని శ్రీకృష్ణుణ్ణి సమీపించి ఆయనకు మెల్లగా వీవసాగింది.

ఆ సమయమున

పతివ్రత, భర్త ధరించిన రూపానికి అనుగుణమైన రూపంతోనే విరాజిల్లేదీ, సుందరి, చంద్రముఖి, లక్ష్మీస్వరూపిణి, శోభనాంగి, ప్రాణేశ్వరాంకితమతి, నిర్మలహృదయ అయిన రు
క్మిణి మహాపతివ్రత. ఆమెతో వాక్చాతుర్యం కలిగిన శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుచు ఈ రీతిగా పలికాడు.

(రు
క్మిణీకృష్ణలు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు. ఒకర్ని వదలి మరొకరు ఉండరు. స్వామి ఎన్ని అవతారాలెత్తినా లక్ష్మి తదనుగుణంగా తగిన రూపంతో ఆయన్ను చేరే ఉంటుంది. స్వామి రాముడైనప్పుడు లక్ష్మి సీత అయింది. కృష్ణుడైనప్పుడు రుక్మిణి అయింది. ఇలా లక్ష్మి శ్రీహరికి అనపాయిని(ఎడబాటులేనిది). ఇట్లుండడం ఆ దివ్యదంపతుల అన్యోన్య ప్రేమకు నిదర్శనం.)

రుక్మిణీ! శిశుపాలుడు మొదలయినవారు కులబలరూపశౌర్యాదులచేత ఇంద్రుడు మొదలయిన దిక్పాలురకంటె గొప్పవారు. ఏ లోటూ లేనివారు. మీ తల్లిదండ్రులు, తోబుట్టువు - వాళ్లకు వివాహం చేస్తుంటే నీవు వారితోపాటు వెళ్లకుండ బలవంతుల్ని చూచి భయపడేవారినీ, భూమిమీద నిలువనీడలేక సముద్రంలో దాగినవారినీ మమ్మల్ని ఎందుకు అంగీకరించావు? (అంగీకరించకుండా ఉండాల్సింది).

రుక్మిణీ! మేము లోకాచారప్రకారంగా ప్రవర్తింపం. ఇతరులకు మా నడవడి తెలియదు. బలమదం గలవారు మామీద పగపూనుతారు. సింహాసనాలెక్కి రాజ్యాలు పరిపాలింపం. మాకు ఈ సముద్రమే ఆశ్రయం. మేము దరిద్రులం. మాకు సొమ్ము పాతరలు లేవు. శ్రీమంతులు మా బంధువులు గారు.

మేము దరిద్రులకు చుట్టాలం. ధనం కూడబెట్టలేదు. మా నడవడి గుట్టుగా ఉంటుంది. మేము మంచిగుణాలు లేనివారం. బిచ్చమెత్తుకొంటూ బతుకు లీడ్చేవారిని ఆశ్రయిస్తాం? ఇటువంటి మమ్ముల్ని సుందరు లెవ్వరూ ప్రేమించరు. నీవేల ప్రేమించావు?

(ఇక్కడ ఒక అర్థం పరిహాసంగా మాటాడే శ్రీకృష్ణునికీ, రెండవ అర్థం శ్రీకృష్ణావతారమెత్తిన విష్ణువుకు అంటే పరమాత్మకూ సంబంధించి ఉంటుంది. మొదటి అర్ధం తాత్పర్యంలో ఉంది.

రెండవది - విష్ణుపరమైన అర్ధం ; 1. ఈ చరాచర ప్రపంచానికి నేనే సృష్టికర్తను. కాబట్టి, నా నడవడి ఈ లోకంలోనివారి నడవడిని పోలియుండదు. 2. త్రికాలజ్ఞుడనయిన నన్ను ఎవ్వరును తెలుసుకొనలేరు. 3. బలమదం గలవారు ప్రతి అవతారంలోను నాతో వైరం పెట్టుకొంటారు. 4 నే నేయవతారంలోను రాజ్యసింహాసన మధిష్టించని లోకేశ్వరుణ్ణి 5. క్షీరసాగరమే మాకు గృహం. 6. మానవుల లక్షణాలు - జననం, మరణం మొదలగునవేవియు లేనివాణ్ణి. నేను పరాప్రకృతిని. అణిమ మొదలయిన అష్టైశ్వర్యాలు కలవాణ్ణి మోక్షప్రదాతను. 7. ధనవంతులు నాకు భక్తులు కాలేరు. 8. నేను దీనబాంధవుణ్ణి. భక్తులే నా సంపద. 9. అజ్ఞానులు నా తత్త్వాన్ని గ్రహించలేరు. 10. నేను నిర్గుణుణ్ణి. 11. మహాయోగులే నాకు ఆప్తులు. 12. నేను ఆత్మారాముణ్ణి - ఇలా పైకి తనను కించపరుచుకొంటున్నా - లోపల తన తత్త్వాన్ని వ్యక్తం చేస్తూ - రు
క్మిణిని పరీక్షిస్తున్నాడు శ్రీకృష్ణుడు.)

ఎంతగొప్ప సంసారుల మధ్యనయినా ధనం, సత్కులం, సౌందర్యం సమానంగా నున్నప్పుడే పెండ్లి జరుగుతుంది. స్నేహ మేర్పడుతుంది. చుట్టరికం కుదుర్తుంది. అవి సమానాలు కాకపోతే ఇవి జరగవు.

రుక్మిణీ! ఇది మంచిపని కాదని తెలుసుకోలేక నీవు నన్ను పెండ్లాడినావు. దీనివల్ల నీవు తప్పు చేసిందానివయ్యావు. నీకు తగిన ఒకరాజును పతిగా వరించుకో. సద్గుణాలు లేనివారిని మోహించడం న్యాయమా? (కాదని అర్థం)

రుక్మిణీ! సాల్వుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలగు రాజులు నన్ను చూచి చెలరేగుతుంటారు. నీ అన్న రు
క్మికూడా పొగరుబట్టి బలమదంతో కన్నుగానక ఎగిరిపడుతుంటాడు. వాళ్ల తలపొగరు అణపదలచి నిన్ను బలాత్కారంగా తీసుకొని వచ్చానే కాని సంసారం చేయాలని కాదు. 

నేను దారైషణ, పుత్రైషణ, ధనైషణ అను మూడు కోరికల్నీ వదిలినవాణ్ణి. కామాదులైన అరిషడ్వర్గం లేనివాణ్ణి. అన్నిటా తటస్థుడిని. ప్రాపంచిక వ్యవహారాలలో చిక్కుకోను. పూర్ణకాముడిని. పరమాత్మననే బుద్ధితో ఇంటిలోని దీపం మాదిరిగా వెలుగుతూ వెలుగొందజేస్తాను. ఇటువంటి నాతో కలసి నీవు బాధపడవద్దు.

షడ్గుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడి, నిత్యమూ అన్ని సేవలూ చేస్తూ ఉండడంచేత "నేనే ప్రియురాలిని, నేనే పట్టపురాణిని" అని చెప్పే రుక్మిణిఅహంకారాన్ని అణచి, మాటాడక ఊరకున్నాడు. మానవంతురాలయిన ఆమె వినడానికి ఇష్టంగానివీ, ఇంతకు ముందు ఏనాడూ పలుకనివీ అయిన ప్రాణేశునిమాటలు విని, మేరలేని దుఃఖాతిశయంవల్ల పరితపిస్తూ

మగనిఎత్తి పొడుపుమాటలకు సంతాపం పొందిన రుక్మిణి స్వరూపాన్ని కవి వర్ణిస్తున్నాడు. కాటుక చెదరిపోయేట్లుగా కారిన కన్నీటిచే స్తనద్వయంమీదికుంకుమం తడిసిపోయింది. ఎడతెగని వేడినిట్టూర్పులచే చిగురాకువంటి పెదవి కందింది.

సౌందర్యం నిగ్గు తగ్గిపోయి, కళావిహీనమై ముఖం వాడిపోయింది. గాలిదెబ్బకు అల్లల్లాడే కల్పవృక్షంవలె మేను గజగజ వణికింది. మనస్సు బాధపడింది. రుక్మిణి చెక్కిట చేయిచేర్చి, సంతోషం కోల్పోయి, కాలిబొటనవ్రేలితో నేల రాస్తూ, ముఖం సగంవంచి తపించింది. ఆమె కోమలత్వం నశించినపువ్వులాగా కనబడింది.

తనతో ప్రియుడు పలికిన అప్రియమైన మాటలు చెవులలో గ్రుచ్చిన సూదులు కాగా, రుక్మిణి పులిగాండ్రింపు విన్న లేడివలె స్థైర్యం కోల్పోయి, కదలలేక, మెదలలేక చీల ఊడిపోయిన బంగారుబొమ్మవలె భూమిమీద పడిపోయింది.

(శ్రీకృష్ణుడు నిష్కారణంగా ఏమాటా మాట్లాడడు. కనుక తనకు ప్రాణప్రియ అయిన రుక్మిణిని ఇలా నిందించడం వెనుక ఏదో ప్రయోజనం ఉంటుంది. రుక్మిణి ఎప్పుడూ తనకు సేవలు చేస్తుందే కానీ - తానెప్పుడూ ఆమెకు సేవలు చేయలేదు. 

అందుకే కృష్ణుడు ఇలాంటి మాటల్లో ఆమెను నొప్పించి, నేలపై పడేట్టుగా చేశాడు. తర్వాత ఆమెకు సేవలు చేసి, అనునయించి, లాలించి, సంతోషపరుస్తాడు. ఇది ఆ స్వామికి ఒక ఆనందలీలావిలాసం.)

ఇట్లు నేలమీద పడిపోగా...

వేదపూజితుడయిన శ్రీకృష్ణుని కన్నీటిపొరలు కమ్ముకోవడంచేత చక్కగా చూడలేనిదీ, శరీరంనుండి జారిపోయిన ఆయా నగలు గలది, భర్త మాటాడిన చెడ్డమాటలవల్ల కళదప్పిందీ, భూమిమీద పడిందీ, కులాచారమనే ఉత్తమధర్మంతో చరించేదీ, మగనికి దూరమయింది, సంతోషం లేనిది, కుటుంబినులలో అగ్రగణ్య ఐన రు
క్మిణిని సమీపించాడు.

నేలమీద వ్రాలిన రు
క్మిణికి శ్రీకృష్ణుడు ఉపచారాలు చేస్తున్నాడు. అతడు, ఆమెశరీరంపై పలుచగా మంచిగంధం పూశాడు. పన్నీటితో కన్నీటిమకిల కడిగాడు. చెవులలోపల కర్పూరపు పలుకులు పడునట్లుగా ఊదాడు. ముత్యాలదండల చిక్కుదీసి వక్షస్థ్సలంపై సర్దినాడు.

నుదుట తిలకం దిద్దాడు. పడిపోయిన నగలు పెట్టాడు. తామరరేకులవంటి విసనకర్రతో విసిరాడు. స్తనాలమీద పైట సవరించాడు. అలసట పోగొట్టాడు. బిగికౌగిట చేర్చాడు. ముఖం నిమిరాడు.

శ్రీకృష్ణుడు వంకరలై, మన్మథుని నల్లనియుచ్చులను మించినవై అనగా కామోద్దీపనములై, చీకట్లును మించిపోయిన తుమ్మెద రెక్కలకంటె మిక్కిలి నీలంగా ఉండే రు
క్మిణి తలవెండ్రుకల చిక్కు తీర్చి, కొప్పు పెట్టి పూలు తురిమాడు.

శ్రీకృష్ణుడు, ప్రశంసింపబడిన ప్రవర్తన గలది, పద్మాలనుపోలినకన్నులుగలదీ, భీష్మకునిపుత్రిక అయిన రు
క్మిణిని తుమ్మెదల రెక్కల గాలిచే కదలుతున్న పూలతో, మొగ్గలతో అందంగా ఉన్న పానుపుపై చేర్చాడు.

రుక్మిణిని పాన్పుమీద చేర్చి శ్రీకృష్ణుడు మెత్తని తియ్యని మాటలతో ఓదార్చగా

రు
క్మిణి సిగ్గుతో, చిరునవ్వుతో కూడి మనోహరంగా ఉన్న కడగంటి చూపులతో శ్రీకృష్ణుని ముఖపద్మాన్ని చూచి ఈ విధంగా పలికింది.

రుక్మిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట






Srikrishnudu Padaruvela Conniyala Varinchi Devalokamunaku Boyi Parijatamu Decchuta - శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట

రాజవంశ శ్రేష్ఠుడూ, కంసుణ్ణి జయించినవాడూ అయిన శ్రీకృష్ణుడు, రాజులను గెలిచి నరకాసురుడు బందీలుగా పట్టితెచ్చిన పదారువేలమంది రాజకన్యలను ఆ భవనంలో చూచాడు. ఆ రాజపుత్రికలు జనులచేత గౌరవింపదగినవారు. సుగుణవతుల జీవనమార్గం అనుసరించి ధన్యత నొందినవారు.

ఆ రాజకన్యలు నిలువెల్లా కుతూహలం గలవారై రాక్షస సేనలను ఛేదించేవాణ్ణీ, మొక్కే వారికి కల్పవృక్షమయినవాణ్ణీ, శుభాలు కలిగించే రూపం గలవాణ్ణీ, నిత్యనవీనమయిన శృంగారం కలవాణ్ణీ; భావవికారాలు లేనివాణ్ణీ; సద్గుణాలకు నిలయుడయినవాణ్ణీ; యువతుల హృదయ ధనాన్ని దొంగిలించువాణ్ణీ, మనస్సులను ఆకర్షించువాణ్ణీ, రత్నాలు పొదిగిన కిరీటంతో ప్రకాశించేవాణ్ణీ శ్రీకృష్ణుణ్ణీ చూచారు.

రాజపుత్రికలు శ్రీకృష్ణుణ్ణి చూచి, అతనిసౌందర్యం, గాంభీర్యం, నైపుణ్యం మొదలయిన గుణాలవల్ల అతణ్ణి ప్రేమించారు. వారికి తహతహపాటు కలిగింది. వారు ధైర్యం కోల్పోయారు. బిడియాన్ని వదలివేశారు. మన్మథుడు వారి హృదయాల్ని కలతపెట్టాడు. దైవవశంతో వారిమనస్సులు అదుపు తప్పాయి. ఆ ఉత్తమాంగనలు మన్మథతాపానికి లోనై శ్రీకృష్ణుడే తమకు ప్రాణేశ్చరుడని నిశ్చయించుకొని

మహాపాపియైన నరకాసురుడు నిర్భంధించాడని ఎప్పుడూ అనుకొంటాము. నిజంగా వాడు పాపాత్ముడా? వాని పుణ్యమా అని శ్రీకృష్ణుణ్ణి దర్శింపగలిగాము కదమ్మా! ఈనాడు పురుషశ్రేష్ఠుడయిన ఇతణ్ణి కలసికొనేందుకై పూర్వజన్మంలో మనం ఎట్టి నోములు నోచామో? ఆ బ్రహ్మదేవుడు పుణ్యాత్ముడు గదమ్మ! కాబట్టే, శ్రీకృష్ణుణ్ణీ, మమ్మల్నీ ఇక్కడ చేర్చాడు.

మనందరిలో శ్రీకృష్ణుడు కౌగిలించి ఆదరించగా సుఖంగా జీవించే అదృష్టవతి పూర్వజన్మంలో సదాచారాలు పాటిస్తూ, అడవుల్లో నీళ్లల్లో నిలిచి, కష్టాలు పడి ఏ వ్రతా లాచరించిందో? (లేకుంటే అంతటి అదృష్టం కల్గదని భావం).

మనం చాలాకాలం నుండి బ్రతుకుతూ ఉన్నాం గదా! ఎవరిలో అయినా ఈ అందం ఉందని విన్నామా? ఇంతటి ప్రతాపమూ, గంభీరతా మరొకనియందు చూచామా? ఎవని నుండయినా, ఎప్పుడయినా ఈ ప్రేమను దక్కించుకొన్నామా?

ఆ రాజకన్యలు గుంపులుగూడి తమలో తాము "నేను గనుక వైజయంతిమాల నయితే శ్రీకృష్ణుని మెడలో వ్రేలాడుతుంటాను గదా! నేను గాని పసుపు పచ్చని పట్టుబట్టనయితే అతని ఒంటినిండా ప్రకాశిస్తూ ఉందునుగదా! నేను గనుక కౌస్తుభమణి నయితే అతని వక్షంపై తళతళమెఱస్తూ ఉంటాను గదా! నేను గనుక పాంచజన్యాన్ని అయితే అతని అధరామృతాన్ని సేవించి, పరవశిస్తూ ఉంటాను గదా!” అని తలకొక విధంగా చెప్పుకోసాగారు.

పరీక్ష్మిన్మహారాజా! రాజకన్యలందరూ క్రమంగా తమలో తాము "శ్రీకృష్ణుడు నన్నే పరిహసించాడు; యుక్తంగా చూచాడు; నా సౌందర్యాన్ని వర్ణించాడు; నన్ను గూర్చి చక్కగా తెలుసుకొన్నాడు; నన్ను మన్నించాడు; నాపై దయ చూపాడు; నాపేరు అడిగాడు; ఆచారం ప్రకారం వివాహమవుతుంది; నేనే అతని పట్టమహిషిని” అని నిశ్చయించుకొన్నవా రయ్యారు.

ఈ విధంగా రాజకన్యలు ముందు ముందు శ్రీకృష్ణునివల్ల తమకు ప్రాప్తించే గౌరవాదులను గూర్చి ఆరాటపడుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పదాఱువేలమందికీ తెల్లనిబట్టలూ, నగలూ, పూలదండలూ, మైపూతలూ ఇచ్చి, పల్లకీలు సమకూర్చాడు. 

వారినీ, నరకాసురుని ధనరాశులనూ, రథాలనూ, గుర్రాలనూ, ఏనుగులనూ ద్వారకకు పంపాడు. ఆ ఏనుగులు సామాన్యమయినవి కావు. అవి తెల్లనివి. వేగం గలవి. ఐరావత గజ సంతతికి చెందినట్టివి. నాలుగు దంతాలు కలవి. తర్వాత శ్రీకృష్ణుడు అమరావతికి వెళ్లి అదితిని సందర్శించాడు.

ఆమెకు సూర్యకాంతిని మించిన కాంతి కలిగిన కుండలాలను ఇచ్చాడు. శచీదేవితో కూడిన ఇంద్రునిచేత సత్యభామాసహితుడై పూజలు పొందాడు. సత్యభామకోరిక ననుసరించి నందనోద్యానవనానికి వెళ్లి

శ్రీకృష్ణుడు చేతితో పెల్లగించి పారిజాతవృక్షాన్ని గరుత్మంతునిమీద పెట్టాడు. ఆ పారిజాత పుష్పాల సువాసనలకై, చేరి అట్టిటు తిరుగుతూ తుమ్మెదలు రొద చేస్తున్నాయి. చిగుళ్లతో, ఆకులతో, కొమ్మలతో, పండ్లతో పూమొగ్గల గుత్తులతో ఆ కల్పవృక్షం అందగిస్తూంది. అది ఇంద్రునిచేత రక్షింపబడింది. దాన్నిగూర్చి మూడులోకాల్లోని యాచకులు చెప్పుకొంటూ, పొగడుతున్నారు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు పారిజాతాన్ని అపహరించి, సత్యభామతో కూడి గరుత్మంతునిమీద వెళ్లేటప్పుడు

నరకాసురుడు నానాయాతనలు పెట్టగా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి, కిరీటం కాళ్లకు తగిలేటట్లుగా నేలమీద చాగిలబడి మ్రొక్కటం, శ్రీకృష్ణుడు దయగలిగి నరకాసురుణ్ణి చంపి తననూ, తనవారినీ రక్షించటం, ఇవన్నీ దేవతాధిపత్యంవల్ల కలిగిన మదంచేత ఇంద్రుడు విస్మరించాడు.

అతడు అడ్డపడి "శ్రీకృష్ణా! వెళ్లకు, పారిజాతవృక్షాన్ని విడువు" మని పలుకుతూ ఎదిరించాడు. దేవతలు కూడా తరిమి శ్రీకృష్ణుణ్ణి తమ ప్రభువు మాదిరిగానే ఎదుర్కొన్నారు. అయ్యో! ఈ పనిచేయదగునా? చేయదగదా? అనే జ్ఞానం ఉండనక్కర లేదా? దేవేంద్రత్వం దేనికి? మంటబెట్టటానికా? చూస్తుంటే దేవతలపొగరు ఆశ్చర్యకరంగా ఉంది.

శ్రీకృష్ణుడు తన్నెదిరించి అడ్డపడిన దేవేంద్రుణ్ణీ, దేవతల్నీ జయించి, ద్వారకకు వెళ్లాడు. ఆశ్రితులపాలిటికి కల్పవృక్షమైన అతడు తన పూలతేనెల తీపిని మరగి ఉన్నచోటు వదలి, వెంటవస్తున్న తుమ్మెదలకు మేలుచేసే పారిజాతాన్ని సత్యభామతో కలసి తాను విహరించే ఉద్యానవనంలో నాటాడు. నరకాసురుని యింటినుండి తీసుకొని వచ్చిన రాజకన్యల కందరికీ గృహాలు కట్టించి సమస్త గృహోపకరణాలను సమకూర్చాడు.

అనేక విధాలైన వినోద సంచారాలు చేసేవాడు, సర్వనియామకుడు, అంతం లేనివాడు అయిన శ్రీకృష్ణుడు ఒకరోజున శుభముహూర్తఆనందంతో పదియారువేలభవనాలలో, పదియారువేలఆకృతులతో, పదియారువేల రీతులుగా, పదియారువేలమంది రాజపుత్రికలను వైభవంగా పెండ్లాడినాడు.

శ్రీకృష్ణుడు ఉత్తమ గృహస్థుడై రాజకన్యకలకు ఒకేవిధంగా, సమానంగా కోరిన వస్తువులను ఇచ్చేవాడు. సంతోషం కలిగించేవాడు. ఒకే తీరున వారిని చూచేవాడు. వారితో మాటలాడేవాడు. వారిని పిలిచేవాడు. వారికందరికీ అన్ని రూపాలతో ఎప్పుడూ కనబడేవాడు. అతడు అన్ని కోరికలూ సిద్ధించినవాడై వారితో క్రీడించాడు.

పెక్కుమంది భార్యలుగల మగవాడు సవతుల కయ్యం కారణంగా సుఖశాంతులతో బ్రతుకలేడు. కాని, శ్రీకృష్ణుడు ఆ పదారువేలమంది భార్యలతో నేర్పుకలిగి సమచిత్తంతో ప్రవర్తించాడు.

బ్రహ్మ ఇంద్రుడు మొదలయినవారు ఎన్నెన్నో విధాలుగా యోగాల్ని ఆశ్రయించి చూడలేని పరమాత్మకు భార్యలై రాజపుత్రికలు చూపులు, నవ్వులు, మాటలు, సురతాలు, ఆలింగనాలు, ప్రేమలు అనేవాటిచేత సేవించి వాసికిక్కారు.

పదారువేలమంది రాచకొమార్తెలు వేలకొలది పనికత్తెలచేత ఊడిగం చేయించుకొనే వారే అయినప్పటికీ, వారు స్వయంగా శ్రీకృష్ణునికి పరిచర్యలు చేసెడివారు. ఆ రాజకన్యలు భర్త ఇంటికి వచ్చినపుడు ఎదురుపోయేవారు. అతడు తెచ్చిన వస్తువులను తీసికొనేవారు. కూర్చోవడానికి మణులు పొదిగిన బంగారుపీటలు వేసేవారు. 

భక్తితో కాళ్లు కడిగి సుగంధిజలంతో స్నానం చేయించి, చందనవస్త్రాభరణాలు ఇచ్చేవారు. ఇష్టపదార్జాలతో భోజనం పెట్టిన తర్వాత తాంబూలమిచ్చి, వీవనలతో వీచేవారు. తలదువ్వి, పానుపుపై మృదువుగా పాదములొత్తుతూ"సేవించేవారు.

ఆ పదారువేలమంది రాజకన్యలు "పగలూ రేయీ నన్ను మాత్రమే ఎడబాయడు. దయతో నాతోమాత్రమే పొంది పొసగి ఉంటాడు. ప్రియపత్నులలో నన్నుమాత్రమే దొడ్డయిల్లాలిగా గౌరవిస్తాడు. ప్రాణేశ్వరుడు నా ఇంటిలోనే ఉన్నాడు" అని తమ మనస్సులలో భావించి, పాతివ్రత్యదాస్యభక్తియోగాలతో శ్రీకృష్ణుణ్ణి సేవిస్తున్నారు.

శ్రీకృష్ణుడు కూడా పదారువేలమంది రాజకన్యలయందు అత్యధిక ప్రేమకలిగి మేడలలో, ఉద్యానవనాల్లోని లతాగృహాలలో, సరస్సులలో వాళ్లతోకూడి విహరించాడు.

లోకాలను సృష్టించి, పోషించి, లయింపజేసే పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ప్రభువై వర్ణాశ్రమధర్మాలను రక్షించడానికి ఆ రాజకన్యలతో ఆ విధంగా వ్యవహరిస్తూ యాదవులలో ప్రకాశించాడు.


శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట






Tuesday, August 25, 2026

Rugvedam & Yajurveda Upaakarma - ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మ నిర్వహిస్తారు.

ఉపనయనం తరువాత, 
ఉపాకర్మ మొదటి రోజున వేద అధ్యయనం ప్రారంభమవుతుంది.

ఇప్పటికి వేదపాఠశాలలో ఈ విధానం పాటిస్తారు. తరువాతి పుష్య  మాసంలో ఉత్సర్జన కర్మ చేయబడుతుంది,  వేద అధ్యయనం నిలిపివేయబడుతుంది మరియు తరువాతి ఆరు నెలల పాటు, శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం మరియు కల్పసూత్రం అనే ఆరు వేదాంగాలలో సాధ్యమైనంత వరకు అధ్యయనం చేయబడుతుంది. 

ఆపై తరువాతి సంవత్సరం శ్రావణ మాసంలో, ఉపకర్మ రోజున, ఉపకర్మ నిర్వహించి వేద మంత్రాల అధ్యయనాన్ని తిరిగి ప్రారంభిస్తారు.

వేద అధ్యయనాన్ని ప్రారంభించే ఈ కర్మనే ఉపకర్మ అంటారు. ఈ విధంగా ఉపకర్మ నిర్వహిస్తేనే, మన వద్ద ఉన్న కొద్దిపాటి వేద మంత్రాలకు శక్తి లభిస్తుంది. లేకపోతే, అది భగవద్గీతలో వర్ణించబడిన ఆహారం వలె 'యతయామం' అవుతుంది.

యజుర్వేద ఉపకర్మ
వేదాలను ప్రారంభించి నేర్చుకోవడమే కాకుండా, ఉపాకర్మ రోజున, బ్రాహ్మణులు శ్రౌత కర్మలతో పాటు తమ నూతన యజ్ఞోపవీతం ధారణ చేస్తారు.

ఉపాకర్మ అనేది ఇప్పటికీ బ్రాహ్మణులు ఆచరించే వైదిక ఆచారం.
యజుర్వేదాన్ని అనుసరించే వారు శ్రావణ పూర్ణిమ రోజున అంటే శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ఉపాకర్మను పాటిస్తారు.

ఋగ్వేద ఉపకర్మ
ఋగ్వేదాన్ని అనుసరించే వారు శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మను పాటిస్తారు.

సామవేద ఉపకర్మ
సామదాన్ని అనుసరించే వారు భాద్రపద మాసంలో హస్తా నక్షత్రం రోజున ఉపాకర్మను పాటిస్తారు.

సామవేద ఉపాకర్మ దినం సాధారణంగా యజుర్వేదం మరియు ఋగ్వేద ఉపాకర్మ పక్షం
రోజుల తర్వాత వస్తుంది.

అధర్వణవేద ఉపకర్మ
అధర్వణవేదాన్ని అనుసరించే వారు శ్రావణ పౌర్ణమి లేదా భాద్రపద పౌర్ణమి రోజున ఆచరిస్తారు.

దీని ప్రకారం, యజుర్వేదం మరియు ఋగ్వేదం అనుసరించే వారి ఉపకర్మ భిన్నంగా ఉండవచ్చు.

తమిళనాడులో ఉపకర్మను అవని అవిట్టం అంటారు. తమ మొదటి ఉపాకర్మను చేసే వారికి, దీనిని తలై అవని అవిట్టం అంటారు.

తెలుగువారు శ్రావణ పూర్ణిమలో జరిగే ఉపాకర్మ ఆచారాన్ని జంధ్యాల పూర్ణిమ అంటారు.

శ్రావణ పూర్ణిమ రోజు హయగ్రీవ జయంతితో కలిసి వస్తుంది కాబట్టి, బ్రాహ్మణులు వేద అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఈ రోజు మంచిదిగా భావిస్తారు.

హయగ్రీవ అవతారం విష్ణువు యొక్క అవతారములలో ఒకటి. 
శ్రావణ పూర్ణిమ రోజు శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు కావున ఆ రోజును హయగ్రీవ జయంతిగా చేస్తారు.

పురాణం:
శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున, మధు-కైటభ అనే దైత్యులు బ్రహ్మ నుండి దొంగిలించిన వేదాలను విష్ణువు(హయగ్రీవ రూపంలో ) తిరిగి ఇచ్చాడని పురాణం.

విష్ణువు తన నాభిపై ఉన్న పద్మం నుండి బ్రహ్మను సృష్టించిన తరువాత, తన చర్మంపై తమోగుణం(చీకటి) మరియు రజోగుణం(చలత్వం) గల రెండు చెమట బిందువులను సృష్టించాడు.

ఆ బిందువుల నుండి మధు, కైటభులు జన్మించారు. వారు మహాదేవిని తప్పస్సు తో మెప్పించి, తాము కోరుకున్నప్పుడు మాత్రమే మరణించే వరాన్ని పొందారు.

వరగర్వంతో, అహంకారంతో ఆ సోదరులు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించి, పాతాళంలో దాక్కున్నారు. నిస్సహాయుడైన బ్రహ్మ విష్ణువును ప్రార్థించాడు. 

అప్పటికే హయగ్రీవ రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు ఆ సోదరులను ఎదుర్కొని వారితో యుద్ధం చేశాడు. వారి పరాక్రమానికి ముగ్ధుడైన విష్ణువు, ఆ సోదరులకు తమకు నచ్చిన వరాన్ని ఇస్తానని చెప్పాడు.

దేవీ వర మదంతో, ఆ దైత్యులు నవ్వి, బదులుగా తమను వరం అడగమని విష్ణువును కోరారు. ఆ శ్రీమహావిష్ణువు వారిని సంహరించగల సామర్థ్యాన్ని పొందే వరాన్ని కోరాడు. ఆశ్చర్యపోయిన ఆ సోదరులు, నీటిపై తప్ప మరెక్కడైనా వారిని చంపగల వరాన్ని ప్రసాదించారు. 

ఆ దైత్యులు పరిమాణంలో పెరుగుతుండగానే, విష్ణువు వాటిని పట్టుకుని, తన తొడలపై ఉంచి, తన దివ్య చక్రమైన సుదర్శన చక్రంతో వారిని శిరచ్ఛేదం చేశాడు. ఈ విధంగా, వేదాలు బ్రహ్మకు తిరిగి ఇవ్వబడ్డాయి.

శ్రావణ పూర్ణిమ రోజు శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చి వేదాలను రక్షించాడు కావున శ్రావణ పూర్ణిమ రోజును హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు.

ఉపాకర్మ అనేది వేదాల జ్ఞానాన్ని మానవాళికి అందించిన మరియు  పవిత్రమైన వేద మంత్రాలను మనకు వెల్లడించిన పురాతన ఋషులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆచరించే క్రియ.

ఉపాకర్మ మరుసటి రోజు గాయత్రీ జపంగా ఆచరిస్తారు.

హయగ్రీవుడు

Bhudevi Srikrishnuni Stuthinchuta - భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

“అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసుదేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ బొందువానికి నాదిపురుషునకును
నఖిలనిదానమై యాపూర్ణవిజ్ఞానుండైనవానికిఁ బరమాత్మునకును

ధాతఁ గన్న మేటితండ్రికి నజునికి, నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప, రాపరాత్మమహిత! యమితచరిత!

అఖిలజీవస్వరూపా! నిరుపమానా! ఈశ్వరా! పరాపర ప్రకృతి దయరూపా! నిరవధికచరితా! శ్రీకృష్ణా! నీవు పద్మం నాభియందు కలవాడివి. కమలాలవంటి కన్నులు గలవాడివి. పద్మహారం కలవాడివి. పద్మాలవంటి చరణాలు కలవాడివి. అనంతశక్తి సంపన్నుడివి. 

వసుదేవునికుమారుడివి. దేవతలకే దేవుడివి. భక్తులు కోరిన ఏ రూపమైనా ధరించేవాడివి. సృష్టికి పూర్వమే ఉండే పురుషుడివి. సర్వానికీ మూలకారణమైనవాడివి. పరిపూర్ణ విజ్ఞానివి. పరమాత్ముడివి. బ్రహ్మను కనిన గొప్పతండ్రివి. జననం లేనివాడివి. ఇట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను.

దేవా! నీవు రజోగుణంతో కూడి బ్రహ్మవై లోకాలను సృష్టిస్తావు. సత్త్వగుణం కలిగి విష్ణువువై వాటిల్ని రక్షిస్తావు. తమోగుణాన్ని ధరించి వాటిల్ని నశింపజేస్తావు. నీవే కాలస్వరూపుడవు.

పరమాత్మవు; ప్రకృతి, పురుషుడు, మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలూ, శబ్దరూపరసాదులూ - అనే పంచవింశతితత్వాలూ (25), ఇంద్రియాల అధిదేవతలూ, స్థావరజంగమాలతో కూడిన యావద్విశ్వమూ సాటిలేని నీయందే పుడుతున్నాము.

భక్తుల్ని చల్లని చూపులతో చూచేవాడా! జాలిగొలుపే వారిని కాపాడేవాడా! దయతో ఈ వైపు చూడవయ్యా!. వీడు నరకాసురుని కుమారుడు. నిన్ను చూచి భయపడుతున్నాడు. వీడు పసిబిడ్డ. దిక్కులేనివాడు. దుఃఖిస్తున్నాడు. ఏ ఆశ్రయం లేనివాడు. తండ్రిమాదిరిగా పరాక్రమంతో ఎదురు తిరుగడం తెలియనివాడు. నీ కాళ్ల దగ్గరకు చేరాడు.

ఈ విధంగా భూదేవి భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించి, మాటల పూలతో పూజచేసింది. భక్తానురాగం కలిగిన శ్రీకృష్ణుడు నరకాసురుని కుమారుడయిన భగదత్తునికి అభయప్రదానం చేసి, సర్వభాగ్యాలూ ప్రసాదించాడు. తర్వాత నరకునిభవనం ప్రవేశించి, దానిలో


శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట





Krishnudu Poundrakavasudevunimida Dandethipoyi Vaanim Jamputa - కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట పౌండ్రక వాసుదేవుడు బలంవల్ల కలిగిన పొగరుతో ప...